Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గీతాబాలి భారతీయ వెండితెరపై విలక్షణ నటి. ఆమె జీవించింది కొద్దికాలమే. భారత సినీ పరిశ్రమలో ఆమె వేసిన ముద్ర చెరగనిది. బాలీవుడ్ గోల్డెన్ ఎరాలో ఆమెదో అధ్యాయం. ఆమె సినీ జీవితం కేవలం 14 ఏండ్లే. కానీ దాదాపు 70 సినిమాలు చేసింది. కానీ ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంది. కేవలం నటిగానే మిగిలిపోలేదు. నిర్మాతగానూ మారింది. షమ్మీకపూర్ను పెండ్లి చేసుకుని ఆదర్శ జీవితం గడిపింది. వృత్తిపరంగానూ, వ్యక్తిగత జీవితంలోనూ భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచింది.
గీతాబాలి సర్దార్ కుటుంబంలో పంజాబ్లోని అమృత్సర్లో పుట్టింది. ఆమె అసలు పేరు హరికీర్తన్ కౌర్. మొదట ఆల్ ఇండియా రేడియోకు పాటలు పాడేది. శాస్త్రీయ నృత్య నేర్చుకున్న బాలి ఎన్నో వేదికలపై ప్రదర్శనలిచ్చింది. గుర్రపుస్వారీ తెలుసు. గట్కా(మార్షల్ ఆర్ట్స్)ను కూడా నేర్చుకుంది. పంజాబ్లో బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది. పన్నెండేండ్ల వయసులో 'ది కోబ్లార్' సినిమాలో నటించింది. తరువాత బద్నామీ సినిమాతో హీరోయిన్గా మారింది. పదహారు, పదిహేడేండ్ల మధ్యలో ముంబాయికి చేరుకుంది. సినిమాలో పాత్ర 'గీత' పేరునే సొంత పేరుగా మార్చుకుంది. తండ్రి పేరు చివరన ఉన్న బాలీని తన పేరు చివరన చేర్చి హరికీర్తన్ కౌర్ కాస్త గీతాబాలిగా మారిపోయింది. 1948లో ఆమె నటించిన 'సొహాగ్రాత్' ఎనలేని కీర్తినిపెట్టింది. తరువాత నేకీ బాడీ చేసింది. దేవానంద్, గీతల కాంబినేషన్ అంటే సక్సెస్కు చిరునామా ఆ రోజుల్లో. వాళ్లిదరూ కలిసి బాజీ (1951), జాల్ (1952), ఫెర్రీ (1954), మిలాప్ (1955), ఫరార్ (1955), పాకెట్ మార్ (1956) వంటి విజయవంతమైన సినిమాలెన్నో చేశారు.
రంగీన్ రాతేమే...
మిస్ కోకాకోలా షూటింగ్ సమయంలో షమ్మీతో పరిచయం ఏర్పడింది గీతకు. కానీ 'రంగీన్ రాతే' షూటింగ్ టైమ్లో ఆమెలోని ప్రత్యేకతలను గుర్తించలిగాడు షమ్మీ. అప్పుడామెకు 24 ఏండ్లు. కానీ వయసుకు మించిన పరిణితి. జీవితంలో ఎన్నో కష్టాలు. వాటన్నింటినీ మరిచి కెరీర్లో సక్సెస్ఫుల్గా సాగిపోతున్న మహిళ. ఏ క్షణాన ఆమెతో ప్రేమలో పడిపోయాడో తెలియదు. అందుకే 'రంగీన్ రాతే సినిమా నిజంగా సినిమా కేవలం గీతను నా జీవితంలోకి తీసుకురావడానికే తీశారేమో. లేకపోతే ఆమెకు ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర, అంతంతగానే ఉన్న స్క్రిప్ట్.. అందులో ఆమె పనిచేయడం, ఆ సందర్భంగా నాకు పరిచయం అవ్వడం డెస్టినీ అనుకుంటాను. నా కంటే ఓ ఏడాది పెద్దది కావడం వల్ల నా తండ్రితో పనిచేసింది. నా అన్నతో కలిసి ఓ సినిమా తీసింది. ఏది ఏమయినా నా జీవితమంతా తనతోనే పంచుకోవాలని కోరుకున్నాను' అని షమ్మీ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
సినిమాటిక్ పెండ్లి...
అలా 'రంగీన్ రాతే' సినిమా షూటింగ్ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. షమ్మీనే గీతకు ప్రపోజ్ చేశాడు. వెంటనే గీత ఒప్పుకోలేదు. ఎందుకంటే తన కుటుంబం అంతా ఆమెపైనే ఆధారపడి ఉంది. అందుకే 'షమ్మీ నీ మీద ప్రేమ ఉంది. కానీ నా కుటుంబాన్ని వదిలి రాలేను అర్థం చేసుకోమ'ంది. అయినా షమ్మీ ఊరుకోలేదు. పదే పదే ఆమె ముందు తన ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. చివరకు ఒప్పుకుంది. ఆమె అంగీకరించిన మరునాడే వాళ్లిద్దరి పెండ్లి జరిగింది. అది కూడా చాలా తమాషాగా. తన మిత్రుడైనా స్టార్ కమెడియన్ జానీవాకర్ దగ్గరకు గీతాను తీసుకుని వెళ్లాడు షమ్మీ. ఆయన తన హిందూ ఫ్రెండ్తో మాట్లాడి... ఇద్దరినీ సౌత్ ముంబైలోని ఓ గుడికి తీసుకెళ్లారు. అప్పటికే అది మూసేశారు. మరునాడు రమ్మని గుడి పూజారి చెప్పాడు. తెల్లారి నాలుగు గంటలకే గుడికి చేరుకున్నారు. సినిమాటిక్ పద్ధతిలో వాళ్ల పెండ్లి జరిగింది. షమ్మీ గీత నుదుటన సిందూరం పెట్టడానికి బదులుగా... ఆమె పెదాలకు లిప్స్టిక్ను దిద్దాడు. అలా 1955 ఆగస్టు 23న షమ్మీకపూర్తో ఆమె వివాహమైంది. అతడు ఆమెను ఎంతో ఆరాధించాడు. ఆమె అతడిని అంతగా ప్రేమించింది. పృ థ్వీరాజ్ కపూర్... పెద్ద కొడుకు రాజ్ కపూర్ను సినిమా నటుడిని చేసినా, కోడలుగా పెద్దింటి అమ్మాయిని తెచ్చుకున్నాడు. రెండో కొడుకు షమ్మీ ఓ సినిమా నటీమణిని చేసుకుంటానంటే ఆయన ఒప్పుకోలేదు. చాలా తర్జనభర్జనలయ్యాక షమ్మీ కుటుంబం వారి పెండ్లిని అంగీకరించింది.
ఆమే అతని వ్యక్తిత్వం...
పెండ్లికి ముందు షమ్మీకంటే గీతనే ఎక్కువ సక్సెస్ సాధించింది. అతని కంటే ఏడాది పెద్దది కూడా. అప్పటిదాకా కెరీర్ ఓరియెంటెడ్గా ఉన్న బాలి... పెండ్లి తరువాత కపూర్ల కుటుంబంలో చేరినాక ఆ పరంపరను కొనసాగించింది. షమ్మీకోసం ఎంతో త్యాగం చేసింది. బయట కనిపించే ఆయన ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం అంతా గీతతో వచ్చిందే. ఇతర సినిమా హీరోయిన్లలా స్టీరియోటైప్ విషాద జీవితం కాదామెది. ఆమె నటించిన ఏక్ అల్బేలా సినిమాలో లాగే ఎప్పుడూ అల్లరి పిల్లలా, చురుకుదనం నిండిన వ్యక్తిగా కనిపించేది బాలి. పెండ్లి తరువాత షమ్మీతోకలిసి సురేందర్ కపూర్ నిర్మించిన జబ్ సే తుమే దేఖా హై (1963)లో చిన్న పాత్రలో కనిపించింది. ఆమెకు అత్యంత ఇష్టమైన పాత్ర అంటే.. భగవాన్ దాదా బ్లాక్ బస్టర్ 'అల్బేలా'నే. తన వ్యక్తిగత జీవితానికి ఎంతో దగ్గరగా ఉన్న ఆ పాత్రలో గీతా జీవించింది. దానికి సీక్వెల్గా 1953లో వచ్చిన జమేలా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది.
నిర్మాతగా...
నవకేతన్ సంస్థ నుంచి వచ్చిన సినిమా 'బాజీ'(1951)లో దేవ్ ఆనంద్ సరసన హీరోయిన్గా వేసినది గీతా బాలి. ఆ సినిమా విజయవంతం కావడంతో టి.ఆర్. ఫతేచంద్ అనే ఓ సింధీ ఆయన అదే కాంబినేషన్లో 'జాల్' (1952) సినిమా తీయడానికి ముందుకు వచ్చాడు. కథ, స్క్రీన్ప్లే, డైరక్షన్ గురుదత్ది కాగా, హీరో హీరోయిన్లు దేవ్, గీతాలు. అదీ హిట్ అయింది. గురుదత్ దర్శకత్వ ప్రతిభ చూసి గీతా బాలి యీసారి మనమే భాగస్వాములుగా సినిమా తీద్దామంది. 'బాజ్' (1953) అనే సినిమా ప్లాను చేశారు. 16 వ శతాబ్దంలో మలబార్ తీరంపై దాడి చేసిన పోర్చుగీసులపై తిరగబడడానికి స్థానిక యువరాజు సహాయం తీసుకున్న సముద్రపు దొంగల రాణి కథ అది. విప్లవకారిణిగా గీతా బాలిని అనుకుని హీరోగా ఎవరా అని వెతికారు. దేవానంద్ అప్పటికే స్టార్ అయిపోవడంతో అతనికి మార్కెట్ రేటు యిస్తే సినిమా బజెట్ దాటిపోతుంది. 'నువ్వే ఎందుకు వేయకూడదు?' అన్నారు గురుదత్తో గీతా బాలి. గురుదత్కి నాట్యం వచ్చు. అప్పటికి చిన్నా, చితకా వేషాలు వేశాడు. అయినా అవన్నీ వదిలిపెట్టి డైరక్షన్వైపుకి ద ష్టి మరలించాడు. ఓ పట్టాన ఒప్పుకోలేదు. గీతా బాలి దగ్గరుండి అతన్ని చాలా ప్రోత్సహించి వేయించింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడంతో 'బాజ్' తర్వాత వారు కలిసి సినిమాలు తీయలేదు.
సినిమాతో సంబంధం లేకుండా...
1956లో కొడుకు ఆదిత్య రాజ్కపూర్ పుట్టాడు. తమలా కొడుకు సినిమా వైపు రావద్దనుకుంది. అందుకే సినిమాలతో సంబంధం లేకుండా పెంచింది. ఇంట్లో కూర్చుంటే ఏదీ జరగదు... బయటికి వెళ్లాలి. ప్రపంచాన్ని చూడాలి. నేర్చుకోవాలని చెబుతూ ఉండేది కొడుకుకు. అందుకు తగ్గట్టుగానే అతను తయారయ్యాడు. చార్కోల్ పెయింట్ అద్భుతంగా వేస్తాడు. వంట బాగా చేస్తాడు. బైక్ రైడర్ కూడా. ఏక్ చద్దర్ మైలీసీ సినిమా షూటింగ్ సమయంలో అంతా కొడుకు ఆమె దగ్గరే ఉన్నాడు.
34 ఏండ్లకే...
ఆమెకు స్మాల్ఫాక్స్ రావడం, అనారోగ్యం పాలవ్వడంతో షమ్మీకపూర్ ముంబైకి తీసుకుని వచ్చాడు. ఆమె మంచాన పడటంతో కొడుకును, కూతురుని రాజ్కపూర్ ఇంట్లో పెట్టింది. ఆ తరువాత 15 రోజులకే 1965 జనవరి 21న ఆమె కన్ను మూసింది. తన అభిమానులను, అమితంగా ప్రేమించిన షమ్మీని, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. అప్పుడామె వయసు 34 సంవత్సరాలు. గీత మరణాన్ని షమ్మీ తట్టుకోలేకపోయాడు. ఆ విషాదం నుంచి తేరుకోవడానికి చాలా కాలమే పట్టింది. తరువాత షమ్మీ రెండో పెండ్లి చేసుకోవాల్సి వచ్చింది. రెండో పెళ్లి చేసుకున్నా గీత కుటుంబంతో సంబంధబాంధవ్యాలు కొనసాగించాడు. గీత అక్క హరిదర్శన్ కౌర్ కూతురు యోగితా బాలి కొన్నాళ్లకు సినిమాలలో ప్రవేశిద్దామని అనుకుంది. ఆమెను తన మిత్రుడు, ఈగిల్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎఫ్.సి.మెహ్రాకు పరిచయం చేసి వారి ''పర్దే కే పీఛే'' (1971) ద్వారా ఆమెను సినీరంగ ప్రవేశం చేయించాడు. కొన్ని రోజులు పోయాక ఆమె నటగాయకుడు కిశోర్ కుమార్ను పెళ్లి చేసుకుంటానంది. ఆ పెళ్లిలో షమ్మీ పూర్ ఆమె తండ్రి స్థానంలో కన్యాదానం చేశాడు.
- కట్ట కవిత