Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్యాన్సర్ అన్న పదం వినగానే.. ఉలిక్కి పడతాం. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ జబ్బు బారిన పడినవారిని అంటరానివారిగా చూస్తాం. ఇక మరణం తప్ప మరో గత్యంతరం లేదు అన్నకున్న ఎంతో మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు తన వైద్యంతోనే కాదు.. మంచిమాటలతో ధైర్యాన్నిస్తూ.. క్యాన్సర్ కూడా అన్ని జబ్బుల మాదిరిగానే నయం అవుతుందన్న భరోసాను కల్పిస్తున్నారు సుప్రసిద్ధ వైద్యులు డాక్టర్ సునీత, సీనియర్ కన్సలెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. రెండుదశాబ్దాలుగా క్యాన్సర్ బారిన పడిన వారికి భరోసానిస్తూ.. తన వద్దకు వచ్చిన ఎందరో జీవితాలను అధ్యయనం చేసి ఈ వ్యాధి బారిన పడినవారికి అవసరమైన సమాచారం, కేసు స్టడీస్తో పుస్తకం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న ఆమె మానవితో చెప్పిన విషయాలు..
కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని చిన్నగ్రామం గండికోట కోటారిపల్లి మా సొంతూరు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మా నాన్న సుబ్బయ్య ఎంతో కష్టపడి కర్నూలు మెడికల్ కాలేజీలో చదివి డాక్టర్ అయ్యారు. ఆయన తన పిల్లలంద రినీ డాక్టర్లు చేయాలని నిర్ణయించుకున్నారు. అమ్మ లక్ష్మీదేవి. మేం ముగ్గురం పిల్లలం. తమ్ముడు (డాక్టర్), చెల్లి (సాఫ్ట్వేర్). నేను మొదటి బిడ్డను కావడంతో నాన్న ఆశయం ముందుగా నాతోనే ప్రారంభమైంది. అమ్మకు డెలివరి చేసిన వ్యక్తి ప్రముఖ డాక్టర్ బాలాంబగారు. నన్ను తాకిన మొదటి స్పర్శ ఆమెది కావడం నా అదృష్టం. నాన్న గవర్నమెంట్ డాక్టర్ కావడంతో ప్రతి మూడేండ్లకు ఒకసారి బదిలీలు ఉండేవి. ప్రాథమిక విద్య జిల్లాల్లో సాగింది. పదవతరగతి, ఇంటర్ హైదరాబాద్లోనే పూర్తి చేశాను. నాకు టీచర్ కావాలన్న కోరిక మనసులో ఉన్నా.. నాన్నకు భయపడి ఎప్పుడూ చెప్పలేదు. ఎంసెట్ రాసిన తర్వాత కొద్దిరోజులు డిగ్రీ చదివాను.
ఓయూలో సీటు..
ఎంసెట్లో స్టేట్ర్యాంక్ 300 వచ్చింది. దాంతో ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. నాన్న సంతోషానికి అవధులు లేవు. నాకు మనసులో బాధగా ఉన్నా.. నాన్న కోసం మెడిసిన్లో చేరాను. క్లాసులు ప్రారంభం కావడం.. ప్రొఫెసర్లు వైద్యవృత్తి గొప్పదనం చెప్పడంతో నేను మంచి డాక్టర్ను కావాలని నిశ్చయించు కున్నాను. మాకు క్లాసులు తీసుకునేవారిలో ఎంతో మంది ప్రముఖ డాక్టర్లు ఉన్నారు. వారి వద్ద కేవలం హ్యూమన్బాడీ మెటబాలిజంతోపాటు హ్యూమన్ వ్యాల్యూస్, మెంటల్ స్ట్రెంత్ నేర్చుకున్నాం. క్లాసుకు లేటుగా వచ్చినా.. సరిగ్గా డయగ్నోసిస్ చేయకపోయినా.. అమ్మాయిలు అన్నది కూడా చూడకుండా తిట్టేవారు. వివక్ష అన్నది లేకుండా అందరినీ సమానంగా చూసేవారు. ఈరోజు డాక్టర్గా మంచి పేరు ఉందంటే ఆ క్రెడిట్ అంతా మా నాన్న, మా ప్రొఫెసర్లదే.
పాఠాలు చెప్పవచ్చని..
నాకు థియరీ క్లాసులు చెప్పాలంటే చాలా ఇష్టం. టీచర్ కావాలన్న కోరిక మెడిసన్లో తీరింది. ఎంబిబిఎస్ సెకండరీయర్లో ఉన్నప్పుడే ఫస్ట్ ఇయర్ వారికి లెసెన్సు చెప్పడం ప్రారంభించాను. ఆ తర్వాత ఎంబిబిఎస్లో ఉన్నన్ని రోజులు క్లాసులు చెప్పేదాన్ని. నా ఫ్రెండ్స్ కూడా వచ్చి థియరీ చెప్పమని అడిగేవారు. అలా బోధించా లన్న నా కోరిక తీరింది. సర్జికల్ స్కిల్స్ నాకు అంతగా లేవు అన్న విషయం నేను గుర్తించి.. ఫిజీషియన్ కావాలనుకున్నాను. డెర్మిటాలజీలో చేరాలని నాన్న సూచించారు. ఆయన కూడా డెర్మిటాలజిస్టు కావడంతో నన్ను అందులోనే స్పెషలైజేషన్ చేయమన్నారు. అయితే ఆంకాలజీ పై ఆసక్తి నన్ను ఆంకాలజీ, రేడియేషన్లో ఎం.డి చదివేందుకు కారణమైంది. రేడియాలజీలో చేరినప్పుడు రేడియేషన్ ప్రభావంతో ఆరోగ్యం పాడైతదని నా ఫ్రెండ్స్ భయపెట్టారు. అప్పుడు క్లాస్లో నేను మరో అమ్మాయి మాత్రమే ఉండేవాళ్లం. ఎం.డి, డిఎన్బి పూర్తి చేసిన తర్వాత యశోద హాస్పిటల్లో చేరాను. న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో, టాటా మెమోరియల్ హాస్పిటల్లోనూ శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత బసవతారకం ఇండో అమెరికన్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్లో పన్నెండు సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు కాంటినెంటల్ హాస్పిటల్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజీస్ట్గా పనిచేస్తున్నాను.
వైద్యరంగంలో ఎఫ్ఆర్సిఆర్ పట్టా పొందడం ఒక మైలురాయి వంటిది. ఎంతో క్లిష్టమైన ఈ పరీక్షలో విజయం సాధించాలని ఎంతో ప్రయత్నించాను. చివరికీ మా బాబుకు మెడికల్ సీటు, నాకు ఎఫ్ఆర్సిఆర్ పట్టా ఒకే ఏడాది వచ్చాయి. నిజంగా చాలా హ్యాపీగా ఫీలయ్యాను.
పేషంట్ చెప్పింది వినాలి..
ప్రతి జబ్బుకు ఒక చరిత్ర ఉంటుంది. కొన్ని లక్షణాలనే బట్టి మనం జబ్బును అంచనా వేయలేం. ముఖ్యంగా క్యాన్సర్ సోకిన వారిలో వారి జీవనవిధానం, అలవాట్లు ప్రముఖపాత్ర పోషిస్తాయి. అవేమి తెలుసుకోకుండా కేవలం రిపోర్ట్స్ చూసి వైద్యం చేస్తే.. అవి జబ్బును పూర్తిగా నయం చేయవు. మొదటి నుంచి తెలుసుకోవడం అన్న అలవాటు ఉన్న నేను.. వైద్యం కోసం వచ్చే ప్రతిరోగి గురించి పూర్తిగా తెలుసుకుంటాను. వారితో ప్రేమగా మాట్లాడితే చాలు సగం జబ్బు తగ్గిపోతుంది. ఎందుకంటే క్యాన్సర్ వ్యాధి అనగానే ఇక జీవితం ముగిసిపోతుంది అన్న భయం, బాధ వారిలో ఉంటాయి. ఎన్ని మందులిచ్చినా.. రికవరీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాకాకుండా రోగితో ప్రేమగా మాట్లాడితే.. మెంటల్గా వారు స్ట్రాంగ్ అవుతారు. అప్పుడు మందులు కూడా పనిచేస్తాయి. ప్రతి పేషంట్కు దాదాపు గంటటైమ్ కేటాయిస్తాను. కంప్లీట్ ఫ్యామిలీ హిస్టరీ, డైలీ హాబిట్స్ తెలుసుకున్న తర్వాతే అవసరమైన వైద్యపరీక్షలు చేయిస్తాం. అప్పుడు వారికి ఇచ్చే చికిత్స చాలా త్వరగా కోలుకునేలా చేస్తుంది. మనోధైర్యం ఉంటే ఎలాంటి జబ్బులనైనా నయం చేయవచ్చు.
రెగ్యులర్గా చెకప్..
' కార్యేషుదాసి, కరణేషు మంత్రి అంటూ.. మహిళలను మల్టీటాలెంట్ పర్సన్గా అభివర్ణిస్తారు. ఆడవారు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు, ఇంటిలోని వారంతా ఆనందంగా ఉంటారు అన్న విషయాన్ని మాత్రం విస్మరిస్తారు. రెగ్యులర్గా హెల్త్ చెకప్ లేకపోవడంతో క్యాన్సర ్బారిన పడుతున్న మహిళల సంఖ్య అధికంగా ఉంది. మనదేశంలో మహిళల్లో సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్లతో పాటు గొంతు క్యాన్సర్ కూడా ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్వైకల్, గొంతు క్యాన్సర్లు కనిపిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. వీటికి కారణాలను పరిశీలించినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అధిక సంతానం, శుభ్రత పాటించకపోవడం, ఎక్కువగా పొగాకు ఉత్పత్తులను తినడం. ఇక పట్టణ ప్రాంతాల మహిళల విషయం గమనిస్తే.. 30ఏండ్ల వరకు పెండ్లి చేసుకోకపోవడంతో వారిలో హార్మోన్స్లో తేడాలు వస్తాయి. ఇవి క్యాన్సర్ రావడానికి కారణం అవుతాయి. ఇటీవల 16ఏండ్ల అమ్మాయిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఐడెంటిఫై చేశాం. ఏ క్యాన్సర్ అయినా ఫస్ట్, సెకండ్ స్టేజీలో బయటపడితే పూర్తిగా నయం చేయవచ్చు. రెగ్యులర్ చెకప్లతో వీటికి చెక్ పెట్టవచ్చు. 35ఏండ్లు పై పడిన వారు ప్రతి పదేండ్లకు ఒకసారి పాప్స్పియర్ టెస్ట్, 50ఏండ్లు పై పడిన వారు ప్రతి రెండేండ్లకు ఒకసారి మమోగ్రామ్ టెస్ట్ చేయించుకుంటే చాలామందిలో క్యాన్సర్ను నివారించవచ్చు. మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. వారి ఆరోగ్యంపైనే కుటుంబం ఆరోగ్యం, ఆనందం ఆధారపడి ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
- వి. యశోద