Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమలమ్మ గారిని జ్ఞాపకం చేసుకోవడమంటే, తలుచుకోవడమంటే నైజాం ప్రభుత్వ ఏలుబడిలో దొరల దౌర్జన్యాలు, వెట్టి చాకిరి, బానిసత్వం , గడీల్లో జరిగిన అరాచకాలు, వాటికి వ్యతిరేకంగా ఆంధ్ర మహా సభ , ఆ పై కమ్మూనిస్టు ఉద్యమం, మట్టి మనుషుల త్యాగాలు ... ఓ మహోన్నత పోరాటాన్ని మననం చేసుకోవడమే. 92 ఏండ్ల వయసులో ఈ నెల 11వ తేదీన కన్ను మూసిన కమలమ్మగారి జ్ఞాపకాలు ఉద్యమాల్లో పని చేసేవారికి స్ఫూర్తి దాయకం.
వడ్డించిన విస్తరి కాదు కమలమ్మ గారి జీవితం. ఆవిడ నాయన పేరు చెరకు రంగారావు. అప్పట్లో ఆయన వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం నేనాల గ్రామంలో కరణం దొరల దగ్గర గుమస్తా. ఆనాటి దొరల పాలనలో ప్రజలకు ఏ హక్కులు ఉండక పోయేవి. ఇక స్త్రీల కష్టాలు చెప్పనలవి కావు. వారికి నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి గడీల్లో పెట్టుకున్నా అడిగే పరిస్థితి ఆరోజుల్లో లేదు. అలా తెచ్చుకున్న అమ్మాయిలను గడీల్లో పెట్టుకున్న వారిని ఆడబాపలనేవారు. వాళ్ళు తమ బతుకంతా గడీల్లో బానిసలుగా ఉండే వారు. పుట్టిన పిల్లలకు తల్లి మాత్రమే తెలిసేది. తండ్రి ఎవరో తెలియక పోయేది. అక్కడ పుట్టినావిడే రంగమ్మ. గుమస్తా పనిచేస్తున్న చెరుకు రంగా రావు అక్కడే పరిచయమైన రంగమ్మతో సహా జీవనం చేసాడు. రంగారావు, రంగమ్మ గార్లకు 5 మంది సంతానం. అందులో నాలుగో సంతానమే కమలమ్మ. సహజంగా పిల్లలకు తండ్రి తరపునే ఇంటి పేర్లను పెట్టుకుంటారు. కానీ వీరి పుట్టిన పిల్లలకు తల్లి తరుపున ఉన్న ''మందాటి'' అన్న ఇంటిపేరు స్థిరపడింది. దానికి ప్రధాన కారణం, ఆనాటికి కరణం దొరలను ఎదిరించి నిలబడే శక్తి రంగారావుకు లేదు. ఒకవేళ ఇంటిపేరు పిల్లలకు పెడితే దొరలు ఊరుకోరు. అందుకే పిల్లలకు భార్య ఇంటిపేరునే ఉంచేశారు. పెద్దవాడు మందాటి వెంకటయ్యకు పెండ్లి చేద్దామంటే కరుణాల పిల్లను ఇవ్వలేదు. ఆ క్రమంలోనే మరిపెడ మండలం చిల్లంచర్ల రాంపురం గ్రామానికి చెందిన చక్రపాణమ్మ బిడ్డ చిత్తారమ్మను వెంకటయ్య చేసుకుంటే, ఆవిడ కొడుకు ముకుందాన్ని కమలమ్మ చేసుకుంది. పెండ్లి సమయానికి కమలమ్మ వయసు 7 ఏండ్లు. ముకుందానికి 18 ఏండ్లు.
ఉద్యమంలోకి...
తెలంగాణా ప్రాంతం ఆనాడు నైజాంల ఏలుబడిలో ఉండేది.వారి మద్దతుతో గ్రామాల్లో దొరలు, భూస్వాముల పెత్తనాలు చెప్పతరం కాదు. అన్ని కులాల ప్రజలు దొరలకు వెట్టి చేసేవారు. భారత దేశానికి1947 లో స్వాతంత్రం వచ్చినా, తెలంగాణ ప్రాంతానికి మాత్రం రాలేదు.1946 నుండే కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యంలో ఈ అన్యాయాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం మొదలైంది. దొరలకు మద్దతుగా నైజాం ఏర్పాటు చేసిన ప్రైవేట్ సైన్యం రజాకార్లు రంగంలోకి దిగారు. ఎక్కడ చూసినా అరాచకాలు. పోరాడితే తప్ప బతకలేని పరిస్థితి. ఆ పోరులోకి ముందుగా పోయినవాడు కమలమ్మ పెద్దన్న వెంకటయ్య. ఆయన పార్టీలో దళ కమాండర్. అతడే కమలమ్మను, ముకుందాన్ని ఉద్యమంలోకి తీసుకొని పోయాడు. పోరాటంలోకి పోయినప్పుడు కమలమ్మ గారి వయసు 18 ఏండ్లు. ఆరోజుల్లో ఉద్యమం జరుగుతున్నప్పుడు నాయకులు మారు పేర్లతో పిలవబడ్డా, కమలమ్మ గారి పేరు మార్చలేదు. ఆమె పేరుతోనే దళాల్లో తిరిగింది. భర్త మాత్రం రహస్యజీవితంలో అప్పన్నగా పేరు మార్చుకొని చివరి వరకు ఆ పేరుతోనే బతికాడు.
మాతృత్వం మెలిపెట్టినా
ఉద్యమంలోకి పోతున్నప్పుడు కమలమ్మకు ఎనిమిది నెలల బాబు. తన ఎనిమిది నెలల బాబును అప్పన్న చెల్లెలుకిచ్చి దళాల్లోకి వెళ్లిపోయింది. ఒక మామూలు స్త్రీ కమలమ్మ.. సిద్ధాంతాన్ని చదవలేదు. పుస్తకాల జ్ఞానం లేదు. కానీ ఒక సంక్షుభిత సమయంలో సమస్యల పరిష్కారం కోసం తన పిల్లవాడిని వదిలేసి ఉద్యమంలోకి దూకడం ఎర్రజెండా ఇచ్చిన చైతన్యమే. పిల్లవాడిని పంపేసినా పాలు తాగే వయసు కనుక మాతృత్వ మమకారం నిరంతరం మెలిపెట్టేది. ఆ రెండేళ్లలో వాడిని చూడాలని అనుకున్నా నిర్బంధంలో సాధ్యం కాలేదు
కన్నీళ్లు ఆగలేదు...
అడివిలోకి పోయినపుడు అక్కడ గిరిజనులను ఆర్గనైజ్ చేయడానికి బుర్రకథలు, పాటలు పాడడం, గొల్లసుద్దులు చెప్పడం చేసే వారు. దళాల్లో వైజ్ఞానిక రంగంలో అంటే నర్సుగా దెబ్బలు తాకినప్పుడు కట్లు కట్టడం, సూదులు ఇవ్వడం చేసేది. ఎప్పుడైనా ప్రజాయుద్ధం త్యాగాన్నే కోరుకుంటుంది. త్యాగం చేయలేనివాళ్లు అక్కడ నిలబడ లేరు.ఇద్దరు కలిసే పోరాటంలోకెళ్ళినా అప్పన్న మంతెన మహాదేవపూర్ అడివిలో ఉంటె, కమలమ్మ ఖమ్మం, మానుకోట ఏరియాల్లో ఎక్కువగా పని చేసింది. కొంతకాలం తర్వాత భార్య భర్తలు ఒకే చోట పనిచేసే అవకాశం వచ్చినప్పుడు, గర్భం ధరించిన కమలమ్మ ఎక్కడా వెనకడుగు వేయకుండా దళంలోనే 9 నెలలు అనేక పనులు చేసింది. కాన్పు జరిగిన తీరును చెప్పినప్పుడు మాకైతే కన్నీళ్లు ఆగలేదు. కాన్పు జరిగే సమయం వరకు కూడా దళంలో ఒకచోటనుండి ఇంకొకచోటుకు తిరుగుతూనే ఉందట. నొప్పులొస్తున్నాయని అన్నప్పుడు చుట్టూ దళాల్ని కాపలాగా పెట్టి, గుట్ట లోపల సొరంగంలో మంత్రసానిని పిలిపించి కాన్పు చేయించినట్లు, అప్పుడు అప్పన్న గుట్టపైన కావలి కాసినట్లు చెప్పింది. ఆమెను కాపాడుకోవడానికి దళం ఎంత కష్ట పడిందో. 'నీవెంత బాధలు అనుభవించినవమ్మా' అని అన్నప్పుడు, అంత కష్టాన్నైనా భరించే ధైర్యాన్నిచ్చిన దళ సభ్యులను, వారు చేసిన సాయాన్ని ఎంతసేపు తలుచుకుందో. పుట్టిన బాబుకు, అప్పటికే వరంగల్ జిల్లా మానుకోట తాలూకా పిండిపోలు గ్రామంలో పోలీసుల కాల్పుల్లో మరణించిన కామ్రేడ్ సీత రామారావు అని పేరు పెట్టుకున్నారు.
నిర్ణయం గొప్పది
నైజాం లొంగిపోయాక యూనియన్ సైన్యాలు వచ్చాయి. దాడి తీవ్రమైంది. పోరాటంతో పాటు పిల్లోడు పెరుగుతున్నాడు. అడవిలోనే 6 నెలలు సాదుకుంది. పిల్లోడిని ఎత్తుకొని అనేక పనులు చేసేది. ఒకచోట క్లాసులు జరుగుతున్నప్పుడు పిల్లవాడు ఏడవడం మొదలేసిండు. ఎంతకు ఏడవడం ఆపడం లేదు.దళాల ఉనికే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో కమలమ్మ గారి ముందు రెండే ప్రశ్నలు. . ఒకటి మాతృత్వాన్ని త్యాగం చేయాలా? రెండు ఉద్యమాన్ని వదిలేయాలా? మాతృప్రేమ కావాలనుకుంటే మంచి తల్లి అవుతుంది. ఉద్యమమే కావాలనుకుంటే ఊరందరి తల్లి అవుతుంది. కమలమ్మ గారు ఊరందరి తల్లి అవడానికే నిశ్చయించుకొంది. తెలిసిన వారికి ఇవ్వడానికి, బయటకు పోయే పరిస్థితి లేదు. అడవిలో ఉన్న కోయ వారిని కలిసి పిల్లోడిని సాదుకొమ్మని అడిగింది. 'పిల్లోడు ఎర్రగా ఉన్నాడు. మా కోయ వాళ్లలో కలిసి పోయినట్లు ఉండడు. మాపై పోలీస్ దాడులు పెరగవచ్చు. అదీగాక ఇక్కడ దళ సభ్యురాలి పిల్లవాడిని తెలిస్తే, ఈ ఏరియాలో దళాలకు ప్రమాదం' అని వాళ్ళు వద్దన్నారు.
నిర్ణయం అసమాన్యం
ఈ ఏరియాలో తీసుకోవడం లేదు కనుక బాబు మెడలో ఒక కాగితం రాసి ' పిల్లవాడిని సాదలేక పోతున్నాను. దయ గల్లవారు సాదుకొమ్మని' అందులో రాసి ఇల్లెందు బొగ్గుట్ట ఏరియాలో ఎవ్వరికైనా ఇచ్చేసి రావాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు పార్టీ కేటాయించిన ఎంకన్న అనే దళ సభ్యుడి సహకారంతో ఒక రాత్రి, ఒక పగలు నడిచి బొగ్గుట్టకు చేరుకున్నారు. అక్కడ ఎర్ర గోపన్న అనే ఆర్గనైజర్ ఉండేవాడు. అతని సహాయంతో ఒకతనికి పిల్లోన్ని ఇచ్చేసి అతని చేతులో పిల్లవాడి కోసమంటూ తన దగ్గరున్న 10 రూపాయలు ఇచ్చిందట. తిరిగొస్తుంటే పిల్లవాడు నాకోసం చూసిన చూపు మరువలేకున్నానంది. పిల్లవాడిని వదిలేయడమంటే... దారిన పోయే ఒక మనిషి పిల్లోడిని తీసుకుపోతుంటే ఏ తల్లికైనా సాధ్యమేనా? అయినా తను ఎత్తుకున్న ఎర్రజెండా కోసం. తననే నమ్మిన కష్టజీవుల కోసం ఆ నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్కరి జీవితం ఇంకొకరి త్యాగంతో పోల్చలేకున్నా, ఒక చారిత్రక దశలో వారు తీసుకున్న నిర్ణయాలు, ఎర్రజెండా కోసం నిలబడ్డ తీరు వారిని అసమాన్యులుగా చేస్తుంది. ఆనాటి పరిస్థితుల్లో ఒక సామాన్య స్త్రీగా కమ్యూనిస్టు దళాల్లో కొచ్చి పార్టీ ఇచ్చిన జ్ఞానంతో వారు తీసుకున్న నిర్ణయం మనల్ని విపరీతంగా కదిలించి వేస్తుంది.
తెచ్చుకునే అవకాశం ఉన్నా
1952 లో అజ్ఞాత జీవితం వీడి బయటకొచ్చాక పిల్లవాడిని ఏ ఏరియాలో ఏ బొగ్గుగని కార్మికునికి ఇచ్చి వచ్చారో తెలిసే అవకాశం ఉంది కొద్దిగా కష్టపడితే పిల్లవాడిని దొరకపట్ట వచ్చని అందరూ చెప్పినా, కమలమ్మ ఆవిడ భర్త అప్పన్న( చివరి వరకు కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉండి చనిపోయాడు) అలాంటి ప్రయత్నాలు వద్దన్నారు.గుండె దిటవు చేసుకొని ఇద్దరు ఒక నిర్ణయానికొచ్చారు. 'ఒకవేళ పిల్లవాడు దొరికినా, పిల్లవాడిని ఇచ్చేటప్పుడు తల్లిగా నేనెంత ఏడ్చానో, సాదుకొన్న తల్లికీ అంతే బాధ ఉంటుంది' అని పిల్లవాడిని దేవులాడ వద్దని నిర్ణయించుకున్నారు. ఆ తల్లీ బిడ్డల మమకారం మధ్యన తాను ఒక సమస్యగా మారకూడదని చనిపోయేవరకు ఆ జ్ఞాపకాల్లోనే బతుకుతూ.. కండ్లలో కారే కన్నీటిని తుడ్చుకుంటూ ఆరోజు మాకెన్నో విషయాలు చెప్పింది.
ఉద్యమ జెండాలై ఎగురుదాం
ఆరోజు మాకు చెప్పిన అనేక విషయాలు మదిలో కొస్తుంటే.. వయసులో అలిసిపోయి.. ఆశయంలో ఆకాశాన్ని ఒడిసిపట్టి మెరిసిపోతున్న అమ్మను చూస్తుంటే.. మనం మళ్ళీ ఉద్యమ జెండాలై ఎగురుతాం. అయినా అమ్మ ఎక్కడికెళ్లింది. చివరికంటా ఎత్తుకున్న ఎర్రజెండాను వారసత్వంగా ఇచ్చి వెళ్ళింది. ఏ ఉద్యమం కోసం ఆ తల్లి మాతృత్వాన్ని చంపుకొని ఊరంతా బిడ్డలనుకుందో వారంతా నేడు పోరాటానికి సన్నద్ధం అవ్వడమే ఆ తల్లికి మనమిచ్చే నివాళి. ఈ నెల 22 తేదీ, సాయంత్రం 5 గం|| వరంగల్లోని పోచంమైదాన్లో కమలమ్మ స్మారక సభ జరగబోతున్న సందర్భంగా...
- స్ఫూర్తి,
9490098694