Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బయట ఎండ మండిపోతుంటే... చల్లని చల్ల తాగితే కలిగే హాయే వేరు. వేసవిలో ఎంతో ఆరోగ్యాన్నిచ్చే చల్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేసవి అంతా తాగాల్సి వచ్చినప్పుడు... బోర్ కొడుతుంది. అలాంటప్పుడే ఈ ఫ్లేవర్స్ పనికొస్తాయి. కొంచెం వగరుగా, ఇంకొంచెం తీపిగా, మరికొంచెం పుల్లగా... మీకు కావాల్సిన విధంగా చల్లను తాగేసి కడుపు చల్లగా చేసుకోండి!
బెల్లం మిరియాలతో
కావల్సినవి: పెరుగు - కప్పు, బెల్లం - అరకప్పు, మిరియాలు - ఏడు గింజలు, యాలకులు - రెండు.
తయారీవిధానం: బెల్లాన్ని సన్నగా తరగాలి. అలాగే మిరియాలూ, యాలకులను పొడి చేసుకుని పెట్టుకోవాలి. ముందుగా పెరుగును మిక్సీలోకి తీసుకుని చిక్కని చల్ల చేసుకోవాలి. తరవాత పెరుగులో బెల్లం తరుగూ, పావుకప్పు చల్లనినీళ్లూ పోసుకుని నురగలా వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని గ్లాసుల్లో తీసుకుని మిరియాలపొడి, యాలకులపొడి కలిపి కాసేపు ఫ్రిజ్లో ఉంచి తాగాలి.
పుదీనా జీరాతో...
కావల్సినవి: పుదీనా - కట్ట, పచ్చిమిర్చి - ఒకటి, ఉప్పు - తగినంత, పెరుగు - కప్పు, జీలకర్ర - పావుచెంచా, అల్లం - చిన్నముక్క, నిమ్మరసం - ఐదు చెంచాలు.
తయారీవిధానం: పుదీనా ఆకుల్ని బాగా కడిగి కొన్ని నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. ఐదు నిమిషాల తరవాత దింపేసి నీళ్లు వంపేయాలి. పుదీనా ఆకులు చల్లారాక అవీ, తరిగిన పచ్చిమిర్చీ, ఉప్పూ, జీలకర్రా, నిమ్మరసం, కడిగి తరిగిన అల్లం, పెరుగు కాసిని చన్నీళ్లు మిక్సీలోకి వేసుకుని చిక్కని చల్ల చేసుకోవాలి. ఇది వేసవి తాపాన్ని తగ్గిస్తుంది.
మామిడికాయతో...
కావల్సినవి: కొద్దిగా పులుపు తక్కువగా ఉన్న పచ్చిమామిడికాయ - ఒకటి, చక్కెర - కప్పు, పెరుగు - కప్పు, జీడిపప్పు, బాదం - నాలుగు చొప్పున (నీళ్లలో నానబెట్టుకోవాలి).
తయారీవిధానం: మామిడికాయను చెక్కు తీసి కాసిని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. మామిడికాయ ఉడికించిన నీటిని విడిగా తీసుకోవాలి. మామిడికాయ గుజ్జు, చక్కెర, పెరుగు మిక్సీలో తీసుకుని మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. తరవాత మామిడికాయ ఉడికించిన నీళ్లు పోసుకుని మరోసారి మిక్సీ పట్టి గ్లాసుల్లోకి తీసుకోవాలి. దీనిపై నానబెట్టిన జీడిపప్పూ, బాదంపలుకులూ అలంకరిస్తే మామిడికాయ చల్ల రెడీ!
తులసితో...
కావల్సినవి: పెరుగు - కప్పు, కీర- రెండు, యాపిల్- పావుముక్క, తులసి ఆకులు-5, తేనె- 1 టీస్పూను, అల్లం- చిన్న ముక్క (ఇష్టాన్ని బట్టి).
తయారీవిధానం: కీర, యాపిల్ రెండింటినీ సన్నగా తరగాలి. పైన పేర్కొన్న మిగతా పదార్థాలతో కలిపి వీటిని బ్లెండర్లో వేసి గ్రైండ్ చేయాలి. ఇది లేత ఆకుపచ్చ, క్రీమీ రంగులోకి వచ్చే వరకూ బ్లెండ్ చేయాలి. తర్వాత గ్లాసులో పోసుకుని తాగాలి.
కీరదోసతో..
కావల్సినవి : కీరదోస- రెండు, పెరుగు- అరలీటరు, అల్లం- 2 అంగుళాల ముక్క, కొత్తిమీర తురుము- 2 టేబుల్స్పూన్లు, పచ్చిమిర్చి- రెండు, పంచదార- 4 టేబుల్స్పూన్లు, ఇంగువ- చిటికెడు, ఉప్పు- రుచికి సరిపడా
తయారీ విధానం: కీరా ముక్కలు, అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి, పంచదార, ఇంగువ, ఉప్పు అన్నీ మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. అందులోనే పెరుగు కూడా వేసి మళ్లీ తిప్పాలి. ఇప్పుడు దీన్ని గ్లాసుల్లో పోసి ఐస్క్యూబ్స్ వేసి చల్లచల్లగా అందించాలి.