Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత కాలంలో యువత చదువు పూర్తి చేసినవెంటనే ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. చిన్న వయసులోనే సంపాదిస్తున్నారు. అయితే ఆర్థిక విషయాల్లో సరైన అవగాహన మాత్రం ఉండడం లేదు. ఆర్జించిన మొత్తాన్ని చాలా వరకు సరదాలకు, షికార్లుకు పెట్టేస్తున్నారు. సంపాదన ప్రారంభించిన నాటి నుంచే పొదుపు గురించి ఆలోచించాలంటున్నారు ఆర్థిక నిపుణులు. ఆర్థిక లక్ష్యాల ప్రాధాన్యతను గుర్తించకపోతే మీ శ్రమ, సంపాదన బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే ఆర్థిక లక్ష్యాలు ఎలా ఉండాలో, మనం చేసే కొన్ని పొరపాట్లు, వాటి నుంచి నేర్చుకోవల్సిన గుణపాఠాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం...
స్వాతి బిటెక్ పూర్తి చేసి చిన్న వయసులోనే ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నది. అయితే ఆర్థిక విషయాలపై ఆమెకు ఏ మాత్రం అవగాహన లేదు. ఒకరిద్దరు మిత్రులు ఏమన్నా పొదుపు చేస్తున్నావా? అని అడిగితే పెట్టుబడుదల గురించి నాకేం తెలుసు. ఇపుడే ఆ చికాకులు వద్దు. లైఫ్ ఎంజారు చెయ్యనీరు అనేది. ఇలా హాయిగా సాగిపోతున్న స్వాతి జీవితంలో ఓ పెద్ద కుదుపు. అప్పటి వరకు అన్నీ తానై చూసుకున్న తండ్రి ఓ ప్రమాదంలో చనిపోయాడు. తల్లికీ, చెల్లికీ ఇప్పుడు స్వాతి పెద్దదిక్కయింది. రెండు మూడేండ్లు తిరిగే సరికి పెట్టుబడులు, ఆర్థిక విషయాలపై చాలా పాఠాలు నేర్చుకున్నది.
మొత్తం ఖర్చు చూడాలి
మూడేండ్లు తిరిగే సరికి 25 లక్షల రూపాయలతో ఓ ప్లాట్ తీసుకుంది. ముందూ వెనకా చూకుండా బిల్డర్ చెప్పిన మాటలు నమ్మి ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఆ ప్లాట్కు సరైన డోర్స్గానీ, ఇంటీరియర్స్గానీ లేవు. అదేమని అడిగితే బిల్డర్ ఒప్పందంలో ఉన్నట్టే ఇచ్చా అన్నాడు. దాంతో చేసేదేం లేక ఫ్లాట్ కోసం మరో 10 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది.
తొలి పెట్టుబడి
చాలామంది ఉద్యోగంలో చేరిన రెండు మూడేండ్ల వరకు పెట్టుబడుల గురించే ఆలోచించరు. గరిష్ట రాబడులు ఎందులో వస్తాయా అని ఆలోచిస్తూ కాలం వృధా చేస్తారు. దీంతో వారి మిగులు నిధులపై కనీస రాబడులు కూడా రావు. ఇలాంటి వారు జీవితంలో తమ ఆర్థిక లక్ష్యాలు సాధించడంలో బాగా వెనకబడతారు. అందుకే పెద్దగా తెలియపోయినా పెట్టుబడుల గురించి ఆలస్యం చేయవద్దు. జాబ్లో చేరినప్పటి నుంచే కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. ప్రతి సంవత్సరం మీ పెట్టుబడులను పెంచుకుంటూ వెళ్లండి. ఇలా చేస్తే పెట్టుబడులపై రాబడులూ పెరుగుతాయి.
భయం వద్దు
మనలో చాలామందికి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే ఎక్కడ లేని భయం. కష్టపడి సంపాదించిన నాలుగు రాళ్లు ఒడిదుడుకులు ఎక్కువగా ఉండే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఉన్నదంతా ఎక్కడ ఊడ్చుకుపోతుందోనని భయపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఇది నిజం కూడా. అయితే మీ పెట్టుబడుల విలువ త్వరగా పెరగాలంటే స్టాక్ మార్కెట్టే సరైన సాధనం. ఉదాహరణకు 30 ఏండ్ల వయసున్న వ్యక్తి 60 సంవత్సరాల వయసు వచ్చే సరికి 10 కోట్ల రూపాయల ఆస్తిపరుడు కావాలనుకున్నాడు. ఈ లక్ష్యం సాధించాలంటే ఆ వ్యక్తి ఆరున్నర శాతం వడ్డీ ఉండే బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్లలో నెలకు 90 వేల చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. అదే ఎనిమిది శాతం వడ్డీ రేటు అండే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో అయితే నెలకు 67 వేల చొప్పున పెట్టుబడి పెట్టాలి. దీర్ఘకాలికంగా చూస్తే భారత్ స్టాక్ మార్కెట్లో సగటు రాబడి 14 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేస్తే చాలు 60 ఏండ్లకల్లా తన 10 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
శక్తికి మించి రిస్క్ వద్దు
పిండి కొద్ది రొట్టె అంటారు పెద్దలు. ఈ సూత్రం పెట్టుబడులకు సైతం వర్తిస్తుంది. 'రిస్కు కొద్దీ రాబడులు' అనేది పెట్టుబడి మార్కెట్లో ప్రధాన సూత్రం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి. శక్తికి మించి రిస్కు తీసుకుంటే మాత్రం కష్టాలు తప్పవు. స్టాక్ మార్కెట్లో నేరుగా ఇన్వెస్ట్ చయడం కంటే, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ పథకాల్లో మదుపు చేయడం మంచిది. ఐదేండ్ల కంటే తక్కువ కాలానికి మాత్రం ఎపుడూ స్టాక్ మార్కెట్లో మదుపు చేయవద్దు. దీర్ఘకాలిక రాబడుల కోసం మాత్రమే షేర్లలో ఇన్వెస్ట్ చేయాలనే విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. స్వల్ప కాలిక రాబడుల కోసం మ్యూచువల్ ఫండ్ సంస్థలకు చెందిన రుణ పథకాల యూనిట్లలో మదుపు చేయడం మంచిది.
గుడ్డిగా అనుసరించవద్దు
కావ్యకు జీతం పెరిగింది. ఆదాయపు పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చింది. సంతోషంగా ఈ విషయం భర్తతో చెప్పింది. వెంటనే భర్త ఏదైనా ఎల్ఐసీ పాలసీ తీసుకో జీవితానికి బీమాతో పాటు పన్ను భారం కూడా తగ్గుతుందని సలహా ఇచ్చారు. కావ్య వెంటనే భర్త చెప్పినట్లు ఒక పాలసీ తీసుకుంది. తర్వాత పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ నిపుణులని కలిసాక తెలిసింది. బీమాను పెట్టుబడులతో ముడిపెట్టడం సరికాదని. ఎవరో ఏదో చెప్పారని ఎడా పెడా బీమా పాలసీలు తీసుకోవద్దు. ఎవరైనా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ నిపుణులను కలిసిన తర్వాతే బీమా పాలసీలు తీసుకోండి. ఎందుకంటే పెట్టుబడులతో బీమాను ఎప్పుడూ ముడిపెట్టకూడదు. పన్నుల ఆదా కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పథకాలు ఎంచుకోవడం మంచిది.
పొరపాట్లు మంచివే
పొరపాట్లు చేయడం తప్పని చిన్నప్పటి నుంచీ అందరి మెదళ్లలో పాతకుపోయింది. పొరపాట్లు చేస్తామనే భయంతోనే చాలా మంది పెట్టుబడులకు ముందుకు రారు. బుడి బుడి నడకల చిన్నారికైనా పడకుండా నడక రాదు. ఇదే సూత్రం పెట్టుబడులకూ వర్తిస్తుంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్టే ఇందుకు చక్కని ఉదాహరణ. పొరపాట్లు చేయండి. కానీ వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోండి. ఉదాహరణకు మీ దగ్గర ఉన్న షేర్లలో ఏదైనా షేరు ధర పడిపోతుంటే, ధర తగ్గింది కదాని ఆ షేర్లను కొని యావరేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలా చేస్తే కొంప కొల్లేరయ్యే ప్రమాదం ఉంది.
లక్ష్యాలను చేరేలా
ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ తీసుకుని గమ్య స్థానానికి వెళ్లే లోపే విమానాలు నూటికి 99 శాతం సమయం నిర్ణీత మార్గంలో ప్రయాణించవు. అయినా అవి నిర్ణీత సమయానికి గమ్యస్థానం చేరతాయి. కాక్పిట్లో ఉండే పైలెట్లు ఎప్పటికపుడు విమాన ప్రయాణ మార్గాన్ని సరిచేయడమే ఇందుకు కారణం. మన పెట్టుబడుల పోర్టుపోలియోను సైతం ఎప్పటికపుడు చెక్ చేసుకుంటూ అవసరమైన మార్పులు చేసుకుంటుండాలి. మార్కెట్ మార్పులను బట్టి ఎప్పటికపుడు ఈ మార్పులు చేయాలి. అలా చేస్తేనే మన ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకుంటాం. లేకపోతే లక్ష్యాలు కాదు గదా అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంటుంది.