Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సావిత్రి హృదయ స్పందన తెలిసినవాళ్ళకే ఇది సాధ్యమేమో. కడవల కొద్దీ సానుభూతిని ఒలకబోయటం చాలా సులువు. కానీ మనసెరిగి మలచటం అంత సులువు కాదు. దానికి స్పందన కావాలి. ఆ స్పందన మనసుకే ఉంటుంది. దర్శకులు నాగ్ అశ్విన్ ఆ మనసునే పెట్టుబడి పెట్టి సినిమా తీశారా అనిపిస్తుంది.
''సావిత్రి ఒక నటి. మహానటి. 'ఎన్ని కన్నీటి చుక్కలు కావాలి? రెండా? మూడా? ఏ కంటి నుంచి? కుడికంటి నుండి కావాలా? ఎడమ కంటి నుండి కావాలా?' అని కెవిరెడ్డి లాంటి దర్శక దిగ్గజానికి సవాలు విసిరి, దర్శకుడు కోరిన కుడికంటి నుండి రెండే రెండు కన్నీటి చుక్కలు రాల్చగలిగిన మహానటి, తెలుగులోనే కాదు ప్రపంచంలో మరే భాషలోనైనా ఉన్నదా? నాకైతే తెలియదు.
సావిత్రి.. ఉరకలు వేసే జలపాతం, గల గల పారే సెలయేరు. నిండు గోదావరి. అంతేనా, ఎగిసిపడే కెరటం. అగ్ని పర్వతాల్ని, నిధి నిక్షేపాల్ని తనలో దాచుకున్న అగాధం.. మహార్నవం.
ఏం కోరింది సావిత్రి? ప్రేమను కోరింది. ప్రేమ దొరికనన్నాళ్ళూ ఆమెకు అన్నీ ఉన్నాయి. నటన, కీర్తి, అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నీ. ప్రేమ కనుమరుగయ్యాక, ఎడారిలో నీటి చుక్కలా ఇంకి పోయాక, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ పోయాయి. కానీ జీవితంలో అంతర్భాగమైన నటనా శక్తి, తల్లి బాధ్యతలు మాత్రం మిగిలాయి.
మహానటి సినిమా తీయడం సాహసమే. ఎన్నో ప్రశంసలు, మరెన్నో విమర్శలు మామూలే. అయితే సినిమా లక్ష్యం ఏమిటి. ఆమె జీవితాన్ని ఆవిష్కరించడమే. మంచయినా, చెడైనా, మిర్చి మసాలాలు చేర్చకుండా అసలు వాస్తవాలను లక్షలాది అభిమానులకు, భావి తరాలకు తెలియచెప్పడమే. తెలుగు ప్రజల సాంస్కృతిక చరిత్రలో ఆమెను చిరస్థాయిగా నిలపడమే.
అదే చేశారు ఈ సినిమా దర్శక నిర్మాతలూ, నటీనటులూ, టెక్నీషియన్లూను. ఓ మహానటికి నివాళి అర్పించారనిపించింది. మూడు గంటల సినిమా అప్పుడే అయిపోయిందా, సావిత్రి జీవితం ఇంతేనా అనిపిస్తుంది. కానీ జీవితం మొత్తం సినిమా తీయాలంటే మూడు గంటలు కాదు, ముప్పై గంటలు కావాలేమో.
దర్శక నిర్మాతల, వారి తల్లిదండ్రుల సంస్కారం, సినిమాను నడిపిన తీరులో, కథనంలో పూసల్లో దారంలా కనిపిస్తుంది. సావిత్రి జీవితంలోని ఎత్తుపల్లాలను అర్ధం చేసుకోవడానికి అభిమానం మాత్రమే చాలదు, ఆర్ధ్రత కావాలి. ఇప్పటికీ సినిమాల్లో నటించే స్త్రీల పట్ల రంధ్రాన్వేషణలు చేసి కాకుల్లా పొడుచుకు తినే ఈ కాలంలో ఒక మహానటి జీవితంలోని ఆరోహణావరోహణల్ని, నటనలోని ఉచ్ఛ స్థితిని, వాటితో పాటు వ్యక్తిగత వైవాహిక జీవితాన్ని, అందరూ దుయ్యబట్టే వ్యసనాన్ని, వాటి వెనకాల ఉన్న 'రీజన్'-కార్యకారణ సంబంధాన్ని అర్ధం చేసుకోవటానికి ఎంతో ఆర్ధ్రత కావాలి.
'స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం', అంటే గుళ్ళో అమ్మవారిని పూజించినట్లా? స్త్రీలో ఒక వ్యక్తిని, ఒక పరిపూర్ణ మానవిని చూడగల ధైర్యం ఈ నవనాగరిక సమాజానికి ఇంకా రాలేదు. చలం చెప్పినట్లు, పురుషాధిక్యత, స్త్రీల అణచివేత ఫలితంగా ఎందరో స్త్రీ మూర్తులు కళాకారులుగా, చిత్రలేఖకులుగా, రాజనీతిజ్ఞలుగా, వ్యవహారదక్షులుగా ఎదగలేక వదిగిపోతున్నారు. వారి ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించలేకపోతున్నారు. కన్నతండ్రి, కట్టుకున్న భర్త, తోడబుట్టినవాళ్ళు అందరూ ఈ సమాజంలో భాగస్తులే. సావిత్రి జీవితాన్నే చూద్దాం.
తోడుగా ఉంటానని ప్రమాణం చేసినవాడే సహచరి ఎదుగదలను జీర్ణించుకోలేక, అసూయతో పట్టిన చేతిని వదిలేస్తే, నరకం అనుభవించి ఉంటుంది. అందుకే వ్యసనానికి బానిసయింది. అయినా ఆమెలో సామర్ధ్యం ఎగదన్నుకొస్తూనే ఉంది. దర్శకురాలిగా, నిర్మాతగా, చిత్రకారిణిగా బహుముఖ ప్రజ్ఞలు ప్రదర్శిస్తూనే ఉంది. కాసులు గలగలలాడే సినీ మాయా జగత్తులో పరిపూర్ణ మానవిగా బతికింది సావిత్రి.
సావిత్రి ప్రతి పాత్రలో నటించలేదు, జీవించింది. ఇది అందరూ అనే మాటే. తన జీవితానుభవాల్నే పాత్రల్లో కూడా వెతుక్కుందేమో. సావిత్రి నటనను చూసి అందరం 'ఆహా, ఓహౌ' అని పొగిడేవాళ్ళమే. సినిమాలు చూసి ఆనందపడే వాళ్ళమే. కానీ ఇందరిని ఆనందపరిచే ఆ సావిత్రికి ఏం కావాలి? ఆమె హృదయానికి ఏం కావాలి? ప్రేమించానన్న జెమినీగణేషన్కే అర్ధం కాలేదు. థియేటర్లలో ఈలలు వేసి, చప్పట్లు కొట్టే జనానికెన్నడు అర్ధం కావాలి.
సావిత్రి ఎందుకు ఇలా అయింది? పదేపదే తలెత్తే ప్రశ్న. కన్నతండ్రి, ప్రేమించానన్న భర్త... ఆ ఇద్దరూ ఆమె ఉన్నతికి పాదు చేసి నీళ్ళు పోసినవారే. అయితే ఏం? ఆ ఇద్దరూ ఆమె మనసు తెలుసుకో నిరాకరించారు.
తండ్రి ప్రేమ ఏమిటో ఎరగని చిన్నారి. కాసులు మాత్రమే దర్శించే పెదనాన్న. లోకమంటే ప్రకృతి అనుకునే మాయలు తెలియని యవ్వనవతి. ప్రేమలో పడింది. తప్పా? ప్రేమను కోరడం తప్పా? ఇది ప్రకృతి విరుద్ధం కాదే? సరే, పెళ్ళైన వాడ్ని కాకుండా మొదటి పెళ్ళి వాడ్నే చేసుకుందని అనుకుందాం. అయినా, ప్రేమించానన్న వాడు పెళ్ళి తర్వాత ప్రేమను వదిలేస్తే? స్త్రీకేం కావాలి? పిల్లలు, సంసారం, డబ్బు, అవి తెచ్చే సాంఘిక హౌదా - ఇంతేనా. మరి హృదయం? చలం చెప్పినట్లు, హృదయానికి స్పందన కావాలి. ఆర్తిగా అక్కున చేర్చుకునే హృదయం కావాలి. ఏ వృత్తిలో ఉన్నా వ్యక్తిగత, లైంగిక జీవితం పురుషునికి ప్రశ్న కానప్పుడు, స్త్రీకే ఎందుకు శాపం కావాలి.
ప్రేమరహిత నిస్సార వైవాహిక జీవితానికి విసిగి వేసారి వివాహ జీవితానికి వెలుపలున్న వ్యక్తితో ప్రేమలో పడి దానికి ఎదురైన సవాళ్ళు తట్టుకోలేక జీవితాన్ని అంతం చేసుకున్న కథే అన్నా కరెనినా. టాల్స్టాయి కలం నుండి వెలువడ్డ వెయ్యి పుటల నవలా సాహిత్యం. అన్నా కరెనినా వంటి పాత్రలు మన కళ్ళెదుటే ఉన్నాయి, ఒక సావిత్రి రూపంలో, ఒక శ్రీదేవి, ఒక సునందా పుష్కర్ వంటి వ్యక్తుల రూపంలో. వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ శూన్యతను తట్టుకోలేక ఎంతోమంది ప్రజ్ఞావంతులైన స్త్రీలు కనుమరుగవుతున్నారు. ప్రజా జీవితం నుండి వైదొలుగుతున్నారు.
ప్రేమ పాజిటివ్ దృక్పథాన్ని-ఈ ప్రపంచం పట్ల, ప్రకృతి పట్ల, తన చుట్టూ జరుగుతున్న ఘటనల పట్ల సానుకూల దృక్పధాన్ని పెంచుతుంది అంటుంది కొల్లంతాయి. ప్రేమరాహిత్యమే మనుషుల్లో నేర ప్రవృత్తిని పెంచుతుంది. అయితే ఇతరులను హింసించటం, కాకుంటే తనను తాను హింసించుకోవటం. సావిత్రి ఆ రెండోదే చేసింది. భగ ప్రేమిక తననుతాను హింసించుకుంది. ప్రేమతో పనేముంది, లైంగిక అవసరాలు తీరితే చాలదా? అనుకునే తుచ్ఛ మనస్థత్వమే స్త్రీల మీద, చిన్నారుల మీద లైంగిక దాడులకు దారితీస్తుంది. మానవత్వాన్నే మంటకలుపుతుంది.
ఈ సినిమా కోసం, ఓ మహానటి జీవితాన్ని తెరకెక్కించటం కోసం దర్శక, నిర్మాతలు ఎంత ఆరాటపడ్డారో అనిపిస్తుంది. దత్తు గారికి సన్స్ట్రోక్ తగల్లేదు కానీ డాటర్స్ స్ట్రోక్ తగులుతోంది అన్న విమర్శలను బేఖాతరు చేసి కూతుళ్ళను స్వేచ్ఛగా, చిత్రనిర్మాతలుగా ఎదగనిచ్చిన వినయ, అశ్వనీదత్లు అభినందనీయులు. అటువంటి తండ్రి సావిత్రికి ఉండిఉంటే ఆ గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి పరిపూర్ణ జీవితాన్ని మనం దర్శించగలిగి ఉండేవాళ్ళమేమో.
ఈ మాయా ప్రపంచంలో స్త్రీ తననుతాను నిలబెట్టుకోవాలంటే మరింత రాటుదేలాలేమో-మనసు చంపుకొని. అదే జరిగితే ఇది నేరాల ఘోరాల ప్రపంచంగా మిగిలిపోదా? మానవత్వమనే పరిమళాలు వెదజల్లగలదా?
మహాకవి గురజాడ తన అసంపూర్తి నవల సౌదామినిలో స్త్రీ దాంపత్య జీవితం గురించి చెపుతూ ''స్త్రీ తన జీవితంలో ఏం కావాలని కోరుకుంటుందో నాకేం తెలుసు'' అని అంటూనే, ''దురదృష్టవశాత్తూ నా దేశంలో స్త్రీలు, తమకు ఏం కావాలో కోరుకోకుండా ఉండటమే తమకు కావలసింది అని అనుకుంటున్నారు'' అంటారు. ఈనాటి ఆధునిక మహిళలు ఆయన ఆశించినట్లు తమకేం కావాలో కోరుకుంటున్నారు, ప్రకటిస్తున్నారు. ఆలోచించటం, అర్ధం చేసుకోవటం ఈ ప్రపంచం వంతు. హింస చెలరేగిపోతున్న ఈ కాలంలో ఈ సినిమాకు వచ్చిన స్పందన భవిష్యత్తు తరం మానవీయ కోణంలో నడుస్తుందన్న ఆశను కల్పిస్తోంది.
మహానటి జీవితం ఇప్పుడు తెరిచిన పుస్తకం. ప్రతి స్త్రీ తనకు కావాల్సిన పేజి వెతుక్కోవచ్చు, చదువుకోవచ్చు.
- ఎస్.పుణ్యవతి
ఐద్వా అఖిలభారత ఉపాధ్యక్షులు