Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గిరిరాజు విజయలక్ష్మి... గుండెల నిండా బాధ... కండ్ల నిండా కన్నీరు... తండ్రి మరణంతో మొదలైన కష్టాలు అలా ఆమెతో ప్రయాణిస్తూనే ఉన్నాయి. నేటికీ ఒంటరిగానే పోరాడుతున్నారు. సమస్యల సుడిగుండంలో చిక్కి.. తాను కార్చిన ప్రతి కన్నీటి చుక్కను ఒడిసి పట్టి.. అక్షరమాలగా పేర్చి అద్భుతమైన సాహిత్యాన్ని ఈ సమాజానికి అందిస్తున్నారు. సంగీతం, సాహిత్యం, కళలు ఇలా అన్ని రంగాగాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. పురుషాధిక్య సమాజంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కళల సహచర్యంతో ధైర్యంగా ఎదుర్కొంటున్న ఆమె గురించి మరికొన్ని విశేషాలు...
ఈమె సొంతూరు ప్రకాశం జిల్లా పోలవరం. పుట్టింది మాత్రం గుంటూరు. తల్లి పోలవరం వెంకటసుబ్బమ్మ. తండ్రి వేంకట శేషా చలపతి. ఈయన టీచర్గా చేసేవారు. ఈయన గొప్ప కళా పోషకులు. బొమ్మలు వేసేవారు. భక్తి పాటలు పాడేవారు. ఆయన నుండే విజయలక్ష్మికి చిన్నతనం నుండే లలిత కళల పట్ల ఆసక్తి పెరిగింది. ఈమెకు ఓ తమ్ముడు. వీరిద్దరూ తండ్రి వద్దనే భక్తి సంగీతాన్ని నేర్చుకున్నారు. పాటలు, పద్యాలు పాడటం, కళలు విజయలక్ష్మి జీవితంలో ఇలా ఎన్నో. హైస్కూలులో చేరిన తర్వాత క్రీడలు, ఉపన్యాసం, చిత్రలేఖనం, వ్యాసరచన, సంగీతం పోటీల్లో ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. ఇలా హాయిగా సాగిపోతున్న ఆమెను తండ్రి మరణం కుంగదీసింది.
మన్ననలు పొందారు
తల్లీ తండ్రీ తానై తమ్ముడి సాయంతో వెంకట సుబ్బమ్మ పిల్లలిద్దరిని పెంచారు. ఒంటరి మహిళగా ఎన్నో కష్టాలు పడ్డారు. తండ్రి దగ్గర భక్తి సంగీతం నేర్చుకున్న విజయలక్ష్మి తర్వాత ఓకల్, వీణ నేర్చుకున్నారు. వైజాగ్లో ఎస్.ఎస్.ఎల్.సి చేసే రోజుల్లో కుట్లు, అల్లికలు ఇలా చాలానే నేర్చుకున్నారు. ఆమె రాసిన 'సంగీత జ్ఞానము' అనే కథకు ప్రథమ బహుమతి కూడా పొందారు. ఎన్నో పత్రికల్లో ఈమె కథలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. చదువు పూర్తి చేసిన వెంటనే నాగార్జున సాగర్ రైట్ కెనాల్స్ ఆఫీస్లో ఎల్డిసిలో ఉద్యోగం సంపాదించారు. మగవారితో సమానంగా పని చేసి అందరి మన్ననలూ పొందారు. నిజాయితీ, క్రమశిక్షణ గల ఉద్యోగిగా గుర్తింపు పొందారు.
విషాదాన్ని మిగిల్చిన బంధం
పెండ్లి తర్వాత విజయలక్ష్మి హైదరాబాద్ వచ్చేశారు. తన మంచి తనంతో ఉద్యోగాన్ని కూడా ఇక్కడికే మార్చుకున్నారు. పెండ్లి ప్రతి ఆడపిల్ల జీవితంలో ఓ కొత్త మలుపు. ఇది కొందరికి ఆనందాన్ని ఇస్తే మరికొందరికి విషాదాన్ని మిగులుస్తుంది. ఈమె జీవితాన్ని వివాహ బంధం ఓ కుదుపు కుదిపేసింది. తల్లి, తమ్ముడు, ఉద్యోగం, కళలు ఇదే ప్రపంచంగా బతుకుతున్న ఆమె జీవితాన్ని వివాహం సమస్యల సుడిగుండంలోకి నెట్టేసింది. భర్త ఉద్యోగానికి వెళ్ళడు. ఈమె సంపాదించిన దాంతో జల్సాలు చేస్తాడు. కుటుంబం భారమైపోయింది. దానికి తోడు భర్త పెట్టే హింస. ఈ ప్రభావాలన్నీ విజయలక్ష్మి ఆరోగ్యంపై చూపాయి. ఎన్ని సమస్యలు ఎదురైన వృత్తి బాధ్యతల్లో మాత్రం వెనకడుగు వేయలేదు.
మళ్ళీ ఒంటరి పోరాటం
నిత్యం హింసించే భర్త నుండి స్నేహితుల సలహా మేరకు విడాకులు తీసుకున్నారు. తర్వాత తల్లి ఒడిలో ప్రశాంతంగా సేదతీరుదామనుకున్నారు. అయితే విజయలక్ష్మి ప్రశాంతంగా ఉండడం కాలానికి కూడా నచ్చలేదేమో. కొంత కాలానికే తల్లికి క్యాన్సర్ అని తెలిసింది. తన శక్తి యుక్తులను కూడగట్టి తల్లికి వైద్యం చేయించారు. కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో కొనుక్కున్న ఒక్కగానొక్క ఇంటిని తల్లి వైద్యం కోసం అమ్మేశారు. కానీ ఎక్కువ కాలం తల్లిని బతికించుకోలేక పోయారు. క్యాన్సర్ మహమ్మారి ఆమెను మింగేసింది. అప్పటి నుండి మళ్లీ ఒంటరి పోరాటమే. దాంతో ఉద్యోగంతో పాటు తనకు నచ్చిన కళలతో సహచర్యం మొదలుపెట్టారు. గుండెల నుంచి ఉబికి వచ్చే కన్నీటికి అక్షర రూపం ఇచ్చారు. ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. హైదరాబాద్లో విజయలక్ష్మి ఉద్యోగం చీఫ్ ఇంజనీరింగ్ ఆఫీస్లో.
ఉద్యోగ విజయాలు
ఇంజనీరింగ్ ఆఫీస్లో సాధారణ ఉద్యోగిగా చేరిన ఆమె రిటైర్ అయ్యే సమయానికి సెక్షన్ సూపరింటిండెంట్గా ఉన్నారు. ఉద్యోగం చేసేటప్పుడు తన అనుభవాలను 'నా ఉద్యోగ విజయములు' పేరుతో పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఈర్ష్యా ద్వేషాలను విడనాడి మంచి, మర్యాదలతో ఈ పురుషాధిక్య సమాజంలో ఓర్పు, సహనంతో ఓ మహిళా ఉద్యోగంలో ముందడుగు ఎలా వేయవచ్చో అనే విషయాన్ని ఈ పుస్తకంలో చక్కగా వివరించారు. అలాగే విజయలక్ష్మికి ఫొటోగ్రఫీ అన్నా అమితమైన ఆసక్తి. తన కెమెరాలో భద్రపరుచున్న ఎన్నో మధుర జ్ఞాపకాలను 'నేనూ - నా ఛాయాచిత్రాలు' అనే ఛాయచిత్ర పుస్తకాన్ని విడుదల చేశారు. ఇందులో ఆమె తీసిన ఫొటోలతో పాటు వాటికి సంబంధించిన కేప్షన్స్ను చక్కగా రాశారామె.
ఆర్థిక ఇబ్బందుల్లోనే...
1998లో తల్లి చనిపోయిన తర్వాత ఆమె పేరుతో సాహిత్య కారులకు ఓ అవార్డు ఇవ్వాలనుకున్నారు ఆమె. అయితే ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆ కార్యక్రమాన్ని ఘనంగా జరపలేకపోయారు. అయినప్పటికి తల్లికి గుర్తుగా ఆమె వర్ధంతి రోజు సాహిత్య కారులను గుర్తించి వారింటికే వెళ్ళి ఉన్నంతలో సత్కరించి వచ్చేవారు. అయితే కొన్నేండ్లుగా ఈ బాధ్యతను యువకళావాహినికి అప్పగించారు. దాంతో హాలు అద్దె, మిగిలిన ఏర్పాట్ల కోసం కాస్త ఖర్చు పెరిగింది. ఆ ఖర్చును సైతం భరించలేక ఆమె ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాను. ఎన్ని సమస్యలు ఎదురైనా తల్లి పేరుతో ప్రారంభించిన ఈ అవార్డును మాత్రం ఆపకుండా ఎందరో రచయితలను ప్రోత్సహిస్తున్నారు.
ఎన్నో ప్రచురణలు
1995 నుండి ఇప్పటి వరకు విజయలక్ష్మి 24 పుస్తకాలు రచించారు. ప్రస్తుతం 'సంపెంగ సౌరభం' అనే మరో పుస్తకం ప్రింటింగ్లో ఉంది. సంగీత జ్ఞానం, వ్యాస సుమమాల, కదంబమాల, వైద్యోనారాయణో హరి, ఆగ్ని సాక్షిగా, అన్వేషణ, అక్షరజ్ఞానం, శ్రీ గిరిరాజు కథలు, నీలవేణి, కొవ్వొత్తి, కవితల సుమమాలలు, శ్రీగిరిరాజు కథలు-2, లెటర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇంగ్లీష్ పోయెట్రీ, అంతర్వాణి, నా ఉద్యోగ విజయములు, చిత్ర హాస్యనందం, ఆకాషిక్, స్నేహం, విజ్ఞానసుధ, భావతరంగిణితో పాటు ఆమె అనే నవలని రచించారు. అలాగే ఈమె వేసిన కార్టూన్లు, పెయింటింగ్స్, తీసిన ఫొటోలులతో సిటీ సెంట్రల లైబ్రరీలో 3 సార్లు ప్రదర్శన కూడా పెట్టారు. సాహిత్యం, కళలకు ఆమె చేసిన సేవలకు గాను ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.
ఇల్లే ఓ మాయాబజార్
ప్రస్తుతం ఆమె నివసిస్తున్న ఓల్డ్ బోయిన్పల్లిలోని ఇంటి నిండా స్వయంగా తాను వేసిన బొమ్మలు మనకు దర్శÛనమిస్తాయి. అందులోకి అడుగుపెట్టగానే అది ఇల్లా లేక ఆర్ట్ గ్యాలరీనా? అనే అనుమానం వచ్చేస్తుంది. ప్రత్యేకంగా ఓ ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్థోమత లేక ఇంటినో ఓ అందమైన బృందావనంగా మార్చివేశారు. ఇంటికి వచ్చిన వారు 'మీ ఇల్లు మాయాబజార్లా ఉందే' అంటుంటారని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈమె గతంలో ఆలిండియా రేడియో కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఈమె చేసిన సేవలకుగాను ఢిల్లీ వండర్ వరల్డ్ వారి నుండి ఆంధ్ర ప్రదేశ్లో ప్రధమ మహిళగా సాహిత్యం, ఇతర ప్రక్రియలలో' వండర్ అచీవ్మెంట్స్' సాధించిన మహిళగా రికార్డ్ సాధించారు. తన ఊపిరి ఉన్నన్ని రోజులు సాహిత్యానికీ, కళలకూ సేవ చేస్తూ గడపాలనేది ఆమె కోరిక.
బాధలను పంచుకోవాలి
నేటి అమ్మాయిలు చాలా మంది కష్టాలు వస్తే భరించలేకపోతున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా కాకుండా కష్టం వస్తే తల్లికో, తండ్రికో, స్నేహితులకో చెప్పుకోవాలి. బాధలు పంచుకుంటే తగ్గుతాయి. ఏదైనా బతికి సాధించాలి. నలుగురి సాయం తీసుకొని దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సాహిత్యం, కళలతో కలిసి ప్రయాణం చేశాను. వీటి సహచర్యంలో నా ఒంటరి తనాన్ని మర్చిపోతున్నాను. అలాగే అందరూ ఏదో ఒకటి సాధించగలం అనే నమ్మకాన్ని పెట్టుకుంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు.
- సలీమ
పిప్పల్ల వెంకటేశ్