Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చుట్టుపక్కల వాళ్ళందరూ జ్యోతిని గౌరవంగా పలకరించేవారు. ఆమె కూడా అందరితో ఎంతో కలివిడిగా ఉండేది. ఎవరికి ఏ సమస్య వచ్చినా సలహా ఇచ్చేది. వాళ్ళ సమస్య పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్ళేది. జ్యోతికి సుధ ఒక్కతే కూతురు. కూతురిని కూడా తనలాగే ధైర్యంగా పెంచింది. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పేది. ఈ మధ్య ఆడపిల్లలపై రోజు రోజుకు పెరుగుతున్న దాడులను చూసి తన కూతురు అలాంటి చిక్కుల్లో పడకూడదని చిన్నప్పటి నుండే కరాటే కూడా నేర్పించేది. సుధ కూడా తల్లి చెప్పినట్లే అన్నీ శ్రద్ధగా నేర్చుకునేది. జ్యోతి భర్త మాత్రం ఇంటి గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అన్ని వ్యవహారాలు జ్యోతే చూసుకునేది.
సుధ స్కూల్ చదువు పూర్తి చేసుకొని ఇంటర్కు వచ్చింది. ఇలా ఆడుతూ పాడుతూ ఆమె జీవితం హాయిగా సాగిపోతుంది. ఆమె కరాటే క్లాసులకు వెళ్ళే దారిలోనే పరుశురామ్కు టైలరింగ్ షాప్ ఉంది. అతనికి యాభై ఏండ్లుంటాయి. వేరే స్త్రీలతో సంబంధాలు ఉన్నాయి. అందుకే భార్య, కొడుకు అతన్ని దూరం పెట్టారు. దాంతో మరో స్త్రీతో పరిచయం పెట్టుకొని ఆమెతోనే ఉంటున్నాడు. చిన్నప్పటి నుండి కరాటే నేర్చుకుంటూ ఎంతో చురుగ్గా ఉండే సుధ చూసేవారిని ఇట్టే ఆకర్షించేది. అలాంటి సుధపై పరుశురామ్ కన్నుపడింది.
పరిచయం పెంచుకోవాలని..
సుధ గురించి అన్ని వివరాలు సేకరించాడు. ఆమె తల్లి జ్యోతికి ఆ ఏరియాలో ఉన్న పలుకుబడి, తెలుసుకున్న పరుశురామ్ ఆమె జోలికి వెళ్ళే ధైర్యం చేయలేదు. ఒకపక్క సుధ కరాటే పోటీలకు వెళ్ళిన దగ్గర కిషోర్తో పరిచయమయింది. ఇద్దరూ పెద్దగా మాట్లాడుకున్నదేమీ లేదు. అయితే సుధకు కిషోర్ చూడగానే నచ్చేశాడు. తెలిసిన వారి ద్వారా అతని ఫోన్ నెంబర్ కూడా తీసుకుంది. కాని మాట్లాడటానికి ధైర్యం చాలక ఫోన్ చేయలేదు.
తల్లి మరణంతో...
కొన్ని రోజులకు జ్యోతి అనారోగ్యంతో మరణించింది. అప్పటికి సుధ ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరింది. జ్యోతి చనిపోయిన రోజే పరుశురామ్, సుధ ఇంటికి వచ్చి 'అమ్మా నేను నీకు తండ్రి లాంటి వాడిని, నీకు ఎలాంటి సాయం కావాలన్నీ నా దగ్గరకు రా, మా టైలరింగ్ షాపు ఈ దగ్గరలోనే ఉంటుంది' అని అడ్రస్ చెప్పి సుధను ఓదార్చి వెళ్ళిపోయాడు. తల్లి లేకపోవడంతో సుధకు చదువులో సహకరించే వారు లేకుండా పోయారు. తండ్రి అస్సలు పట్టించుకోడు. దాంతో తల్లి చనిపోయిన రోజు తనను ఓదార్చడానికి వచ్చిన పరుశురామ్ గుర్తుకొచ్చాడు. వెంటనే షాప్కు వెళ్ళి అతన్ని కలిసింది. పురుశురామ్ తనని ఎంతో అప్యాయంగా పలకరించడంతో అప్పుడప్పుడూ సుధ అతన్ని కలుస్తూ ఉండేది.
పెండ్లిపై అభిప్రాయం
పరుశురామ్ చాలా మంచివాడని నమ్మి తన వ్యక్తిగత విషయాలన్నీ అతనితో చెప్పుకునేది. అతను సుధకు చదువుకు కావల్సిన సాయం చేసేవాడు. అలా సుధ డిగ్రీ పూర్తి చేసి ఎల్.ఎల్.బిలో చేరింది. అప్పటివరకు అతను సుధతో అసభ్యంగా ప్రవర్తించలేదు. ఒక రోజు మాటల సందర్భంలో పెండ్లి గురించి ఆమె అభిప్రాయం అడిగాడు. ఇదే మంచి సమయం అనుకొని సుధ అతనితో కిషోర్ గురించి చెప్పేసింది.
ఇక్కడే అసలు ట్విస్ట్
అయితే కిషోర్ పరుశురామ్కు స్వయాన కొడుకే. కాని అతను ఆ విషయాన్ని దాచిపెట్టి వెంటనే కిషోర్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి సుధతో మాట్లాడించాడు. అలా కిషోర్, సుధల పరిచయం చిగురించింది. ఇక రోజూ ఇద్దరూ మాట్లాడుకునేవారు. అప్పుడప్పుడు కలుసుకునేవారు. ఒకరోజు మాటల్లో తన తండ్రి పేరు పరుశురామ్ అని కిషోర్ చెప్పాడు. కిషోర్ చెప్పిన వివరాల ప్రకారం తనకు సాయం చేసే వ్యక్తి, కిషోర్ తండ్రి ఒక్కడే అని సుధకు అర్థమయింది. వెంటనే పరుశురామ్ దగ్గరకు వెళ్ళి 'నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచావు' అని అడిగింది. దానికి పరుశురామ్ 'నా కొడుకు, భార్య నన్ను ఇంటికి రానీయరు. నేనంటే వాళ్ళకు ఇష్టం లేదు. నువ్వు నాకు తెలిసిన అమ్మాయివని తెలిస్తే నా కొడుకు నీతో కూడా మాట్లాడడు అందుకే తెలియనట్టు ఉన్నాను' అన్నాడు.
తండ్రితో పరిచయం నచ్చక
అతని మాటలు నమ్మిన సుధ ఎలాగైనా కొడుకుని, తండ్రిని కలపాలని ప్రయత్నించింది. ఒక రోజు సుధ కిషోర్తో 'మీ నాన్న నాకు నాలుగు సంవత్సరాల నుండి పరిచయం, ఆయనతో మాట్లాడి మనం పెండ్లి చేసుకుందాం' అంది. తన తండ్రితో సుధకు పరిచయం ఉందని తెలుసుకున్న కిషోర్ అప్పటి నుండి ఆమెతో మాట్లాడడం మానేశాడు. దాంతో ఒక రోజు సుధ, కిషోర్ ఆఫీస్కు వెళ్ళి నిలదీస్తే, 'నా తండ్రి మంచి వాడు కాదు, అందుకే మేం అతన్ని దూరంగా ఉంచాం. నీకు అతనితో పరిచయం ఉందంటే నీపై నాకు అనుమానంగా ఉంది. అందుకే ఇక నువ్వు నాతో మాట్లాడకు' అని చెప్పాడు.
బుద్ధి బయటపడింది
కిశోర్ మాటలకు ఏం చేయాలో సుధకు తెలియక పరుశురామ్ దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్పింది. 'నా కొడుకు కాదంటే ఏంటి, నీకు నేనున్నాను కదా, నన్ను పెండ్లి చేసుకో' అన్నాడు. ఆ మాటలకు కోపం వచ్చిన సుధ అతని చెంప పగలగొట్టి వెళ్ళిపోయింది. అక్కడ కిషోర్, సుధను పూర్తిగా దూరమైపోయాడు.
సమస్య ముదిరిపోయాక
ఇలాంటి పరిస్థితుల్లోనే సుధ ఐద్వా లీగల్సెల్కు వచ్చి సాయం కోరింది. ఆమె విషయాలన్నీ విన్న సభ్యులు పరుశురామ్ కావాలనే సుధను మోసం చేశాడని అర్ధం చేసుకున్నారు. 'తన తండ్రి మంచి వాడు కాదని కిషోర్కు తెలుసు. కానీ నువ్వే అతని గురించి ఏమీ తెలుసుకోలేకపోయావు. ముక్కూ మొహం తెలియని వాడిని కష్టంలో తోడుగా ఉన్నాడని గుడ్డిగా నమ్మావు. ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా మంది మగవారు ఇలాగే ఉన్నారు. ఇప్పుడు మీ ఇద్దరికీ పరిచయం ఉందని తెలిసే సరికి కిషోర్ నిన్ను కూడా అనుమానిస్తున్నాడు. సమస్య బాగా ముదిరిపోయిన తర్వాత నీకు అసలు నిజం తెలిసింది.
బలవంతంగా పెండ్లి చేసుకున్నా
ఇప్పుడు నువ్వు ఏం చేయాలన్నా ముందు నీ కాళ్ళపై నువ్వు నిలబడాలి. నువ్వు లా చేస్తున్నావు. ఈ సమాజంపై ఈపాటికే ఒక అవగాహన వచ్చి వుంటుంది. నీకు తోడు నిలవడానికి కూడా నీ వారు ఎవరూ లేరు. ఇకపై నువ్వు ఏం చేసినా బాగా ఆలోచించుకొని అడుగు ముందుకు వెయ్యి, నీకు ఎప్పుడూ మేము తోడుగా ఉంటాం. అయినా ఇప్పుడు కిషోర్ బాగా మారిపోయాడు. అతన్ని బలవంతంగా పెండ్లి చేసుకున్నా సుఖంగా బతకలేవు. అతని అనుమానం వల్ల నిన్ను ఇబ్బంది పెడతాడు. అతని తండ్రి ప్రవర్తన అస్సలు మంచిది కాదు. రేపు ఎప్పుడైనా అతను మీ ఇంటికి వస్తే మళ్ళీ సమస్య మొదలవుతుంది. ఈ విషయాల గురించి ఒక్క సారి బాగా ఆలోచించు. అతన్ని పెండ్లి చేసుకుంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో' అన్నారు.
నలుగురికీ సాయం చేసేలా
'మీరు చెప్పింది నిజమే. అలాంటి వాడిని పెండ్లి చేసుకోవాలని నాకూ లేదు. కాని నాలా మరో అమ్మాయి మోసపోకూడదు. ఇకపై వాడి గురించి ఆలోచించి నా సమయం పాడుచేసుకోను. లా పూర్తి చేసి నలుగురికీ సాయం చేసే స్థాయికి ఎదుగుతాను. నేను కూడా మా అమ్మలా మంచి పేరు తెచ్చుకుంటాను. మా చుట్టుపక్కల ఉండే అబ్బాయిలు నన్ను చూసి మాట్లాడటానికే భయపడేవారు. కాని నేను ఇలా మోసపోయాను. అందుకే మీ దగ్గరకు వచ్చే ప్రతి అమ్మాయికీ, మీకు తెలిసిన వారికి నా గురించి చెప్పి ఎవర్నీ గుడ్డిగా నమ్మొద్దని చెప్పండి. నా తల్లి బతికి ఉంటే నాకు ఇంత కష్టం వచ్చేది కాదు' అని చెప్పి కన్నీళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది.