Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్ష్మాన్ని నిర్దేశించుకుని దానిపైనే దృష్టి పెట్టి పట్టుదలతో కృషి చేస్తే కచ్చితంగా విజయం సాధించవచ్చు. ఆ లక్ష్య సాధనలో వచ్చే అడ్డంకులను సునాయాసంగా ఎదుర్కోవచ్చు. దీనికి ఉదాహరణే 24 ఏండ్ల ఆంచల్ గంగల్. కొన్నేండ్ల పాటు అవిశ్రాంతంగా శ్రమించి యుద్ధ విమాన పైలెట్ కావాలనే తన కలను నిజం చేసుకుంది. దేశం దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఎవరు ఈ ఆంచల్ గంగల్ ...చదవండి..!
మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో టీ కొట్టు పెట్టుకుని బతుకున్న ఓ సాధారణ కుటుంబంలో పుట్టింది. ఈమెకు ఓ తమ్ముడు, చెల్లి ఉన్నారు. చిన్నప్పటి నుండి యుద్ధ విమానానికి పైలెట్ కావాలని కలలు కన్నది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు.
సేవలు అందించాలని
''నేను 12 వ తరగతి చదువుతున్నప్పుడు ఉత్తరాఖండ్కు వరదలు వచ్చాయి. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ వారు చేసిన సేవలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. నేనూ ఎలాగైనా వాళ్ళతో పాటు సేవలు అందించాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ సమయంలో మా కుటుంబ పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల అనుకున్నది చేయలేకపోయాను'' అంటుంది ఆంచల్.
స్కాలర్షిప్ సాధించి
ఆంచల్ నీముచ్ లోని హెచ్.ఎస్ పాఠశాలలో చదువుకుంది. చిన్నప్పటి నుండి ఆమెకు చదువంటే ప్రాణం. కష్టపడి చదువుకుంటూ స్కూల్లో టాపర్గా నిలిచింది. తర్వాత స్కాలర్షిప్కు అర్హత సాధించి కుటుంబానికి భారం కాకుండా ఉజ్జయినిలోని విక్రమ్ యూనివర్సిటీలో సీటు సంపాదించింది. అక్కడ బాస్కెట్ బాల్ ప్లేయర్గా రాణించింది.
సంతృప్తి పడలేదు
''నేను ఏదైతే సాధించాలనుకున్నానో దాన్ని ఎప్పటికైనా సాధించగలను అనే నమ్మకంలో నాకు ఉంది'' అంటున్న ఆమె చదువు పూర్తి అయిన వెంటనే ఉద్యోగ వేట కొనసాగించింది. వివిధ పోటీ పరీక్షలకు హాజరయింది. మొదటిసారి పోలీస్ సబ్ ఇనిస్పెక్టర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అందులో ఎంపికయింది. ట్రైనింగ్కి వెళ్ళే సమయం కూడా వచ్చేసింది. అయితే ఇది ఆమె లక్ష్యం కాదు. ఆమె కల చాలా పెద్దది. అందుకే దొరికిన దానితో సంతృప్తి చెందలేదు. తన లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టాలేదు. అనుకున్నది సాధించే వరకు ఎదురు చూసింది. మరింత పట్టుదలతో ప్రయత్నించింది.
లక్ష్యం చేరడం సులవు కాదు
ఆ తర్వాత లేటర్ ఇనిస్పెక్టర్ పరీక్షా ఫలితాల్లో విజయం సాధించినప్పుడు కూడా దాన్ని పక్కకు పెట్టేసింది. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్పై తన దృష్టంతా పెట్టింది. అయితే తన టాస్క్ చాలా కష్టమైనది. అనుకున్న లక్ష్యం చేరడం అంత సులువు కాలేదు. అలాగే కొన్ని సంవత్సరాల పాటు పట్టుదలతో ప్రయత్నించింది. ఐదు సార్లు ఇంటర్వ్యూలకు వెళ్ళింది. ఇక ఆరో సారి కూడా ఇంటర్వ్యూకి వెళ్ళివచ్చింది. జూన్ 7న ఫలితాలు విడుదలయ్యాయి.
ఏకైక విద్యార్థిగా
ఆంచల్తో పాటు దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు ఆరు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 22 మంది విద్యార్థులు అర్హత సాధిస్తే మధ్యప్రదేశ్ నుండి కేవలం ఆంచల్ ఒక్కతే అర్హత సాధించింది. విజయం సాధించడానికి పేదరికం అడ్డుకాదని నిరూపించి తన కలను సాకారం చేసుకున్న ఆమె ఇప్పుడు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అంతేకాదు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ సైతం ట్విట్టర్ ద్వారా ఆమెను ప్రశంసించారు. అలాగే మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి స్వయంగా ఆమె ఇంటికి వెళ్ళి అభినందలు తెలిపి వచ్చారు.
గర్వంగా ఉంది...
నీముచ్ బాస్టాండ్ వద్ద టీ కొట్టు పెట్టుకొని బతుకుతున్న ఆంచల్ తండ్రి సురేష్ కూతురి విజయాన్ని చూసి గర్వపడుతూ ''ఇప్పుడు నేను నడుపుత్ను 'నామ్దేవ్ టీ స్టాల్' గురించి అందరికీ తెలిసిపోయింది. నాకు చాలా గర్వంగా ఉంది. అందరూ టీ కొట్టు దగ్గరకు వచ్చి అభినందలు చెప్పి వెళుతుంటే చాలా సంతోషంగా, ఎంతో గర్వంగా ఉంది. ఆంచల్ తన పరీక్షల కోసం ఇండోర్లో కోచింగ్ తీసుకోవడం కోసం లోన్ తీసుకున్నాను. అలాగే నా కొడుకు ఇంజనీరింగ్ చదివేందుకు కూడా డబ్బు సమకూర్చుకున్నాను. ప్రస్తుతం నా చిన్న కూతురు 12వ తరగతి చదువుతుంది'' అంటూ ఆనందంగా చెప్పాడు.
కోరిక బలంగా ఉంటే...
జూన్ 30 నుండి ఆంచల్ సంవత్సరం పాటు ట్రైనింగ్ కోసం హైదరాబాద్ రాబోతుంది. చాలా మంది విద్యార్థులు ఏదో సాధించాలని తపిస్తారు. కానీ ఏం చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతారు. అలాంటి వారు ఒక్కసారి దీర్ఘశ్వాస తీసుకోండి. ఆంచల్ను గుర్తు చేసుకోండి. అనుకున్న లక్ష్యం చేరుకోవాలనే కోరిక బలంగా ఉండాలే కాని ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చు అనడానికి ఈమె జీవితం ఓ చక్కని ఉదాహరణ.