Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో పెండ్లి ఓ పెద్ద పండుగ. ఇద్దరు మనుషుల కలయికగా కాక... రెండు కుటుంబాలు, రెండువైపుల చుట్టాల పరిచయ కార్యమవుతుంది. ఈ శుభకార్యంకోసం ఎంత ఖర్చు చేస్తారో... అంత వృథా చేస్తారు కూడా. వస్తువులు, డెకరేషన్, ఆహారం అన్నీ వృథా అయిపోవడమే కాకుండా... పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ను సైతం పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. మంచినీళ్లకోసం ఉపయోగించిన ఒక గ్లాస్ మట్టిలో కరుగుతుందా? అన్నం తినడానికి ఉపయోగించిన ప్లేట్స్ పరిస్థితి ఏమిటి? కానుకలు తెచ్చిన కవర్స్ మాటేమిటి? ఇలా ఎన్ని ఉన్నాయి పర్యావరణానికి హాని కలిగించేవి. లేనిపోని ఈ ఆడంబరాలు వద్దని చాలా కొత్త జంటలు కొందరు అనుకున్నా... సమ్మతి దొరికేది తక్కువ. దాంతో నలుగురితో నారాయణ అనేస్తున్నారు. ఫలితం తీరని నష్టం. అది ఈ ఇద్దరు స్నేహితులకు బాధ కలిగించింది. అందుకే జీవన శైలిని మార్చుకోవాలనుకున్నారు. దానికోసం చెన్నైకి చెందిన ఆ ఇద్దరు యువతులు ఏం చేశారు? తెలియాలంటే ఇది చదవాల్సిందే!
'సుదర్శన నేను (వీణ) నిఫ్ట్లో చదువుకున్నాం. ఇద్దరి భావాలు ఒకేలా ఉండటంతో మంచి స్నేహితులమయ్యాం. పర్యావరణ పరిరక్షణ పట్ల ఇష్టంవంటి విషయాలు మమ్మల్ని కలిసి పని చేసేలా చేశాయి. నేను పెండ్లి చేసుకోవాలనుకున్నప్పుడు... పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా చేసుకోవాలనుకున్నాను. నిజానికి మన దేశంలో పెండ్లంటే ఆడంబరం. డబ్బు, హౌదా ప్రదర్శన. కాని దీనివల్ల పర్యావరణానికి ఎంతో హాని. పర్యావరణానికి హాని కలగకుండా పెండ్లి చేసుకోవాలనుకున్నా. నా భర్త విఘ్నేష్ కూడా సరేనన్నాడు. మాకు సుదర్శన సహాయం తోడయ్యింది. అయితే పెండ్లంటే సెంటిమెంట్స్ ఉంటాయి. స్నేహితులు, చుట్టాలు అందరూ ఒక్కదగ్గరకి వస్తారు. అది ప్రేమను, సంతోషాన్నిచ్చే శుభకార్యం. కాబట్టి పద్ధతులు మారకూడదు. ఉపయోగించే వస్తువులు ప్రత్యామ్నాయంగా ఉండాలని భావించాం. వేదిక నుంచి చివరి దాకా జీరో వేస్టేజ్ పద్ధతిలో చేయాలనుకున్నాం.
ఆహ్వాన పత్రికను ఆన్లైన్లోనే పంచాం. వాట్సాప్, ఫేస్బుక్, మెసేజ్ల ద్వారా సమాచారాన్ని ఇచ్చాం. కార్డులు తప్పనిసరి అనుకున్నవాళ్లకు ఆహ్వాన పత్రికకు బదులుగా కొన్ని విత్తనాలు ప్యాక్ చేసి, మా పెండ్లికి గుర్తుగా వాటిని నాటాలని చిన్న మెసేజ్తో పంపాం. డెకరేషన్కోసం ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా చుట్టుపక్కల రైతులు పండించిన పూలనే కొన్నాం. పెండ్లిల్లో వేసుకుని జువెలరీ, బట్టలు నిజానికి తరువాత అస్సలు ధరించం. అయిన ఎక్కువ డబ్బులు పోసి కొంటాం. అలాంటి డబ్బు వృథా చేయొద్దనుకున్నా. అందుకే 50 ఏండ్ల కిందట మా బామ్మ పెండ్లిలో కట్టుకున్న చీరనే తిరిగి పెండ్లికి కట్టుకున్నాను. అలాగే పెండ్లికి వచ్చే పెద్దలు 'మాకు ఏమన్నా ఇవ్వాలనుకుంటే... ఆ డబ్బుతో ఏదైనా స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వండి. కానీ ప్లాస్టిక్ కవర్లు, డబ్బాలల్లో కానుకలేవీ తేవొద్దు' అని చెప్పాం. ఇక ఆహారం విషయంలో జరిగే వృథా అంతా ఇంతాకాదు. దానికోసం ఉపయోగించే ప్లేట్లు, గ్లాసులు అన్నీ ప్లాస్టిక్వే. దానివల్ల పర్యావరణానికి నష్టం. అందుకే స్టీల్ గ్లాసులు, జగ్గులనే ఉపయోగించాలనుకున్నాం. ఇక ప్లేట్లుగా అరటి ఆకులను తీసుకున్నాం. పెండ్లి అనగానే చాలా ఆహారం వృథా అవుతుంది. దాన్ని ఎవరికయినా ఇవ్వచ్చు. అయితే మిగిలిపోయిన ఫుడ్గా కాకుండా... ఇంకొంత వండించి... రాబిన్హుడ్ స్వచ్ఛంద సంస్థకు పంపిణీ బాధ్యతలు అప్పగించాం. మిగిలిపోయిన కూరగాయలు, పండ్ల తొక్కలు, అలంకరణకు ఉపయోగించిన పూలు అన్నీ కలిపి కంపోస్ట్ ఎరువుగా తయారు చేశాం. మా పెండ్లికి మరో స్వచ్ఛంద సంస్థ 'రెస్టోర్' సహకరించింది' అని చెబుతోంది వీణ.
ఈ పెండ్లి ద్వారా ఆ ఇద్దరు స్నేహితులు సమాజానికో సందేశాన్నిచ్చారు. వీణ పెండ్లి పర్యావరణ హితంగా చేయడమే కాదు... అలా చేసుకోవాలనుకునేవారికి సహకరించేందుకు, ఇతరుల్లో చైతన్యం తెచ్చేందుకు కన్సల్టెన్సీ ప్రారంభించారు. దాని పేరు 'టు'. ఇద్దరమ్మాయిలు మొదలుపెట్టిన చైతన్యం మరెందరికో స్ఫూర్తి కావాలని ఆశిద్దాం!