Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరోజకు ఓ కొడుకు, ఓ కూతురు. భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఇద్దరు పిల్లల్ని కష్టపడి పెంచింది. కూతురు కావ్యకు పద్దెనిమిదేండ్లు వచ్చాయి. ఎలాగైన కూతురి పెండ్లి చేసి ఓ దారి చూపిస్తే ప్రశాంతంగా ఉండొచ్చనుకుంది. బంధువుల ద్వారా ఓ సంబంధం వచ్చింది. అబ్బాయికి కిరాణ షాపు, సొంత ఇల్లు ఉన్నాయి. దాంతో పిల్ల హాయిగా బతుకుతుందని పెండ్లి చేసేసింది. కూతురి పెండ్లి జరిగిన రెండేండ్లకు కొడుకు పెండ్లి చేసింది.
కొడుకు గురించి ఆమెకు దిగులే లేదు. ఆలోచనంతా కావ్య గురించే. కూతురి భవిష్యత్ గురించి ఆలోచిస్తే నిద్రపట్టడం లేదు. అత్తగారింటికి వెళ్ళిన దగ్గర నుంచి అన్నీ కష్టాలే. కావ్యకు కొడుకు పుట్టాడు. భర్త నాలుగు రోజులు షాపు తెరిస్తే నాలుగు రోజులు ఎటో వెళ్ళిపోతాడు. ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడు. ఇల్లు గడవడమే కష్టమైపోయింది. ఇంటర్ మధ్యలోనే ఆపేసిన కావ్య ఓ ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తూ ఇల్లు గడిపేది. అత్తమామలను కూడా ఆమే చూసుకునేది. కావ్య ఎంత కష్టపడినా వాళ్ళు కూడా కొడుక్కే సపోర్ట్ చేస్తారు.
బాబును స్కూల్లో చేర్పించింది. ఖర్చులు పెరిగాయి. ఇన్ని కష్టాలు పడుతూ కూడా కావ్య పుట్టింట్లో ఒక్క మాట కూడా చెప్పేది కాదు. చివరకు బాధలు భరించలేక భర్తకు ఎదురుతిరిగేది. దాంతో అతను విపరీతంగా కొట్టేవాడు. భర్త కొట్టినప్పుడల్లా పుట్టింటికి వచ్చేసేది. భార్యాభర్తల మధ్య ఇలాంటి సమస్యలు సహజమే అని తల్లి సర్ది చెప్పేది. ఇల్లు పట్టించుకోని భర్త, సాధించే అత్తమామలు. కడుపునిండా తిండి లేదు. కావ్య చాలా బలహీనంగా, నీరసంగా తయారయింది.
కావ్య పుట్టింట్లో ఉంటే తన తల్లిదండ్రులను చూసే వాళ్ళు ఉండరు. అందుకే భర్త వడ్డీకి అప్పులు తెచ్చి ఇల్లు గడిపేవాడు. ఈ విషయాలేవీ కావ్యకు చెప్పడు. చివరకు కిరాణా షాపు అమ్మేశాడు. ఇల్లు కూడా తాకట్టుపెట్టాడు. ఎవరు చెప్పినా వినడు. మొండిగా వ్యవహరిస్తాడు. అందరూ తన మాటే వినాలంటూ గోల చేస్తాడు. తాగుడికి బానిసయ్యాడు. ఇలాంటి భర్తతో జీవితాంతం ఎలా గడపాలో తెలియక కావ్య గుండెలు పగిలేలా ఏడ్చేది. ఆ దిగులుతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేది. దాంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది.
షాపు, ఇల్లు పోగొట్టుకున్నా భర్త మాత్రం పనికి సరిగా వెళ్లేవాడు కాదు. కావ్య అడుగుతుందని చివరకు ఇంటికి రావడం తగ్గించాడు. ఎక్కడెక్కడో ఉండేవాడు. ఇంటికి వచ్చినా ఎవరితోనో గంటల కొద్ది ఫోన్లో మాట్లాడతాడు. భర్తకు వేరే ఆవిడతో సంబంధం ఉందేమో అని కావ్యకు అనుమానం. చివరకు ఆమె అనుమానమే నిజమయింది. అతను వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నా డు. ఆమే ఇతనికి డబ్బులు ఇస్తుంటుంది. ఆ డబ్బుతో తాగుతూ, సరదాగా ఎంజారు చేస్తున్నాడు. భార్యను, కొడుకును పూర్తిగా మర్చిపోయాడు. ఈ విషయం తెలిసిన కావ్య కుప్పకూలి పోయింది. అతను చేసిన మోసాన్ని భరించలేకపోయింది.
తల్లిని, అన్నను తీసుకుని న్యాయం కోసం ఐద్వా లీగల్సెల్కు వచ్చింది. కావ్య సమస్య మొత్తం విన్న లీగల్సెల్ సభ్యులు ఆమె భర్తకు లెటర్ పంపారు. తర్వాతి వారం అతను ఒక్కడే లీగల్సెల్కు వచ్చి 'మేడమ్ నా భార్య మంచిది కాదు. ఆమె పెండ్లికి ముందే ఎవరినో ప్రేమించింది. నేనంటే అస్సలు ఇష్టం లేదు. నన్ను దగ్గరకు కూడా రానిచ్చేది కాదు. ఎప్పుడూ పుట్టింటికెళ్ళి కూర్చుంటుంది. నన్ను అస్సలు పట్టించుకోదు. మా అమ్మా నాన్నలు బాగా పెద్ద వాళ్ళయిపోయారు. నడవలేదు. అందుకే ఈరోజు నాతో తీసుకు రాలేదు. వాళ్ళను కూడా చూసుకోదు. ఆమెకు వేరే ఎవరో ఉన్నారు. అందుకే నాతో ప్రేమగా ఉండదు. అందుకే నేను రెండో పెండ్లి చేసు కున్నాను. నేను చేసిందాంట్లో తప్పేంది? కట్టుకున్న భార్య పట్టించు కోకపోతే ఇంతకంటే మగాడు ఏం చేస్తాడు?'' అన్నాడు.
'ఆమెకు నువ్వుంటే ఇష్టం లేకపోతే ఇన్నేండ్లు నీతో ఎలా ఉంది? బాబుకు జన్మనెలా ఇచ్చింది. నువ్వు ఇల్లు వదిలి ఎటో తిరుగుతుంటే నీ కొడుకును, తల్లిదండ్రులను చూసుకుంది ఎవరు? నీ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసుకుంటూ పోయావు. అవి తీర్చలేక ఉన్న షాపు, ఇల్లు అమ్మేసుకున్నావు. కన్న తల్లిదండ్రులను, భార్యను, కొడుకును పట్టించుకోకుండా తిరిగావు. మరో స్త్రీతో సంబంధం పెట్టుకుని నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు. నీ లాంటి వాడిని ఇన్నాండ్లు కావ్య భరించింది. ఇప్పుడు నువ్వు ఆమె గురించి అబద్ధాలు చెబుతున్నావు' అన్నారు సభ్యులు.
లీగల్సెల్ సభ్యులు ఇంతగా చెప్పినా అతనిలో ఎలాంటి మార్పు లేదు. తప్పంతా కావ్యదే అంటూ గట్టిగా వాదించాడు. అప్పటి వరకు అన్నీ మౌనంగా వింటున్న కావ్య లీగల్సెల్ వారి సలహాతో భర్తపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని నిర్ణయించు కుంది. అక్కడి నుండి తిన్నగా వెళ్లి పోలీస్ స్టేషన్లో కేసుపెట్టింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెండ్లి చేసుకోవడం నేరమని పోలీసులు బెదిరించారు. దాంతో కావ్య దగ్గరకు వెళ్ళి 'మీ ఇద్దరినీ మంచిగా చూసుకుంటాను. నువ్వు లేకుండా నేను ఉండ లేను' అంటూ బతిమాలాడు. కానీ కావ్య దీనికి అంగీకరించలేదు. ఇక లాభం లేదని కావ్యతో రాజీ కుదుర్చుకుని ఎంతో కొంత డబ్బు ఇచ్చి వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
వెంటనే ఐద్వా లీగల్సెల్కు వచ్చి ''నేను ఇప్పటి వరకు చేసినవన్నీ తప్పులే. నా తప్పు నేను తెలుసుకున్నాను. కావ్యకు నాలుగు లక్షలు ఇస్తాను. కేసు వెనక్కు తీసుకోమని చెప్పండి. మీరు చెబితే ఆమె కచ్చితంగా వింటుంది'' అన్నాడు.
''నిర్ణయం తీసుకుంది కావ్య. ఆమె జీవితం ఆమె ఇష్టం. ఇప్పుడు కేసు వెనక్కు తీసుకోవాలో వద్దో నిర్ణయించుకోవల్సింది కూడా ఆమెనే. అయినా ఓసారి మాట్లాడి చూస్తాం. తుది నిర్ణయం మాత్రం ఆమెదే'' అని కావ్యను పిలిపించి మాట్లాడారు. ''ఇన్నేండ్లు అతన్ని, అతని తల్లిదండ్రులను భరించాను. నా భర్త ఎప్పటికైనా మారకపోతాడా అని చాలా కాలం ఎదురు చూశాను. కొడుకు కోసమైనా ఆలోచిస్తాడని ఆశపడ్డాను. కష్టపడి ఇల్లు నెట్టుకొచ్చాను. కుటుంబం కోసం నేను ఇంత కష్టపడితే అతనిలో మార్పు రాకపోగా నాపైనే నిందలు వేశాడు. నేనూ మనిషినే. నాకంటూ ఓ మనసు ఉంది. ఇక నా అత్మగౌరవాన్ని చంపుకుని అతనితో బతకాల్సిన అవసరం నాకు లేదు. ఇన్నేండ్లు నా కొడును ఎలాగైతే పెంచు కున్నానో, ఇప్పుడూ అలాగే పెంచుకుంటాను. నన్ను మోసం చేసిన అతనికి శిక్ష పడాల్సిందే. అతని నుంచి నాకు ఒక్కపైసా రాకపోయినా పర్లేదు'' అంది.
''నువ్వు తీసుకున్న నిర్ణయం మాకు బాగా నచ్చింది. నువ్వు చెప్పినట్టు అతనికి శిక్ష పడాల్సిందే. ఆ విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము కూడా నీకు మద్దతు ఇస్తాం. చాలా మంది ఆడపిల్లలు భర్త మోసం చేశాడని, వదిలేసి వెళ్ళిపోయాడని ప్రాణాలు తీసుకుంటున్నారు. పిల్లలను అనాథలు చేస్తున్నారు. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. నేటి ఆడపిల్లలకు నీ జీవితం ఓ స్ఫూర్తిదాయకం కావాలి. నీకు న్యాయం జరిగే వరకు తోడుగా ఉంటాం'' అన్నారు.
కావ్య అనుకున్న ప్రకారమే అతనికి శిక్ష పడింది. అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కావ్య ప్రైవేటు స్కూల్లో టీచర్గా పని చేస్తుంది. ఆమె సమస్యను అర్థం చేసుకున్న స్కూలు యాజమాన్యం పదో తరగతి పూర్తయ్యే వరకు బాబుకు ఉచిత విద్యను అందిస్తామన్నారు. వచ్చిన ఆదాయంతో కావ్య సంతోషంగా ఉంది. కొడుకుతో ధైర్యంగా బతుకున్న కూతుర్ని చూసుకుంటూ కాలం గడుపుతుంది సరోజ.
- సలీమ