Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రశ్న : మేడం నాకు ఎనిమిదేండ్ల్ల కిందట పెండ్లి అయ్యింది. అత్తవారింట్లో రెండేండ్ల కాపురంలో ఎన్నో బాధలు అనుభవించాను. మాకు పిల్లలు లేరు. పిల్లలకు పుట్టకపోవడానికి కూడా నేనే కారణం అంటూ సూటిపోటి మాటలతో హింసించారు. ఇక ఆయనతో కలిసి ఉండలేక పుట్టింటికి వచ్చాను. పెద్దమనుషుల తో పంచాయితీ తర్వాత కోర్టు ద్వారా మ్యూచువల్ డైవోర్స్ తీసుకున్నాం. ఆ తర్వాత ఉద్యోగంలో చేరాను. మా ఆఫీస్లో పనిచేసే ఒక వ్యక్తితో పరిచయం ప్రేమగా మారింది. నా గురించి అతని వద్ద ఏ విషయాలు దాచలేదు. నాకున్న ఆస్తులు, గతంలో తీసుకున్న విడాకులు అన్నీ చెప్పాను. ఏడాది కిందట పెండ్లి చేసుకున్నాం. మొదట్లో బాగానే ఉన్నా.. ఈ మధ్య మొదటి భర్త గురించి పదేపదే ప్రస్తావిస్తున్నాడు. మాటలతో, చేతలతో హింసిస్తున్నాడు. ఆఫీస్లోనూ ఇబ్బందిగా ఉంది. అమ్మా వాళ్లకు చెబితే 'ఇది నీకు రెండో పెళ్లి. ఎన్ని సార్లు విడాకులు తీసుకుంటావు.సర్దుకుపోవాలి' అంటూ నాకే చెప్తున్నారు. మేం ఇద్దరం ఉన్నప్పుడే కాకుండా వాళ్ల చుట్టాల ముందు రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. ఆయనతో కలిసి నలుగురిలోకి రావాలంటేనే భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరు నాకొక దారి చూపండి.
జవాబు : సర్దుకుపో అంటూ అందరూ ఆడవారికే చెప్తారు. ఈ సమాజమే పురుషాధిక్యసమాజం. ఇక మీ విషయానికి వస్తే.. మీ తప్పు లేకుండానే మొదటి భర్త విడాకులు ఇచ్చాడు. ప్రేమ పేరుతో వెంటపడి చేసుకున్న రెండో భర్త అనుమానంతో హింసిస్తున్నాడు. అమ్మనాన్నల సహకారం అంతంత మాత్రమే. అయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అతను మీ ఆస్తి కోసమే పెండ్లి చేసుకున్నాడని అర్థం అవుతుంది. అతనిని భరించడం కష్టంగా ఉంటే మీరు భయపడాల్సిన పనిలేదు. ముందుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇవ్వండి. అతను విడాకులు ఇవ్వను అన్నంత మాత్రాన కుదరదు. మీకు డైవోర్స్ కేసు వేసుకునే హక్కు ఉంది. సెక్షన్ 13 (ఐ, ఐక్యు) హిందూ వివాహ చట్టం ప్రకారం కేసు ఫైల్ చేయవచ్చు. కౌన్సెలింగ్ ఇస్తారు. అతనిలో మార్పు వస్తే మంచిదే.. లేకపోతే కేసు ప్రొసీడింగ్స్ నడుస్తాయి. మీరు నిశ్చితంగా ఉండవచ్చు. పెండ్లి మాత్రమే జీవితం కాదు. మీరు ఎంచుకున్న కెరీర్పై దృష్టి పెట్టండి..ఉద్యోగంలో ఉన్నతస్థాయికి ఎదగడానికి ప్రయత్నించండి.
మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించడం.. దాన్ని ఎలా ఎదుర్కొవాలో తెలుసుకోవడం.. చట్టంలో ఉన్న వెసులుబాటుల గురించిన అవగాహన.. ఇవ్వన్నీ తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న వారికి, సమస్యలను ఎదుర్కొంటూ.. పరిష్కారం కోసం వెతికే వారికి సమాధానం ఇస్తారు ప్రముఖ న్యాయవాది ఆకుల రమ్యకుమారి. హైకోర్టు న్యాయవాదిగా తనకున్న అనుభవంతో ఆమె చెప్పే సూచనలు, సలహాలు 'నవతెలంగాణ' పాఠకులకు ఉపయోగపడుతాయని భావిస్తాం. ఇకపై ప్రతివారం లీగల్ కాలమ్లో మీ సమస్యలకు ఆమె సమాధానాలు తెలుసుకోండి.
మీ సమస్యలు రాయల్సిన చిరునామా..
ఎడిటర్,
లీగల్ కాలమ్, మానవి,
నవతెలంగాణ తెలుగు దినపత్రిక,
ఎంహెచ్ భవన్, ప్లాట్ 21/1,
ఫస్ట్ఫ్లోర్ , అజామాబాద్ ఇండిస్టియల్ ఏరియా,
హైదరాబాద్ 500020.
manavi@navatelangana.com