Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచీకరణ, పారిశ్రామీకరణ, సరళీకృత ఆర్థికవిధానాలు కాలులో ముల్లులా కనిపించకుండా బాధిస్తున్నాయి. మానవ సంబంధాలను చిన్నాభిన్నం చేస్తున్న ఈ విధానాలనే ఇతివృత్తాలుగా తీసుకుంటూ ఆకట్టుకునే శైలితో, మనసుకు హత్తుకునే శిల్పంతో సాహిత్యరంగంలో రాణిస్తున్నారు ప్రముఖ రచయిత వారణాసి నాగలక్ష్మి. ఆమె కలం నుంచి వెలువడిన కథలను చదువుతుంటే మన జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు అనుభవమైన సంఘటనలుగా అనిపిస్తాయి. కథ, పాటలు, నాటికలు, కవితలు ఇలా సాహిత్యంలో పలు ప్రక్రియలతో పాఠకులకు సుపరిచితమైన ఆమె రచయితగానే కాదు చిత్రకారిణిగానూ అరుదైన చిత్రాలను వేస్తూ.. రాత, గీత తానై కథా సంకలనాలను వెలువరిస్తున్నారు. ఆమె రాసిన కొన్ని కథలు ఇటీవల హిందీలోకి 'బోల్తీ తస్వీర్'గా అనువదించారు. ఆమె కుంచె నుంచి జాలువారిన చిత్రం లండన్ లోని 'రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్'లో ప్రదర్శనకు ఎంపికైంది. ఆమె జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక బహుమతులు అందుకున్నారు. ఏ రంగంలో ఉన్నా.. ది బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాలన్నదే తన తపన అంటున్న ఆమెతో మానవి..
''దేశానికి స్వాతంత్య్రం రాకముందే తాతగారు మైనింగ్ ఇంజనీరుగా పనిచేసారు. స్వాతంత్య్రభారతంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం కావాలన్న ఆకాంక్ష ఆయనది. నాన్న రామకృష్ణశాస్త్రి అగ్రికల్చర్ బిఎస్సీ చదివి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసారు. నూజివీడు నుంచి ఆరుకిలోమీటర్ల దూరంలో వంద ఎకరాల మెట్టపొలం ఉమ్మడి ఆస్తిగా ఉండేది. వ్యవసాయభూమిలోనే మా ఇల్లు కూడా ఉండేది. మా నాన్న అవలంబించిన ఆధునిక పద్ధతులు మా వ్యవసాయ క్షేత్రంలో కొత్త ఆవిష్కరణలకు దోహదమయ్యాయి. ఇంటికి కావల్సిన ఆహారపదార్థాలన్నీ స్వయంగా పండించేవాళ్లం. స్వచ్ఛమైన వాతావరణంలో పెరగడం వల్ల కావచ్చు.. చిన్నతనం నుంచే ప్రకృతిపై ఆసక్తి పెరిగింది. 'మా తాతగారికి ఉంది ఓ తోట.. రాయలని ఉంది ఓ పాట' అంటూ చిన్నవయసులోనే ఒక పాట రాసాను. ఉమ్మడి కుటుంబంలోని మానవీయ సంబంధాలను బాగా గమనించేదాన్ని. ప్రకృతితో సహజీవనం, అనుబంధాల మధ్య పెరగడం నా రచనలకు బాగా ఊతమిచ్చాయి. ప్రతిరోజూ రాత్రి పిల్లలందరం నాన్న చుట్టూ చేరేవాళ్లం. ఆయన చెప్పే చిన్నచిన్న కథలు నైతిక విలువలను నేర్పించేవి. ఇంటికి ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వారపత్రికలు, చందమామ మాసపత్రిక వచ్చేవి. మా అమ్మ పార్వతి.. ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత కాస్త వీలు చూసుకుని.. పత్రికలు చదివేవారు. అలా ఆమెతో పాటు నేను అక్షరాలు గుర్తుపట్టడం వచ్చిన నాటి నుంచీ పత్రికలు చదివేదాన్ని. అయితే మాకు గ్రంథాలయం అందుబాటులో ఉండేది కాదు.. అందుకే ప్రముఖుల రచనలు చిన్నతనంలో చదవలేక పోయాను. ఆ తర్వాత వీలైనప్పుడల్లా మంచిమంచి పుస్తకాలు కొంటూ ఇంట్లోనే చిన్న గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నాను.
నూజివీడులోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో మూడో తరగతిలో చేర్పించారు. రోజూ ఆర్టీసి బస్సులో వెళ్ళేవాళ్లం. స్కూలు నుంచి ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్లితే దాన్ని నేను ట్రావెలోగ్ రాసేదాన్ని. ఒక ఏడాది మైసూరు, మరో ఏడాది ముంబయి వెళ్లాం. ఆ అనుభవాలతో రెండువందల పేజీల ట్రావెలోగ్ రాసాను. ఆ తర్వాత నూజివీడు ధర్మ అప్పారావు కళాశాలలో ఇంటర్, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బి.ఎస్సీ పూర్తి చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రిలో ఎం.ఎస్సీలో చేరాను. ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్లోనే ఇ.ఎన్.టి స్పెషలిస్ట్ డాక్టర్ వి.ఎస్.శర్మ తో పెండ్లి అయ్యింది. బాబు జయంత్ పుట్టిన తర్వాత, ఎం.ఫిల్. చేసాను. బి.ఎస్సీ, ఎం.ఎస్సీ, ఎం.ఫిల్లలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. పాప వర్షిత పుట్టిన తర్వాత కొద్దిరోజులు ఉద్యోగం చేసాను. మా ఆయన డాక్టర్గా బిజీ కావడంతో ఇంటి బాధ్యతలన్నీ చూసుకోవడానికి వీలుగా ఆ తర్వాత ఉద్యోగం మానేసాను.
మొదటికథ..
చిన్నతనం నుంచే పాటలు రాసేదాన్ని. ఇంటికి వచ్చే పత్రికలు, ఇంట్లో ఉండే కొన్ని పుస్తకాలు తప్ప పెద్దగా సాహిత్యంతో పరిచయం లేదు. మానవసంబంధాలను ఎన్నో కోణాల్లో గమనించేదాన్ని. ప్రకృతి చేత ప్రేరేపించబడి కలాన్ని కదిలించాను. మొదటి కథ 'పాప ఫలాంత వైభవం' ఆంధ్రప్రభలో ప్రచురించబడింది. చిన్నతనంలో నేను పెరిగిన వాతావరణం సున్నితత్వాన్ని నేర్పింది. అలా నా రచనల్లోనూ ప్రతిబింబిస్తుంది. ఇప్పటివరకు దాదాపు 200 పాటలు, 80కి పైగా కథలు , వ్యాసాలు, కవితలు, నాటికలు రాసాను. నేను రాసిన కథలు, కవితలు ఆంధ్రప్రభ, వనిత, ఆంధ్రజ్యోతి, విపుల, స్వాతి, నవ్య ,రచన, ఆంధ్ర భూమి, భూమిక, స్వప్న, నది వంటి వార, మాస పత్రికలలో, సారంగ, విహంగ వంటి వెబ్మ్యాగజైన్లలో ప్రచురితమయాయి. కౌముది, రచన, స్వాతి, ఆంధ్ర భూమి పత్రికలనుండి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా), న్యూ జెర్సీ తెలుగు జ్యోతిలనుండి కథలూ , కవితలూ, పాటలకు అనేక బహుమతులు వచ్చాయి. దూరదర్శన్ నుండి మరియు ఆకాశ వాణి నుండి కథలు, రేడియో ముచ్చట్లు, లలిత గీతాలు, నాటికలు ప్రసారమయ్యాయి. రేడియో కోసం 'ఆయుర్వేదం'పై ఒక గంట నిడివి గల నాటకం, చిన్నపిల్లల కోసం హాస్య నాటకాలు రాసాను. మ్యూజ్ ఇండియా, పొయెటిక్ ప్రిజమ్ వంటి బహుభాషా కవి సమ్మేళనాలలో పాల్గొన్నే అవకాశం లభించింది. సాహిత్య సేతు , ముక్తాంచల్ వంటి హిందీ సాహితీ సంచికలలో నా కథల అనువాదాలు ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు ఇటీవల హిందీలోకి 'బోల్తీ తస్వీర్' కథా సంపుటి ఆర్. శాంత సుందరిగారి అనువాదంతో వెలువడింది. 'వానచినుకులు'(2003) లలిత గీత మాలిక, 'ఆలంబన '(2005), 'ఆసరా'(2010),' వేకువపాట' (2015), కథాసంపుటాలు, 'ఊర్వశి'(2014) న త్య నాటిక ఇప్పటి వరకు వచ్చిన పుస్తకాలు. నేను రాసిన గీతాలు రేడియోలో ఎన్నో సార్లు ప్రసారం కావడంతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు రామాచారి, వారి శిష్యుల చేత సంగీత విభావరిగా శ్రోతలను అలరించాయి. మా అమ్మాయి వర్షిత కూడా చాలా బాగా పాడుతుంది.
అవార్డులు..
2004లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ' సాహితీ పురస్కారం', 2005 లో నవ కథా రచయిత్రి గా 'శ్రీమతి అబ్బూరి రుక్మిణమ్మ' పురస్కారం, 2009 లో ' యమ్వియల్ సాహిత్య సత్కారం', 2011లో 'లేఖిని' సంస్థ నుండి 'ఉత్తమ కథా రచయిత్రి గా, 2013 లో ' షీ' పురస్కారం, 2017లో అమృతలత 'అపురూప పురస్కారం' అందుకున్నాను. బాల్యం నుండి చిత్ర లేఖనంలో అభిరుచి ఉండడం వల్ల అనేక చిత్రలేఖన పోటీలలో బహుమతులు లభించాయి. 2004 లో 'ఉఅషశీశ్రీశీస్త్రy శీఅ జaఅఙaర' అంశంపై ఇంటర్నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్స్లో నా చిత్రం 'దీశ్రీబవర aఅస దీశ్రీశీశీఎర ' ఎంపికై లండన్ లోని రాయల్ కాలేజ్ అఫ్ ఆర్ట్స్లో ప్రదర్శితమైంది.
చిన్నారులకు చిత్రకళను..
నా పుస్తకాలకు నేనే బొమ్మలు వేసుకోవడం అలవాటు. వాసా ప్రభావతి గారు, భువన చంద్ర రాజు గారు, మంథా భానుమతి, వనజ తాతినేని తదితర రచయితల కథా సంపుటాలకు కూడా ముఖ చిత్రాలు వేసే అవకాశం లభించింది. స్త్రీవాద పత్రిక 'భూమిక' కు కొంతకాలం ఇల్లస్ట్రేషన్స్ వేసాను. నేటి చిన్నారులకు ముఖ్యంగా పట్టణప్రాంతాల్లోని వారికి ప్రకృతిలో స్నేహం కరువైపోయింది. ఎంతసేపు టీవీలు, కంప్యూటర్లు వారి అందమైన బాల్యాన్ని బంధీ చేస్తున్నాయి. రంగులతో పిల్లల సృజనాత్మకత పెరుగుతుంది. అందుకే గత దశాబ్దంగా 'రంగ్ రేఖ' పేర 5 నుండి 15 సంవత్సరాల వయసులోపు చిన్నారులు చిత్రలేఖనం నేర్పిస్తున్నాను. ఒకవైపు రచనలు, అనువాదాలు మరోవైపు చిత్రకళతో సమయం చాలడం లేదు.
- వి. యశోద