Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, ఇతర పనులు చేసే వారెవరైనా ప్రతి వ్యక్తి చేసే పని నుంచి ఒకానొక సమయంలో విరామం తీసుకుంటుంటారు. ఆ సమయంలో సంపాదన లేకుంటే గడవడమెలా..? ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ సంపాదన ప్రారంభించిన నాటి నుండే కొంత మొత్తం పెట్టుబడుల రూపంలో దాచుకోవాలి. లేకుంటే భవిష్యత్ అంధకారమయ్యే అవకాశం ఉంది. చాలా మంది ముందుచూపుతో పెట్టుబడులు ప్రారంభించినప్పటికీ సరైన పద్ధతిలో పెట్టకపోవడం, డబ్బు మొత్తం ఒకే చోట పెట్టడం వల్ల నష్టపోవాల్సి వస్తుంది. అందుకే పెట్టుబడుల కోసం ఎంచుకునే మార్గాలపై ఎక్కువ దృష్టి సారించాలి.
ప్రతి ఒక్కరికీ రిటైర్మెంట్ తర్వాత చేయాల్సిన వాటికి సంబంధించి ఎన్నో ప్రణాళికలుంటాయి. విరామ సమయంలో ఉరుకులు పరుగులుగా ఆఫీసులకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. పిల్లలకు సమయానుకూలంగా బాక్స్లు అందించాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు రొటీన్ జీవితం అనే భావన ఉండదు. చాలా సమయం ఖాళీగానే ఉంటారు. ఆ సమయంలో ఎన్నాళ్ళ నుంచో కన్న కలలను నిజం చేసుకోవచ్చు. కొందరికి విహారయాత్రలకు వెళ్ళాలని, ప్రపంచాన్ని చుట్టి రావాలని... ఇలా ఎన్నో ఆశలు ఉంటుంటాయి. కానీ ఆ సమయంలో ఏ పని చేయాలన్నా డబ్బు చాలా అవసరం. అనుకోగానే అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
ఎవరికి వారే ఆలోచించుకోవాలి
పిల్లల ఫీజులు, సొంత ఇల్లు, రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఇలా ఎన్నో అవసరాలు ఉంటాయి. వీటి గురించి 20 ఏండ్ల వయసులో ఉన్నప్పుడే ఆలోచించాలని ఎవరూ ప్రత్యేకించి చెప్పరు. ఇది ఎవరికి వారే ఆలోచించి అడుగు వేయాల్సిన విషయం.. అలా అని ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టడం కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది.
ఎంత మేర..
మొదట ఆలోచించాల్సింది సంపాదన ఎంత.. అందులో ఆదా చేస్తున్న మొత్తం ఎంత అని లెక్కగట్టాలి. నోటి లెక్క కంటే, ప్రతీ ఖర్చూ రాస్తూ ఉంటే సరైన అంచనా ఉంటుంది. వాటిని నెల వారి ఖర్చులకు, సంవత్సరాదాయానికి కలపాలి. ఇవన్నీ కలిపి చూసుకుంటే ఆదాయం, వ్యయాలకు సంబంధించి ఒక క్రమ స్థితి ఏర్పడుతుంది. తర్వాత చెల్లించని క్రెడిట్ కార్డు బిల్లులు, నెలవారీ ఖర్చులు, అప్పులు వంటివన్నీ లెక్కలేసుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని సరిగా అంచనా వేయడంతో పాటు భవిష్యత్ కోసం ఎంత మేర ఆదా చేయగలమో కూడా అర్థమవుతుంది.
లక్ష్యం ఏమిటి..?
ఒకసారి ఆదాయం, అప్పులు అన్నీ లెక్కలు వేసుకున్న తర్వాత ఎంతమేర దాచగలమో అర్థమవుతుంది. అది రిటైర్మెంట్ తర్వాత ఏ స్థితిలో ఉండగలమో నిర్ణయిస్తుంది. ఒక కచ్చితమైన ప్రణాళిక ఏర్పడుతుంది. సాధారణంగా ఒక ఏడాదికి ఖర్చు చేసే డబ్బుకు 40 రెట్లు రిటైర్మెంట్ తర్వాత అవసరమవుతుంది. ఉదాహరణకు ఏడాదికి ఖర్చు చేసే మొత్తం రూ.4లక్షలు అనుకుంటే, దానికి 40 రెట్లు అంటే రూ.1.2 కోట్లు రిటైర్మెంట్ తర్వాత కావాల్సి ఉంటుంది. హుందాగా బతకాలంటే రోజుకు రూ.40 ఇన్వెస్ట్ చేయాలని పి.వి. సుబ్రహ్మణ్యం అనే రచయిత తన పుస్తకంలో రాశారు.
ప్రణాళికతోనే ముందుకు..
మన ప్రస్తుత పెట్టుబడులు, భవిష్యత్లో అందివచ్చే విధానంపై ఆధారపడి రిటైర్మెంట్ ప్రణాళిక ఉంటుంది. ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి.. ప్రస్తుత ఆస్తుల విలువ, రిటైర్ అయ్యే వయసు, అందుకు ఉన్న సమయంపై అంచనాకు రావాలి. పెట్టుబడుల మీద ఎంత మొత్తంలో తిరిగి వస్తున్నాయో అంచనా ఉండాలి. అదే పనిగా నష్టాలు వస్తుంటే ఎంచుకున్న విధానం, సమయాన్ని అంచనా వేయడంలో లోపం ఏర్పడినట్టే. కాబట్టి ముందే తగిన జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడులు ఎంచుకోవాలి. అవసరాన్ని బట్టి మార్చుకోవాలి.
0లలో మదుపు తప్పనిసరి
ఉదాహరణకు 40 ఏండ్ల వయసుంటే, రిటైర్ అవ్వడానికి ఇంకా 20 ఏండ్లు ఉంటుంది. జీవితకాలం 80 ఏండ్లు అనుకుంటే 40 ఏండ్లు సమయం ఉన్నట్టే. 40 ఏండ్ల జీవితానికి సరిపడ డబ్బు దాచుకోవడానికి సరిపోను సమయం ఉన్నట్టే. పెట్టుబడుల మీద ఎంత మొత్తం తిరిగి వస్తుందనేది అంచనా వేయాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించుకున్నాక, దానిని అమలు చేయాల్సి ఉంటుంది. 40 ఏండ్ల వయసులో పెట్టుబడులు పెడుతున్నపుడు వేసే ప్రతీ అడుగుపై అప్రమత్తంగా ఉండాలి. ఒకటి రెండింటిలో పెట్టుబడులు పెట్టకుండా, వేర్వేరు వాటిల్లో పెట్టుబడులు పెడితే రిటర్న్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది.రిటైర్మెంట్ తర్వాత ఆదాయానికి సంబంధించి సరైన ప్రణాళిక ఇప్పటి నుంచే వేయకపోతే తర్వాత ఆ ఆశలన్నీ అలాగే మిగిలిపోతాయి.
సంతోషంగా గడిపేందుకు..
చాలా మంది చేతిలో బాగా డబ్బు ఉన్నపుడే పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. మంచి పెట్టుబడులు పెట్టడానికి డబ్బు ఒక్కటే ప్రాతిపదిక కాదు. సమయాభావం కూడా ఉండాలి. రోజుకు రూ.40 చొప్పున దాచడం లేదా పెట్టుబడిగా పెట్టడం తొందరగా మొదలు పెడితే బాగుంటుంది.
పెట్టుబడులు పెట్టేటపుడు, ఎంతమేర వస్తాయనే విషయంపై సాధారణ అవగాహన లేకుండా ముందుకు అడుగేస్తే నష్టాలపాలవుతాం. అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం పెట్టుబడులు పెట్టడం లేదా ఆదా చేయడం వంటివి చేస్తే రిటైర్మెంట్ సమయానికి డబ్బు గురించి బెంగపడాల్సిన అవసరముండదు. ఆ తర్వాత సంపాదన లేకున్నా ధైర్యంగా బతికేయవచ్చు.
సరైన పద్ధతిలో పెట్టుబడులు పెట్టకుంటే, డబ్బును కోల్పోయే అవకాశం ఉంది. బ్యాంకుల్లో దాచడం లేదా సక్రమంగా పెట్టుబడులు పెట్టడంలో విఫలమవుతుంటారు. ఈ రెండు పనులు చేయడం వల్ల తర్వాత నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక పరమైన చింత లేకుండా ఉండాలంటే సరైన పద్ధతిలో ఆదా తప్పనిసరిగా చేసుకుంటుండాలి.
ఎ. హర్షిత