Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అల్పాహారం మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాదు బరువు కూడా అదుపులో ఉంటుంది. అయితే అల్పాహారంగా మనం ఏం తినాలో... ఏవి తినకూడదో తెలుసుకోవాలి.
- చాలామంది ఇంట్లో తయారు చేసుకున్న తాజా పండ్లు, కూరగాయల రసాలను అల్పాహార సమయంలో తీసుకుంటారు. వీటి నుంచి మన శరీరానికి కావాల్సిన పీచు లభించదు. కాబట్టి నేరుగా పండ్లు లేదా సలాడ్ని ఎంచుకోవాలి. అప్పుడే వాటిలోని పోషకాలు, పీచు అందుతాయి. పొట్ట నిండిన భావన కలుగుతుంది.
- అల్పాహారం అనగానే చాలామంది ఏది పడితే అది తినేస్తారు. కానీ మాంసక త్తులున్న పదార్థాలు తినాలి. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి చాలా అవసరం. త్వరగా ఆకలి వేయదు. వీటిని తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. గుడ్లూ, బీన్స్, డ్రైఫ్రూట్స్, కూరగాయల నుంచి ఇవి లభిస్తాయి.
- కొంతమంది త్వరగా తయారు చేసుకోవచ్చనే ఉద్దేశంతో బ్రెడ్, మైదా పదార్థాలను ఎంచుకుంటారు. వీటి నుంచి పీచు అందదు సరికదా త్వరగా ఆకలీ వేస్తుంది. కారణం వీటిలోని పిండిపదార్థాలే. బరువూ పెరుగుతారు. అంటే పిండిపదార్థాలు తీసుకోవద్దని కాదు. మీ శరీరానికి ఉపయోగపడే సంక్లిష్ట పిండిపదార్థాలు తినాలి. గుడ్లు, ఓట్మీల్, పెరుగు, రాగిదోశ, గోధుమరవ్వతో చేసిన ఉప్మా ఎంచుకోవచ్చు.
- చాలామంది అసలు అల్పాహారం తీసుకోరు. మరికొందరితే కుదిరినప్పుడు తింటారు. ఈ రెండూ సరికాదు. ఇలా చేయడం వల్ల మధ్యాహ్నం భోజనం ఎక్కువగా తినేస్తారు. దీంతో బరువు పెరిగే అవకాశం ఎక్కువ. కాబట్టి ఆలస్యం చేయకుండా, అసలు మానేయకుండా అల్పాహారం వేళకు తీసుకోవాలి. ఉదయం నిద్ర లేచిన గంట లోపల తినడం మంచిది.