Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మమ్మ, నాన్నమ్మలు చెప్పే కథలు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆ పరిస్థితులన్నింటినీ కళ్లకు కడతాయి. కళ ఏదైనా కావచ్చు... స్టోరీ టెల్లింగ్ అంటే ఆమెకు అమితమైన అభిమానం. ఆమె కళ్లు ఎన్నో భావాలను పలికిస్తాయి. ఆమె ప్రతి కదలికలో ఓ రిథమ్ ఉంటుంది. ఆ రెంటినీ మేళవించి ఆమె చెప్పే కథలు.. ఆహుతులను కను తిప్పనీయవు. ఆమె... కూచిపూడి నృత్యకళాకారిణి కాత్యాయని గంటి! కేవలం నృత్యం నేర్చుకోవడం, ప్రదర్శించడంతోనే ఆగిపోలేదు. 'లాస్యకల్ప' ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఇతర కళారూపాలను ప్రతి ఏటా ప్రదర్శింపజేస్తున్నారు. నేడు రవీంద్ర భారతిలో 'పంచమం' పేరుతో నృత్యోత్సవాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఆ నృత్యకారిణి పరిచయం...
డ్యాన్స్ మీద ఇష్టం ఎట్లా ఏర్పడింది?
చిన్నప్పటినుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. వెంపటి చినసత్యం గారి శిష్యురాలు మల్లికా రాంప్రసాద్ టీచర్ దగ్గర నేర్చుకున్నప్పుడు కూచిపూడి పట్ల సీరియస్నెస్ పెరిగింది. ఆ తరువాత ఇంజనీరింగ్ చదివేటప్పుడు నృత్యానికి కొంత దూరంగా ఉన్నాను. ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఏం చేయాలనేది పెద్ద ప్రశ్న! ఇంజినీరింగ్ చదువులు అస్సలు నాకు సంబంధించినది కాదని తోచింది. 'అమ్మా డిగ్రీ ఇష్టం లేకున్నా చేశాను. ఇక మాస్టర్స్ ఏది చేస్తే అందులోనే ఉండిపోవాలి కదా! ఎందులో చేయను?' అని అమ్మను అడిగాను. 'నీకు డ్యాన్స్ ఇష్టమైతే డ్యాన్స్లో చేయి. చిన్నప్పుడు ఇష్టంతో చేసేదానివి కదా!' అన్నది. అలా నాలో ఉండిపోయిన కళను మళ్లీ మేల్కొలిపింది. నాన్నగారు చిన్నప్పుడే పోయారు. నాకు అమ్మనుంచి వందకాదు.. ఐదువందలశాతం సహకారం ఉంది. దాంతో శాస్త్రీయ నృత్యాన్నే ఫుల్టైమ్ కెరీర్గా తీసుకున్నాను.
కూచిపూడిలోనే మాస్టర్స్, పీహెచ్డీ చేసినట్టున్నారు?
అవును... హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే ఎమ్మే, పీహెచ్డీ. ఐందేండ్లపాటు సీరియస్గా గురువు దగ్గర నేర్చుకున్నట్టు సర్టిఫికెట్ ఉంటే చాలు. దాంతో పాటు యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాలి. అలా ఎమ్మేలో సీటు వచ్చింది. అప్పుడు మా గురువుగారు టి.బి. కృష్ణభారతిగారు. తరువాత నెట్ రాస్తే... జేఆర్ఎఫ్ వచ్చింది. దాంతో... ఐదేండ్లపాటు దానికోసమే కేటాయించి. కూచిపూడి తెలుగు సినిమాకు ఉన్న అనుబంధం (1930 నుంచి 1970ల వరకు)మీద చేశాను. అప్పట్లో కూచిపూడి తెలుగు సినిమాల్లోకి ఎలా వెళ్లింది? సినిమా మీద అది ఎలాంటి ప్రభావాన్ని చూపింఇ... సినిమాతో కూచిపూడిలో వచ్చిన మార్పులేమిటి? కూచిపూడిలో ప్రముఖులు వేదాంతం రాఘవయ్య, వసుమతి కృష్ణమూర్తి, వెంపటి చినసత్యంలాంటివాళ్లు సినిమాలో చేసిన ప్రయోగాలేంటి? వంటివాటిమీద అధ్యయనం చేశాను. ఇప్పుడు పదేళ్లుగా గురు డీఎస్వీ శాస్త్రిగారి దగ్గర నేర్చుకుంటున్నా.
వెస్ట్రన్ వెల్లువలా ఉన్న ఈ సమయంలో శాస్త్రీయ నృత్యాలకు మనుగడ ఎలా ఉంటుందనుకుంటున్నారు?
ఇవెప్పటికీ పాపులర్ కళారూపాలు కాదు. వేలకు వేలు లక్షలకు లక్షలు మంది వచ్చి చూడటానికి.. కూచిపూడి ఎప్పటికీ క్రికెట్ కాదు. అంత క్రేజ్ ఇదివరకు లేదు. ఇప్పుడు ఉండదు. అసలు వేరేవాటితో పోల్చాల్సిన అవసరం లేని ప్రత్యేకమైన కళారూపమిది! ఎలాగంటే... పెయింటింగ్ను చూసి అందరూ ప్రశంసించలేరు. దాన్ని ఆస్వాదించేవారు కొందరే ఉంటారు. ఆ కొందరిలో దానిమీద ఆసక్తి ఎప్పటికీ ఉంటుంది. కళారూపాలు రాశికి తక్కువ కావచ్చు... కానీ వాసి ఎక్కువ. శాస్త్రీయ నృత్యాన్ని ఏ సినిమాతోనో పోల్చి చూడటం సరైనది కాదు. అయితే కళారూపాలకు... ఇంతకుముందుకంటే ఇప్పుడు ఎక్కువ ఆదరణ మాత్రం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత... మామిడి హరికృష్ణ, బుర్రా వెంకటేశంగారిలాంటివాళ్లు కళలను చాలా ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడినుంచో ఓ చిన్న కళాకారుడు వచ్చినా కూడా... వాళ్లకో వేదిక సృష్టించి ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కళలకు మంచి ప్రోత్సాహం ఉంది. ఇది వందశాతం చెప్పగలను.
'లాస్యకల్ప' ఫౌండేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
ఇంతకుముందు ఎక్కువగా నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్స్ అయ్యేవి కాదు. బయటి ఆర్టిస్టులు ఎక్కువగా వచ్చేవాళ్లు కాదు. మంచి మంచి ఆర్టిస్టులు న్నారు కానీ... ఇక్కడివాళ్లు పిలవడం, చూడటం వంటివి లేవు. దానికోసం మా గురువుగారు డీఎస్వీ శాస్త్రిగారు, మరో నృత్యకారిణి సాహితిరెడ్డి కలిసి.. ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేశాం. ఐదేండ్లుగా నడుస్తున్నది. మాకు చాలా ఇష్టమైన ఆర్టిస్టులను తీసుకొచ్చి ప్రతి ఏటా నిర్వహిస్తున్నాం. ఆ ప్రోగ్రా ం తయారు చేయడానికి మూడు నాలుగు నెలలు పడుతుంది. ఎంత వీలయితే అంత బెస్ట్ ఆర్టిసులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ఎంతసేపు మన కళా రూపాయలను మనమే ప్రదర్శించుకుంటూ పోతే... కొత్తదనం ఏముంటుంది? మనదేశంలో ఎన్నో కళలున్నాయి. రాష్ట్రానికో నృత్యం ఉన్నది. ఇతర నాట్య కళలను మన రాష్ట్రంలో ప్రదర్శనలు పెడితే.. ఇక్కడివారికి స్ఫూర్తినిచ్చిట్టు ఉంటుందనిపించింది. ఇలాంటి ఇంటరాక్షన్స్ వల్ల మన కళారూపాలు మరింత వృద్ధి చెందుతాయి. అయితే ఫౌండేషన్ ప్రారంభించేటప్పుడే..' వేదిక ఇస్తున్నాం కదా! ఊరికనే వచ్చి చేసిపోండి' అని కాకుండా... వచ్చిన కళాకారులకు తగిన రెమ్యునరేషన్ ఇవ్వాలనుకున్నాం. అది ఇవ్వలేని నాడు అసలు నృత్యోత్సవాలు కూడా నిర్వహించొద్దని అనుకున్నాం. ఇప్పటికి నాలుగు సంవత్సరాలు నిర్వహించాం. ఇది ఐదో ఏడు. అందుకే ఈ డ్యాన్స్ఫెస్టివల్కి 'పంచమం' అని పేరుపెట్టాం. ఇప్పటికి ఒడిస్సి, సత్రియా, కథక్, భరతనాట్యం ప్రదర్శనలు జరిగాయి. ఈసారి 'మోహిని ఆట్టం' కూడా ఉండబోతున్నది.
నృత్యంలో మీకు స్ఫూర్తి ఎవరు?
బెంగళూరులో 'నృత్యగ్రామ్' అని ఉంది. ప్రతిమా బేడి స్థాపించిన సంస్థ అది. అక్కడ ఒడిస్సి ఉంటుంది. వాళ్లు చేసే పద్ధతి... ఆర్ట్ పట్ల వాళ్లకు ఉన్న అప్రోచ్ చూస్తే అబ్బురమనిపిస్తుంది. వాళ్లు చేసే పద్ధతి నాకు ఎంతో ప్రేరణనిస్తుంది. ఎప్పటికైనా స్కూల్ పెడితే అలా ఉండాలని నా కోరిక. డిసెంబర్ 16న జరిగే ప్రదర్శనకు అక్కడనిఉంచి ఒక నృత్యకళాకారులు వస్తున్నారు. భరతనాట్య కళాకారిణి రమా వైద్యనాథన్ కూడా నాకు స్ఫూర్తి. వాళ్ల నృత్యం చూసి... ఇలా ఉండాలని కలలు కన్నాను. అలాంటి వాళ్ల ప్రదర్శనలు నిర్వహించడమనేది నాకు ఈసారి ఉన్న ప్రత్యేక ఆనందం. ఇన్సిపిరేషన్ ఎవ్వరినుంచైనా తీసుకోవచ్చు. దానికి చిన్నా, పెద్దా అన్న తేడా లేదు. చిన్నవాళ్లయినా కొందరు అద్భుతమైన నృత్యం చేస్తారు. ఆ మూమెంట్స్ చూసినప్పుడు... వాళ్లలా మనం చేస్తే బాగుంటుంది కదా! అనిపిస్తుంది. ఇక డీఎస్వీ శాస్త్రిగారు నాకు గురువుగా దొరకడం అదృష్టం. ఆయన దొరికి ఉండకపోతే... నేను కూచిపూడిని కొనసాగించకపోయేదాన్ని. చిన్న చిన్న అంశాల మీద కూడా సునిశిత పరిశీలన ఉంటుంది. వేలి ముద్ర ఎలా ఉందో కూడా చూస్తారు. కూచిపూడి నృత్యం, సంగీతం తెలిసిన అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర నేర్చుకోవడం నా అదృష్టం. ఇక మా అమ్మ ఇచ్చే ప్రోత్సాహం... అంతా ఇంతా కాదు. టాలెంట్ ఉన్నా... పెద్దవాళ్లు ఒప్పుకోక డ్యాన్స్ మానేసినవాళ్లను చాలా మందిని చూశాను. అందుకే అమ్మ, గురువులకు దక్షిణగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా.
నృత్యం చేయడాన్ని మీరెలా చూస్తారు?
నాకు స్టోరీ టెల్లింగ్ అంటే ఇష్టం. అది సినిమా కావచ్చు. కథ కావచ్చు. కవిత్వం కావచ్చు. ఏవిధంగా నైనా స్టోరీ చెప్పడం నచ్చుతుంది. కూచిపూడికూడా ఓ స్టోరీ టెల్లింగ్ ఆర్ట్ ఫామ్. ఇందులో ఎన్నో కథలను చెప్పొచ్చు. పాత కథలనే కొత్తగా చెప్పొచ్చు. ఏదైనా చేస్తున్నప్పుడు ఆ ఆ పాత్రలను ప్రతిష్టించడం, ఆ ఎమోషన్స్ ఫీలవ్వడం చాలా ఇష్టం. భాష ఒక్కటే ... కానీ రాసే కవిత్వం భిన్నంగా ఉంటుంది. కూచిపూడి కూడా అంతే. అది థియేటర్ ఆర్ట్. మా ప్రదర్శనలో ఆ డ్రామాను చూపించాలనుకుంటాం.
మీరు డ్యాన్స్ ఎకాడమీ ప్రారంభించలేదు. ఎందుకని?
నాకు అకాడమీ స్టార్ట్ చేయాలని ఉంది. కానీ టీచింగ్ అంటే మదర్హుడ్. అంత సీరియస్ జాబ్ తీసుకోవడానికి నాకు కొంత సమయం పడుతుంది. అందుకే ఆగుతున్న. కానీ కచ్చితంగా ఏర్పాటైతే చేస్తా.
మీకు వచ్చిన ప్రశంస?
ఓసారి ప్రదర్శన ఇచ్చిన ఏడాది తరువాత ఒక వ్యక్తి వచ్చి వచ్చి... 'మీరు ఆ కార్యక్రమంలో ఇచ్చిన ప్రదర్శనకు నాకు గూస్ బంప్స్ వచ్చాయి' అని చెప్పారు. ఇది కదా నిజమైన కళ అనిపించింది. ఒక ప్రోగ్రాం చేశామా? అయిపోయిందా? అన్నట్టుగా కాకుండా... అది ఆహుతుల మనసులో ఉండిపోతే... అది నిజమైన ప్రదర్శన. అది ప్రతి కళాకారుని కల. అయితే ప్రతి ప్రదర్శనలో అలా జరగదు. కొన్నిసార్లు.. కొన్ని కథలు... కొన్ని మూమెంట్స్ అలా గుర్తుండిపోతాయి. ఇప్పటిదాకా దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. నాట్యమే జీవితం!
ఐడెంటిటీ కోల్పోవద్దు..
సందేశం లాంటి పెద్దమాటలు కాదు కానీ... మనకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయాలని అనుకుంటా. ఇన్నాళ్లు ఇలా చేశారు కాబట్టి నేను కూడా ఇలా చేయాలి అనుకోకూడదు. మనదైన గుర్తింపు, ముద్ర ఉండాలి. మనది మనం క్రియేట్ చేసుకోవాలి. దానికి కట్టుబడి ఉండాలి. లేకపోతే... మహిళలు ఐడెంటింటీ కోల్పోడం చాలా ఈజీ. మనం కరెక్టు చేస్తేన్నామా లేదా చూసుకోవాలి. ఎవ్వరికోసం మన ప్యాషన్, డైరెక్షన్, మన ఫోకస్ మార్చుకోవాల్సిన పనిలేదు. ఎవరికోసమో త్యాగాలు చేయాల్సిన పనిలేదు. అది కోల్పోయిన నాడు మనలను మనం కోల్పోయినట్టే లెక్క!