Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చదవడానికి, రాయడానికి ఖర్చయ్యే శక్తి కూడా తక్కువేమీ కాదు. మామూలు రోజుల్లో కన్నా పరీక్షల వేళల్లో ఈ ప్రక్రియలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే పిల్లలు రోజురోజుకీ బాగా బలహీనపడిపోతుంటారు. అయితే ఈ వేళల్లో ఎక్కువగా చదవడం, రాయడమే కాదు, వీటి వెనుక దిగులు, ఆందోళనలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ కలిసి శారీరకంగా మానసికంగా పిల్లల్ని బాగా కుంగదీస్తుంటాయి. పరీక్షల వేళల్లో నిద్ర బాగా తగ్గిపోతుంది కాబట్టి సహజంగానే ఆకలి కూడా తగ్గిపోతుంది.
శరీరం బాగా నీరసించిపోయి, తినే విషయంలో శ్రద్ధా, ఆసక్తి ఉండవు. కొంత మంది పిల్లలకు తినాలంటేనే ఒక విసుగు మొదలవుతుంది. ఎక్కువ శక్తి అవసరమైన రోజుల్లో మామూలు రోజుల్లో కన్నా భోజనం ఇంకా తగ్గిస్తే ఎలా ఉంటుంది? ఫలితంగా మొదటి పరీక్ష రాసిన రోజున ఉన్నంత చలాకీగా, రెండవ పరీక్ష రాసే నాటికి ఉండరు. ఇలా పరీక్షకి, పరీక్షకి మధ్య వాళ్ల శక్తి, ఉత్సాహం తగ్గిపోతూ ఉంటాయి.
ఆ తేడాలను ఎప్పటికప్పుడు గమనించకపోతే, అందుకు అవసరమైన చర్యలు చేపట్టలేం. ఈ స్థితిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే మాటలు చెప్పడంతో పాటు, వాళ్లకు ఎక్కువ శక్తినిచ్చే ఆహార పానీయాలు తరుచూ ఇస్తూ ఉండాలి. అయితే, శారీరకంగా, మానసికంగా బాగా కుంగిపోయిన పిల్లలు ఘనాహారం తినడం పట్ల ఆసక్తి చూపరు. అందుకే ఈ దశలో ద్రవపదార్థాలే ఎక్కువగా ఇవ్వాలి. పండ్లరసాలు, పాలు, మజ్జిగ లాంటివే ఎక్కువగా ఇవ్వాలి.
పండ్ల రసాలు చాలా తొందరగా జీర్ణమై, తొందరగా శక్తినిస్తాయి. ఒక రకంగా శారీరక, మానసిక విషయాలు వేరువేరే అయినా, శారీరక బలాన్ని పెంచడం ద్వారా మనోబలాన్నీ, మేధో బలాన్నీ పెంచవచ్చు. ఒకవేళ ఘనాహారమే ఇచ్చినా పిల్లలు అమితంగా ఇష్టపడేవి ఇవ్వాలి. స్వీట్స్ అనగానే చాలా మందికి నెగెటివ్గా చూసే తత్వం ఉంటుంది. కానీ, స్వీట్స్లో మెదడు చురుకుదనాన్ని పెంచే అంశాలు ఉన్నాయి. అందుకే రోజుకు ఒకటి రెండుసార్లు ఒకటి రెండు పీసెస్ ఇవ్వడం మంచిదే. ఏమైనా, పిల్లల మార్కుల స్కోర్ పెరగాలంటే, వాళ్ల ఎనర్జీ లెవెల్స్ పెంచడం తప్పనిసరి!!