Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అజిత... పాల ప్యాకెట్లు నింపిన బ్యాగులను తన ద్విచక్ర వాహనంపై పెట్టుకుని ఇంటింటికి వెళ్లి అందిస్తుంది. ఇలా ప్రతిరోజూ రెండు వందల ఇళ్లకు వెళ్లి పాలప్యాకెట్లను సరఫరా చేస్తుంది. ఇందులో విశేషం ఏమిటంటారా? ఆమె ప్రస్తుతం త్రిశూరు మేయర్గా ఎంపికైంది.
కేరళలోని కనిమంగళం ప్రాంతానికి చెందిన ఈమె పాలు సరఫరా చేసే వ్యక్తిగా కనిమంగళం ప్రాంత వాసులకు తను సుపరిచితమే. దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ పని చేస్తోంది. అజిత భర్త విజయన్ సీపీఐ(ఎం) నాయకుడు. భర్త గత ఇరవై రెండేండ్లుగా మిల్మా పేరిట మిల్క్ బూత్ నడుపుతున్నాడు. ఆమె అతనికి సాయంగా పాలప్యాకెట్లు వేస్తోంది. ఈ మధ్యనే అజిత త్రిశూర్కు మేయర్గా ఎంపికైంది.
మేయర్గా బాధ్యతలు స్వీకరించినా ఇప్పటికీ ఈ ప్రాంత వాసులకు ఆమె పాలు సరఫరా చేయడానికే ఆసక్తి చూపుతోంది. 'పాలు వేయడం వల్ల నా పని మరింత సులువవుతుంది. ఇలా ప్రతిరోజూ ఇంటింటికీ తిరగడం వల్ల ప్రజల సమస్యలను ముఖ్యంగా మహిళల సమస్యలన్నీ ప్రత్యక్షంగా తెలుస్తాయి. ఎన్నికలయ్యాక కనిపించట్లేదని నా గురించి ఎవరూ అనుకోకూడదు. అందుకే ఇకపైనా పాలప్యాకెట్లు వేస్తా...' అని చెబుతోంది అజిత. ఈమె సీపీఎం పార్టీలో పనిచేస్తూనే అయిదేండ్లు అంగన్వాడీ టీచరుగానూ విధులు నిర్వహించింది. ప్రస్తుతం మేయర్గా మహిళల కోసం పార్టీ రూపొందించిన పథకాలన్నీ అమలయ్యేలా చూడటం తన బాధ్యత అంటోంది అజిత.