Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక్క అవకాశం జీవితాలను మార్చేస్తుంది. అది అక్షరాలా నిజమయ్యింది 'ఇల్మా అఫ్రోజ్' విషయంలో. ఆమెకు అవకాశం ఆక్స్ఫర్డ్ స్కాలర్షిప్ రూపంలో వచ్చింది. విదేశాల్లో చదివే అవకాశాన్నిచ్చింది. అక్కడి చదువు ఆమెకు ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఇలా ప్రపంచాన్ని మార్చేసింది. అలాగే తానెవరి కోసం పనిచేయాలో ఆమెకు నేర్పించింది. ఆమెను చదివించడానికి తల్లి, తమ్ముడు పడ్డ కష్టం వృథా కాలేదు. విదేశాల్లో చదివినా... అక్కడే స్థిరపడిపోలేదు. తల్లి, తన ఊరు కన్న కలలను నిజం చేయాలని... తిరిగి ఊరికి వచ్చేసింది. సివిల్స్ రాసిన మొట్టమొదటిసారే... ఐపీఎస్గా ఎంపికైంది. 'ఊరునుంచి చాలా తీసుకున్నారు... తిరిగి ఇచ్చేయాలి' శ్రీమంతుడు సినిమాలో డైలాగ్. కానీ ఆమె జీవితంలో అది నిజం. గ్రామానికి తిరిగి ఇచ్చే పనిలో సీరియస్గా ఉందామె.
ఉత్తరప్రదేశ్, మురాదాబాద్లోని కుందర్కిలో పుట్టింది ఇల్మా. తండ్రి పేద రైతు. ఆమెకు పద్నాలుగేండ్ల వయసులో హఠాత్మరిణామం. తండ్రి చనిపోయాడు. తండ్రి మరణించిన తరువాత... తల్లి, తమ్ముడితో కలిసి తమ పొలంలో పనిచేసింది. కానీ చదువుని మాత్రం ఆపలేదు. ఆమె ప్రతిభకు పేదరికం అడ్డం కాలేదు. ఆమె ఆశయం, కష్టం ముందు విజయం తలవంచింది. ఇంటర్ వరకు స్థానిక కళాశాలలో చదివింది. స్కూలింగ్ గ్రామంలోనే చేసిన ఇల్మా... ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ... సెయింట్ స్టీఫెన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తత్వశాస్త్రంలో పట్టాసాధించింది. అక్కడితో ఆగకుండా ఆమె ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంది. భర్త చనిపోయినా... పిల్లలను బాగా చదివించాలనుకుంది ఇల్మా తల్లి. అందుకే తను కష్టపడి సంపాదించిన ప్రతి పైసా.. పిల్లల చదువుల కోసమే వినియోగించింది. సాధారణంగా ఎదిగిన కూతురు ఇంట్లో ఉంటే... పెండ్లి చేసి పంపిస్తారు. కానీ ఆమె అలా కాదు... తానెలాగు చదువుకోలేదు. కూతురైనా చదువుకుంటే ఆమె బతుకు బాగుంటుందని ఆలోచించింది. తల్లి నమ్మకాన్ని వమ్ము చేయలేదు ఇల్మా. శ్రద్ధతో చదివింది. అదే ఆమెకు ఆక్స్ఫర్ట్ యూనివర్సిటీ స్కాలర్షిప్ను తెచ్చిపెట్టింది. ఆక్స్ఫర్డ్లో మాస్టర్స్ అయిపోయాక... న్యూయార్క్ వెళ్లింది. మాన్హట్టన్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పనిచేసింది. ఏం చేసినా.. చేస్తున్నా.. తన మనసు మాత్రం మూలాల్లోనే ఉంది.సెలవుల సమయంలో ఇంటికి వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్లు తమ ఇంటికి వచ్చి మాట్లాడేవారు. వాళ్ల కళ్లల్లో ఎన్నో కలలు.. ఇల్మాపై. విదేశాల్లో చదువుతున్న ఇల్మా... తమ కష్టాలన్నీ తీరుస్తుందన్న ఆశ వారిలో. అంతేకాదు... ఇంటి చుట్టుపక్కలవాళ్లు, బంధువులు చిన్న చిన్న పనులకోసం వచ్చేవాళ్లు... రేషన్కార్డు కోసం అప్లై చేయడమో... కంటి శుక్లాల ఆపరేషన్ చేయించమని అడగడమో... చూసేవాళ్లకు చాలా చిన్నచిన్నవే! ఆ వూరికి... వాళ్లకు అవి చాలా పెద్ద సమస్యలు. ఆ సమస్యలన్నీ దూరం చేయాలని అప్పుడే నిర్ణయించుకుంది. విదేశాల్లో చదివి, విదేశాల్లోనే స్థిరపడాలని అనుకోలేదు. తన వాళ్లకోసం సేవ చేయాలని.. అప్పుడే తను నియించుకుంది. పేదరికంలో ఉండి ఉన్నత చదవులు చదివించినందుకు తల్లిదండ్రులకు, అలాంటి వాళ్లకు అండగా నిలువాలనుకుంది.
2017లో పరీక్షలో యూపీఎస్సీలో 217వ ర్యాంక్ సాధించింది. దీంతో పోలీస్ సర్వీస్లోకి చేరింది. హిమాచల్ ప్రదేశ్ క్యాడర్లో చోటు సాధించింది. 'నేను ఈ స్థానంలో ఉన్నానంటే.. మా తమ్ముడు, అమ్మే కారణం. వాళ్లిద్దరూ నా కోసం వాళ్ల జీవితాలను త్యాగం చేశారు. కష్టానికి ఉన్న విలువను తెలియజెప్పింది అమ్మ. నాలా వేరే పిల్లలు ఇబ్బందులు పడకూడదు. అందుకే వాళ్లు బాగా చదువుకోవాలంటే... సౌకర్యాలు కావాలి. ఇప్పుడు నా ఊరికి సాయం చేయాలి. తరువాత దేశానికి ఎలాగూ చేస్తాను' అని గర్వంగా చెబుతుందామె.