Authorization
Mon Jan 19, 2015 06:51 pm
25 ఏండ్లు దాటినప్పటి నుండి అండాల నాణ్యత సన్నగిల్లడం మొదలవుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన పిల్లలు కావాలని కోరుకునేవారు 30 ఏండ్లలోపే బిడ్డకు జన్మనివ్వాలి.
జీవనశైలి కీలకం : వేళకు నిద్ర, ఆహారం, వ్యాయామం గర్భధారణకు ఉపకరించే అంశాలు. భార్యాభర్తల్లో ఎలాంటి శారీరక అనారోగ్యం లేకపోయినా పిల్లలు కలగక పోవడానికి కొన్ని కారణాలున్నాయి. సమతులాహారం, క్రమం తప్పని వ్యాయామం, రోజుకు ఎనిమిది గంటల నిద్ర... వీటిని అనుసరించకపోతే శరీర జీవక్రియలు క్రమం తప్పుతాయి. నెలసరి సమస్యలు తలెత్తుతాయి. దాంతో గర్భం దాల్చే అవకాశాలు సన్నగిల్లుతాయి. కాబట్టి వేళకు పోషకాహారం తీసుకుంటూ, కంటి నిండా నిద్రపోతూ, రోజుకి కనీసం 30 నిమిషాలపాటు వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.
క్రమం తప్పితే : పగటి వేళను నిద్రకు కేటాయిస్తూ, రాత్రి వేళ డెస్కులకు అతుక్కుపోయి పని చేసే ఉద్యోగినుల బయొలాజికల్ క్లాక్ అస్తవ్యస్తం అవడం సహజం. ఫలితం... నెలసరి స్రావాల్లో హెచ్చుతగ్గులు, తేదీల్లో తారుమార్లు. బయొలాజికల్ క్లాక్ పనితీరు దెబ్బతింటే శరీరంలో హార్మోన్ల విడుదలలోనూ అవకతవకలు చోటు చేసుకుంటాయి. దాంతో నెలసరి క్రమం తప్పుతుంది. దాంతో గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయి.
మధుమేహం : గర్భం దాల్చినప్పుడు మధుమేహం తలెత్తితే దాన్ని 'జెస్టేషనల్ డయాబెటిస్' అంటారు. గర్భం దాల్చే సమయానికే మధుమేహం ఉన్నా, లేకపోయినా ఈ స్థితి ఎవరికైనా తలెత్తవచ్చు. మరీ ముఖ్యంగా తల్లితండ్రులకు మధుమేహం ఉంటే, ఆ యువతులు గర్భం దాల్చినప్పుడు, జెస్టేషనల్ డయాబెటిస్కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఒకసారి ఈ సమస్యకు గురయితే, ఆ మహిళలు జీవితాంతం మధుమేహంతో బాధపడవలసి ఉంటుంది. పుట్టే బిడ్డ కూడా అధిక బరువుతో పుట్టే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ కోవకు చెందిన మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి. గర్భం దాల్చింది మొదలు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. గర్భం దాల్చడానికి ఎంతోముందు నుంచీ సమతులాహారం తీసుకుంటూ, వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. ఒకవేళ మధుమేహం ఉన్న మహిళలు గర్భం దాల్చితే, మందులతో చక్కెరను అదుపులో ఉంచుకోవాలి. వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ అవసరం మేరకు ఇన్సులిన్ మోతాదును సరిచేసుకుంటూ, ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటిస్తూ ఉండాలి.
అధిక రక్తపోటు ఉంటే : అధిక రక్తపోటు ఉన్న మహిళలు గర్భం దాల్చినప్పుడు కచ్చితంగా రక్తపోటు పెరుగుతుంది. ఇలాంటి వారు గర్భం దాల్చింది మొదలు వైద్యులను సంప్రదిస్తూ రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. అలాగే మూత్రపిండాలు, కాలేయం పనితీరులను పరిశీలించు కుంటూ ఉండాలి. అధిక రక్తపోటు ఉండి గర్భం దాల్చిన మహిళలకు మూర్ఛవ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ, అవసరమైన పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తగా మెలగాలి.