Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది చిక్కుళ్లు కాసే కాలం. ఏ మార్కెట్లో చూసినా... చిక్కుడుకాయలు కనిపిస్తున్నాయి. చిక్కుళ్లు వండుకుంటాం. పై పొట్టులో ఎంత పీచు ఉంటుందో... గింజల్లో అన్ని పోషకాలుంటాయి. చిక్కుడు గింజలు, చిక్కుళ్లతో చేసే స్పెషల్స్ ఈవారం మీకోసం...
రాజ్మా, చిక్కుడు గింజలతో...సూప్
కావల్సిన పదార్థాలు: రాజ్మా - కప్పు, చిక్కుడు గింజలు - కప్పు, టొమాటోలు- రెండు, ఎండుమిర్చి - రెండు, ఉల్లిపాయ- ఒకటి, నిమ్మరసం - రెండు చెంచాలు, వేయించిన జీలకర్ర పొడి - చెంచా, కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు, నూనె- రెండు చెంచాలు, ఉప్పు-తగినంత.
తయారీ విధానం: రాజ్మా గింజల్ని పన్నెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. తరవాత ఉప్పు వేసి కుక్కర్లో చిక్కుడు గింజలతో సహా ఐదారు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. చల్లారాక ఆ రెండింటినీ ముద్దలా చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెను పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఎండుమిర్చీ, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక రాజ్మా ముద్ద, రెండు కప్పుల నీళ్లు పోసి చిక్కగా అయ్యేవరకూ ఉడికించు కోవాలి. తరవాత జీలకర్రపొడీ, నిమ్మరసం, మరికొంచెం ఉప్పు వేయాలి. ఇది కాస్త చిక్కగా అవుతున్నప్పుడు కొత్తిమీర తరుగు వేసి దింపేయాలి.
వంకాయ చిక్కుడు గింజల కూర
కావల్సిన పదార్థాలు : వంకాయలు- పావు కేజీ, చిక్కుడు గింజలు - పావు కప్పు , ఉల్లిగడ్డ - 2, పసుపు - కొద్దిగా, జీలకర్ర - అర టీస్పూన్, జీలకర్ర పొడి - పావు టీస్పూన్, ధనియాల పొడి - ఒక టీస్పూన్, కారం - పావు టీస్పూన్, అల్లం - చిన్న ముక్క, వెల్లుల్లిపాయలు - 5, పచ్చి మిరపకాయలు - 2, కొత్తిమీర - చిన్న కట్ట, కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ విధానం: చిక్కుడు గింజల్లో కొన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి ఉడికించాలి. ఉడికాక నీళ్లు వంపేసి పక్కన పెట్టాలి. అల్లం, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలను గ్రైండ్ చేయాలి. కడాయిలో నూనె పోసి జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ని వేసి ఐదు నిమిషాలు ఆగాలి. ఆ తర్వాత పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. సన్నని మంట మీద ఉంచి వంకాయలు వేసి మరో పదినిమిషాలు ఉంచి అందులో కొన్ని నీళ్లు పోయాలి. మరో పదినిమిషాల తర్వాత ఉడికించిన చిక్కుడు గింజలను వేసి మూత పెట్టాలి. నీరు గుంజుకునే వరకు అలాగే ఉడికించాలి. వంకాయ చిక్కుడు గింజల కూర రెడీ!
చిక్కుడు గింజల రైస్
కావల్సిన పదార్థాలు : చిక్కుడు గింజలు - 350గ్రా., బాస్మతీ రైస్ - 2 1/2 కప్పులు, లవంగాలు - 4, యాలకులు - 6, షాజీరా - అర టీస్పూన్, బిర్యానీ ఆకులు - 3, దాల్చిన చెక్క - చిన్నది, మెంతి కూర - చిన్న కట్ట, ఉల్లిగడ్డ - 1, అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 1/2 టేబుల్స్పూన్స్, పచ్చిమిరపకాయలు - 7, కొత్తిమీర - అర కట్ట, ఉప్పు, నూనె - తగినంత
తయారీ విధానం : చిక్కుడు గింజలను ఉడికించాలి. నీళ్లు వంపేసి అందులో కొన్ని చల్లటి నీళ్లు పోయాలి. ఆ తర్వాత చిక్కుడుగింజల పొట్టును తీసి మధ్యకు కట్ చేయాలి. బియ్యాన్ని కడిగి కాసేపు నానబెట్టుకోవాలి. గిన్నెలో నూనె పోసి యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, షాజీరా, బిర్యానీ ఆకులు, మెంతికూర వేసి వేయించాలి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు ఆగి చిక్కుడు గింజలను వేయాలి. కొద్దిగా వేగాక ఉప్పు, కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసి రెండు నిమిషాలు ఆగాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసి మూత పెట్టాలి. కాసేపటి తర్వాత మంట తగ్గించాలి. దించేముందు కొత్తిమీర వేసి కలిపి చిక్కుడు గింజల పులావ్ మీ నోరూరించక మానదు!
కుడుములు
కావల్సిన పదార్థాలు : చిక్కుడుకాయలు - పావుకేజీ, పచ్చిమిర్చి - నాలుగు , ఉల్లిపాయలు - రెండు , బియ్యంపిండి - కప్పు (తగినంత), కొత్తిమీర - గుప్పెడు, ఉప్పు - తగినంత, వెల్లుల్లి తరుగు - టీ స్పూన్, నూనె - టీ స్పూన్
తయారీ విధానం : చిక్కుడుకాయ చివర ఈనెలు తీసి, ముక్కలు చేయాలి. గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి, చిక్కుడుకాయ వేసి ఉడికించి, పక్కన ఉంచాలి.పచ్చిమిర్చి, ఉప్పు కలిపి ముద్దగా నూరాలి. ఉల్లిపాయలు సన్నగా తరగాలి. ఉడికించిన చిక్కుడుకాయల్ని రుబ్బుకోవాలి. గిన్నెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిక్కుడుకాయ ముద్ద, బియ్యంపిండి, ఉప్పు, కొత్తిమీర, వేసి బాగా కలపాలి. చిన్న చిన్న ఉండలు తీసుకొని, అదిమి, ఇడ్లీ ప్లేట్కు నూనె రాసి, దాంట్లో ఈ మిశ్రమాన్ని ఉంచాలి. పాత్ర అడుగున కొద్దిగా నీళ్లు పోసి, పైన సిద్ధంగా ఉంచిన ఇడ్లీ ప్లేట్ పెట్టి, మూత ఉంచాలి. పొయ్యి మీద 15 నిమిషాలు ఉడికించాలి. ఉడికించే ముందు మిశ్రమం పైన జీడిపప్పులు అలంకరించవచ్చు. ఉడికిన చిక్కుడు కుడుములను టొమాటో పచ్చడి కెచప్తో వడ్డించాలి.
చిక్కుడుకాయ ఆలూ ఫ్రై
కావల్సిన పదార్థాలు : చిక్కుడుకాయలు- పావు కేజీ, ఆలుగడ్డలు - 2, ఉల్లిగడ్డ - 1, పసుపు - కొద్దిగా, కారం - ఒక టీస్పూన్, ధనియాలపొడి - ఒక టీస్పూన్, మెంతిపొడి - పావు టీ స్పూన్, వెల్లుల్లిపాయలు - 4, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు, నూనె - కొద్దిగా
తయారీ విధానం: చిక్కుడుకాయలను ఒలిచి నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి వాటిని ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత దించేసి నీళ్లు వడబోయాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసి వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేయించాలి. ఒక నిమిషం తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేగనివ్వాలి. దీంట్లో ధనియాలపొడి, పసుపు, కారం, మెంతి పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఆలుగడ్డలు, ఉప్పు వేసి మూత పెట్టేయాలి. ఆలుగడ్డలు బాగా ఉడికిన తర్వాత చిక్కుడు కాయలను వేసి కలపాలి. పై నుంచి కొన్ని నీళ్లు పోసి మళ్లీ మూత పెట్టాలి. సన్నని మంట మీద పదినిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ కూరని చపాతీల్లో తింటే బాగుంటుంది.