Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆడపిల్లకు పెండ్లి చేయడంతో తమ బాధ్యత తీరిపోయిందని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. చదువుకుంటామని, ఉద్యోగం చేసి తమ కాళ్లపై తాము నిలబడిన తర్వాతే పెండ్లి చేసుకుంటామని ఎంత చెప్పినా వినిపించుకోకుండా మంచి సంబంధం అంటూ పెండ్లి చేస్తారు. తీరా పెండ్లికొడుకు అసలు స్వరూపం తెలిసిన తర్వాత తాము చేసిన పొరబాటుకు చింతిస్తారు. కన్నబిడ్డ కష్టాలను చూడలేక కన్నీరు పెడతారు. అలాంటి ఓ అమ్మనాన్న ఐద్వా అదాలత్కు వచ్చారు. వారి సమస్య వింటే ఆడపిల్ల తల్లిదండ్రులు చేస్తున్న పొరబాటు ఏంటో అర్థమవుతుంది.
సావిత్రమ్మ, రామారావు బట్టల వ్యాపారం చేస్తూ తమ ముగ్గురు ఆడపిల్లలను పదోతరగతి వరకు చదివించారు. డిగ్రీ, బిఎడ్ చేసి టీచర్ కావాలన్నది పెద్దమ్మాయి మమత ఆశయం. ఇంటర్లో చేరు తాను అని ఎంత చెప్పినా వినకుండా పెండ్లి సంబంధాలు చూశారు. 'నీ వెనక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నువ్వు చదువుకుంటూ పోతే నీ కన్నా ఎక్కువ చదువుకున్నవాడిని తీసుకురావాలి. మా సంపాదన అంతంతమాత్రమే. మా స్థాయికి తగ్గ సంబంధాలు చూసి పెండ్లి చేసి పంపిస్తే మా బాధ్యత తీరుతుంది' అంటూ మమతను ఒప్పించారు. ఇక గత్యంతరం లేక 'కట్నం వద్దు ఘనంగా పెండ్లి చేస్తే చాలు' అంటూ వచ్చిన సంబంధం చేసుకోవడానికి ఒప్పుకుంది. పెండ్లి కొడుకు సంపత్ ముందు తలవంచి తాళి కట్టించుకుంది.
వారం రోజుల్లోనే..
అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత మమతకు అసలు విషయం అర్థమైంది. పెండ్లైయిన వారం రోజుల్లోనే ఆ ఇంట్లో తన స్థానం ఎమిటో స్పష్టమైంది. అర్జెంటుగా ఇంటిని, గుండె జబ్బు మనిషి అయిన అత్తగారిని చూసుకునే మనిషి కావాలి. దాంతో కొడుకుకు పెండ్లి చేశారు. పగలంతా ఇంటి పని, రాత్రంతా అత్తగారికి సేవలు చేస్తూ.. ఆమెకు తోడుగా ఉండేది. కనీసం భర్తతో మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. అలా ఏడాది గడిచిపోయింది. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న అత్త మమతను సూటిపోటి మాటలతో వేధించడం ప్రారంభించిం ది. 'ఏడాది అయినా పిల్లలు లేరు. పేదింటి పిల్ల అని చేసుకున్నాం. మా వాడికి సంతోషం లేదు. మా ఇంటికి దారిద్య్రం దాపురించింది' అంటూ ఇరుగుపొరుగు ముందు ఇష్టం వచ్చినట్టు మాడ్లాడేది. సంపత్తో అసలు మాట్లాడనిచ్చేది కాదు. కొడుకు ఇంటికి రాగానే తనను బాధపెట్టినట్టు చెప్పేది. దాంతో సంపత్ మమతను బాగా కొట్టేవాడు. పిల్లలు పుట్టడం లేదన్న కారణంతో తనను వదిలించుకుని, భారీ కట్నం తీసుకుని మరోపెండ్లి చేయడానికి సిద్ధమవుతున్నారని మమతకు అర్థమైంది. ఇక ఆ ఇంట్లో తన బతుకు పనిమనిషి కన్నా హీనమని తెలుసుకుంది. ఇన్ని రోజులు తల్లిదండ్రులు బాధపడతారని, ఇద్దరు చెల్లెండ్ల పెండ్లిలు కావాలని అన్ని బాధలు తనలోనే దాచుకుంది. ఇక లాభం లేదనుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
ఏ సంతోషం లేదు..
ఏడాదిలోనే అత్తవారింటి నుంచి కట్టుబట్టలతో వచ్చిన బిడ్డను చూసి భయపడిపోయారు. అసలు విషయం తెలుసుకుని బిడ్డను తీసుకుని ఆమె అత్తవారింటికి వెళ్లారు.' చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మీ దారిద్య్రం మాకు వద్దు. మా వాడికి ఏ సంతోషం లేదు. మీ బిడ్డను మీరే తీసుకుపోండి' అంటూ ముఖంపైనే తలుపు వేశారు. పెద్దమనుషులను తీసుకుపోయినా అదే సమాధానం. తొందరపడి బిడ్డకు పెండ్లి చేసి తాము చేసిన పొరబాటుకు చింతిస్తూ చివరకు ఐద్వా అదాలత్కు వచ్చి తమ సమస్యనంతా చెప్పారు.
తననంట తాను ఇంట్లో నుంచి ..
సంపత్, అతని తల్లి ఉత్తరాలకు స్పందించే మనుషులు కాదని ఫోన్ చేశారు బాధ్యులు. 'ఇంట్లో నుంచి ఆమె వెళ్లిపోయింది. మేమెందుకు రావాలి' అని వాదించాడు. రాకపోతే సమస్య తీవ్రంగా ఉంటుందని చెప్పడం సంపత్, తల్లిని తీసుకుని రెండువారాల తర్వాత వచ్చాడు. 'మీ అమ్మకు ఆరోగ్యం బాగా లేక పోవడంతో ఆమెకు సేవలు చేయడానికి ఒక మనిషి కావాలి. అందుకే పెండ్లి పేరుతో మమతను మీ ఇంటికి తెచ్చుకున్నారు. పెండ్లి తర్వాత మీరు ఏ రోజైనా మీ భార్యతో మాట్లాడారా? భర్తగా ఆమె బాగోగులు పట్టించుకున్నారా? తీరా మీ అమ్మ ఆరోగ్యం బాగైన తర్వాత సూటిపోటి మాటలతో హింసిస్తే.. మీరు ఆమె మాటలు విని విపరీతంగా కొట్టారు. ఇప్పుడు మరో అమ్మాయిని పెండ్లి చేసుకోవడానికి మమత తననంట తాను ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా హింసించారు. మీరు మమతను ఇంటికి తీసుకుపోయి, ఆమెకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. లేకపోతే చట్టపరంగా వెళ్లాల్సి ఉంటుంది' అన్నారు బాధ్యులు.
ఇద్దరికీ ఆరోగ్య పరీక్షలు
'ఏం చేసినా నాలుగు గోడల మధ్య నోరుమూసుకుని కూర్చుంటుంది అనుకున్నారు. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. కోడలిని పనిమనిషిలా కాకుండా మీ మనిషిలా చూడండి. గుండె జబ్బుతో ఉన్న మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటే మీ ఆరోగ్యం బాగైన తర్వాత ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేస్తారా? మీరు ఆడవారే కదా? మరో ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేరా? మమత మీ ఇంటి దీపం. ఆమెకు మమకారం పంచండి. పిల్లలు పుట్టడం లేదు అంటున్నారు కదా ఇద్దరికీ ఆరోగ్య పరీక్షలు చేయించండి. లోపం ఎంటో తెలిసిపోతుంది. మీరు వాళ్లను కాపురమే చేయనివ్వకుండా పిల్లలు పుట్టడం లేదు అంటూ కోడల్ని సూటిపోటి మాటలతో హింసించడం సబబేనా? ఒకసారి ఆలోచించండి' అన్నారు బాధ్యులు. తప్పు తెలుసుకున్న సంపత్ తల్లి కండ్లలోని కన్నీటి తడి ఆమెలో వచ్చిన పశ్చాత్తాపాన్ని తెలియ జేసింది.
బాగా చూసుకుంటాం..
'క్షమించండి. మీ మాటల ద్వారా మేం చేసిన తప్పు తెలుసుకున్నాం. మగపిల్లవాడి తల్లినన్న అహంకారంతో నేను ఆడదాన్ని అన్న విషయం మరిచిపోయి కోడలు పిల్లను బాధపెట్టాను. మరో పెండ్లి చేయడానికి ప్రయత్నించడం తప్పే. మమ్మల్ని క్షమించండి' అంది సంపత్ తల్లి. 'ఇక మీదట నా భార్యను బాగా చూసుకుంటాను' అని రిజిష్టర్లో రాసి సంతకం చేశాడు సంపత్.
'వారం వారం వచ్చి సమన్య ఏమైన ఉంటే చెప్పుతాం' అంటూ మమత సంతకం చేసింది. సంపత్ భార్యను, తల్లిని వెళ్లాడు.
ఆడపిల్లలు భారం కాదు
బిడ్డ అల్లుడు కలిసి వెళ్తుంటే సంతోషంగా చూస్తూ..'పెద్ద బిడ్డ సంసారం ఇలా అయితే మిగతా ఇద్దరు బిడ్డల పెండ్లిల్లు ఎలా చేయలా అని దిగులు పడ్డాం. నా బిడ్డ కాపురం నిలబెట్టారు. మా సమస్యను తీర్చారు' అన్నారు సావిత్రమ్మ, రామారావు.
'ఆడపిల్ల అంటే సమస్యగా ఎందుకు భావిస్తున్నారు? ఇద్దరు బిడ్డల పెండ్లిండ్లు సమస్య అవుతాయని అంటున్నారు కానీ, మీ బాధను అర్థం చేసుకుని మమత ఎంత వేదనను అత్తవారింట్లో భరించిందో తెలుసా? ఆడపిల్లలు భారం కాదు. వరం. మీరు భారం దించుకుందామని ఆమె ఇష్టాఇష్టాలకు విలువ ఇవ్వకుండా పెండ్లి చేశారు. అత్తగారింట్లో 24గంటలు పనిచేసే యంత్రంగా చూశారు. కన్నవారికి, కట్టుకున్నవాడికి తేడా ఏం ఉంది? అత్తగారింట్లో బాధపడలేక ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఏం చేసేవారు? అన్యాయంగా ఆడపిల్లలను బలి చేయకండి. వారి జీవితానికి సంబంధించి నిర్ణయాలు వారినే తీసుకోనివ్వండి. సమస్యలు వచ్చినప్పుడు అండగా నిలబడండి' అన్నారు బాధ్యులు.
- వి. యశోద