Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సొంతిల్లు ఓ మధ్యతరగతి కల. అసలు కడుపు నిండా తిండే లేనప్పుడు... నివాసమన్న ఆలోచనెక్కడిది? అలాంటి నిరాశ్రయుల అడ్డా ఫుట్పాత్. జీవనపోరాటం కోసం రోడ్డెక్కుతాం మనం... కానీ ఫుట్పాత్ల మీదే వాళ్ల జీవితాలు తెల్లారుతుంటాయి. అక్కడే అనేక స్వప్నాలు ధ్వంసమవుతుంటాయి. ఇక మహిళలకైతే ప్రతి నెలా కొన్ని పీడకలలుంటాయి. అర్థరాత్రి అబగా మీదపడే కామపు తోడేళ్లుంటాయి. వాటితో వచ్చే అనేకానేక రుగ్మతలు వారితో సావాసం చేస్తుంటాయి. పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు తమకేం పట్టనట్టుగా ఉంటాయి. ఎన్ని ఉన్నా కొత్త ఆశలతో రోడ్డుపక్కన జీవిస్తున్న అభాగ్యుల జీవితాలపై ఓ కథనం...
''అంతేలే పేదల బతుకులు
తిరిపెమునకు పిడికెడు మెతుకులు
తెరువెరుగని దీర్ఘరాత్రిలో
తలపగిలెడి తలపుల గతుకులు''
శ్రీశ్రీ చూపించిన ఈ దౌర్భాగ్యాన్ని ఎవరూ కోరుకోరు. ఏ మనిషైనా.. ఎప్పుడు? ఎక్కడీ ఎలా పుట్టాలో ఆ మనిషి చేతిలో లేదు. కానీ ఆ మనిషి జీవించే హక్కు మాత్రం సమాజం, ప్రభుత్వాలు కల్పించాలి. అలా జీవించే హక్కు మీదే మిగిలిన హక్కులన్నీ ఆధారపడి ఉంటాయి. అందుకే జీవించే హక్కుని ప్రధానమైన పౌరహక్కుగా గుర్తించాలి. మనిషికి తప్పనిసరిగా ఉండవలసిన కనీస సౌకర్యాలు కూడు, గూడు, గుడ్డ. అవి లేకపోతే సంపూర్ణంగా జీవించడం కష్టం. అయితే అన్ని పట్టణాల్లో లాగానే మన హైదరాబాద్లో కూడా గూడు లేని అభాగ్యులు ఎందరో ఉన్నారు. ఏ వ్యక్తికైనా, కుటుంబానికైనా రాత్రి పూట తలదాచుకునే సరైన, స్థిరమైన, సక్రమమైన వసతి లేకపోవడాన్ని 'హౌమ్లెస్నెస్' అంటారు. అట్లాంటి 'పరాజితుల'కి ఏముంటుంది? వారి 'అలసిన కన్నులు కాంచేదేమిటి? తొణకిన స్వప్నం, తొలగిన స్వర్గం'. అలాంటి తొణకిన కలలను కంటూ... పేవ్మెంట్ల మీద, రైల్వే స్టేషన్లలో లేదా సిమెంటు పైపు ల్లోపల తలదాచుకునేవారి సంఖ్య జనాభాలో 0.15శాతం అంటే, 4,49,761 కుటుంబాలు. వారిలో స్త్రీలు, పిల్లలు మూడవ వంతు.
చలికి వణుకుతూ.. వానకు తడుస్తూ...
పేదరికం, నిర్వాసిత వలసలు, నిరాశ్రయత అనే మూడు జాడ్యాలూ ఒక దానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అదొక విషవలయం. తమ అనిశ్చితి నుంచి, జీవన పోరాటంలోంచి, వెలివేతనుంచి, ఛీత్కారాల రోతలనుంచి, తమని తాము రక్షించుకుంటూ ఒక సమూహంగా, ఐకమత్యంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి తగిన గూడు ఉండదు. సమయానికింత కూడు ఉండదు. కప్పుకునే గుడ్డ ఉండదు. చలికి వణుకుతూ, వానకు తడుస్తూ, నిద్రలేని రాత్రులు గడుపుతారు. తగిన పనిలేక, పనికి తగ్గ కూలీ లేక, విద్యకి, వైద్యానికి దూరంగా కాలం వెళ్లదీస్తారు. వైద్యం విషయానికి వస్తే.. వైద్యానికి కేటాయించిన బడ్జెటులో ఈ నిరాశ్రయులకు ఎలాంటి కేటాయింపులు లేవు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, రాయితీలు వీరి దిరికి చేరవు. దినదిన గండంగా రోజులు గడుపుతారు. ముఖ్యంగా స్త్రీలు, పిల్లలకు ఎలాంటి రక్షణ లేదు. తగిన పని దొరక్కపోతే కడుపుగాలి పడుపువృత్తికి తలవొగ్గి, మాదకద్రవ్యాలవైపు ఆకర్షితులై ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నవారు కూడా ఉన్నారు.
టార్పాలిన్ గదిలోనే కుటుంబమంతా...
అత్తాపూర్లో ప్రధాన రహదారికి ఒకవైపు టార్పాలిన్లు వేసి ఉన్న గుడిసెల్లాంటి ఆవాసాలు వరుసగా. అందులో కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వలస వచ్చిన కూలీలు నివసిస్తున్నారు. వారిలో కొందరు కమ్మరులు, కొందరు మోటారు మెకానిక్కులు. టార్పాలిన్ చుట్టిన ఒకే ఒక్క గదిలో అత్తమామలు, ముగ్గురు మరుదులతో కలిసి ఉంటూ కొత్త పెళ్లి కూతురు లక్ష్మి (పేరు మార్చాం) కాపురం చేస్తోంది. ఆమె ఇప్పుడు నాలుగు నెలల గర్భిణి. ఆమె చీకట్లో బహిర్భూమికి వెళ్లాలి. పక్కన షాపింగ్ కాంప్లెక్సుల్లో నీళ్లు తెచ్చుకోవాలి. పేవ్మెంట్ మీద అడ్డంగా కట్టిన తెరల వెనుక స్నానం చేయాలి. చాలా దూరంగా ఉన్న నీలోఫర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటూ, కాన్పు తయారీ ప్రయత్నాలు చేస్తోంది. ఆమెకు సరైన తిండి లేదు. బక్కచిక్కి బలహీనంగా ఉంది. ఏనాడూ పప్పు తిని ఎరుగదు. ఏకాంతం లేదు. తిండి, నిద్ర లేదు. ఎలాంటి సుఖం లేదు.
రోడ్డుపక్కనే పక్క...
సుల్తాన్బజార్ ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కన ఉండే తారురోడ్డు.. పగలు వాహనాల పార్కింగుకి ఉపయోగపడితే, రాత్రిపూట పూసలమ్ముకుని బతికే హిరానీ(పేరు మార్చాను)లాంటి వాళ్లకి ఆవాసం. తమిళనాడు నుంచి వలసవచ్చిన దాదాపు ముప్ఫై కుటుంబాల వాళ్లు ఆ రోడ్డు మీద అటూఇటూ తువ్వాళ్లు పరుచుకుని వరుసగా నిద్రపోతారు. కొన్ని జంటలు టెంటుల్లాంటి దోమతెరలు కప్పుకుని కాలం గడుపుతారు. ఎవ్వరూ వంట చేసుకోరు. పగలు ప్రభుత్వం పెట్టే ఐదు రూపాయల భోజనం దొరికితే తింటారు. పూసలమ్ముకుని వచ్చి రాత్రి హౌటల్ నుంచి తెచ్చుకున్న మెతుకులు తింటారు. వానాకాలం తడిచి ముద్దవుతూ పక్కనే ఉన్న దుకాణాల షటర్లను ఆఉనుకుని కూర్చుంటారు. రాత్రంతా కంటికి కునుకు ఉండదు. మరుగుదొడ్డికి ఐదు రూపాయలు, స్నానానికి ఇరవై రూపాయలు, బట్టలు ఉతకాలంటే ముప్ఫై రూపాయలు, మంచినీళ్లకు మరో ఇరవై రూపాయలు... వారి మున్సిపాలిటీ కల్పించే వసతికోసం చెల్లించే మొత్తాలు. పండుగలకి, జాతర్లకు ఊరూరు తిరుగుతూ గడిపే ఈ సంచార జాతి... ఈ రోడ్డు మీదే కాలం గడుపుతుంది. పక్కనే ఉన్న ప్రసూతి ఆస్పత్రి వీరికి కాన్పులు చేస్తుంది. కానీ మరే ఇతర వైద్యం చేయదు. శ్రమని, దు:ఖాన్ని, నిస్సహాయతను మర్చిపోవడానికి ఆడామగా తాగుతారు. ఆ మత్తులో పరాయివాళ్లు ఎవరైనా మీద చేయివేస్తే మాత్రం సింగులైపోతారు. అందరూ కలిసి మూకుమ్మడిగా వాడిని కొట్టి తరిమేస్తారు.
గుడిమల్కాపూర్లో జీహెచ్ఎమ్సి కోసం పనిచేసే ఔట్సోర్సింగ్ కార్మికులు ఉంటారు. ఈ 150 కుటుంబాలు కలిసి మోటారుబండ్లతో చెత్తని సేకరించి తెస్తారు. అన్ని మతాలు, జాతులు కలిసిమెలిసి ఉండే ఈ ప్రాంతంలో వారికి తలదాచుకోవడానికి సరైన వసతులు లేవు. అక్కడ అపరిశుభ్రత, అనారోగ్యం, అభద్రత రాజ్యమేలుతున్నాయి. ''మనదీ ఒక బ్రతుకేనా? కుక్కలవలె నక్కలవలె! మనదీ ఒక బ్రతుకేనా? సందులలో పందులవలె!'' పౌరులుగా తమ హక్కులేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రతి నెల ఒక పీడకల...
మరెన్నో ప్రాంతాల్లో ఇలాంటి నిరాశ్రయులు, గూడులేని జీవులు అలమటించిపోతున్నారు. ఈ పరిస్థితి వల్ల ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు ఎన్నో అనారోగ్య సమస్యలతో సతమతమవు తున్నారు. స్త్రీలని ప్రతి నెలా ఒక పీడకల, నరకకూపం, ఒక యమయాతన వెంటాడుతుంటుంది. మరుగు ఉండదు. నీళ్లు ఉండవు. శుభ్రమైన బట్టలు కరువు. నాప్కిన్లు కొనుక్కోనే స్థోమత లేదు. దొరికిన మురికిగుడ్డ ముక్కలతో, పేపర్లతో కాలం వెళ్లదీస్తారు. గజ్జల్లో మంట, దురదల ఫంగల్ ఇన్ఫెక్షన్ వారిని వేధిస్తున్నది. అపరిశుభ్రతతో మూత్రం ఇన్ఫెక్షన్ పైకి ఎగ బాకుతుంది. దీర్ఘకాలిక వ్యాధులకు వారికి వైద్యం అందుబాటులో లేదు. క్షయ, ఉబ్బసం, రక్తహీనత, దగ్గు, అధికరక్తపోటు, మధుమేహం, మానని పుళ్లు, చర్మవ్యాధులు వారిని వేధిస్తున్నాయి. ప్రభుత్వ ఆరోగ్య సేవలు వారికి చేరవు. ఊరు, పేరు, చిరునామా అనే రేఖలు వారిని దూరం చేస్తాయి. మహిళలకు పిల్లలకు రక్షణ కరువు. ఆడమగ తేడా లేకుండా పిల్లలు అత్యాచారాలకి గురవుతుంటారు. అలా హెచ్ఐవీ సోకిన పిల్లవాడు ఇప్పుడు పెద్దవాడై ఢిల్లీలో రిక్షా తొక్కుతూ, ఈ నిరాశ్రయుల కథలను జనానికి వినిపిస్తున్నాడు. భార్యాభర్తలు కప్పుకున్న దోమతెరని చీల్చి మరీ.. మహిళలపై అత్యాచారం జరిపిన సంఘటనలు ఉన్నాయి.
రోడ్డుపక్కనే ప్రసవం...
ఈ నిరాశ్రయ మహిళలు గర్భం దాలిస్తే.. వారి ప్రసవం ఒక సమస్య. ప్రతి గర్భిణీకి కనీసం మూడుసార్లు వైద్య పరీక్షలు జరగాలి. కానీ వీరిని ప్రభుత్వాసుపత్రిలో రిజిస్టరు చేసుకోవడమే కష్టమవుతోంది. వారి నివాసానికి సంబంధించిన రుజువులు కావాలి. ఐడీ ప్రూఫులు ఉండాలి. ఎదురుగా కనిపిస్తున్న మనిషి, తాను బతికే ఉన్నానని చెప్పుకోవడం కంటే మరే రుజువు కావాలి? అసలు వైద్య సేవలకు రుజువెందుకు? జీవించే హక్కుకు హామీలెందుకు? తమ బాధ్యతని తగ్గించుకోవడం కోసం, కనీస అవసరాలను కల్పించడం నుంచి తప్పించుకోవడం కోసం ప్రభుత్వాలు ఈ కొత్త నియమాలను తయారు చేస్తున్నాయి. తలదాచుకునే నీడలేని ఈ నిరాశ్రయులకి ఇంటి నంబరు ఎక్కడిది? ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్లిపోయే ఈ వలస బతుకులకి, సంచార జీవితాలకు నిలకడ ఎక్కడిది? ఇలాంటివారి సంఖ్యని సేకరించి, ఎక్కడికి వెళ్లినా వారికి వైద్యం అందే సౌకర్యాన్ని ప్రభుత్వాలు ఎందుకు కల్పించడం లేదు? ఫ్లై ఓవర్ పిల్లరే చిరునామాగా, సుల్తాన్బజార్ గల్లీ తమ అడ్రసుగా, గుడిమల్కాపూర్ చెత్తకుప్పలే ఆవాసాలుగా, అత్తాపూర్ వీధులే ఇల్లుగా, డబీర్పురా సందుగొందులో నివాసంగా చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం గల వీరికి ప్రభుత్వం ఏ విధంగా సహాయపడుతుంది? పేదరికపు రేఖ కింద అట్టడుగున ఉన్న ఈ అసంఖ్యాకులకు బీపీఎల్ రాయితీలు ఎవరు కల్పిస్తారు? వైద్యానికి, ఆహారానికి కూడా ఆధార్కార్డుని పణంగా పెట్టి, వీరి ఉనికినే ప్రశ్నించడం ఎంత హేయం! శ్రీశ్రీ అడిగినట్టు ''ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిది?''
''గతి లేని మీకు పిల్లలెందుకే'' అంటూ...
ఈ మహిళలకు తొమ్మిదినెలల గర్భం కూడా తియ్యటి అనుభూతిని ఇవ్వలేదు. ''గతి లేని మీకు పిల్లలెందుకే'' అంటూ మహా మేధావులు, డాకర్లు, విధాన నిర్మాతలు, రాజకీయ నాయకులు వీరిని దులపరిస్తారు. సరైన ఆహారం, వైద్యం అందక వీరికి నెలలు నిండకముందే కాన్పులు అయిపోతుంటాయి. ఇతరుల కంటే వీరికి ఈ సమస్య మూడింతలు ఎక్కువగా ఉంటుంది. బరువు తక్కువ పిల్లలు పుట్టడం కూడా ఇతరుల కంటే ఏడింతలు ఎక్కువ. కాన్పు కష్టం కావడం, ప్రాణం మీదకు రావడం కూడా పరిపాటి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని కని, వారికి స్థిరమైన జీవితాన్ని ఇవ్వలేక తల్లులు సతమతమవుతుంటారు. బాలల సంరక్షణ దళాలు పిల్లలకి స్థిరమైన, మెరుగైన జీవితాన్ని అందించే నెపంతో వారిని తల్లుల నుంచి వేరు చేస్తుంటారు. ఆ భయానికి సుల్తాన్బజారు హిరాని లాంటి వారు తమ పిల్లల్ని తమ సొంత ఊరికి పంపేస్తూ ఉంటారు.
మరెన్నో రుగ్మతలు...
ఈ అనిశ్చితి, అభద్రత, ఆహారలోపం, జీవనపోరాటం, తగిన పనిలేకపోవడం, శ్రమకి తగ్గవేతనం లేకపోవడం, అనిద్ర, అనారోగ్యం, అన్నీ కలిసి స్త్రీలలో మానిసిక ఒత్తిడి పెరుగుతుంది. అ వేదనంతా, డిప్రెషన్కి, హిస్టీరియాకి, షిజోఫ్రీనియాకి దారితీస్తోంది. నిరాశ్రయతకి, మానసిక వ్యాధులకి దగ్గర సంబంధం వుంది.
చేయాల్సింది కొండంత...
ఈ నిస్సహాయతలనుంచి నిరాశ్రయులని రక్షించి, ముఖ్యంగా స్త్రీలని, పిల్లల్ని కాపాడాలంటే , సమాజం, ప్రభుత్వం చేయగలిగింది కొండంత వుంది. ఈ మహిళ నెలసరి ఆరోగ్యం కోసం వారికి శుభ్రమైన నాప్కిన్స్ అందించాలి. గర్భిణీస్త్రీలకి తగిన వైద్య సదుపాయాలు, అందించాలి. వారి పిల్లలకి విద్య, వైద్యం అందుబాటు లోకి రావాలి. గృహహింసని, ఇతర హింసలని ఎదుర్కొనే వీరికి ప్రభుత్వం చేయూతనివ్వాలి. నిరాశ్రయ మహిళలకై ప్రత్యేక షెల్టర్లని అందించాలి. మెరుగైన ఉపాది పొందే విధంగా వారికి శిక్షణ ఇవ్వాలి. విద్యని చేరువ చేయాలి. అంగన్వాడీలు వీరిని తమపథకాల్లో చేర్చుకోవాలి. కమ్యూనిటీ వంటిళ్ళు ద్వారా వీరి ఆహారపు అవసరాలని తీర్చాలి. మాదక ద్రవ్యాల విరుగుడు పథకాలను అమలు చేయాలి. గర్భనిరోధక సాధనాలని వారికి అందించాలి. దీర్ఘకాలిక వ్యాధులకి చికిత్స చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారికి ప్రత్యేక వార్డులు ఏర్పరచాలి. వ్యాధి నిరోధక పథకాల ద్వారా వారిని సంక్షించాలి.
సమాజంలో ఒక భాగానికి నివాసాలు లేకపోవడమనేది ఒక 'వైద్యపరమైన విపత్తు'గా గుర్తించాలి. ఎందుకంటే వీరికి వైద్య సదుపాయాలును కల్పించలేక పోవడం వల్ల నష్టపోయేది వీరు మాత్రమే కాదు. వీరు క్షయకి పూర్తిగా వైద్యం తీసుకోకపోతే క్షయ మొండిగా తయారవుతుంది. అసంపూర్ణ ట్రీట్మెంట్ వల్ల పాత మందులు పనిచేయక, 'మల్టీడ్రగ్ రిసిస్టెంట్ టి.బి' వ్యాపిస్తుంది. దీని వల్ల సాధారణ జనానికి కూడా ప్రాణహాని కలుగవచ్చు. అలానే వీరిలో కొందరికి సోకిన హెచ్ఐవి, ఎయిడ్స్, వీరిని లైంగికంగా వేధించే వారికి సోకి, అలాంటి కేసులు ప్రబలే ప్రమాదం ఉంది. అందుకే, ఇవాంక ట్రంప్లాంటి వారు వస్తే వీరిని పట్టణానికో మచ్చగా భావించి, ఊరి బయటకి తరలించే చర్యలు చేపట్టడం మాని, శాశ్వత పరిష్కారాన్ని సూచించాలి. అనారోగ్యం ఆశ్రయం లేక వచ్చిందా? వైద్యం అందక ముదిరిందా? ఈ అనిశ్చితి వల్ల వారి మానసిక సమతుల్యం దెబ్బతింటోందా? అని ఆలోచించి దానికి తగినట్టుగా నిరాశ్రయ నివారణ చర్యలను చేపట్టాలి. వారి ఆరోగ్య సమస్యలపై కేంద్రీక రించాలి. ఈ 'వ్యధార్త జీవిత యదార్థ దృశ్యాన్ని' మార్చడానికి కృషి చేస్తున్న 'అమన్ వేదిక లాంటి సంస్థలను ప్రోత్సహించాలి. ''మానవాళికి నిజంగానే మంచికాలం రహిస్తుందా...!''