Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సృష్టిలో ప్రతి జీవి అమ్మ కడుపు నుంచే ఈ భూమి మీదకు వస్తుంది. జీవకోటిలో సర్వసాధారణంగా సాగే ప్రత్యుత్పత్తి వ్యవస్థ మనుషుల్లో మాత్రం సహజానికి దూరంగా వెళుతోంది. తల్లి కడుపులో నవమాసాలు పెరిగిన పాపాయి ఈ ప్రపంచంలోకి రావాలంటే సిజేరియన్ ఒక్కటే మార్గం అన్న విధంగా నేటి ఆధునిక వైద్యరంగం విషవిలయంగా మారింది. ఈ అరాచక ఆపరేషన్ విధానాన్ని మారుస్తూ సహజప్రసవం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తూ.. ఇప్పటి వరకు దాదాపు వెయ్యికి పైగా సహజప్రసవాలు చేశారు సర్టిఫైడ్ ప్రొఫెషనల్ మిడ్ వైఫ్ డాక్టర్. విజయా క ష్ణన్. సహజ ప్రసవాన్ని ప్రోత్సహిస్తూ అనేక సెమినార్లు, వర్క్షాపులు నిర్వహిస్తున్నారు. డాక్యుమెంటరీల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. విదేశాల్లో సహజ ప్రసవం వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఎక్కువగా సిజేరియన్ ఆపరేషన్ల వైపు మొగ్గు చూపడం బాధాకరం అంటున్న ఆమెతో ముఖాముఖి...
పదేండ్లుగా మీరు సహజ ప్రసవాలపై ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని సహజ ప్రసవాలు చేశారు? నేటి తరం సిజేరియన్లవైపు మొగ్గు చూపడానికి కారణం ఏమిటీ?
ఈ పదేండ్లలో దాదాపు వెయ్యిమంది శిశువులు సహజ ప్రసవం ద్వారా జన్మించేలా అవగాహన కల్పించాం. ఇప్పుడు గర్భధారణ అనగానే ఫుల్ బెడ్ రెస్ట్ అంటూ మంచం దిగనీయడం లేదు. నిజానికి ప్రకృతిలో ఏ జీవి కూడా గర్భధారణను ప్రత్యేకంగా భావించి విశ్రాంతి తీసుకోదు. నాగరికత, ఆధునికత కలిసి మనిషిని ప్రకృతికి దూరం చేస్తున్నాయి. ముఖ్యంగా సహజంగా జరగాల్సిన ప్రసవాన్ని సర్జరీ వరకు తీసుకు వెళ్తున్నారు.
కోటాను కోట్ల జీవుల మాదిరిగానే మనుషుల్లోనూ బిడ్డకు సహజంగా జన్మనిచ్చేలా స్త్రీ శరీరనిర్మాణం ఉంటుంది. గర్భధారణ, శిశువు జననం సాధారణంగా, సహజంగా జరగాలి. అలా కాకుండా గర్భధారణ, ప్రసవం చాలా కష్టమైన అంశాలుగా చిత్రీకరిస్తున్నారు. సహజ ప్రసవంపై అనేక అపోహలు, భయాందో ళనలు ప్రజల్లో ప్రచారం చేస్తూ బిడ్డకు జన్మనివ్వాలంటే అమ్మ కడుపు కోయాల్సిందే అన్న విధంగా భయాందోళనలు కల్పిస్తున్నారు. కేవలం కొందరి ఆర్థిక ప్రయోజనాల కోసం తల్లిబిడ్డల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. పురుటి నొప్పుల కన్నా సర్జరీయే మేలని యువతలు భావిస్తున్నారు. కొందరు తమ లాభాల కోసం బిడ్డకు జన్మనిచ్చే సహజ ప్రక్రియను సంక్లిష్ట ప్రక్రియగా మార్చేశారు. నేటి పరిస్థితుల్లో పిల్లలను కనడం ఖరీదైన అంశంగా మారిపోయింది.
సహజ ప్రసవాలపై మీరు నేటి యువతలో ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
గత కొన్నెండ్లుగా సిజేరియన్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. మన అమ్మలు, అత్తమ్మలు గర్భధారణ సమయంలోనూ అన్ని పనులు చేసేవారు. తొమ్మిదినెలలు నిండినా పొద్దున్నంతా పని చేసి సాయంత్రానికి బిడ్డకు జన్మనిచ్చే వాళ్లు.. మరుసటిరోజు నుంచి యధావిధిగా మళ్లీ ఇంటి పనులన్నీ చేసేవారు. 'మా రోజుల్లో ఈ ఆపరేషన్లు లేవమ్మా' అంటూ పెద్దవాళ్లు అనడం మనమంతా వింటుంటాం. ఇప్పుడు కాబోయే అమ్మలు గర్భధారణ సమయంలో ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటున్నారు. విదేశాల్లో మాదిరిగానే కాబోయే తల్లిదండ్రులకు 'లామాస్' క్లాసులు నిర్వహిస్తాం. మేం మా వద్దకు వచ్చే యువతులకు తప్పనిసరిగా వారి భర్తను కూడా తీసుకురమ్మని చెబుతాం. ప్రసవ సమయంలోనూ భర్త ఆమెకు సపోర్టుగా ఉండేలా అవగాహన కల్పిస్తున్నాం. చాలామంది జంటలు క్రమం తప్పకుండా రావడంతో పాటు భార్యకు మనోధైర్యాన్ని ఇస్తున్నారు. సహజప్రసవం వల్ల బెనిఫిట్స్, రిస్క్ వారికి ముందే వివరిస్తున్నాం. చివరి నిమిషంలో ఏదైనా ప్రతికూల పరిస్థితి ఏర్పడి సర్జరీ అనివార్యమైతే అందుకు తగిన సదుపాయాలు కూడా మా వద్ద ఉన్నాయి.
సహజ ప్రసవాలపై ప్రచారం చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? విదేశాల్లో స్థిరపడిన మీరు ఇక్కడకు వచ్చిన తర్వాత నాచురల్ డెలివరీల హాస్పిటల్ ఏర్పాటుచేయడానికి కారణం?
తమిళనాడు కుంభకోణం మా సొంతఊరు. తాతముత్తాల నాడే అక్కడి నుంచి వచ్చాం. నేను పూణేలో పుట్టి పెరిగాను. అక్కడే ఫిజియోథెరపి కోర్సు పూర్తి చేశాను. పెండ్లి తర్వాత యుఎస్ వెళ్లాను. మా వారు కృష్ణన్ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేసేవారు. అక్కడ మిడ్వైఫ్ ట్రైనింగ్ చేశాను. మాకు పెద్దబాబు పుట్టినప్పుడు నా ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్గా మారింది. చివరికి సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండోబాబు విషయంలో ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నాను. దాంతో సహజప్రసవం జరిగింది. చాలామందికి మొదటిసారి ఆపరేషన్ అయితే రెండోసారి కూడా ఆపరేషన్ చేయాల్సిందే అన్న అపోహ ఉండేది. నేను అలాగే అనుకునేదాన్ని. అయితే అక్కడ డాక్టర్ ట్రీట్మెంట్, లామాస్ శిక్షణ వల్ల సహజ ప్రసవమైంది. ఆ తర్వాత లామస్ శిక్షణ తీసుకున్నాను. కాబోయే అమ్మ యోగా, తేలికపాటి వ్యాయామం, తీసుకోవల్సిన డైట్ వంటి అన్ని కలిపి లామస్ (చైల్డ్ బర్త్ స్పెషల్ ట్రైనింగ్) అని పిలుస్తారు. అమెరికాలో దాదాపు 15ఏండ్ల ఉన్నాం. ఆ తర్వాత తిరిగి మన దేశానికి వచ్చేశాం. ఇక్కడకు వచ్చిన తర్వాత లామాస్ క్లాసులు ప్రారంభించాను. మొదట్లో నాలుగైదు జంటలు వచ్చేవారు. ఆ తర్వాత సంఖ్య పెరిగింది. అయితే మా క్లాసులకు వచ్చేవారికి డెలివరీకి ఏ హస్పిటల్కు వెళ్లాలి అన్న సందేహం ఉండేది. నగరంలోని కొన్ని హాస్పిటల్స్ గురించి సెర్చ్ చేయగా జెజె హస్పిటల్లో డాక్టర్ జయంతిగారు సహజప్రసవాలను ప్రోత్సహిస్తున్నారని తెలిసింది. దాంతో మా క్లయింట్ల్ను జెజె హాస్పిటల్కు పంపేదాన్ని. అలా దాదాపు ఏడెండ్లు మా వద్దకు లామాస్ ట్రైనింగ్కు వచ్చేవారందరికీ సహజప్రసవం జరగడంతో పాటు తల్లీబిడ్డ చాలా యాక్టివ్గా ఉండేవారు. మౌత్పబ్లిసిటీ ద్వారా లామాస్కు వచ్చేవారి సంఖ్య పెరిగింది.
తల్లిబిడ్డల ఆరోగ్యంపై సహజ ప్రసవం, సిజెరియన్ అన్న ప్రభావం ఉంటుందా?
కచ్చితంగా ఉంటుంది. సహజంగా నెలలు నిండిన తర్వాత బిడ్డ తల్లి కడుపు నుంచి బయటకు రావడానికి శరీరం సన్నద్దం అవుతుంది. ప్రసవాన్ని ప్రేరేపించే హార్మోన్లు విడుదల అవుతాయి. ఈ హార్మోన్లు తల్లిబిడ్డల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ముహుర్తపు ఆపరేషన్లలో తల్లిబిడ్డల మధ్య సమన్వయం లోపిస్తుంది. ఇందుకు చిన్న ఉదాహారణ.. సహజ ప్రసవం జరిగిన తర్వాత ముర్రుపాలు చాలా తర్వాతగా వస్తాయి. అదే సిజెరియన్ల చేసినప్పుడు తల్లిలో ముర్రు పాలు త్వరగా రావు. దాంతో పాపాయికి పోతపాలు పడతారు. దాంతో అనేక ఇన్ఫెక్షన్లు తల్లి బిడ్డల శరీరాలపై దాడి చేస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అనారోగ్య సమస్యలకు సిజెరియన్ కారణం అవుతుంది. అందు కని సహజంగా ప్రసవం జరిగే ప్రక్రియని ప్రొత్సహించే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఈ చైతన్యం మహిళల్లో పెరగడం అవసరం. సహజ ప్రసవం తల్లిబిడ్డల ఆరోగ్యానికి ఉపయోగకరం.