Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరీ అర్ధరాత్రి కాకుండా రాత్రిపూట త్వరగా తినాలనీ... తక్కువ తినాలనీ వైద్యులు చెబుతుంటారు. ఇవే కాదు, రాత్రి భోజనం విషయంలో మరికొన్ని జాగ్రత్తలు పాటించాలి.
- కొందరు రాత్రి భోంచేశాక టీ, కాఫీలు తాగుతుంటారు. వాస్తవానికి భోజనానికి రెండు గంటలు ముందే వీటిని తాగడం మానేయాలి. భోజనానికి ముందూ, తరువాతా తాగడం అలవాటుగా మారితే క్రమంగా ఎసిడిటీ సమస్యకు దారితీస్తుంది. సాయంత్రం ఐదారు గంటల తరువాత వాటి జోలికి వెళ్లకపోవడం ఉత్తమం.
- రాత్రి భోజనం చేసిన వెంటనే పండ్లు తినడమూ సరికాదు. ఆ సమయంలో జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. ఒక్కోసారి పదార్థాలు అరగవు కూడా. భోం చేసిన గంట తరువాత తీసుకున్నా వాటివల్ల శరీరానికి కావల్సిన శక్తి అందదు.
- రాత్రిపూట ఎప్పుడైనా స్నానం చేశాకే అన్నం తినాలి. భోంచేశాక స్నానం చేయకూడదు. అలా చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు సన్నగిల్లుతుంది. అలానే నడవడం, వ్యాయామం వంటివీ ఎక్కువగా చేయకూడదు. ఇవన్నీ శరీరంలో వేడిని పెంచుతాయి. దాంతో నిద్ర సరిగా పట్టదు. అందుకే రాత్రి భోజనమయ్యాక పది, పదిహేను నిమిషాలు నడిస్తే మేలు.