Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనసులోని భావాలను చెప్పాలంటే మాటలు రావు. కానీ, కళాహృదయం ఉన్నవారి చేతిలోని కుంచె రంగురంగుల చిత్రాలతో భావోద్వేగాలకు వర్ణరూపం ఇస్తుంది. అలాంటి కళాకారుల్లో ఒకరు నారా విజయలక్ష్మి. శరీరంలోని అవయవాలన్నీ పనిచేస్తున్నా కాసింత కళాపోషణ లేకపోతే ఎంత ప్రయత్నించినా కళాకారులు కాలేరు. కళాభిరుచి ఉన్నవారికి శరీరంలో పనిచేసే అవయవం ఒకటున్నా వారిలోని ప్రతిభను ప్రదర్శించడానికి వేదికను ఇస్తుంది. ప్రతిభ ఉన్నవారికి ప్రోత్సాహం తోడైతే వైకల్యాన్ని జయించడంతో పాటు అందరి అభినందనలు అందుకుంటారు అనడానికి ఆమే నిదర్శనం. కేవలం ఎడమచేయి మాత్రమే ఆమె మనసు మాట వింటుంది. అద్భుతమైన చిత్రాలు వేస్తుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో మొదటిసారి తన చిత్రాలను ప్రదర్శిస్తున్న ఆమె పరిచయం..
సిద్ధిపేట జిల్లా ములుగు మండలం అన్నాసాగర్ మా సొంత ఊరు. నాన్న నర్సింహులు, అమ్మ ప్రమీల. ఊరూరు తిరిగి బట్టలు అమ్మడం నాన్న వృత్తి. మేం నలుగురు పిల్లలం. అన్నయ్య తర్వాత పుట్టిన అక్కయ్యకు, నా తర్వాత పుట్టిన తమ్ముడికి చూపు సరిగ్గా లేదు. అమ్మనాన్నది మేకరికం కావడంతో పిల్లలకు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయని, అందులో భాగంగానే అక్కకు, తమ్ముడికి చూపు మందగించిందని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు వారిద్దరికీ కంటిచూపు లేదు. నాకు చిన్నప్పుడు పోలియా సోకింది. బతకను అనుకున్నా రట. చివరికి శరీరమంతా చచ్చుబడిపోయి కేవలం ఎడమచేయి మాత్రమే పనిచేసే స్థితిలో బతికి బయటపడ్డాను. నలుగురు పిల్లల్లో ముగ్గురం అంగవైకల్యం ఉన్నవారిగా మిగిలాం. అమ్మనాన్న పెద్దవాళ్లు కావడంతో ఇప్పుడు మా ముగ్గురిని అన్నవదిన చూస్తున్నారు. ప్రస్తుతం మేడ్చెల్ జిల్లా శామిర్పేట్ మండలం తుర్కపల్లిలో ఉంటున్నాం.
డ్రాయింగ్ పోటీలో..
నా వైకల్యాన్ని అమ్మనాన్న ఏనాడు చిన్నచూపు చూడలేదు. ఎంతో సపోర్ట్గా నిలిచారు. బడికి పంపించడం కోసం నాన్న ప్రత్యేకంగా మూడుచక్రాల బండిని తయారు చేయించాడు. పదోతరగతి వరకు మా ఊరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే చదువుకున్నాను. అక్క, తమ్ముడు కూడా చూపు సమస్య లేనన్ని రోజులు బడికి వెళ్లి చదువుకున్నారు. రెండో తరగతి నుంచే బొమ్మలు వేయడంపై ఆసక్తి కలిగింది. స్కూల్లో జరిగే అన్ని డ్రాయింగ్ పోటీల్లో బహుమతులు గెలుచుకునేదాన్ని. ఆ తర్వాత గోరింటాకు డిజైన్స్ వేయడం నేర్చుకున్నాను. కొద్దిగా ఆదాయం కూడ రావడంతో పెయింటింగ్ను పక్కకు పెట్టి మెహిందీ డిజైన్స్పై శ్రద్ద పెట్టాను. పదోతరగతి తర్వాత ఇంటర్లో చేరుదామనుకున్నాను. అయితే మా హెడ్మాస్టర్ ప్రకాశ్ సార్ ' రోజు కాలేజీకి వెళ్లడం ఇబ్బంది కదా. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేయి. నీకు ఇష్టమైన పెయింటింగ్ను కంటిన్యూ చేయి' అంటూ ప్రోత్సహించారు.
యూట్యూబ్ సహాయంతో..
హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తూ పెయింటింగ్ ప్రాక్టిస్ చేసేదాన్ని. చక్రాల కుర్చీకే పరిమితమైనప్పటికీ నాటకరంగంలో విశేష ప్రతిభ కనబరిచి కేంద్రప్రభుత్వం నుంచి స్త్రీశక్తి అవార్డు అందుకున్న పద్మావతిగారి గురించి తెలిసింది. ఎంతో మంది తనలాంటి వారికి అండగా నిలిచిన ఆమెను స్ఫూర్తిగా తీసుకుని చిత్రకళలో రాణించాలనుకున్నాను. మొదట్లో నేను కలర్ పెన్సిల్స్తో బొమ్మలు వేసేదాన్ని. ఆ తర్వాత కాన్వస్పై రంగురంగుల చిత్రాలు వేయడం నేర్చుకున్నాను. ఈ సమయంలో నాకు యూ ట్యూబ్ చానల్ ఎంతో ఉపయోగపడింది. చాలా టెక్నిక్స్ తెలుసుకునే అవకాశం కలిగింది. ఆ తర్వాత నేను ఒక యూట్యూబ్ పేజీ స్టార్ట్ చేసి బొమ్మలు గీసే వీడియోలు అప్లోడ్ చేశాను. ఆ తర్వాత మంచి స్పందన వచ్చింది. దాదాపు రెండు వందల వీడియోలు అప్లోడ్ చేశాను. ఆర్టిస్ట్గా గుర్తింపుతో పాటు నలుగురికి నా పెయింటింగ్స్ పరిచయం అయ్యాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు అవార్డులతో సత్కరించాయి.
పెయింటింగ్స్ చూసి..
రవీంద్రభారతిలో స్ఫూర్తి అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా నా పెయింటింగ్స్ కొన్ని అక్కడ ప్రదర్శించాను. ప్రోగ్రామ్కు వచ్చిన వారంతా ఎంతో మెచ్చుకున్నారు. కేవలం ఎడమచేయితోనే నేను ఈ పెయింటింగ్స్ అన్నీ వేశాను. ఈ ప్రోగ్రామ్కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన భాష సాంస్కృతి శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణగారు నా పెయింటింగ్స్ చూసి అభినందించడంతో పాటు ప్రదర్శన ఏర్పాటు చేయమని సూచించారు. ఆయన ప్రోత్సహంతో ఇప్పటి వరకు నేను వేసిన వాటిలో దాదాపు 80చిత్రాలతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఐదు రోజుల పాటు ప్రదర్శన నిర్వహిస్తున్నాను.
భావోద్వేగాలకు...
నేను వేసిన వాటిలో ఎక్కువగా మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే చిత్రాలు ఉన్నాయి. స్వాతంత్య్ర ఘట్టాలు, భారత సైన్య ధైర్యసాహసాలు, మహిళా సమస్యలకు దర్పణం పట్టే పెయింటింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు భావోద్వేగాలను రంగుల్లో చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పటివరకు ఎక్కడ ప్రదర్శనలు ఇవ్వలేదు. మొదటి ప్రదర్శన రాష్ట్ర అవతరణదినోత్సవం సందర్భంగా నిర్వహించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. అవకాశాలు వస్తే ఇకపై సోలో, గ్రూప్ ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాను.
కుటుంబసభ్యుల ప్రోత్సాహంతోనే..
ఇంట్లో ఎవరైనా వైకల్యం ఉన్న పిల్లలు ఉంటే వారి పై సానుభూతి చూపిస్తారు. కానీ, మా అమ్మనాన్న మాకు ఆత్మవిశ్వాసంతో బతకడం నేర్పించారు. అక్క, తమ్ముడు సొంతంగా పిండిగిర్ని నడిపిస్తున్నారు. నా పనులన్నీ నేనే స్వయంగా చేసుకుంటాను. అమ్మనాన్న, అన్నవదిన ఎంతో మద్దతునిస్తారు. అయితే పెయింటింగ్ అనేది ఖరీదైన కళగా మారిపోయింది. అందుకే ఆర్థికంగా అన్నయ్యకు భారం కాకుండా ఈ ప్రదర్శనలో చిత్రాలు అమ్మాలనుకుంటున్నాను. నాలాంటి పిల్లలకు అండగా ఉంటూ ఆసక్తి ఉన్నవారికి పెయింటింగ్ నేర్పించాలన్న ఆలోచన ఉంది. .