Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్గంతో సంబంధం లేకుండా... మహిళలందరి కథలు దాదాపు ఒక్కచోటే మొదలవుతాయి. వాటిని మలుపుతిప్పుకోవడంపైనే వాళ్ల జీవితం ఆధారపడి ఉంటుంది. అక్షరాన్ని ఆయుధంగా మలుచుకుని ముందుకు సాగినవాళ్లెప్పుడూ... మరికొందరికి కొనసాగింపుగా మారతారు. అందుకు ఉదాహరణ పాలడుగు సరోజినిదేవి. నల్లగొండ జిల్లా విద్యాశాఖాధికారి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఉపాధ్యాయుడైన తండ్రిని చూస్తూ పెరిగింది. కళలపట్ల ఆసక్తిని పెంచుకుంది. ఆయన మరణం తరువాత... తండ్రిబాటలో నడిచి తనతోవ నిండా వెలుగులు నింపుకొంది. నిరాడంబరమైన జీవితం.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం. అధికారినిగానే కాక... మంచి గాయనిగా పేరుతెచ్చుకున్న స్ఫూర్తిమంతమైన జీవితం గురించి ఆమె మాటల్లోనే...
''మా స్వస్థలం సూర్యాపేట జిల్లా కుడకుడ గ్రామం. నాన్న పాలడుగు నాగయ్య, అమ్మ జ్ఞానమ్మ. నాకు ముగ్గురు తమ్ముళ్లు, ఒక చెల్లె.నాన్న దోమల్గూడా మార్కెట్ స్కూల్లో ఎస్జీటీ టీచర్ ఉద్యోగం హైదరాబాద్లో రావడంతో నేను పసిపాపగా ఉన్నప్పుడే హైదరాబాద్కు మారిపోయాం. హైదర్గూడా ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుకున్నా. తరువాత ఇంటర్ శ్రీ రామభద్ర కాలేజీలో చేశాను. డిగ్రీ, ఎమ్మే ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఈడీ చేశాను. నా ఇంటర్ అయిపోగానే... జాండిస్ వచ్చి నాన్న ఆరోగ్యం పాడయ్యింది. కొన్ని రోజులకు నాన్న మరణిం చారు. అప్పటిదాకా అన్నీ నాన్నే. అలాంటిది ఆయన మరణంతో ఒక్కసారిగా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఇంటర్ సెకండియర్లో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. దీంతో కుటుంబబాధ్యతలన్నీ అమ్మ, నేనే తీసుకోవాల్సి వచ్చింది. అమ్మ మిషన్ కుట్టేది. నేను ట్యూషన్ చెబుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాం.
జూనియర్ అసిస్టెంట్నుంచి...
నాన్నకు నేను ఉన్నత చదువులు చదవాలన్న కోరిక ఉండేది. ఆ కోరిక మేరకే నేను కష్టపడి చదివాను. నాన్నగారు చనిపోయాక ఆయన జాబ్ వచ్చింది. 1984 నుంచి డిగ్రీ అయిపోయిన వాళ్లకే జూనియర్ అసిస్టెంట్ ఇచ్చారు. ఒక సంవత్సరం ముందు... నాకు ఇంటర్ బేస్డ్తో 1983లో చాదర్ఘట్ హాజంపూర్ పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం. తరువాత అనేక బదిలీలు. మెదక్ జోగులాంబలో ఇన్చార్జి డీఈఓగా, బాలభవన్లో ఏడీగా పనిచేశాను. ప్రస్తుతం నల్లగొండ డీఈఓగా పని చేస్తున్నా. నాన్న సొంత జిల్లా. నేను పుట్టిన జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా. కాబట్టి నా జిల్లా కోసం ఏదైనా చేయాలనుకుంటున్న. నన్ను కూడా నా జాయినింగ్ దగ్గరనుంచి ఇప్పటివరకూ జిల్లాలో అందరూ సహకరిస్తున్నారు. ఇప్పుడే కాదు.. మొదటినుంచి కూడా నేను ఎప్పుడూ వివక్షను ఎదుర్కోలేదు. నా ముందు ఎవ్వరూ ఏమీ అనలేదు. నా వెనకాల ఏం అనుకునేవారో తెలియదు. అవేవీ నేను పుట్టించుకోకపోయేది. పని విషయంలో ఎప్పుడూ వెనక్కి పోను కాబట్టి... మహిళ అన్న వివక్ష కూడా లేదు. అత్యవసరం అయితే తప్ప సెలవులు కూడా పెట్టకపోయేది. ఇప్పటికీ అంతే. నేను వచ్చినప్పుడు రిజల్ట్ తక్కువగా ఉంది. ఈ ఏడాది పెరిగింది. ప్రభుత్వం బాలికల విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నది. దాన్ని వినియోగించుకోవాలి. పిల్లలను చదువుతోపాటు మిగిలిన కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్లో కూడా భాగస్వాములను చేయాలి. దానికోసం కూడా కృషి చేస్తున్నాం.
ఆదర్శ వివాహం...
బి.రత్నం... ప్రముఖ కళాకారుడు. నాన్నగారి స్నేహితుడు. కళల్లో నాకు ఉన్న ఆసక్తి చూసి... నన్ను బాగా చూసుకునేవారు. బుక్రథల్లో మరింత శిక్షణ నిచ్చారు. నాన్న చనిపోయాక నా మంచి చెడ్డా ఆయనే చూసుకున్నారు. నాతోపాటు బుర్రకథలు చెప్పిన.. గద్ద నర్సింగ్రావుతో 1984లో ఆదర్శ వివాహం చేశారు. ఆయన ప్రస్తుతం కమర్షియల్ టాక్స్ ఆఫీసర్గా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. మాకు ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. ప్రస్తుతం వారంతా ఉన్నతస్థాయిలో స్థిరపడ్డారు. మా వారు అంతకుముందు ప్రయివేటు ఉద్యోగం చేసేవారు. ఆ కంపెనీ మూసేసినప్పుడు ఉద్యోగులందరూ పోరాటం చేశారు. దాంతో మావారికి కమర్షియల్ టాక్స్లో సీనియర్ అసిస్టెంట్గా చేరారు. మా పెండ్లి తరువాతనే వాళ్ల తమ్ముళ్లు, చెల్లెళ్ల పెండ్లిళ్లు చేశాం. మా చెల్లి, తమ్ముళ్ల పెండ్లిళ్లు చేశాం. నా చదువు విషయంలో ఆయన ఎంతో ప్రోత్సహించారు. పెండ్లి తరువాత డిగ్రీ, బీఎడ్, ఎమ్మే చేశాను. నాకు అవసరం అనిపించినప్పుడల్లా... తను వెన్నుదన్నుగా నిలబడ్డారు.
నాన్నతో కళాసక్తి...
నాన్న టీచర్ అయినా... కవితలు, బుర్రకథలు, నాటకాలపైనే ఆసక్తి ఎక్కువగా చూపించేవారు. దాంతో నాకు ఆసక్తి ఏర్పడింది. అప్పట్లోనే అంబేద్కర్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి బుర్రకథలు రాశారు నాన్న. నాన్న ఏదైనా పాట రాసి... ట్యూన్చేసి నాకే వినిపించేవారు. గుర్తు పెట్టుకుని..మళ్లీ నాన్న అడిగినప్పుడు పాడి వినిపించేదాన్ని. నాన్నతో పాటు నేను కూడా బుర్రకథలు, జానపదగేయాలు నేర్చుకున్నా. 1972లో మొట్ట మొదటిసారి రవీం ద్రభారతిలో అంబేద్కర్ బుర్రకథను ప్రదర్శించాం. కోరస్ నుంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, మేకప్ వరకు మొత్తం కుటుంబ సభ్యులే. కుటుంబమంతా కళాకారులే. పాటలు రాయడం, జానపదాలను సేకరించడం, బుర్రకథలు, ఏకపాత్రాభినయాలు చేసేదాన్ని. దూరదర్శన్లో సాంస్కృతిక ప్రదర్శనలిచ్చాను. విజయవాడ, హైదరాబాద్ రేడియోస్టేషన్లలో యాభైకి పైగా ప్రోగ్రామ్స్ చేశాను. దేశభక్తి గేయాలు, జాతీయగీతాలు, మా నాన్నగారు రాసిన పాలడుగు పదాలు, పల్లె జానపదాలు, భక్తి జానపదాలు కంఠతా వచ్చేవి. వాటిలో కొన్నింటికి నేనే స్వరకల్పన చేశాను. తరువాత ప్రభుత్వం... బాల్యవివాహాలు, మూఢ నమ్మకాల నిర్మూలన, మద్యపాన నిషేధం వంటివాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రచారం చేపట్టింది. కళాకారురాలిగా అందులోనూ భాగస్వామినయ్యా. అయితే అవన్నీ కూడా నాన్నను, అమ్మను చూస్తూ వాళ్ల నుంచి నేర్చుకున్నవే. ఏదైనా నైపుణ్యం సాధించా లంటే గురువు దగ్గర నేర్చుకోవాల్సిందే. అందుకే త్యాగరాయ సంగీత కళాశాలలో చేరాను. ఓ ఏడాది నేర్చుకున్నానో లేదో... నాన్న మరణంతో ఆపేశాను. 2010 వరకు ప్రతి ఏడు బోనాల పండుగకు ఒక పాటల సీడీనీ తీసుకొచ్చేవాళ్లం. తరు వాత ఉద్యోగ బాధ్యతల్లో బిజీకావడంతో.. మానేశాను. ఇప్పుడు నాన్న రాసిన అనేక జానపదాలు, బుర్రకథల పుస్తకాలు దొరికాయి. వాటన్నింటినీ పుస్తకంగా తీసుకురా వాలను కుంటున్నా. అలాగే ఆయన జ్ఞాపకంగా మిగిలిన బుర్రకథ లకు తిరిగి ప్రదర్శింపజేయాలి''
పరస్పర సహకారం అవసరం...
సమాజంలో నేటికీ మారుమూల ప్రాంతాల ప్రజలకు విద్యపై అంతగా అవగాహన లేకపోవడంతో నిరక్షరాస్యులుగానే మిగిలిపోతున్నారు. ప్రతి ఒక్కరికీ విద్య అందేలా కృషి చేయాలనుకుంటున్నా. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు వెళ్లినప్పుడు పిల్లలతో మాట్లాడేదాన్ని. విద్య ద్వారానే వారి సమస్యలు తీరడంతో పాటు వారి జీవితాల్లో మార్పు సాధ్యమౌతుందన్న విషయం ప్రతి విద్యార్థికీ చెప్పేదాన్ని సమాజంలో మహిళలు ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నా ఇంకా వారిపై దాడులు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. వాటిని అరికట్టాలంటే మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగాలి. మహిళలకు సంబంధించి విద్యా, ఆరోగ్యం సాహిత్యం తదితర రంగాల్లో మార్పులు రావాలి. సమస్యలపై సదస్సులు నిర్వహించి వారిలో చైతన్యం కల్పించాలి. వ్యక్తిత్వ వికాసం కొరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. మహిళలను దేవతలుగా ఆరాధించాల్సిన అవసరం లేదు. మనుష్యులుగా గుర్తిస్తే చాలు. చదువుకోవాలన్న వారి ఆలోచన గౌరవిస్తే చాలు. వారి ప్రగతికి వారే బాటలు వేసుకుంటారు. మహిళలు పరస్పర సహకారం, గౌరవం అందించుకోవాలి.