Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మమత మనస్సంతా దిగులుగా ఉంది. ఇంటి కోసం పదేండ్ల నుంచి తాను పడిన కష్టమంతా వృధానే. పైసాపైసా కూడబెట్టి, తన కోసం ఏమీ దాచుకోకుండా అంతా నా కుటుంబమే అని జీతం మొత్తం ఇంటికోసమే ఖర్చు చేస్తే ఈ రోజు నా కష్టానికి, జీతానికి లెక్కలేకుండా పోయింది. ఈ రోజు మాటమాట పెరిగి భర్త మనసులోని మాట బయటపడింది. ఆయన నోటివెంట వచ్చిన మాటలతో జీవితసత్యం తెలుసుకుంది. తనకు న్యాయం జరగాలంటే ఐద్వా అదాలత్కు వెళ్ళాల్సిందే..! అనుకుంటూ అడుగు ముందుకు వేసింది.
మమత ఇంటర్ వరకు చదివింది. తలిదండ్రి ఇద్దరూ దుబారులో ఉంటారు. తమ్ముడు కువైట్లో ఉద్యోగం చేస్తాడు. డిగ్రీ చదివి బ్యాంకులో పనిచేసే మనోహర్తో మమత పెండ్లి చేశారు. కట్నంగా ఇచ్చిన డబ్బంతా పెండ్లి ఖర్చులకే అయిపోయిందని మమతకు పెండ్లిలో రెండు తులాల బంగారం మాత్రమే పెట్టారు అత్తింటివాళ్లు. పెండ్లి తర్వాత మమతకు అత్తింటి ఆర్థిక పరిస్థితి అర్థమైంది. ఆయన ఉద్యోగం మీదనే ఆధారపడాలి. పొదుపుగా ఇంటిని నెట్టుకు వచ్చేది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఖర్చు పెరిగిపోయింది.
భర్తకు సహాయంగా..
అత్తమామ ఊళ్లో ఉండే వ్యవసాయం చూసుకో వడానికి వెళ్ళిపోయారు. భర్త ఆఫీస్కు, పిల్లలు బడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమీ తోచేది కాదు. అంతేకాక రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులకు భర్త జీతం సరిపోయేది కాదు. దాంతో భర్తకు సహాయంగా ఉండేలా మమత కూడా ఉద్యోగంలో చేరింది. ప్రైవేటు స్కూల్ల్లో క్లర్క్గా చేరింది. అక్కడ పొద్దున్నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పనిచేసేది. ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లలను చదివిస్తూ.. ట్యూషన్లు చెప్పేది. అలా కష్టపడి నెలకు పదివేలకు పైగా సంపాదించేది.
ఇంట్లోని అవసరాలకు భర్తను అడగకుండా ఆమే ఖర్చు చేసేది. మెల్లమెల్లగా మనోహర్ ఇంటి ఖర్చు గురించి పట్టించుకోవడం మానేశాడు.
వీకెండ్ టూర్స్...
మనోహర్కు ఏ చెడు అలవాట్లు లేవు. అయితే స్నేహితులతో కలిసి నెలలో రెండుసార్లు అయినా వీకెండ్ టూర్స్ వెళ్లేవాడు. భార్యపిల్లలతో కన్నా స్నేహితులతో కలిసి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు. మమత కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పేది కాదు. స్కూలు, ట్యూషన్లు వదిలి ఎక్కడికి వెళ్ళేది కాదు. పిల్లల కోసం ఎక్కడికైనా వెళ్దామని అడిగితే ' నీ దగ్గర డబ్బులు ఉంటే చెప్పు వెళ్దాం' అనేవాడు. దాంతో సినిమాకు వెళ్లాలన్నా, బయటకు ఎక్కడికైనా వెళ్ళాలన్న మమతే ఖర్చులన్నీ భరించేది.
జీతమంతా..
మమత జీతమంతా ఇంటికే ఖర్చు అయ్యేది. నెలాఖరు వస్తే చేతిలో పదిరూపాయలు కూడా ఉండేవి కాదు. మనోహార్ను అడిగితే 'నీ జీతమంతా ఏం చేశావు? అప్పుడే అయ్యిపోయిందా' అనేవాడు. ఇంట్లో సరుకులు, రోజు పాలు, కూరగాయలు అన్నీ మమత జీతం నుంచే. ఇంటి కిరాయి, పిల్లల ఫీజులు మాత్రమే మనోహర్ కట్టేవాడు. అంతకు మించి ఒక రూపాయి ఇచ్చేవాడు కాదు. ఎవరి డబ్బులు అయినా ఇంటికోసమే కదా అనుకునేది మమత.
సొంత ఇంటికోసం..
మనోహర్ ఒకొక్క సారి ఇంటికిరాయి కట్టేవాడు కాదు. జీతం ఏం చేశావు అని మమత అడిగితే ఆ రోజు చావబాదేవాడు. నా జీతం అడగడానికి నువేవ్వరూ అంటూ పిల్లల ముందే గొడవ పెట్టుకున్నాడు. దాంతో మమత మౌనంగా ఉండేది. తాను పొదుపుగా దాచిన డబ్బులే కిరాయి కట్టేది. సొంత ఇల్లు ఉంటే కిరాయి బాధ తప్పుతుందన్న ఆలోచన వచ్చింది. భర్త పనిచేసేది బ్యాంక్లోనే కాబట్టి సులభంగా ఇంటికి లోను వస్తుందని సొంతిల్లు తీసుకుందామని భర్తకు చెప్పింది. మొదట్లో లోను కట్టడం సాధ్యం కాదన్నాడు.' ఇంటి ఖర్చు నేను చూసుకుంటాను. మీరు లోన్ మాత్రం కట్టండి' అంది. తల్లిదండ్రులు కూడా సొంతిల్లు తీసుకోమని మనోహర్పై ఒత్తిడి తీసుకువచ్చారు. దాంతో సరే అన్నాడు. ఆ తర్వాత స్నేహితులంతా కలిసి ఒక చోటనే ఇండ్లు తీసుకోవాలనుకున్నారు. కొద్ది రోజులు వెతికిన తర్వాత మంచిలోకేషన్లో ఇల్లు దొరికింది. అయితే ఇంటిని తీసుకోవడానికి కావల్సిన మొత్తం లోనుగా రావడం లేదు. ఒకవేళ లోన్ తీసుకున్నా జీతంలో ఎక్కువ కటింగ్ అవుతుందన్న ఆలోచనలో ఉండగా మమత తన బంగారం అమ్మేస్తాను అని, కొద్దికొద్దిగా పొదుపు చేస్తూ, చిట్టీలు వేసి జమ చేసిన ఐదు లక్షల రూపాయలు తనలో ఉన్నాయని చెప్పింది. దాంతో ఇల్లు తీసుకునే ప్రక్రియను ప్రారంభించాడు మనోహర్.
అసలు గొడవ అక్కడే ....
అడ్వాన్సు కట్టడం, మనోహర్ లోనుకు అప్లై చేయడం చకాచకా జరిగిపోయాయి. బ్యాంకు ఉద్యోగి కాబట్టి కాస్త త్వరగానే లోన్ వచ్చింది. మమతకు పుట్టింటి వాళ్లు పెట్టిన, పెండ్లిలో అత్తింటివాళ్లు పెట్టిన బంగారం అమ్మితే మరో ఐదు లక్షలు వచ్చాయి. పది లక్షల రూపాయలు నగదు ఇచ్చి, లోను తీరేవరకు నెలనెలా ఇంటి బాధ్యత అన్నీ మమతే చూసుకుంటాను అని చెప్పడంతో మొత్తానికి మనోహర్, మమత సొంత ఇల్లు కొనుక్కున్నారు. రిజిస్ట్రేషన్ అప్పుడే అసలు గొడవ మొదలైంది. ఇల్లు ఇద్దరి పేరుతో రిజిష్ట్రేషన్ చేయించ మని మమత అమ్మనాన్న, తమ్ముడు చెప్పారు. లోన్ తన పేరుతో ఉంది కాబట్టి తన పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తానని మనోహర్ పట్టుపట్టాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. ' అప్పు చేసి మరీ ఇల్లు కొంటున్నాను. ప్రతి నెలా కట్టాల్సింది నేను. ఇది నా ఆస్తి. నా పేరుతోనే ఉండాలి' అన్నాడు మనోహర్. 'నా ఆస్తి' అన్న పదం మమతకు వాస్తవం తెలిసేలా చేసింది. 'నేను ఇంటికోసం పది లక్షలు ఇవ్వడంతో పాటు నా జీతమంతా ఇంటికే ఖర్చు చేస్తాను అన్న తర్వాత నువ్వు సొంతిల్లు తీసుకుంటున్నావు' అందుకని నా పేరు కచ్ఛితంగా ఉండాలి' అంది మమత. మరో పదేండ్ల తర్వాత ఏ పని చేయడానికి శక్తిలేని రోజు నా పరిస్థితి ఏంటీ? ఏమైనా సరే ఇంటిని ఇద్దరి పేరుమీద రాయించాలి' అంటూ పట్టుపట్టింది.
'ఎక్కడ ఉందే నీ ఇల్లు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో' అంటూ ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. సరాసరి ఐద్వాకు వచ్చి ఆమె సమస్యనంతా చెప్పింది. మనోహర్కు ఫోన్ చేయడంతో భార్య పోలీస్స్టేషన్లో కంప్లెయింట్ ఇస్తే ఉద్యోగం ఎక్కడ పోతుందో అన్న భయంతో గంటలో వచ్చాడు మనోహర్. 'లోన్ నా పేరు మీద వస్తుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ నా పేరుమీద చేయిద్దాం అనుకున్నాను' అన్నాడు నెమ్మదిగా.
'ఇల్లు కొనడంతో మీ కన్నా ఎక్కువగా ఆమె కష్టపడుతుంది. మీకు పది లక్షలు ఇవ్వడంతో పాటు ఇంటి బాధ్యత అంతా తానే తీసుకుంటాను అంటుంది. మీరు ఇంటిని 'నా ఆస్తి' అంటున్నారు. ఆమె 'మన కోసం సొంత ఇల్లు' అనుకుంటూ పిల్లల గురించి ఆలోచిస్తుంది. ఆమె సంపాదన పూర్తిగా ఇంటికే ఖర్చు చేస్తుంది. మీరు ఇంటి ఖర్చులకన్నా మీ జల్సాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. స్నేహితులతో వెళ్ళినప్పుడు ఖర్చు చేసే మీరు భార్య, పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు ఆమెతో ఎందుకు ఖర్చు చేయిస్తున్నారు? ఇది చిన్న విషయమే కావచ్చు. కానీ, మీ మనస్తత్వాన్ని తెలియచేస్తుంది. నేను, నాదీ అని కాకుండా మనం, మనది అన్న విధంగా ఆలోచించండి. ఇల్లు మీ ఇద్దరి పేర్ల మీద రిజిష్ట్రర్ చేయించండి' అన్నారు బాధ్యులు. 'అది ఎలా వీలైతుంది. నా జీతం నుంచి కదా కట్ అవుతుంది. అప్పుడు ఇల్లు నా పేరు మీదనే కదా ఉండాలి. నా తర్వాత ఇల్లు పిల్లలకు చెందుతుంది' అన్నాడు మనోహర్. ' నెలానెలా లోన్ అకౌంట్ కట్టే మీరే ఇల్లు నాదీ అంటే.. ఇల్లు కొనడానికి పదిలక్షల రూపాయలు ఇచ్చి, ప్రతినెలా ఇంటి ఖర్చంతా భరించే నీ భార్యకు ఇంటిపై హక్కు లేదా' అన్నారు బాధ్యులు. 'నా పేరుతో ఉంటే ఆమె పేరుతో ఉన్నట్టే కదా! ఆడవాళ్ల పేర్లమీద ఆస్తులు ఎందుకు' అంటూ వాదించాడు మనోహర్. ' ఆడవాళ్ల సంపాదన కావాలి, వాళ్లు ఇంటి పనులన్నీ చేసి, ఉద్యోగం చేసి, ట్యూషన్లు చెప్పి అదనంగా సంపాదించాలి. కానీ, ఆస్తి మాటకు వచ్చేవరకు 'ఆడవాళ్లకు ఆస్తి ఎందుకు' అంటున్నారు. సరే ఆమె డబ్బులు ఆమెకు ఇవ్వండి. ఇంటి ఖర్చంతా మీరే భరించండి. ఆమె జీతం ఒక్క రూపాయి కూడా ఇంట్లోకి ఇవ్వదు. ఆ తర్వాత మీరు ఏదైనా ఆస్తి మీ సంపాదనతో కొంటే మీ పేరుతోనే రిజిష్ట్రర్ చేయించుకోండి. సరేనా?' అన్నారు బాధ్యులు. 'అది ఎలా అవుతుంది మేడమ్! నాకు వచ్చే జీతం ఇంటికే సరిపోతే.. ఇక లోన్ ఏం కడతాను?' అన్నాడు మనోహర్. 'అయితే ఇద్దరిపేర్లతో రిజిష్ట్రేన్ చేయించు. అప్పుడు ఆమె నీ బాధ్యతను కూడా పంచుకుంటుంది. ఆడవాళ్లకు ఆర్థిక స్వేచ్ఛను ఇచ్చింది. వాళ్ల మీద ప్రేమతో కాదు. మీ అసమర్థత దాచుకోవడానికి. కుటుంబ అవసరాలకు సరిపోయే సంపాదన మీకే వస్తే ఇక మమత ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? మగవారి జీతంలో ఇంటికి ఎంత వస్తుందో చెప్పలేం. కానీ, ఆడవారి జీతం మాత్రం నూటికి 90శాతం ఇంటికే ఖర్చు చేస్తారు అని స్పష్టం చెప్పవచ్చు. నువ్వు ఈ విషయం గుర్తుంచుకో. ఇల్లు ఇద్దరి పేరుతో ఉంటేనే ఆమె కష్టానికి గుర్తింపు' అన్నారు బాధ్యులు.
'క్షమించండి మేడమ్! నేను చదువుకున్న వాడినైనా మగవాడినన్న ఈగోతో మాట్లాడాను. మీరు చెప్పింది నిజమే. మమత ప్రతి పైసా ఇంటికోసమే ఖర్చు చేసింది. నా ఆలోచన తప్పని మీ మాటలతో అర్థమైంది. నేనే కాదు మా స్నేహితులకు కూడా వారివారి భార్యల పేర్లు చేర్చమని చెబుతాను' అన్నాడు మనోహర్. 'ఆడవారికి ఆర్థిక స్వేచ్ఛను ఇవ్వడం అంటే వారికి ఉద్యోగాలకు పంపడం కాదు. వారి జీతం నుంచి ఒక పైసా తీసుకోకపోవడం. వారికి ఆస్తిహక్కు ఉండటమే నిజమైన ఆర్థిక స్వేచ్ఛ' అన్నారు బాధ్యులు.
'మీరు మా గృహప్రవేశానికి తప్పక రావాలి మేడమ్ అన్నాడు మనోహర్. 'నా సమస్యనే కాదు మేడమ్. నాలాంటి ఎంతో మంది సమస్యను మీరు పరిష్కరించారు. చాలా థ్యాంక్స్' అంటూ మమత, మనోహర్ ఇంటిదారి పట్టారు.