Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజస్థాన్లోని ఝున్ఝును జిల్లా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఆ జిల్లాకు కలెక్టర్గిరీ చేయడానికి పురుష ఐఏఎస్ అధికారులే భయపడ్తుంటే మహిళా ఐఏఎస్లు చార్జ్ తీసుకోవడం ఊహించలేని విషయం. కాని ఆ సవాల్ను స్వీకరించారు ముగ్ధా సిన్హా. ఝున్ఝునుకు వచ్చిన మొదటి మహిళా కలెక్టర్గానే కాదు.. ఆ జిల్లాను ఓ దారిలో పెట్టిన ఐఏఎస్గానూ చరిత్రలో నిలిచారు.
ముగ్ధా తండ్రి గురు స్వరూప్ సిన్హా. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పైలట్గా పనిచేసేవారు. చైనాతో, ఆ తర్వాత 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. 1978లో విధినిర్వహణలో ఉండగానే... విమాన ప్రమాదంలో మరణించారు. అప్పటికి ముగ్ధ వయసు నాలుగేళ్లు. ఇద్దరు చెల్లెళ్లు. తల్లి కమలా సిన్హా పిల్లల్ని పెంచి పెద్దచేసింది. సమాజాన్ని సంస్కరించడం కోసం ముగ్ధాకు ఐఏఎస్ కావాలని కలలుగన్నది తల్లి. భర్త చనిపోయాక పిల్లలను తీసుకుని ఆగ్రా వెళ్లిపోయారు కమల. పాఠశాల విద్యను అక్కడే పూర్తి చేశారు ముగ్ధ. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్లో హిస్టరీ హానర్స్ చదివారు. కాలేజ్ ఫస్ట్. యూనివర్సిటీలో థర్డ్ ర్యాంకర్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎమ్మే చేశారు. సెకండ్ అటెంప్ట్లో ఐఏఎస్ సాధించారు. సివిల్స్లో ఆమెది ఆల్ ఇండియా ఎనిమిదో ర్యాంక్. జైపూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా ముగ్ధానే. రెండేళ్లు సీఎమ్ (రాజస్థాన్) ఆఫీస్లోనూ పని చేశారు. జిల్లా కలెక్టర్గా 2005లో మొదటి అపాయింట్మెంట్ తీసుకున్నారు.
బ్యూరోక్రాట్స్లో నాలుగు రకాలుంటారు. ఒకటి.. నిజాయితీగా, సమర్థవంతంగా పనిచేసేవారు. రెండు.. నిజాయితీగా ఉన్నా సామర్థ్యంలేని వాళ్లు. మూడు.. సామర్థ్యం ఉన్నా నిజాయితీలేని వాళ్లు. నాలుగు.. అవినీతి, అసమర్థులైన ఆఫీసర్లు. నిజాయితీ కలిగిన సమర్థురాలైన కలెక్టర్గాముగ్ధా... మైనింగ్ తర్వాత ఆ రేంజ్లోనే ఉన్న వంట గ్యాస్ సిలెండర్ల బ్లాక్ మార్కెటింగ్నూ బ్లాక్ చేసేశారు. అలాగే పర్మిషన్ లేకుండా వేస్తున్న బోర్వెల్స్నూ పూడ్చేయించారు. హర్యానా నుంచి బోర్వెల్ మెషీన్స్ వచ్చేవి. వాటన్నిటినీ సీజ్ చేయించారు. గ్రామాల్లోకి వెళ్లిపోయి ప్రత్యక్షంగా సామాన్య ప్రజలను ఆమె కలిసేవారు. వాళ్ల అర్జీలు, దరఖాస్తులు తీసుకునేవారు. సత్వర పరిష్కారం కోసమూ అంతే శ్రమించేవారు. ఆఫీస్ పనివేళలు అయిపోయి, పని మిగిలిపోతే ఆ ఫైల్స్ పట్టుకుని ఇంటికి వెళ్లేవారు. రాత్రంతా కూర్చొని ఫైల్స్ చెక్ చేసేవారు. ఆమె నిజాయితీ, సామాన్యులకు అండగా ఉన్న తీరు, మైనింగ్ మాఫియా, బ్లాక్ మార్కెటింగ్పై ఆమె ఉక్కుపాదం మోపడం.. ఇవన్నీ గిట్టని పెద్దలు ఆర్నెళ్లలో ముగ్ధకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇప్పించారు. ఎన్నో పాలనా సంస్కరణలు తెచ్చారు ముగ్ధ. అందుకే ఆమె ట్రాన్స్ఫరై పోతుంటే ఆ జిల్లాలోని ప్రజలు బదిలీని ఆపమంటూ ధర్నా నిర్వహించారు. బంద్కు పిలుపిచ్చారు. ఆమెలోని సిన్సియారిటీ, సమర్థత తన పదిహేనేళ్ల సర్వీస్లో పదమూడు ట్రాన్స్ఫర్స్లను గిఫ్ట్గా ఇచ్చింది.