Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూట్కేస్ చేతపట్టుకుని ఇంటి గుమ్మంలో నిలబడిన బిడ్డను చూసి సావిత్రికి నోటమాట రాలేదు.' నేను బట్టలన్నీ సర్దుకుని వచ్చేస్తున్నాను' అని అరగంట కింద ఫోన్ చేసిన జ్యోతి తల్లి సమాధానం వినకుండా ఫోన్ పెట్టేయడం, సరిగ్గా అరగంటలో ఇంటిముందు ఆటో దిగడం చూసి ఆమె మనసులో ఆవేదన. అల్లారుముద్దుగా పెంచిన బిడ్డ జీవితం పెండ్ల్లయిన ఆరునెలలకే ఇలా కావడం భరించలేకపోతుంది. బిడ్డను గుమ్మంలోనే నిలబెట్టి పలుపలు విధాలుగా ఆలోచిస్తుంది. 'నేను లోపలికి రావాలా వద్దా' అన్న జ్యోతి మాటతో వాస్తవంలోకి వచ్చింది. రెండురోజుల తర్వాత బిడ్డను తీసుకుని ఐద్వాఅదాలత్కు వచ్చిన సావిత్రి సమస్య ఎలా పరిష్కారం అయ్యిందో, జ్యోతి కాపురం ఎలా చక్కబడిందో చదవండి..
సావిత్రి ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్గా పనిచేస్తుంది. జ్యోతి మూడేండ్ల పిల్లగా ఉన్నప్పుడే భర్త చనిపోవడంతో బిడ్డే లోకంగా బతికింది. అతి గారాబంగా పెంచింది. ఆ గారాబమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. చదువు తప్ప మరో లోకం తెలియకుండా పెంచింది. స్నేహితులతో కలవనిచ్చేది కాదు. దాంతో జ్యోతికి పెద్దగా స్నేహితులు ఎవరూ లేరు. పెద్దగా బంధువులు కూడా లేరు. ఇల్లు, కాలేజీ తప్ప మరో ప్రపంచం తెలియదు. బి.టెక్ అయిన తర్వాత మంచి సంబంధం చూసి పెండ్లి చేసింది. ఒక్కతే అమ్మాయి కావడంతో కట్నకనుకలు భారీగానే ఇచ్చింది. ఆరునెలలకే అత్తవారింటికి వెళ్లనంటూ వచ్చేసింది. అసలు విషయం తెలియాలంటే జ్యోతి భర్త ప్రకాశ్ను కూడా రమ్మని చెప్పారు బాధ్యులు. అతనికి ఫోన్ చేయగానే వచ్చాడు.
ప్రకాశ్, పెద్దగా చదువు లేకపోయినా ఆస్తిబాగానే ఉంది. ముగ్గురు అన్నదమ్ములు. అన్నకు పెండ్ల్లయింది. అమెరికాలో ఉంటాడు. తమ్ముడు డాక్టర్ చదువుతున్నాడు. ప్రకాశ్ తల్లిదండ్రులకు సావిత్రి కుటుంబంతో ఐదేండ్ల అనుబంధం ఉంది. తెలిసిన అమ్మాయే కావడంతో జ్యోతితో ప్రకాశ్ పెండ్లి జరిగిపోయింది. అత్తవారింట్లో అడుగుపెట్టిన జ్యోతికి ఏ పని తెలియదు. అమ్మలాగే అత్తకూడా తనకు అన్న సమకూర్చి పెడుతుందన్న భావనలో ఉండేది. జ్యోతి గారాబంగా పెరిగిన విషయం తెలిసిన ప్రకాశ్కు, అతని తల్లిదండ్రులు పెండ్లి అయిన తర్వాత బాధ్యతలు తెలుసుకుంటుంది అనుకున్నారు.
గారాబంగా పెరిగిన ..
పెండ్ల్లయి నెలరోజులైనా జ్యోతి అత్తవారింట్లో కిచెన్లోకి వెళ్లలేదు. కొత్త కదా అని మొదట్లో ప్రకాశ్ అనుకున్నాడు. ఆ తర్వాత తన తల్లి పనులు చేస్తుంటే జ్యోతి టీవి చూస్తూ కూర్చోవడం చూసి భరించ లేకపోయాడు. గారాబంగా పెరిగిన అమ్మాయి కాబట్టి 'అమ్మకు పనుల్లో సహాయం చెయ్యి జ్యోతి' అని చెప్పాడు. మరోసారి గట్టిగా చెబితే 'నాకు ఏ పనులు రావు. నన్ను ఇలా వేధిస్తే మా ఇంటికి వెళ్లిపోతా' అనేది. మెల్లగా తెలుసుకుంటుంది లే అని ప్రకాశ్ తల్లికూడా అనేది. వంట లాంటి పెద్దపెద్ద పనులు చేయకపోయినా గిన్నెలు సర్దడం, కూరగాయలు కోయడం వంటి చిన్నచిన్న పనులు చేస్తూ అత్త గారికి సహాయంగా ఉండాలని సావిత్రి కూడా ఎన్నో సార్లు జ్యోతికి చెప్పింది. అయినా వినేది కాదు. ఆరునెలలు గడిచినా జ్యోతి మాత్రం ఇంటిపనుల్లో జోక్యం చేసుకోలేదు. భోజనానికి తప్ప బెడ్రూమ్ దాటి వచ్చేదికాదు. ఇలా అయితే కాదని ప్రకాశ్ జ్యోతిని కిచెన్లోకి తీసుకువెళ్లి గిన్నెలు శుభ్రం చేయ మని చెప్పాడు. అంతే వెంటనే బట్టలు సర్దుకుని వచ్చేసింది.
బాధ్యత తెలిసేలా..
ప్రకాశ్ చెప్పింది నిజమేనా అని జ్యోతిని అడిగారు బాధ్యులు. 'నిజమే. నాకు ఏ పనులు రావు. ఎలా చేస్తాను? మా ఇంట్లో ఏ రోజు గిన్నెలు తోమలేదు. కనీసం కాఫీ కలుపుకోవడం కూడా నాకు రాదు. అన్ని తెలిసే కదా పెండ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇలా ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు' అంది జ్యోతి. తల్లి గారాబం, బయటి ప్రపంచం తెలియకపోవడం వల్ల జ్యోతికి బాధ్యతలు తెలియడం లేదన్న విషయం గమనించిన బాధ్యులు..' మీరిద్దరూ కొన్నిరోజులు వేరుగా ఉండండి. అప్పుడు ఆమెకు ఇల్లు, ఇంట్లో పనులు అర్థం అవుతాయి' అన్నారు. ప్రకాశ్ తల్లిదండ్రులతో మాట్లాడి సరే అన్నాడు. జ్యోతి మాత్రం 'నేను వెళ్లను. మా అమ్మతోనే ఉంటాను' అంది. 'నీకు ప్రకాశ్ అంటే ఇష్టమేనా? అతనితో కలిసి ఉండటం ఇష్టమే కదా?' అడిగారు. 'ఇష్టమే. అయితే ఆయననే మా ఇంటికి రమ్మని చెప్పండి' అంది జ్యోతి. 'నీకు పెండ్లి చేసిన తర్వాత భర్తతో కలిసి ఉండు. అంతేగానీ అతనిని కూడా ఇక్కడికే రమ్మని చెప్పడం సరికాదు' అంది సావిత్రి.
భర్త మీద ప్రేమతో వేరు కాపురం పెడితే అతనితో కలిసి ఉండ డానికి జ్యోతి అంగీకరించింది. 'జ్యోతిది అమాయకత్వం. మీరు మెల్లగా ఆమెలో మార్పు తీసుకురావాలి. భర్తగానే కాదు తల్లిదండ్రిగా మీరే ఆమె బాధ్యత తీసుకోవాలి. కొద్దిరోజులు మీరిద్దరే కలిసి ఇంటి పనులన్నీ చేసుకోండి. త్వరగానే ఆమెలో మార్పు వస్తుంది.' అని ప్రకాశ్కు చెప్పారు బాధ్యలు.
అత్తగారింటికి, అమ్మగారింటికి దూరంగా చిన్న రూం తీసుకున్నాడు ప్రకాశ్. ఇద్దరి అవసరాలకు సరిపోయే కొద్ది సామానుతో కొత్తకాపురం ప్రారంభించారు ప్రకాశ్, జ్యోతి.
అత్యవసరం అయితే..
'సావిత్రిగారు, మీరు వాళ్లింటివైపు వెళ్లవద్దు. కొద్ది రోజుల వరకు అత్యవసరం అయితే తప్ప ఫోన్ చేయవద్దు. పిల్లలను ప్రేమతో పెంచాలి. అతి గారాబంతో కాదు. ప్రస్తుత తరుణంలో ఆడమగ పిల్లలు అన్న తేడా లేకుండా వారికి ఇంటి పనులు నేర్పించాలి. ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో విదేశాలకు వెళ్లితేఇంట్లో పనులు చేసుకోవడం తప్పదు కదా! ఇతరుల మీద ఆధారపడకుండా సొంతపనులు చేసుకోవడం చిన్నతనం నుంచే అలవాటు చేయాలి' అన్నారు బాధ్యులు.
'నిజమే మేడమ్! అప్పుడు తెలియలేదు. ఇప్పుడు అర్థమైంది. అతి గారాబం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలిసింది. వారు సంతోషంగా ఉంటే చాలు. నేను ఫోన్ కూడా చేయను' అంది సావిత్రి.
నెల రోజుల తర్వాత..
ప్రకాశ్, జ్యోతి కలిసి వచ్చారు. 'జ్యోతి కొత్త కాపురం ఎలా ఉంది?' అడిగారు బాధ్యులు. 'ప్రకాశ్ దగ్గర ఉండి అన్నీ పనులు నేర్పిస్తున్నాడు. కాఫీ పెట్టడం వచ్చింది. కూరగాయలు కట్ చేస్తే ఆయనే కర్రీ వండుతున్నాడు. రైస్ కుక్కర్లో అన్నం చేస్తున్నాను. ఆమ్లెట్ వేయడం నేర్పించాడు' అంటూ తనకు వచ్చిన పనులన్నీ వివరిస్తుంది జ్యోతి. ఆమెలో వచ్చిన మార్పును చూస్తూ ప్రకాశ్ సంతోషంగా ఉన్నాడు.
రెండునెలల తర్వాత సావిత్రి ఫోన్ చేసి ' చిన్నచిన్న అపార్థాలతో విడిపోయే భార్యభర్తలను చూస్తున్నాం. భార్యభర్తలుగా వారి బాధ్యతలు తెలుసుకునేలా మీరు ఇచ్చిన కౌన్సెలింగ్ కాపురాన్ని నిలబెట్టింది. జ్యోతి ప్రకాశ్ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మా అమ్మాయికి మూడోనెల' అంటూ తన సంతోషాన్ని బాధ్యులతో పంచుకుంది.