Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్ణాలు ఏడే.. అవి వెదజల్లే కాంతులనేకం. కేవలం రంగులే కాదు... అవి అనేకానేక భావాల వ్యక్తీకరణలు. మనుషుల మనసులు చదవడం తెలిసిన రవళికి... రంగులు చెప్పే ఊసులూ తెలుసు. ఆ ఎరుకతో రంగులతో ఆమె ఒలికించే కాంతిని చూస్తే ఇట్లే ముగ్ధులయిపోతారు. అందుకు ఆమె ఎంచుకున్న ఆర్ట్... స్టెయిన్డ్ గ్లాస్ పెయింటింగ్. విదేశాల్లో ఎంతో పురాతనమైన... మనకు నూతనంగా కనిపించే ఈ వర్క్లో ఆమె నిపుణ. వృత్తిరీత్యా సైకాలజిస్ట్ అయిన రవళికి... ఈ పెయింటింగ్ ప్రవృత్తి మాత్రమే. అయినా 'అమెజాన్'వంటి ఈకామర్స్ సైట్లో సైతం చోటు దక్కించుకున్న ఆమె ఆర్ట్ గురించి... సైకాలజిస్టుగా ఆమె అనుభవాల గురించి...
మనిషిలో కళ ఉండాలేకానీ.. వారి చేతిలో కళాత్మకం కాని వస్తువేదీ ఉండదు. అందుకు నిదర్శనం రవళి. చిన్నప్పడినుంచి కళలంటే ఇష్టం. ఒరిగామి, పేపర్ ఆర్ట్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మండల పెయింటింగ్, డాట్స్ పెయింటింగ్... ఇలా దేన్నీ వదిలిపెట్టలేదు. ప్రత్యేకించి పేపర్ ఆర్ట్, మండల పెయింటింగ్ అంటే ఎంతో ఇష్టం. ఆసక్తితో అన్నింటితోనూ రకరకాల బొమ్మలు తయారు చేసేది. స్నేహితులకు బంధువులకు కానుకగా ఇచ్చేది. దాన్ని వాళ్లు మెచ్చుకుంటే ఆనందించేది. రకరకాల డిజైన్లలో మెహెందీ వేసేది. ప్రత్యేకించి పెండ్లి కూతురుకు మెహెందీ వేయడంలో ఆమె నిపుణ. ఇవన్నీ సొంతంగా నేర్చుకున్నవే. అయితే దేన్నీ అంత ఫోకస్డ్గా ప్రయత్నించలేదామె. ఎందుకంటే ఆమెకు కొత్తదనం ఇష్టం. ప్రతి ఆర్ట్ను రెండు మూడు లేదా నాలుగైదు పీసుల వరకు కొనసాగించి... తరువాత నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేది. ఇలా చేస్తూనే.. మరోవైపు విశాఖపట్నంలో డిగ్రీ వరకు చదివిన రవళి... పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో సైకాలజీలో పీజీ చేసింది.
రోమన్, ఫ్రెంచ్ ఆర్ట్ చూసి...
పెండ్లి తరువాత చాలా మంది జీవితం మారిపోతుంది. ఆమెది కూడా మారిపోయింది. కానీ మరిన్ని కొత్త కాంతులతో. అందుకు కారణమయ్యింది ఆమె విదేశీ ప్రయాణం. పెళ్లయిన తర్వాత వాళ్ల కుటుంబం మొత్తం పారిస్, రోమ్ ట్రిప్కి వెళ్లింది. అక్కడే స్టెయిన్డ్ గ్లాస్ ఆర్ట్ ఆమె కంటపడింది. అక్కడి ఆర్కిటెక్చర్లో ఒక భాగమైన స్టెయిన్డ్ గ్లాస్ పెయింటింగ్ మీద రవళి ఆసక్తి మొదలయ్యింది. తిరిగి ఇండియాకు వచ్చాక ఆ ఆర్ట్ను మనకు పరిచయం చేసేందుకు ప్రయత్నించింది. దానికోసం తీరిక దొరికినప్పుడల్లా ఎన్నో ప్రయోగాలు చేసింది. చివరకు సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఒక డిజైన్ను గంట గంటన్నరలో పూర్తి చేసేస్తుంది రవళి. కానీ పెయింటింగ్ అనేది ఆమెకు పూర్తికాలపు పని కాదు. ఎందుకంటే ఆమెకు ఇష్టమైన అంశం... సైకాలజీ. అందుకే 'ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సల్లెన్స్'లో స్టూడెంట్ కౌన్సెలర్గా పనిచేస్తున్నది. వారాంతాలు, ఖాళీ సమయాల్లోనే ఈ ఆర్ట్ను కొనసాగిస్తున్నది. అందుకు చాలా అనువైనదిగా అనిపించింది ఈ స్టెయిన్డ్ గ్లాస్ పెయింటింగ్.
ఇంటికి కొత్త కాంతి...
మొదట్లో పెయింటింగ్ వేసి... ఇంటికి వచ్చిన అతిథులకు, స్నేహితులకు ఇచ్చేది. అందరూ బాగుందని మెచ్చుకోవడంతో... వాటిని ఎందుకు అమ్మకూడదనుకున్నది. అనుకున్నదే తడవు ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్లో 'ఆర్డ్ వేద' పేరుతో ఉంచింది. ఆమె ఒక్కో ఆర్ట్ పీసు విలువ 199 రూపాయల నుంచి మొదలవుతుంది. దాని తయారీకోసం రవళి వెచ్చించిన సమయం, గ్లాస్ ఖర్చు, రంగుల విలువ, అన్నింటికీ మంచి ఆమె చేతిలోని కళ.. ఇవేవీ వెలకట్ట లేనివి. అయినా అమ్మడం ఎందుకంటే.. కేవలం తన అర్ట్ గురించి నలుగురికి తెలియాలనే. వీటిలో ఎక్కువగా క్యాండిల్ హౌల్డర్స్, షో పీసెస్. గతేడాది దీపావళి అయిపోయిన తరువాత పెట్టడంతో కొద్దిగానే అమ్ముడుపోయాయి. ఈసారి దీపావళికి ముందే మరిన్ని మార్కెట్లో ఉంచాలని ప్రయత్నిస్తున్నది. కేవలం దీపావళికి మాత్రమే కాదు... క్రిస్మస్కోసం క్రిస్మస్ ట్రీ, స్టార్స్, ఇలా అన్ని రకాలనూ అందుబాటులోకి తెస్తున్నది. ఆమె చేసే స్టెయిన్డ్ గ్లాస్ పెయింటింగ్స్ను మన ఇంటి అలంకరణ కోసమే కాదు... ఏవైనా చిన్న చిన్న పార్టీలకోసం రిటర్న్ గిఫ్టులుగానూ అందించొచ్చు. అలా ఆర్డర్సు కూడా వస్తున్నాయి. సమయం ఇస్తే.. పది నుంచి 50 వరకు సులభంగా చేసిచ్చేస్తుంది రవళి. పండుగ వేళల్లో ఒక్కసారి ఆ పెయింటెడ్ గ్లాస్లో క్యాండిల్ను పెట్టి గదిలో ఉంచారంటే... అది పరిచే రంగుల కాంతిలో అందరూ మంత్రముగ్ధులవ్వాల్సిందే. ఇది ఆమెలోని కళాత్మక కోణం మాత్రమే.
విద్యార్థుల జీవితాల్లో మార్పు..
స్టూడెంట్ కౌన్సెలర్గా ఆమె ఎందరో విద్యార్థుల జీవితాల్లో మార్పు తెస్తున్నది. సీబీఎస్సీలో అడాలసెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా ఉన్నది. అందులో భాగంగా విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తుంది. ఐదేండ్లలోపు పిల్లల్లో ఎక్కువగా ఉండే లర్నింగ్ డిజేబులిటీస్ గుర్తిస్తుంది. వాటిని ఎంత తొందరగా గుర్తిస్తే అంత తొందగా నయం చేయవచ్చు. ఒక్కసారి ఆ పిల్లలను గుర్తించాక... వాళ్లకు సంబంధించిన ఫాలో అప్ అటు టీచర్స్తోనూ, ఇటు పేరెంట్స్తోనూ ఉంటుంది. స్కూల్లో అందరూ ఎంతో సహకరిస్తారు. చిన్న పిల్లల్లో ఈ డిజేబులిటీస్ అయితే.. కొంచెం పెద్దయినవాళ్లలో మానసిక సమస్యలు. ప్రత్యేకించే పరీక్షల సమయంలో ఒత్తిడికి గురవుతుంటారు' అని చెప్పే రవళి.. వాటిని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నది.
అందరి సహకారంతోనే...
''మాది విశాఖపట్నం. నాన్న ఎంవీఎన్ రావు, ఎయిర్ఫోర్స్లో పనిచేసి రిటైర్ అయ్యారు. అమ్మ స్వర్ణ గృహిణి. నాకు ఇద్దరన్నయ్యలు. చిన్నప్పటి నుంచి సైకాలజిస్ట్ అవ్వాలని కోరిక. ఇంట్లో అందరూ చదువుకున్నవారే అవ్వడంతో నాకు మరింత సహకారం అందింది. 2017 పెండ్లయ్యింది. మావారు జగన్నాథ్ శర్మ. సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఆయన సహకారం ఎంతో ఉంది. అలాగే మా అత్తమామలు కూడా నన్నెంతో ప్రోత్సహిస్తారు. నేను వేసిన పెయింటింగ్స్ చూసి మెచ్చుకుంటారు. నేను నా పనిలో నిమగమై ఉంటే.. అన్నీ అమరుస్తారు. వాళ్లందరి సహకారంతోనే... అటు వృత్తినీ, ఇటు ప్రవృత్తినీ కొనసాగిస్తున్నా'' అని చెప్పే రవళి తన కళలో మరింత ప్రగతిని సాధించాలని ఆశిద్దాం.
సమయం కేటాయించాలి...
ఇప్పుడు పిల్లలు మొబైల్స్కు బాగా అడిక్ట్ అవుతున్నారు. ఇలా ఇంటికి, టీవీ లేదా కంప్యూటర్ స్క్రీన్కి, మొబైల్కి పరిమితమైతే పిల్లలు అకడమిక్స్లో బాగుంటారేమో కానీ... సమాజంతో ఉండటం ఎట్లా అనే బాధ్యత, పెద్దల పట్ల గౌరవం ఇవేవీ రావు. అందుకే ముఖ్యంగా పిల్లలను ఆడుకోనివ్వాలి. అది పార్కులో కావచ్చు, గ్రౌండ్లో కావచ్చు, చివరకు సెల్లార్లో కావచ్చు. ఏదో ఒక సోషల్ యాక్టివిటీ ఉండాలి. దాంతో నలుగురితో ఎలా ఉండాలో తెలుస్తుంది. పంచుకోవడం తెలుస్తుంది. నాయకత్వ లక్షణాలు వస్తాయి. అంతేకాదు చాలామంది తల్లిదండ్రులు పిల్లలమీద చదువులు రుద్దుతుంటారు. పిల్లలు వాళ్ల స్థాయిని బట్టి ఒక్కొక్కరు ఒక్కోవిధంగా నేర్చుకుంటారు. కాబట్టి ఒత్తిడి వద్దు. హౌమ్వర్క్ చేస్తే చాక్లెట్ ఇస్తా, క్లాసులో ఫస్ట్ వస్తే అది కొనిస్తా ఇది కొనిస్తా అని లంచం ఇవ్వడం అలవాటు చేస్తారు. అది అస్సలే మంచి పద్ధతి కాదు. చదువుకోవడం వల్ల జరిగే మేలు ఏంటో నెమ్మదిగా చెప్పాలి. పిల్లలకు అర్థం చేయించాలి తప్ప ఏదో ఒక వస్తువు ఎరగా చూపడం మంచిది కాదు. భవిష్యత్ కూడా అలాగే అలవాటవుతుంది. పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని కొట్టడం, తిట్టడం వల్ల ఇంకా మొండిగా తయారవుతారు. అలా వ్యవహరించినందుకు పనిష్మెంట్ కాని పనిష్మెంట్ ఇవ్వాలి. ఉదాహరణకు పిల్లలు రోజూ గంటసేపు టీవీ చూస్తుంటే.. ఆ తప్పు చేసినందుకు ఆ సమయాన్ని పావుగంటకే తగ్గించాలి. అలా తగ్గించడానికి వాళ్లు చేసిన తప్పే కారణం అని చెప్పాలి. దీని వల్ల తప్పు చేయకూడదు అని నెమ్మదిగా వాళ్ల మెదళ్లలోకి ఎక్కుతుంది. అన్నింటికీ మించి పేరెంట్స్ ఇద్దరూ వర్కింగ్ అయినా సరే.. పిల్లలకోసం సమయం కేటాయించాలి. వాళ్లతో మాట్లాడాలి. మంచి పనిచేసినప్పుడు మెచ్చుకోవాలి. అది వాళ్లకు సానుకూల శక్తినిస్తుంది.
- కట్ట కవిత