Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలోని సంప్రదాయ సమాజంలో... మహిళలు బయటికి వెళ్లడం సాహసం. ఆమె సాహసం సముద్రమంత గొప్పది. పురుషులతోనే నిండిపోయిన ఓ రంగంలో మహిళ ప్రవేశించడం, అందులోని లైసెన్స్ పొందడం అంటే... సంకెళ్లను తెంచుకోవడమే. అలా సంకెళ్లను ఛేదించుకుని.. సముద్రంలో స్వేచ్ఛగా విహరిస్తున్న మహిళ... కేసీ రేఖ. మహిళలు కేవలం తీరంలో ఉండి... వేటకు వెళ్లిన తమ భర్తలు క్షేమంగా తిరిగిరావాలని మాత్రమే కోరుకునే సమాజంలో కచ్చితంగా ఆమె వేసిన అడుగు విప్లవమే.
కేరళలోని త్రిస్సూర్ జిల్లా చెట్టువకు చెందిన రేఖ... సముద్రంలోకి తన తొలి అడుగును పదేండ్ల కిందటే వేసింది.
తాను ఓ చరిత్ర సృష్టిస్తున్నానని అప్పు డామెకు తెలియదు. ఆ సమయంలో తనకు తెలిసిందల్లా కేవలం తన భర్త పి.కార్తికేయన్కు సాయపడటం మాత్రమే. అప్పటిదాకా కార్తికేయన్తో పాటు మరో ఇద్దరు జాలరులు ఉండే వారు. కానీ వాళ్లు మానేశారు. మరో ఇద్దరిని పెట్టుకునేంత ఆర్థిక స్థోమత ఆ కుటుంబానికి లేదు. అదిగో అప్పుడే రేఖ వల తాళ్లను పట్టుకుంది. అప్పటిదాకా ఈత తెలియని, సముద్రం అంటే భయపడే రేఖకు మొట్టమొదటి ప్రయాణం ఓ భయంకరమైన అను బశం. మూడు గంటలపాటు విరామం లేకుండా వాంతులు చేసుకున్నది. కొద్దిసేపటి తరువాత దగ్గితే రక్తం పడింది. ఇది కొన్ని వారాల పాటు ఉన్నది. సముద్రమంటే భయం పోయిన తరువాత... పడవలో సరిగ్గా కూర్చోగ లిగింది. అది మొదలు కేవలం... తన భయాన్ని పోగొట్టుకోవడమే కాదు సముద్రంలో ఈదడం నేర్చుకుంది. సముద్రంలో చేపలు ఈదినంత సులభంగా ఈదడం అలవర్చుకుంది. అంతేకాదు... చేపలు పట్టే వలలను తయారు చేయడం, ఖరాబైన వాటిని బాగుచేయడం కూడా నేర్చుకుంది. అంతేకాదు.. పడిలేచే అలల మధ్య తమ సింగిల్ ఇంజిన్ పడవ స్టీరింగ్ తిప్పడమూ నేర్చుకుంది. అప్పుడే రేఖకు చాలా కీర్తి వచ్చింది. అది కాస్తా సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ ఇనిస్టిట్యూట్(సీఎఎఫ్ఆర్ఐ)కు చేరింది. వాళ్లు ఆమెను సన్మానించారు. ఆ తరువాత జాలరిగా ఆమెకు లైసెన్స్ వచ్చింది. మన దేశంలో లైసెన్స్ పొందిన మొట్టమొదటి మహిళా జాలరిగా చరిత్ర సృష్టించింది. అయినా వాళ్ల జీవితం ఇంకా కష్టాలే. ఎందుకంటే కొన్ని గంటల పాటు నడి సముద్రంలో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఉండటం అంటే... చావును కోరి తెచ్చుకోవడమే. కానీ... కడలమ్మ(సముద్ర దేవత) తమను కాపాడుతుందని బలంగా నమ్ముతారు. కూతురు చదువుకోవడానికి సీఎఎఫ్ఆర్ఐ సహాయసహకారాలందిస్తోంది. పీకల్లోతు కష్టాలున్న ఆ కుటుంబానికి ఇదో ఊరట.
సముద్రాన్ని చదివేసింది...
సాధారణంగా వర్షాకాలంలో అరేబియా మహా సముద్రంలో నల్లటి మబ్బుల తో కప్పేసి భయంకరంగా కనిపిస్తుంది. అయినా రేఖ భయపడదు. సూర్యుడి వెలుగురేఖలు తీరాన్ని తాకకముందే సముద్రంలోకి ఆ జంట ప్రయాణం మొదలవుతుంది. ప్రతిరోజూ 20 నుంచి 30 నాటికల్ మైళ్లదాకా ఈ జంట ప్రయాణిస్తుంది. దిక్సూచి ఉండదు. జీపీఎస్ డివైస్ ఉండదు. లైఫ్ జాకెట్సే కాదు... ఎలాంటి నావిగేషన్ ఎక్విప్ మెంట్ ఉండదు. ఎన్నో కష్టకాలాను సైతం సులభంగా ఈదుకొచ్చిందా జంట. అదెలా అంటే... మాకు ఏండ్లుగా ఉన్న జ్ఞానంతోనే అంటారు. నీటిని, సము ద్రాన్ని నాకంటే ఆమెనే బాగా అర్థం చేసుకుంటుందంటాడు రేఖ భర్త కార్తికేయన్. నిజమే... చేపల గుంపు ఎక్కడున్నదో చాలా సులభంగా గుర్తించేస్తుంది రేఖ. అంతేకాదు... వాటికి ఎదురుగా వెళ్లిపోయి... వలను విసురుతుంది. అంతేకాదు... వివిధ రకాల చేపల గురించి, వాటి అలవాట్లు, దారుల గురించి పాఠమే చెప్పేయగలదు.
పెను ప్రమాదాలనుంచి...
రేఖ కార్తికేయన్లది ప్రేమ వివాహం. ఇద్దరూ హిందీ కోర్సు చదువుతుండగా కలిశారు. ప్రేమలో పెడ్డారు. పెండ్లికి పెద్దలు అంగీకరించలేదు. కారణం కులాలు వేరు. ఇద్దరూ ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సముద్రంలోని ఆటుపోట్లను వాళ్లు ప్రేమిస్తారు. ఇటీవలే ఓ పెద్ద ముప్పునుంచి బయటపడ్డారిద్దరు. ఓరోజు సముద్రం మధ్యలోకి వెళ్లాక... వల వేసి పడవలోనే భర్త నిద్రపోయాడు. ఆ చీకట్లోంచి పెద్ద ఓడరావడం గమనించింది రేఖ. గట్టిగట్టిగా అరిచింది రేఖ. ఓడ దారినుంచి తమ పడవను తప్పించింది. ఆ ఓడకు, వారి పడవకు కొన్ని సెకన్ల దూరమే. మరోసారి నడి సముద్రంలో ఓడ ఇంజన్ ఆగిపోయింది. ఆరు గంటలపాటు పడవను నెమ్మదిగా గాలివాటంతో నెట్టుకొచ్చారు. ఆ తరువాత వారికి సహాయమందించింది. ఒక్కోసారి పెద్దపెద్ద చేపలు పడతాయి. ఒక్కోసారి ఏమీ ఉండవు. చేపలు పట్టడం లాటరీ జాక్పాట్లాంటిదే అంటుంది రేఖ.