Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాలుగు రోజుల నుంచి పద్మ మనసంతా దిగులుగా ఉంది. బిడ్డ పరిస్థితి తలుచుకుంటే కన్నీళ్ళు ఆగడం లేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ అత్తవారింట్లో ఇన్ని బాధలు ఎలా భరించిందో తలుచుకుంటూ వాళ్లను ఏమైనా చేయాలన్న కోపంతో రగిలిపోతుంది. మరుక్షణమే తన ఆరోగ్యం, భర్త ఆరోగ్యం గుర్తుకు వచ్చి వారిని ఏమీ చేయలేని అశక్తత ఆవేదనగా మారుతుంది. ముందుగా తమ బిడ్డ మనసులోని బాధను తగ్గించి, ఆమె మనసులో ఏం ఉందో తెలుసుకోవాలన్న ఆలోచనతో బిడ్డను తీసుకుని ఐద్వా అదాలత్కు వచ్చారు.
పద్మ, రామారావు దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి డాక్టర్. తనతో పాటే చదువుకునే డాక్టర్తో ఆమె పెండ్లి జరిగింది. వారిది ప్రేమ పెండ్లియే అయినా ఇరువైపుల పెద్దలు ఒప్పుకోవడంతో లవ్ కమ్ అరెంజ్డ్ మ్యారేజ్. చిన్నమ్మాయి కీర్తి. ఎంబిఏ చదివింది. అబ్బాయి యుఎస్లో ఎం.ఎస్ చేస్తున్నాడు.
కీర్తి ఇంట్లో ఆఖరి సంతానం కావడంతో గారాబంగా పెరిగింది. వయసు పెరిగినా చిన్నపిల్ల మనస్తత్వం ఆమెది. పద్మ, రామారావులకు షుగర్, బిపీ ఉన్నాయి. దాంతో వారు కీర్తికి కూడా పెండ్లి చేయాలని నిర్ణయించుకుని మ్యారేజ్ బ్యూరోలో వివరాలు ఇచ్చారు. వారంలో నాలుగు సంబంధాలు వచ్చాయి. వాటిలో ఒక సంబంధం రాజేష్ వాళ్ళది. అమ్మాయి చూసుకోవడానికి వచ్చి.. పిల్ల బాగా నచ్చింది అంటూ వెంటనే ఎంగెజ్మెంట్ కూడా చేసేసుకున్నారు. నెలరోజుల్లో పెండ్లి తేదీ కూడా ఖరారు చేశారు. యుఎస్లో ఉన్న అబ్బాయి వచ్చేవరకు ఆగుదాం అన్నా.. 'వీరిద్దరి పేర్లతో మళ్ళీ ముహుర్తం కుదరడం కష్టం' అంటూ తొందర పెట్టారు.
హడావుడిగా పెండ్లి పనుల్లో...
రాజేష్ ఇంటికి పెద్దకొడుకు. ఆస్తులు బాగానే ఉన్నాయి. ఆడపిల్లలు లేదు. రాజేష్ తమ్ముడు పదోతరగతి చదువుతున్నాడు. కట్నం విషయంలోనూ వాళ్లకు ఎక్కువగా పట్టింపులు లేకపోవడంతో సంబంధం వద్దని చెప్పడానికి కీర్తి వాళ్ళకు సరైన కారణాలు ఏమీ లేవు. దాంతో హడావుడిగా పెండ్లి పనుల్లో పడ్డారు. పెండ్లి తర్వాత కీర్తిని అత్తవారింటికి పంపించారు. అక్కడ తమ బిడ్డ సంతోషంగా ఉంటుంది అన్న నమ్మకంతో ఉన్నారు పద్మ, రామారావు.
అసలు సంగతి..
పెండ్లి తర్వాత కీర్తి, రాజేష్లతో అతని అమ్మనాన్న, తమ్ముడు కలిసి వారం రోజులు పుణ్యక్షేత్రాలకు వెళ్ళివచ్చారు. పూజలు, వత్రాలు అంటూ కీర్తిని రాజేష్కు దూరంగా ఉంచేవాళ్ళు. ఉమ్మడి కుటుంబం కావడంతో భర్తతో ఏకాంతం దొరికేది కాదు. ఇంట్లో పనులన్నీ కీర్తితోనే చేయించేవాళ్ళు. కొత్త కోడలు నేర్చుకోవాలి కదా అంటూ అత్త ఎంతో ప్రేమగా మాట్లాడేది. రాజేష్ తల్లి మాటకు వంత పాడుతూ.. అమ్మతో పాటే ఉండేవాడు. పండుగలకు కూడా పుట్టింటికి పంపించేవారు కాదు. పద్మ అడిగితే 'మా కోడలు లేకపోతే మాకు ఏమీ తోచదు' అంటూ సున్నితంగా నిరాకరించేవారు.
సమస్య ఉందని..
కీర్తి, రాజేష్ల పెండ్లి అయిన ఏడాది పూర్తి కావస్తుండగా రాజేష్ తల్లి రోజూ ఒకే విషయం పదేపదే అడిగేది. పిల్లలు పుట్టకుండా జాగ్రత్త తీసుకుంటున్నారా? త్వరగా పిల్లనో, పిల్లాడినో కనండి' అనేది. ఇంటికి వచ్చిన వారందరికీ 'మా కోడలు ఇంకా శుభవార్త చెప్పడం లేదు. పిల్లలతో ఎప్పుడు ఆడుకుంటానో' అంటూ బాధపడేది. కీర్తికి పిసివోడి సమస్య ఉన్నది తెలిసిన తర్వాత కీర్తి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ' మీ అమ్మాయికి సమస్య ఉందని పెండ్లికి ముందు ఎందుకు చెప్పలేదు? పిల్లలు పుట్టే అవకాశం ఉందో లేదో డాక్టర్కు చూపించండి' అంటూ గట్టిగా అరిచింది. దాంతో పద్మ, రామారావు వచ్చి కీర్తిని తమతో పాటు తీసుకుపోయారు. డాక్టర్కు చూపిస్తే.. పెద్ద సమస్య ఏం లేదు. మందులు వాడితే చాలు' అన్నారు. ఆరునెలలైనా ఎలాంటి మార్పు లేకపోవడంతో మళ్ళీ డాక్టర్ వద్దకు వెళ్ళారు. కీర్తితో పాటు రాజేష్ను కూడా పరీక్షలు చేయించుకోవాలి. ఎవరిలో సమస్య ఉందో తెలిసిపోతుంది' అంది డాక్టర్. అదే విషయం రాజేష్ తల్లికి చెప్పితే..'నా కొడుకునే అనుమానిస్తారా?మీ ఇంట్లో అందరికీ జబ్బులే. మీ నాన్నకు గుండెజబ్బు, అమ్మకు క్యాన్సర్. మీ అమ్మాయికి పిల్లలు పుట్టరు. అందుకే ఇలా మా వాడిని పరీక్షలు చేయించు కోమంటున్నారు' అంటూ పెద్ద గొడవ చేసింది. బిడ్డ కాపురం ఇలా గొడవల మయం కావడంతో పద్మ, రామారావుల ఆరోగ్యం మరింత క్షీణించింది. కీర్తి అక్క డాక్టర్ కావడంతో మరో డాక్టర్ సలహాతో ఐవిఎఫ్ కు సిద్ధమయ్యారు. రాజేష్కు పరీక్షలు చేస్తే జీరో కౌంట్ అని తెలిసింది. దాంతో 'మీ అక్కతో కలిసి ఇలా దొంగ రిపోర్ట్స్ తెస్తున్నారు. అంతా దొంగలు' అంటూ రిపోర్ట్స్ అక్కడే పడేసి రాజేష్ కీర్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. అత్తవారింట్లో పెద్దగొడవే జరిగింది. 'రోగిష్టి దాన్ని తెచ్చుకున్నాం. మావాడినే తప్పుపడతారా' అంటూ కీర్తిని రాజేష్, తల్లి కలిసి కొట్టారు. తల్లిదండ్రులకు ఫోన్ చేయకుండా గదిలో బంధించారు. వారం రోజుల తర్వాత పద్మ, రామారావు బిడ్డను చూడడానికి వచ్చారు. గదిలో నుంచి బయటకు వచ్చిన కీర్తిని చూసి గుర్తుపట్టలేక పోయారు. నాలుగు రోజులు మా ఇంటికి తీసుకువెళ్తాం 'అని చెప్పి సమస్య పరిష్కారం కోసం ఐద్వా అదాలత్కు వచ్చారు.
మాటలతో చిత్రవధ...
కీర్తితో విడిగా మాట్లాడి సమస్యను పూర్తిగా తెలుసుకో వాలనుకున్నారు బాధ్యులు. ' కీర్తి నిజం చెప్పు. మీ ఇద్దరి మధ్య అనుబంధం ఉందా? నువ్వు తిరిగి రాజేష్ దగ్గరకు వెళ్తావా' అని అడిగారు.'మేడమ్ అమ్మనాన్న ఆరోగ్యం బాగుండదు. అందుకే నేను వారికి ఏం చెప్పలేదు. అక్కతో షేర్ చేసుకునే టైం లేకపోయింది. ఈరోజు మీతో నా బాధను పంచుకుంటున్నాను. నిజం చెప్పాలంటే ఆయన ఏ రోజు నాతో ప్రేమగా మాట్లాడడు. ఎప్పుడు వాళ్ల అమ్మతోనే ఉంటాడు. బెడ్రూమ్లో కూడా వేరుగానే ఉంటాడు. ఇంట్లో పనులన్నీ చేసి అలసిపోతాను. ఆయన ఫోన్లో పిచ్చిపిచ్చి వీడియోలు చూస్తాడు. నిద్రపోతున్న నన్ను వేధిస్తాడు. మాటలతో చిత్రవధ చేస్తాడు. నేను మాత్రం తిరిగి అక్కడికి వెళ్ళను' అంది కీర్తి ఏడుస్తూ..
తన లోపాన్ని కవర్ చేయడానికి..
'నువ్వు చదువుకున్నావు. నీ కాళ్ళపై నువ్వు నిలబడే ధైర్యం తెచ్చుకో. నీ భర్తను, అత్తను పిలిపిస్తాం. కౌన్సెలింగ్ ఇస్తాం. నువ్వు సరే అంటేనే ఇదంతా చేస్తాం' అన్నారు బాధ్యులు. 'లేదు మేడమ్ అతని రిపోర్ట్స్ చూడండి. తన లోపాన్ని కవర్ చేయడానికి నన్ను వేధిస్తున్నారు. పిల్లలు పుట్టకపోవడం నా లోపం కాదు. కానీ, వాళ్ళ చుట్టాలందరికీ నాలో లోపం ఉందని చెబుతున్నారు. నాకు విడాకులు కావాలి. రాజేష్, వాళ్ళ అమ్మ విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుండే చాలు' అంది కీర్తి. సరే మీ అమ్మనాన్నతో కూడా మాట్లాడుదాం. అంటూ విషయమంతా వారికి చెప్పారు. 'విడాకులా' అంటూ మొదట ఆశ్చర్యపోయినా.. బాధ్యులు ఇచ్చిన సూచనల మేరకు బిడ్డ ధైర్యం చూసి డైవర్స్కు అప్లై చేయడానికి సిద్ధమయ్యారు.
నువ్వు చదువుకున్నావు. నీ కాళ్ళపై నువ్వు నిలబడే ధైర్యం తెచ్చుకో. నీ భర్తను, అత్తను పిలిపిస్తాం. కౌన్సెలింగ్ ఇస్తాం. నువ్వు సరే అంటేనే ఇదంతా చేస్తాం' అన్నారు బాధ్యులు. 'లేదు మేడమ్ అతని రిపోర్ట్స్ చూడండి. తన లోపాన్ని కవర్ చేయడానికి నన్ను వేధిస్తున్నారు. పిల్లలు పుట్టకపోవడం నా లోపం కాదు. కానీ, వాళ్ళ చుట్టాలందరికీ నాలో లోపం ఉందని చెబుతున్నారు. నాకు విడాకులు కావాలి' అంది కీర్తి.
మేడమ్ అమ్మనాన్న ఆరోగ్యం బాగుండదు. అందుకే నేను వారికి ఏం చెప్పలేదు. అక్కతో షేర్ చేసుకునే టైం లేకపోయింది. ఈరోజు మీతో నా బాధను పంచుకుంటున్నాను. నిజం చెప్పాలంటే ఆయన ఏ రోజు నాతో ప్రేమగా మాట్లాడడు. ఎప్పుడు వాళ్ల అమ్మతోనే ఉంటాడు. బెడ్రూమ్లో కూడా వేరుగానే ఉంటాడు. ఇంట్లో పనులన్నీ చేసి అలసిపోతాను. ఆయన ఫోన్లో పిచ్చిపిచ్చి వీడియోలు చూస్తాడు. నిద్రపోతున్న నన్ను వేధిస్తాడు. మాటలతో చిత్రవధ చేస్తాడు.