Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలోచనకు ఆసరా తోడై కొత్త దిశగా వారి పయనం సాగింది. ఆరోగ్యాన్ని కబళించే మద్యం తయారీ వదిలి పచ్చళ్ల తయారీలో శిక్షణ తీసుకున్నారు. మనసుంటే మార్గం ఉంటుందన్న సూక్తిని మనసారా నమ్మి 'సారా' తయారీకి దూరంగా తమ జీవితాలను తీర్చిదిద్దుకుంటున్నారు. వారు తయారుచేసిన రకరకాల పచ్చళ్ళు హట్హట్గా అమ్ముడవుతూ కొత్త ఆర్డర్లను తీసుకువస్తున్నాయి. వీరంతా నగరంలోని ధూల్పేటకు చెందిన మహిళలు. ఆరుగురు మహిళలు ఒక బృందంగా ఏర్పడి పచ్చళ్ళ తయారీ నేర్చుకుని మహిళా సాధికారత దిశగా పయనిస్తున్నారు. ఎంటర్ప్రెన్యూర్స్గా మారారు. వారి జీవనగమనంలో మార్పు వచ్చిన విధానం..
హైదరాబాద్లోని ధూల్పేట ప్రాంతం. సినిమాల్లోనే కాదు నిజానికి కూడా ఈ ప్రాంతంలోని వారి ప్రధాన జీవనోపాధి గుడంబా తయారీ, అమ్మకం. కొందరు మత్తు కోసం సేవించే ఈ మద్యం అక్కడి స్థానిక ప్రజల ఉపాధి మార్గం, జీవనాధారం. ప్రభుత్వం గుడంబాను నిషేధించింది. దానిపై ఆధారపడిన కుటుంబాల జీవినోపాధి కల్పించాలన్న విషయం మాత్రం విస్మరించింది. దాంతో ధూల్పేటలోని చాలా కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అప్పటివరకు మగవారు గుడంబా తయారీ, అమ్మకంలో ఉంటే ఆడవారు ఇంట్లోనే ఉండేవారు. మగవారికి ఉపాధి లేకపోవడంతో ఆర్థికంగా వారి కుటుంబాలు వీధిన పడే పరిస్థితి. దాంతో ఇల్లు గడవడానికి ఆడవారు కూడా పనులు చేయాల్సి వచ్చింది. చదువులు అంతంతా మాత్రమే ఉన్న వారు కావడంతో మగవారు ఆటోడ్రైవర్లుగా, రోజూ కూలీలుగా మారారు.
మహిళలకు మాత్రం ఎలాంటి ఉపాధి లభించలేదు. సరిగ్గా అదే సమయంలో స్థానికంగా ఉన్న ఆక్స్ఫర్డ్ హైస్కూలులోని ప్రశాంతి మేడమ్ పికిల్స్ మేకింగ్పై వర్క్షాపు నిర్వహించారు. ఉపాధి కోసం వెతుకుతున్న ధూల్పేట మహిళలకు ఇది ఎంతగానే ఉపయోగపడింది. ఇంట్లోనే సులభంగా తయారు చేసే వ్యాపార అవకాశంగా పికిల్స్ తయారీని వారు ఎంచుకున్నారు.
ఫిక్కి సహాయంతో..
దాదాపు ఎనిమిది వందల మంది గుడంబా తయారీ పై ఆధారపడి జీవించేవారు. వారిలో 30మంది మహిళలు పికిల్స్ తయారీ వర్క్షాపులో పాల్గొన్నారు. కొత్త ఉపాధి మార్గాలను వెతుకుతున్న మహిళల్లోని ఆసక్తి గమనించిన ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్ఓ) వారు తయారుచేసే పికిల్స్కు మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి ముందుకు వచ్చింది. ఫిక్కి, ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లలో ధూల్పేట మహిళల కోసం ఉచితంగా స్టాల్ను కేటాయించడానికి ముందుకు వచ్చారు ఎఫ్ఎల్ఓ చైర్పర్సన్ సోనా చాట్వానీ. పికిల్స్ తయారు చేయడానికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు మార్కెటింగ్ సదుపాయం కల్పించి కొత్త ఉపాధి మార్గం కోసం అన్వేషిస్తున్న ధూల్పేట మహిళలు మంచి సహాకారం అందింది. అంతే సహజంగా తమలో ఉన్న ప్రతిభకు మెరుగులు దిద్ది అద్భుతమైన రుచులతో పచ్చళ్ళను తయారు చేశారు. ఎగ్జిబిషన్లో హట్హట్గా సేల్ కావడంతో పాటు దాదాపు 80కిలోల పచ్చళ్ళ ఆర్డర్ కూడా అందుకున్నారు.
ఆసక్తి ఉంటే..
అట్టడుగుస్థాయిలో ఉన్న తమ జీవితాల్లో మార్పు పికిల్స్ రూపంలో వచ్చిందంటు న్నారు ఇక్కడి మహిళలు. పికిల్స్ మేకింగ్ వర్క్షాపులో శిక్షణ తీసుకున్నవారిలో ప్రీతి, సునీత, శారద, మహేశ్వరి, శ్రద్ధా, కాంచన కలిసి స్టాల్ ఏర్పాటు చేశారు. వీరు తయారుచేస్తున్న పికిల్స్ను సీజన్ వారీగా విభజించారు. మార్కెట్లో ఎప్పుడూ లభించే టమాటా, మిర్చి, నిమ్మ లాంటి వాటిని ఎప్పుడు కావాలన్న అందించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఎగుమతి చేసేందుకు..
నిజంగా పచ్చళ్లు మా జీవితాల్లో వెలుగు నింపాయి' అంటూ సంతోషం వ్యక్తం చేసింది శారద. మా ప్రాంతంలో ఉన్న కుటుంబాల్లోని మహిళలు ఉపాధి శిక్షణ తీసుకుంటున్నారు. మేం తయారు చేస్తున్న పచ్చళ్ళును ఇక్కడ క్యాంటీన్లకు, హౌటల్స్కు, ఫంక్షన్ హాల్స్కు సరఫరా చేయడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం' అంటున్నారు శారద. 'భారతీయ భోజనంలో ముఖ్యంగా తెలుగువారి భోజనంలో పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మేం చేస్తున్న పచ్చళ్లుకు మంచి గిరాకీ వచ్చింది. ఇక మీదగా మాప్రాంతం పచ్చళ్ళకు ప్రసిద్ధిగా మారుతుంది. ప్రస్తుతం మేము ఆరుగురం తక్కువ పెట్టుబడితో ప్రారంభించాం. ఫిక్కీ ఇచ్చిన సహకారంతో మాకు మార్కెటింగ్ సులభం అయ్యింది. ఇప్పుడిప్పుడే పెద్దపెద్ద ఆర్డర్లు వస్తున్నాయి. మామిడి, చింతకాయ వంటి పచ్చళ్ళను మాత్రం సీజనల్గా తయారుచేస్తాం. ఇక ముందు పచ్చళ్ళతో పాటు పొడులు, వడియాలు వంటివి కూడా తయారుచేస్తాం.
సీజన్ వారీగా..
వంట చేయడం అనేది మహిళలకు కొత్తేమి కాదని, అయితే దీనిని ఉపాధి మార్గంగా మలుచుకోవాలన్న ఆలోచన మాత్రం ఇప్పుడే వచ్చిందని ప్రీతి అంటున్నారు. ' హైటెక్స్ సిటీలో రెండురోజుల పాటు ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్లో ధూల్పేట పచ్చళ్ళకు మంచి ఆదరణ లభించింది. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఐజీ స్వాత్రిలక్రా, ఐపిఎస్ మేడమ్ కూడా మా పచ్చళ్ళు చాలా రుచిగా ఉన్నాయని చెప్పారు. చాలా ఐటీ కంపెనీల క్యాంటీన్ల నుంచి ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఇది మాకు ఎంతో సంతోషానిచ్చింది' అంటూ ఎగ్జిబిషన్లో పాల్గొన్న ప్రీతి ఆనందం వ్యక్తం చేసింది.