Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దున లేవగానే ఉన్న ఉత్సాహం సాయంత్రమయ్యే సరికి ఉండదు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారిలో. సాయంత్రమవగానే అలసట కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కానీ కొంతమందిని చూస్తే ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే చురుకుగా ఉంటారు. అస్సలు అలసిపోరు. వారి ముఖంలో ఉత్సాహం తొణకిసలాడుతూ ఉంటుంది. అలా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటిస్తే సరి.
- ఒకే పనిని రొటీన్గా రోజూ చేయాలంటే ఎవరికైనా బోర్. ప్రతీ పనిని లిస్ట్ రాసిపెట్టుకున్న విధంగా చేయాలన్న రూల్ ఏమీ లేదు. అందుకే ఎప్పుడూ కొత్తగా ఆలోచించండి. ఎప్పుడూ చేసే కామన్ పనైనా సరే విభిన్నంగా కొత్తగా ఎలా చేయవచ్చో తెలుసుకోండి. దీంతో పనిపట్ల మరింత ఇష్టం కలుగుతుంది.
- ఎప్పుడైనా అలసటగా అనిపించినప్పుడో లేక పని చేయాలని అనిపించకపోయినప్పుడో, వెంటనే కోకో చాకొలెట్స్ కానీ లేక కాఫీ గానీ తాగాలి. అందులో ఉండే కోకో, నికోటిన్ పదార్థాలు మూడీగా ఉండే మైండ్ను మార్చేసి రీఫ్రెష్గా మునపటిలా ఉత్సాహంతో ఉండేలా చేస్తాయి. ఈ విషయాన్ని పరిశోధకులు కూడా నిర్ధారించారు.
- అలాగే అదే పనిగా పనిచేస్తుంటే విసుగు వస్తుంది. శరీరం అలసటకి లోనవుతుంది. అందుకని పని చేస్తున్న సమయం మధ్యలో పదినిమిషాల సమయం అయినా సరే కళ్లు మూసుకొని రిలాక్స్ అవ్వాలి. ఆ చిన్న కునుకు కూడా మనసుకు ఉత్తేజాన్ని కలగజేస్తుంది. దీని వల్ల మరింత చురుకుగా ఉండగలుగుతారు.
- ఆఫీసులో కంప్యూటర్ను అదే పనిగా చూడటం వల్ల కంట్లో నీరు ఇంకి కళ్ళు పొడిబారినట్లుగా మారిపోతాయి. ఫలితంగా కంటి సమస్యలు వస్తాయి. అంతేకాక కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. తొందరగా అలసిపోతారు. అందుకే విధినిర్వహణలో ఉన్నప్పుడు, కనీసం మూడు గంటలకు ఒక్కసారైనా సరే ఐదు నిమిషాలు మన సీటులోంచి లేచి అలా నడిచి రావాలి. దీని వల్ల కూడా ఉత్తేజం కలుగుతుంది.
- పాటలు వినడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మూడ్ బాలేకపోయినా లేక అదే పనిగా పనిచేస్తున్నట్లు అనిపిస్తే ఇష్టమైన జోష్నిచ్చే సంగీతం వినాలి. హడావిడి కలిగించే సంగీతం కన్నా మంద్రంగా సాగే శాస్త్రీయ సంగీతం వింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
- మంచి ఆహారం, మంచి ఆరోగ్యం లేకపోతే ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఉల్లాసంగా ఉండలేం. అందుకే ప్రతిరోజూ పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. అదేసమయంలో శరీరానికి చాలినంత నీటిని కూడా తాగుతూ ఉండాలి. చాలా మంది ఉద్యోగస్థులు పని హడావిడిలో పడి శరీరానికి సరిపడినంత నీరు తాగడం మర్చిపోతారు. తగినంత నీరు తాగకపోవడమే చాలావరకు వారి అనారోగ్యా నికి కారణమని చాలా సర్వేలు వెల్లడించాయి.
- మనసే అన్నింటికీ మూలం. కాబట్టి మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఏ పనైనా సక్రమంగా నెరవేర్చగలుగుతాం. అందుకు మనసును ఆధీనంలో ఉంచుకోవాలి. ప్రతీ చిన్న విషయానికి కంగారు, ఎమోషనల్ కాకూడదు. కొన్ని సందర్భాల్లో వచ్చే ఆ కంగారును అదుపులో ఉంచాలంటే, యోగా, ధ్యానం వంటి వ్యాయామాలు రోజూ చేయాలి. రాత్రి నిద్ర పోయే సమయం, ఉదయం నిద్ర మేల్కొనే సమయం ప్రతి రోజు ఒకేలా ఉండేలా శరీరానికి అలవాటు చేయాలి.
- వీటన్నింటితో పాటుగా సానుకూల ఆలోచనా దక్పథాన్ని అలవాటు చేసుకోవాలి. చేస్తున్న పనిపట్ల ఆసక్తి ప్రదర్శిస్తే, ఏ పని అయినా ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధితో చేయగలుగుతాం. దానివల్ల అనుకున్నది సాధించగలం. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండగలం