Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఇన్ ఆంఖోంకి మస్తీ కే.. మస్తానే హజారోం మే'' అని పాడితే... రేఖ కళ్లతో పాటు ఆశా స్వర మాధుర్యంలో ఓలలాడారు శ్రోతలు. ''ఇస్ షహర్ మే తుమ్ జైసే దివానో హజారోం మే'' అన్న ఆమె గొంతును పిచ్చోళ్లలా ప్రేమించారు. ప్రేమిస్తూనే ఉన్నారు. ఒకటా రెండా.. వేల సినిమాల్లో వేవేల పాటలు. ఒక్కోపాటా ఒక్కో జానర్. గజల్, క్యాబరే నంబర్, రొమాంటిక్ సాంగ్, పాప్, భజన్స్, ఖవ్వాలీలు, జానపదాలు, శాస్త్రీయం.. రవీంద్రుని సంగీతం. పాట ఏదైనా... జీవం పోసే విద్య ఆమెకు మాత్రమే తెలుసు. ఒక్క హిందీనేనా... 20 దేశీవిదేశీ భాషల్లో పాడింది. ఆమె సృష్టించని రికార్డులు లేవు. దాదాసాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్... ఆమెను వరించని అవార్డులు లేవు. ప్లేబ్యాక్సింగింగ్ బ్యాడ్గాళ్ అన్నారు. అక్క పేరు లేకుండా ఆమె లేదు. కానీ ఇప్పుడామె పేరు లేకుండా సంగీతం లేదు. భారతీయ సంగీత ప్రపంచంలో ఆమె ఓ శిఖరం. నేడు 85వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆశాజీకి శుభాకాంక్షలతో...
ఆశా భోస్లే మహారాష్ట్రలోని సాంగ్లి పట్టణంలో జన్మించింది. తండ్రి దీనానాధ్ మంగేష్కర్ గొప్ప శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. రంగస్థల నటుడు కూడా. తల్లి శేవంతి గృహిణి. కుటుంబమంతా మరాఠీ థియేటర్తో ముడిపడి ఉంది. ఐదుగురు సంతానంలో మూడో వ్యక్తి ఆశా. అందరితోబాటు ఆమె కూడా చిన్నతనం నుంచే శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంది. నాటకాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా వేస్తుండేది. తనకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు 1942లో తండ్రి చనిపోయారు. ఫ్యామిలీ ఫ్రెండ్ మాస్టర్ వినాయక్ సలహా మేరకు వారి మకాం బొంబాయికి మారింది. ఆశాకు పదేళ్ల వయసులోనే ఒక మరాఠీ సినిమాకు పాడే అవకాశం వచ్చింది. తరువాత 'చునరియా' (1948)లో హన్సాజ్ర్ బెహల్ సంగీత దర్శకత్వంలో మొట్టమొదటి హిందీ గీతం ఆలపించింది. అప్పటికే అక్క లతా మంగేష్కర్ మంచి గాయని. కుటుంబం ఆర్ధికంగా నిలదొక్కుకుంది. లతా మంగేష్కర్కు వ్యక్తిగత కార్యదర్శి గణపతిరావు భోస్లేను ఆశా పెండ్లి చేసుకుంది. కానీ పదహారేండ్ల ఆకర్షణలో చేసుకున్న పెండ్లి... ఆమెను కష్టాల్లోకి నెట్టింది. కుటుంబాన్ని చూడటానికి వీలు లేదు. కొన్నేండ్లపాటు కనీసం ఉత్తరం కూడా రాయలేని పరిస్థితి. అందరు సంగీత దర్శకుల దగ్గరకు తీసుకెళ్లడం, ఆడిషన్స్ ఇప్పించడం చేసేవాడు భర్త. ఆశా బాగా డబ్బు సంపాదించి పెడుతుంది. తాను ఆమెను కంట్రోల్లో పెట్టుకోవచ్చని ఆశించాడు. నిరాశ ఎదురైంది. ఆమె గొంతు విభిన్నమైనది. కానీ అంత సులభంగా అవకాశాలు రాలేదు. 1948 నుంచి 1956 వరకు ఆశా 800 పాటలు పాడింది. ఆ రోజుల్లో ఏ గాయని అన్ని పాటలు పాడలేదు. ఒక్కోసారి రోజుకు ఐదు పాటలు పాడేది. అదంతా నంబర్గేమ్. అవకాశాలకోసం ఎన్నో పాట్లు పడింది. ఆ లోపు పిల్లలు. చాలా కష్టాలు పడింది. ఇక భరించలేక 1960లో భర్తను వదిలేసి... గర్భిణిగా, ఇద్దరు పిల్లతో బయటికొచ్చింది. గాయనిగా అప్పుడప్పుడే పేరు వస్తున్నా... ఒంటరి తల్లిగా అనేక కష్టాలు పడింది.
అన్ని జానర్స్ లోనూ...
మరోవైపు సినిమాల్లో పాడే అవకాశాలు వచ్చాయి.. కానీ అన్ని సి-గ్రేడ్ సినిమాలు. ఆ స్థాయి నుంచి ఆమె ఎదగడానికి చాలా కాలమే పట్టింది. ఆమె హిందీ మీద మరాఠీ ప్రభావం చాలా ఉండేది. అది పోగొట్టుకుని ఉర్దూ డిక్షన్ నేర్చుకోవడానికి చాలా కష్టపడింది. ఆ కష్టం ఫలించి 1956లో సీఐడీ చిత్రంలోని పాటతో పెద్ద బ్రేక్ వచ్చింది. ఓపీ నయ్యర్ సహకారంతో అవకాశాలు మరింత పెరిగాయి. అతని సినిమాల్లో చివరి రికార్డింగ్ దాకా అన్నీ హిట్సే. సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్ ఆశాలోని టాలెంట్ను గుర్తించారు. ఆమెకు మంచి అవకాశాలు కలిపించారు. ఆ తరువాత సచిన్ తనయుడు ఆర్.డి. బర్మన్తో 1966లో వచ్చిన 'తీస్రీ మంజిల్'తో ఆశా ప్రయాణం మొదలైంది. ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. ఆ సినిమాలో అన్ని పాటలు.. హిట్. ఆర్డీ బర్మన్ ఆశాతో పాడించని పాటలేదు. క్యాబరే, రాక్, డిస్కో, గజళ్లు, ఖవ్వాలీలతోపాటు శాస్త్రీయసంగీతాన్ని కూడా. పాటేదైనా పర్ఫెక్షన్ ఆమె సొంతం. ప్రాణం పెట్టి పాడేది. ఆ కాలంలో గ్రేసఫుల్ డ్యాన్సర్ హెలెన్కు... గొంతుకయ్యింది ఆశా. 'పియా తు అబ్ తో ఆజా', 'దమ్ మారో దమ్...' వంటి పాటలు ఆశాలోని కొత్త గొంతుకను పరిచయం చేశాయి. 'చురా లియా హై తుమ్ నే' పాట... ఆ శతాబ్దపు రొమాంటిక్ సాంగ్స్లో ఒకటి.
విమర్శలకు సమాధానంగా...
ఆమె గొంతే విలక్షణం. అందులో పలికే జీరపైనా ఎన్నో విమర్శలు. 1981లో వచ్చిన 'ఉమ్రావ్ జాన్'లోని పాటలతో ఆ నోళ్లన్నీ మూత పడ్డాయి. అన్ని జానర్స్తోపాటు క్లాసికల్స్ కూడా అద్భుతంగా పాడగలనని నిరూపించింది. ఇప్పటికీ ఆ గజల్స్ను ఇష్టపడని వారుండరు. అదో చరిత్ర. అలాగని ఆ చరిత్రలోనే ఉండిపోలేదు. ఎఆర్ రెహ్మాన్, అనుమాలిక్, సందీప్ చౌతా వంటి సంగీత దర్శకులకు కూడా పాడి... వయసు అసలు సమస్యే కాదని తేల్చి చెప్పింది. 30 ఏండ్ల వయసులో ఉన్న మాధుర్యమే మళ్లీ పలికించింది. అక్క లతా ఎంత పెద్ద గాయనిగా ఎదిగినా ఆమె నీడలా ఉండటానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. తనదైన శైలిని సృష్టించుకుంది. తన స్వరంతో సంగీతంలో ప్రయోగాలు చేస్తూ పోయింది. కేవలం బాలీవుడ్కే పరిమితమైపోలేదు. ప్రాంతీయ భాషా చిత్రాలకూ పాడింది. ఆర్.డిబర్మన్, గుల్జార్తో కలిసి 'దిల్ పడోసీ హై' ఆల్బమ్ చేసింది. తరువాత సంగీత కారుడు లెస్సీ లెవీస్తో కలిసి ఆమె చేసిన ఇండీపాప్ ఆల్బమ్ ి 'జానమ్ సమ్ఝా కరో'కి వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఎమ్టీవీ మ్యూజిక్ అవార్డులను గెలుచుకున్నది. 2000 సంవత్సరంలో ఆర్.డి బర్మన్ కలెక్షన్స్న రిమిక్స్ చేసి... 'రాహుల్ అండ్ ఐ' పేరుతో ఆల్బమ్ విడుదల చేసింది. తరువాత రెండేళ్లకు... 'ఆప్ కీ ఆశా'పేరుతో ఆల్బమ్ కంపోజ్ చేసి పాడింది. అద్నాన్ సమీతో కలిసి 'కభీ తో నజర్ మిలావో' ఆల్బమ్ చేసింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో మేటి అలీ అక్బర్ఖాన్తో చేసిన ఆల్బమ్తో గ్రామీకి నామినేట్ అయ్యింది. గులామ్ అలీ, మెహదీ హసన్, జగ్జీత్సింగ్ వంటి గజల్ కళాకారులతో కలిసి పాడింది. ఓ భక్తి సంగీత ఆల్బమ్ కూడా చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రేరణ..
ప్రపంచమంతా పర్యటించింది. లండన్లో ఉండగా ఇంగ్లీష్ నేర్చుకుంది. ప్రదర్శనలిచ్చింది. 20 రోజుల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని 13 నగరాల్లో ప్రదర్శనలిచ్చింది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా వేదిక ఏదైనా... ఆమె పాడుతుందంటో శ్రోతలతో స్టేడియం కిక్కిరిసిపోయేది. ఆశా గొంతు... అది చేసే మాయ అంతర్జాతీయ సంగీతకారులెందరికో ప్రేరణ నిచ్చింది. బ్రిటీష్ ఒపెరా పాప్ సింగర్ సారా బ్రైట్మెన్ ఉమ్రావ్జాన్లో ఆమె పాడిన పాట 'దిల్ ఛీజ్ క్యా హై' పాటను రీమిక్స్ చేశాడు. ఏడు సార్లు ఉత్తమ గాయనిగా ఫిలింఫేర్ బహుమతులు అందుకుంది. పద్దెనిమిది సార్లు వాటికోసం నామినేషన్ పొందింది. 1979 తరువాత తనను ఉత్తమ గాయని స్థానానికి నామినేట్ చేయవద్దని, నూతన గాయనీమణులను ప్రోత్సహించమని ఫిలింఫేర్ బహుమతుల కమిటీకి అభ్యర్ధన పంపింది. అయితే 1996లో రంగీలా సినిమాలో పాడినందుకు ప్రత్యేక బహుమతిని ఫిలింఫేర్ కమిటీ ఆమెకు బహూకరించింది. 2001లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది. జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా 'ఉమ్రావ్ జాన్', 'ఇజాజత్' సినిమాలో పాటలకు భారత ప్రభుత్వం బహుమతి అందజేసింది. గ్రామీ అవార్డుకు నామినేట్ చేయబడిన తొలి భారతీయ గాయనీమణి ఆశా భోస్లే. భారత ప్రభుత్వంచే 2000 సంవత్సరంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును, 2008లో పద్మ విభూషణ్ అవార్డును ఆశాజీ అందుకుంది. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయనిగా లిమ్కాబుకాఫ్ రికార్డ్సులో చోటు సంపాదించుకున్నది.
వారి బంధానికి సంగీతమే పునాది..
తొలి వివాహం విచ్చిన్నమైన నేపథ్యంలో ఆశా ఒంటరిగానే ఉండిపోయింది. ఆర్డి బర్మన్ అప్పటికే తొలి భార్య రీటా పటేల్తో విడాకులు తీసుకొని వున్నాడు. ఆశాతో ఆర్డీ బర్మన్ పరిచయం బాల్యం నుంచే. తరువాత ఆమె గాయనిగా మంచి స్థితిలో, అతను ఔత్సాహిక సంగీత దర్శకునిగా ఉన్న సమయంలో ఇద్దరూ కలిశారు. కొన్నేండ్లపాటు ఎవరో తెలియకుండా ఆయన పువ్వులు పంపేవాడు. ఓ రోజు గీత రచయిత మజ్రూహ్, పంచమ్దా ఉండగా గులాబీ పువ్వులు వచ్చాయి. అప్పుడామె... 'అవి బయట పడేయండి. ఎవరో వెధవ పువ్వులన్నీ నా మీద వేస్ట్ చేస్తున్నాడు' అనేసింది. అప్పుడు పంచమ్ ముఖం పాలిపోయింది. అది చూసిన మజ్రూహ్ సాబ్ నవ్వేసి... 'ఆ వెధవ వీడే అని' పంచమ్ని చూపిస్తూ చెప్పేశాడు. అట్లా ఆర్డి బర్మన్ రహస్య ప్రేమ ఆమెకు తెలిసిపోయింది. రాహుల్ ఆశా భోస్లే కంటే వయసులో చిన్నవాడే. కానీ, సంగీతం ఆ ఇద్దరినీ ఒకటి చేసింది. 1980లో ఇద్దరూ పెండ్లి చేసుకున్నారు. వాళ్లిద్దరు భార్యభర్తలకంటే మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇద్దరి బంధంలో ఎంతో పరిణితి ఉండేది. 'నేను ఆశాను పెండ్లి చేసుకోలేదు. తన స్వరాన్ని చేసుకున్నాను' అనేవాడు. నిజానికి ముగ్గురు పిల్లల తల్లిని... తనకంటే వయసులో చిన్నవాడు చేసుకోవడమంటే సమాజం అంగీకరించదు. కానీ ఆర్డీ సమాజాన్ని పట్టించుకోలేదు. ఆమె అతని ప్రేమకు దాసోహమయ్యింది. 1994లో ఆర్డీ బర్మన్ చనిపోయేదాకా ఇద్దరూ కలిసే ఉన్నారు. 'మా ఇద్దరి అనుబంధానికి సంగీతమే పునాది. ప్రపంచాన్ని పట్టించు కోకుండా... గంటలు గంటలు సంగీతాన్ని వినేవాళ్లం' అని చెప్పుకునేవారిద్దరూ.
- ఆద్యా ఏంజిలో