Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నువ్వులు... ఆరోగ్యానికి ఎంతో మేలు. వేడి అని చాలామంది వీటిని ఉపయోగించరు కానీ.. నువ్వుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. అందుకే.. పాలకు ప్రత్యామ్నాయంగా తీసుకుంటారు కొందరు. నువ్వులను బెల్లంతో కలిపి చిక్కీస్ చేసుకున్నా, చింతపండుతో కలిపి తీపి పచ్చడి తిన్నా, కొబ్బర కలిపి లడ్డూలు చుట్టినా... అవి ఎముకలకు అందించే బలం అంతా ఇంతా కాదు. అలాంటి నువ్వుల స్పెషల్స్ ఈవారం...
నువ్వుల తీపి పచ్చడి
కావల్సిన పదార్థాలు: తరిగిన బెల్లం -1 కప్పు, నువ్వులు-1 కప్పు, ఎండుమిర్చి-12, ఆవాలు, జీరకర్ర- 2 చెంచాలు, మిరియాలు-1/2 చెంచా, చింతపండు రసం -2 కప్పులు, ఉప్పు-2 చెంచాలు
తయారు చేయు విధానం: నీటిలో బెల్లం, చింతపండు రసం, ఉప్పుకలిపి దగ్గరగా ఉడికించి పక్కన పెట్టాలి. శుభ్రం చేసిన నువ్వులను మిక్సీపట్టి ఈ మిశ్రమంలో కలపాలి. చివరగా పోపులు వేయించి మిక్సీపట్టి కలపాలి. ఈ పచ్చడి అన్నంలోకి రుచిగా ఉంటుంది.
నువ్వుల పచ్చి పులుసు
కావల్సిన పదార్థాలు: నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు, చింతపండు - నిమ్మకాయంత, పంచదార - 1 టీ స్పూను, నీరు - ఒకటిన్నర కప్పు, పచ్చిమిర్చి - 2, ఉల్లి తరుగు - అరకప్పు, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - 1 కట్ట, కరివేపాకు - 4 రెబ్బలు, పసుపు, ఆవాలు, జీలకర్ర, నూనె - పోపుకు సరిపడా.
తయారు చేయు విధానం: నువ్వుల్ని వేయించాలి. పచ్చిమిర్చిని మంటపై కాల్చి చల్లారిన తర్వాత ఉప్పు, నువ్వులతో పాటు బరకగా మిక్సీ వేసుకోవాలి. నానబెట్టి తీసిన చింతపండు రసంలో నీరు, నువ్వుల మిశ్రమం, ఉల్లితరుగు, ఉప్పు, పంచదార, కొత్తిమీర తరుగు కలపాలి. తాలింపు కలిపి ఫ్రిజ్లో గంటసేపుంచి అన్నంలో కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
నువ్వుల లడ్డు
కావల్సిన పదార్థాలు: తెల్ల నువ్వులు- నాలుగు కప్పులు, నీళ్లు- అరకప్పు, బెల్లం పొడి- ఒకటిన్నర కప్పు, కొబ్బరి తురుము లేదా చిన్న చిన్న ముక్కలుగా తరిగినది- ఒక కప్పు.
తయారు చేయు విధానం: ఒక పాన్లో నువ్వులు వేసి లేత గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించాలి. వేరొక గిన్నెలో బెల్లం, నీళ్లు పోసి సన్నటి మంటపై వేడి చేయాలి. బెల్లం పూర్తిగా కరిగాక కొబ్బరి తురుము లేదా ముక్కలు వేయాలి. ఈ మిశ్రమం కొద్దిగా చిక్కబడేవరకు చిన్న మంటపై మాత్రమే వేడి చేయాలి. పాకం చిక్కబడ్డాక స్టవ్ ఆపేసి నువ్వులుపోసి బాగా కలపాలి. వేడి తగ్గాక ఈ మిశ్రమంతో ఉండలు చేయాలి. అంతే నోరూరించే నువ్వుల లడ్డూ రెడీ. ఇది మహారాష్ట్రవారు సంక్రాంతికి వండుకునే ప్రత్యేక వంట.
నువ్వుల పొడి పులిహౌర
కావల్సిన పదార్థాలు: చింతపండు పేస్ట్ - 3 చెంచాలు, నువ్వుల పొడి - 3 చెంచాలు, ఎండుమిరపకాయలు - 3-4, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ - 2 చెంచాలు, పల్లీలు - 3 చెంచాలు, ఆవాలు - 1 చెంచా, జీలకర్ర - 1 చెంచా, మినపప్పు - 1 చెంచా, సెనగపప్పు 1 చెంచా, ఉడికిన అన్నం - 2 కప్పులు, కరివేపాకు - 1 రెమ్మ, ఇంగువ - చిటికెడు, నూనె 5-6 చెంచాలు, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు
తయారు చేయు విధానం: ముందుగా ఉడికిన అన్నంలో పసుపు, ఉప్పు, నువ్వుల పొడి, చింతపండు పేస్ట్, నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత పొయ్యి మీద నూనె పెట్టి అందులో ఆవాలు, మినపప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, పల్లీలు, ఇంగువ వేసి వేయించాలి. పోపు వేగిన తరువాత అందులో వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే
టమాట నువ్వుల పచ్చడి
కావల్సిన పదార్థాలు: టమాటలు- 2, నువ్వులు- 2 చెంచాలు, పచ్చిమిర్చి- 2, ఎండు మిర్చి- 3-6, చింతపండు పేస్ట్- 2 చెంచాలు, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- తగినంత
తయారు చేయు విధానం: ముందుగా నువ్వులను ఫ్రైయింగ్ పాన్ లో వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ బాటమ్ పాన్ ను స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసి, అందులో పచ్చిమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండు మిర్చి కూడా వేసి వేయించుకోవాలి. అలాగే టమాట ముక్కలు కూడా వేసి నీరు పోయేంత వరకూ వేయించు కోవాలి. తర్వాత చింతపండు గుజ్జును టమాటోముక్కల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ముందుగా వేయించి పెట్టుకొన్న నువ్వులను, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకొన్న టమోటో చింత గుజ్జుతో సహా వేసి, ఉప్పు కూడా వేసి మరో సారీ గ్రైండ్ చేసుకోవాలి. అంతే నువ్వుల టమోటో చట్నీ రెడీ. దీన్ని వేడి వేడి గ్రీ రైస్ తో టింటే చాలా రుచిగా ఉంటుంది.