Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జామకాయలు దొంగిలించి తినడం, పండిన సీతాఫలాలు చెట్టునుంచే నేరుగా తెంపుకొని తినడం, కూరగాయలన్నీ పెరట్లోనే పండించడం, పెరట్లో పండించిన కూరగాయలను ఇచ్చిపుచ్చుకోవడం కొన్ని తరాల జ్ఞాపకాలు. కానీ ఇప్పుడంతా మార్కెట్ మాయాజాలం. పురుగుల మందుల ప్రభావం. ఫలితం ఏం కొనాలన్నా భయం. ఏం తినాలన్న ఆందోళన. వీటి నుంచి బయటపడేందుకే టెర్రస్ గార్డెనింగ్ మొదలుపెట్టిందీ ఉషా గజపతిరాజు. వృత్తిరీత్యా డైటీషియన్ అయిన ఆమె... ఆరోగ్యకరమైన, పర్యావరణానికి హాని కలిగించని విధంగా టెర్రస్గార్డెనింగ్ చేస్తూ.. ఎంతోమంది నగరవాసులకు స్ఫూర్తిగా నిలుస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా జనాభా విపరీతంగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా... అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కాంక్రీట్ జంగిల్స్ గా మారుతున్న నగరాలు, పట్టణాల్లో ప్రజల ఆహార అవసరాలు తీర్చడం కష్టంగా మారింది. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ తరుణంలో స్థానికుల అవసరాలు తీరుస్తున్న నూతన వ్యవసాయ విధానం పై అందరికి మక్కువ పెరుగుతోంది. వ్యవసాయ భూమి కరువైన నగరాల్లో బాల్కనీలు, మిద్దెలు, వాడిపడేసిన వస్తువులు, ఇంటి ఆవరణలనే సేద్యపు నేలగా మార్చేస్తున్నారు. ఈ ప్రక్రియకు కొన్ని సంస్థలు ఆధునిక సాంకేతికత జోడిస్తూ నగర వ్యవసాయానికి కొత్త సొబగులు అద్దుతున్నారు కొందరు. ఆ కొందరిలో ముందుంటారు ఉషా గజపతిరాజు.భీమవరంలో పుట్టి పెరిగింది ఉష. ఇప్పుడంటే పండ్లు కొనడం కానీ.. అప్పుడంతా బాల్యం అంటే... చెట్లెక్కడం పండిన పండ్లను తెంచుకుని తింటూ ఆనందించడం. ఎంతో సరదా. ఆమె బాల్యం కూడా అలా సరదాసరదాగానే సాగింది. కూరగాయలు కూడా తోటల నుంచి నేరుగా గడపల ముందుకే వచ్చేవి. తాజాగా ఉండేవి. పురుగుల మందులు అంతగా లేవు. ఎంతో టేస్టీగానూ ఉండేవి. కొన్నయితే అలాగే పచ్చిగానే తినేయాలనిపించేది. ఇంటర్మీడియట్ అయిపోగానే పెండ్లయ్యింది. విశాఖపట్నం వచ్చేసింది. అక్కడ తాజా కూరగాయలు, పండ్లు దొరకడం కలగానే మిగిలిపోయింది. రద్దీ మార్కెట్లోకి వెళ్లడం, రుచీపచీలేని కూరగాయలు, పండ్లను కొనడం అస్సలు నచ్చేది కాదు. ఇక వాటిమీద పురుగుల మందులు, ఇతర రసాయనాలు మచ్చలు తెల్లగా కనిపించేవి. దాంతో మార్కెట్కు వెళ్లాలంటేనే విసుగనిపించిందామెకు. ఇంటి దగ్గరే నెమ్మదిగా కూరగాయలు, ఆకు కూరలను పండించడం మొదలుపెట్టింది. తరువాత ఫ్లాట్ కొనుకున్నాక... దాని టెర్రస్లోనే గార్డెనింగ్ చేయాలన్న ఆలోచన వచ్చింది. రెండువందల చదరపు అడుగులున్న టెర్రస్ మీద... గార్డెనింగ్ మొదలుపెట్టింది. అదికాస్తా ఇప్పుడు 800 చదరపు అడుగులకు విస్తరించింది.
ముంచిన తుపాను...
ఈ ప్రయాణం అనుకున్నంత ఈజీగా సాగలేదు. చాలా సమస్యలు వచ్చాయి. దశాబ్దం కిందట ఫ్లాట్కు షిఫ్టయ్యింది. తనతోపాటు అదే భవనంలో ఉన్న మరో నాలుగు కుటుంబాలు కూడా ఆ అపార్ట్మెంట్కు వచ్చాయి. బిల్డర్ నుంచి దాని టెర్రస్ హక్కులను కూడా కొనేశారు. మొదట 200 చదరపు అడుగుల్లో ఆకు కూరలు, టమాట, మందార, గులాబీ వంటి పువ్వులు, కొన్ని రకాల కూరగాయలు పెంచింది. ఆ సంతోషం ఎక్కువకాలం నిలవ లేదు. 2014లో వచ్చిన హుద్హుద్ తుపాను ... విశాఖ ముఖచిత్రాన్నే మార్చేసింది. ప్రకృతి బలమేంటి, దాని ఆగ్రహం ఎలా ంటుందో ఆమెకు తెలిసొచ్చింది. అప్పటినుంచి.. ఏది చేసినా పర్యావరణానికి హాని కలిగించకుండా చేయాలని నిర్ణయించుకుంది. తుపాను ప్రభావం పోయాక... టెర్రస్ గార్డెన్ను పునరుద్ధరించింది. అదికూడా పూర్తిగా సహజమైన పద్ధతుల్లో. అందుకోసం సేంద్రియ సాగు పద్ధతులన్నింటినీ ఇంటర్నెట్లో చూసి నేర్చుకుంది. ఇంట్లో ఉన్న రకరకాల బాటిల్స్, డబ్బాలను... మొక్కలు పెట్టడానికి ఉపయోగించింది. ప్లాస్టిక్ కంటెయినర్స్, థర్మాకోల్ బాక్సులు, కార్టన్స్, మట్టి నిల్వ చేయగలిగే వాటినన్నింటినీ మొక్కలకోసమే వాడింది. దీని వల్ల డబ్బు ఆదా చేయడమే కాదు... ఆ ప్లాస్టిక్ను సముద్రంలోకి విసిరేసో, భూమిలో పడేసో పర్యావరణానికి హాని కలిగించకూడదన్న స్పృహతో చేసింది. మంచి నీళ్లను సరఫరా చేసేవాళ్ల దగ్గర పాడైపోయిన 20 లీటర్ల క్యాన్లను కూడా తీసుకుని.. టాప్ కట్ చేసి మట్టికి కుండలా ఉపయోగించింది. చివరికి పాత షూను కూడా వదిలిపెట్టలేదు.
ఇంటర్నెట్తో...
మట్టి సరే... ఎరువుల మాటేమిటి. మళ్లీ మూలాల్లోకి వెళ్లింది. పాత పద్ధతిలోనే వంటగదిలోని వేస్టేజీనే ఎరువుగా ఉపయోగించడం మొదలుపెట్టింది. మొక్కలు పెరిగాయి. తన ఇంట్లోని చెత్త సరిపోలేదు. అపార్ట్మెంట్లో ఉన్న ఐదు ఇండ్లలోకి వెళ్లి... వంటగది చెత్తను సేకరించి ఉపయోగించింది. పాత బకెట్లకు డ్రిల్లింగ్తో రంధ్రాలు ఏర్పాటు చేసి... కంపోస్టర్స్ ఏర్పాటు చేసింది. ప్రారంభించిన రెండు నెలల్లోనే టమాటతోపాటు రకరకాల కూరగాయలు చేతికొచ్చాయి. వీటి చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో... టెర్రస్ గార్డెనింగ్ చేయాలనుకున్న చాలామంది ఆమెకు టచ్లోకి వచ్చారు. అన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలతోపాటు.. పసుపు, అల్లం, ఆవాలు, పల్లీలు కూడా పండిస్తున్నది. జామ, పుచ్చ, సపోటా, సీతాఫలం, డ్రాగన్ఫ్రూట్ వంటి పండ్లు కూడా ఈ టెర్రస్ గార్డెన్లోనే. మొదట్లో అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చితో పెస్టిసైడ్స్ తయారు చేసి వాడింది. 2017 తరువాత ఆ వాడకం కూడా తగ్గించింది. ఎందుకంటే... ఆమె తోటలోకి పిచ్చుకలు రావడం మొదలయింది. అవే పురుగులన్నింటినీ తినేస్తాయి. దాంతో పురుగుల మందుల అవసరమే లేకుండాపోయింది.
మల్టీ టాస్కింగ్...
సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె గార్డెనింగ్ అందరికీ తెలిసింది. ఫేస్బుక్లో ' రైతు మిత్ర గ్రూప్' ఏర్పాటు చేసింది. దీని ద్వారా... సేంద్రియ ఎరువుల ద్వారా సహజ పద్ధతిలో జీరోబడ్జెట్తో సాగు చేస్తున్న రైతులు, గార్డెనర్స్ను ప్రోత్సహిస్తున్నది. సాగుచేస్తున్న రైతులకు, కొనుగోలు దారులకు వారధిగా కూడా పనిచేస్తున్నది. తోటలు పెంచాలనుకునేవాళ్లకోసం ఉచితంగా విత్తనాలు, మొక్కలు సరఫరా చేస్తున్నది. కేవలం తన ఇంటికోసం కూరగాయలు, పండ్లు పెంచుకోవడం మాత్రమే కాదు... పర్యావరణంపై అవగాహన కల్పించడం కోసం, వేస్ట్మేనేజ్మెంట్, కంపోస్టింగ్ మీద వర్క్షాపులు నిర్వహిస్తున్నది. అంతేకాదు... వృత్తిరీత్యా... డైటీషియన్ అయిన ఉషా ఫ్రీలాన్స్ డైటీషియన్గా, కన్సల్టంట్గా కూడా పనిచేస్తున్నది. రోజూ ఉదయమే ఓ గంట గార్డెన్లో గడిపేస్తుంది. వీలు కుదిరినప్పుడు సాయంత్రాలు సైతం గార్డెనింగ్ చేస్తుంది. మిగిలిన సమయాల్లో... ఉషా వాళ్లమ్మ, వాళ్ల వాచ్మెన్ గార్డెన్ పనులు చూసుకుంటారు. డయాబెటిస్ ఉన్న పిల్లలకోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ డయాబెటిక్ చైల్డ్ సొసైటీకి కోశాధికారి. ఆ సంస్థ 270మంది డయాబెటిక్ పిల్లలకు సపోర్ట్ చేస్తుంది. వాళ్లకు ఇన్సులిన్, గ్లూకోమీటర్స్, స్ట్రిప్స్, లాన్సెట్స్ అందిస్తున్నది. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఫెడరేషన్తో అసోసియేట్ అయి ఉన్నది. అలాగే... సీఎస్ఆర్ ఆర్గనైజేషన్ సిటీజెన్ అంబాసిడర్గా కూడా పనిచేస్తున్నది. తడిచెత్త, పొడిచెత్త వేరు చేయడం, వాటిని ఉపయోగం మీద అవగాహన కల్పిస్తున్నది. ఇటీవల ఆమె విడుదల చేసిన రెండు వీడియోలు వైరల్ అయ్యాయి. అనేక ప్రశంసలు అందుకున్నాయి. నగరముఖ చిత్రాన్ని మార్చుతూ... పర్యావరణానికి మేలు చేస్తున్న ఉషా గజపతిరాజు కృషి అభినందనీయం.
ఆరోగ్యంగా ఉంచుతుంది..
''తాజాదనంతోపాటు రుచిలో ఇంట్లో పండించిన కూరగాయలు, పండ్లను మించినవి లేవు. మేం వాడే కూరగాయలన్నీ మా టెర్రస్మీద పండించినవే. సొంతంగా ఆహారపదార్థాలను పండించుకోవడం ఎంతో సంతోషాన్ని తృప్తిని ఇస్తుంది. దానికోసం పెడుతున్న నా శక్తిసామర్థ్యాలన్నీ నా కటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుతున్నాయి. నగరాల్లోనే కాదు... ఇప్పుడు గ్రామాల్లో సైతం ఇంటి చుట్టూ పెరడి, దాంట్లో కూరగాయలు పండించుకునే వాతావరణం ఉండటం లేదు. అలాంటిది నాగరాల్లో టెర్రస్ గార్డెన్... చాలా ఉపయోగకరం''