Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సునీల్ ప్రవర్తనలో మార్పు కోసం ఎంతగానో ప్రయత్నించింది సునీత. పదేండ్ల వైవాహిక జీవితంలో ఇద్దరు పిల్లలు కలిగినా.. పిల్ల చేష్టలు పోలేదు సునీల్లో. సొంత ఇల్లు, నిలకడైన ఉద్యోగం ఉన్నా స్నేహితులతో కలిసి జల్సాలు, మార్కెట్లోకి వచ్చిన ప్రతి బండిని కొనడం అమ్మడం, తెలిసిన వారందరి వద్ద అప్పులు చేయడం . పిల్లలు పెరుగుతున్నారు, ఖర్చులు పెరుగాతాయి అంటూ సునీత చెప్పే మాటలను వినిపించుకోలేదు. ఫలితంగా అప్పుల బాధ తట్టుకోలేక సొంత ఇంటి నుంచి కిరాయి ఇంటికి మారాడు. అక్కడ మార్పు రాకపోవడంతో ఆరునెలలకు పైగా కిరాయి బకాయి పడటంతో ఓనర్ ఇంటికి తాళం వేసింది. గత్యంతరం లేక భార్యబిడ్డలను పుట్టింటికి పంపించి, తాను తల్లిదగ్గరకు వెళ్ళిపోయాడు. ఎనిమిది నెలలైనా భర్త వచ్చి తీసుకుపోవడంతో ఐద్వాఅదాలత్ను ఆశ్రయించింది సునీత..
సునీల్ కుటుంబం ఇరవైఏండ్ల కిందట హైదరాబాద్కు వలస వచ్చింది. తండ్రి ఆటోట్రాలీ నడిపేవాడు. సునీల్కు చదువు అంతగా అబ్బకపోవడంతో తండ్రితో పాటే ఆటో నడిపేవాడు. తమ్ముడు అనిల్ డిగ్రీ వరకు చదివి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. పెండ్లి చేసుకుని హాయిగా ఉన్నాడు.
కొడుకుపై బెంగతోనే..
సునీల్ నిలకడగా ఉద్యోగం చేయకపోవడం, స్నేహితులతో ఎక్కువగా తిరగడం, అప్పులు చేయడం భరించలేక తండ్రి ఎన్నో సార్లు మందలించాడు. పెండ్లి చేస్తే మారుతాడని సునీత సంబంధం ఖాయం చేసుకున్నారు. పెండ్లి తర్వాత బాధ్యతలు పెరిగి బుద్ధిగా ఉంటాడు అనుకున్న సునీల్ తల్లిదండ్రుల ఆలోచన తలకిందులైంది. కొడుకులో ఎలాంటి మార్పు రాలేదు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంటి బాధ్యత పట్టలేదు. దాంతో వేరు కాపురం పెట్టమని ఇంట్లో నుంచి పంపించారు. కొడుకుపై బెంగతోనే తండ్రి జబ్బు పడ్డాడు. ఆరునెలలు అనారోగ్యంతో పోరాడి చనిపోయాడు. తండ్రి చావు ఖర్చులు కూడా భరించే స్థితిలో సునీల్ లేకపోవడంతో అంతా తల్లి, తమ్ముడే చూసుకున్నారు.
పుస్తెలతో సహా..
సొంత ఇంటి నుంచి కిరాయి ఇంటికి మారిన తర్వాత సునీల్కు ఖర్చులు పెరిగాయి. కొన్నిరోజులు బుద్ధిగానే ఉద్యోగం చేసినా.. స్నేహితుల కారణంగా జీతం మాత్రం ఇంటికి వచ్చేది కాదు. దాంతో సునీత పుట్టింటి సహయం కోరేది. ఏడాది కిరాయి డబ్బులు కూడా బాకీ పడటంతో ఇంటి ఓనర్తో మాటలు పడలేక పుస్తెలతో సహా అమ్మి కిరాయి కట్టింది. ఇంకా ఆరునెలల అద్దె బాకీ పడటంతో ఇంటికి తాళం వేసుకుంది ఓనర్. దాంతో భార్యబిడ్డలను పుట్టింట్లో దింపివచ్చాడు. అప్పుడప్పుడు వెళ్ళి పిల్లలను చూడటం తప్ప భార్యబిడ్డలను ఇంటికి తీసుకువెళ్ళలేదు.
సునీత చెప్పిందంతా విన్న తర్వాత సునీల్ను రమ్మని వాళ్ళ సొంత ఇంటి అడ్రస్కు లేఖ పంపించారు ఐద్వా బాధ్యులు. లేఖ చూసి తర్వాతి వారం తల్లిని తీసుకుని వచ్చాడు సునీల్. సునీత చెప్పిన విషయాలన్నీ చెప్పి అతని అభిప్రాయం చెప్పమన్నారు.
ఇల్లు మారినా..
'నాకు అప్పులు ఉన్న మాట నిజమే మేడమ్! అయితే చాలాసార్లు జీతం ఇంట్లోనే ఇవ్వాలనుకుంటాను. అయితే స్నేహితుల వల్ల నేను అనుకున్నది చేయడం సాధ్యం కావడం లేదు. ఇల్లు మారినా కూడా నన్ను వదిలిపెడతలేరు. వారిని తప్పించుకోవడం సమస్యగా మారింది. ఎలాగో ఒకలా వారిని తప్పించుకుని ఇంటికి వస్తే..'ఇంట్లో బియ్యం లేవు, కిరాయి ఇవ్వలేదు, పిల్లల ఫీజులు కట్టలేదు' అంటూ సునీత గొడవ పెడుతుంది. దాంతో మళ్ళీ బయటకు వెళ్ళిపోతాను. పిల్లలను వదిలి ఉండలేక చాలాసార్లు వెళ్ళాను. వాళ్ళ అమ్మ చాలా గొడవ పెట్టుకుంది. ఇప్పుడు వాళ్ళను మా సొంత ఇంటికే రమ్మని చెప్పండి. నాన్న చనిపోయిన తర్వాత అమ్మ ఒక్కతే ఉంటుంది. అక్కడ ఉంటే కిరాయి కూడా కలిసివస్తుంది. పిల్లలను అమ్మ చూసుకుంటే సునీత కూడా ఏదైనా ఉద్యోగం చేయడం సాధ్యమవుతుంది. కొన్ని రోజులు కష్టపడితే అప్పులు తీరిపోతాయి' అన్నాడు సునీల్.
అప్పుల కారణంగానే..
'వీడి అప్పుల కారణంగానే కోడలు పుస్తెలు కూడా అమ్మేసింది. ఇంట్లో పిల్లలకు తిండి కూడా ఉండదు. మా దగ్గర ఉన్నప్పుడు ఇంట్లోకి సరుకులు ఇచ్చేదాన్ని. ఇప్పుడు దూరంగా వెళ్ళారు. సొంత ఇంట్లో ఒక పోర్షన్ కిరాయికి ఇచ్చి మిగతా గదిలో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. అయినా నాకు వాళ్ళు పెట్టాలని అడగడం లేదు. నా భర్త చనిపోయినప్పుడు కూడా ఎవ్వరినీ ఒక రూపాయి అడగలేదు. ఇంటి కిరాయి వస్తుంది. నా జీవనానికి సరిపోతుంది. నా భారం వాళ్ళమీద వేయను. పిల్లలు కండ్ల ముందు ఉంటే చాలు' అంది సునీల్ తల్లి.
నమ్మకం కలిగేవరకు..
అక్కడ ఉంటే మళ్ళీ స్నేహితులు అంటూ పోతాడు మేడమ్. నేను అక్కడకు వెళ్ళను. మా అత్తమ్మ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, రోజూ ఆమెతో గొడవ పడతాడు. నన్ను కొడతాడు. నేను అక్కడకు పోను' అంది సునీత.
'సరే, మా సార్ దగ్గర నెలకు కొంత ఇచ్చేలా అడ్వాన్సు తీసుకుంటాను. కిరాయి మొత్తం కట్టేస్తాను. అదే ఇంటికి పోదాం. మెల్లగా ఊరిలో ఉన్న కొద్ది పొలం అమ్మి అప్పులన్నీ కట్టేస్తాను. పిల్లలకు, నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను' అన్నాడు సునీల్.
'వారం పదిరోజులు బాగానే ఉంటావు. తిరిగి అవే పరిస్థితులు వస్తాయి. పిల్లలను మా అమ్మవాళ్ళింటి వద్దనే స్కూల్లో వేశాను. నువ్వు మారావు అన్న నమ్మకం కలిగేవరకు ఇక్కడే చిన్న ఇల్లు తీసుకుని ఉందాం. కొన్ని నెలల తర్వాత నువ్వు ఎక్కడ ఉందాం అంటే అక్కడకు వస్తాను' అంది సునీత
'మేడమ్, మీరు ఎలా చెప్పితే అలా వింటాను. నాకు నా పెళ్ళాం పిల్లలు కావాలి' అన్నాడు సునీల్.
పిల్లల జీవితాలు ..
'మీరు ఇద్దరూ చెప్పిన విషయాలు, మీ అమ్మగారు చెప్పిన విషయాలు విన్న తర్వాత బాగా ఆలోచించి మేం ఒక నిర్ణయానికి వచ్చాం. మీ కాపురం బాగుండాలన్నా, పిల్లల జీవితాలు బాగుండాలన్నా మీరిద్దరూ బాధ్యతలు తెలుసుకోవాలి. సునీల్, నీ కారణంగా అటు పెద్దవాళ్ళు, ఇటు నీ భార్యపిల్లలు చాలా బాధపడుతున్నారు. కొన్ని రోజులు మీరు పిల్లల స్కూలుకు ఇబ్బంది లేకుండా దగ్గర్లో ఇల్లు కిరాయికి తీసుకుని ఉండండి. ప్రతినెలా జీతం సునీతకు తెచ్చి ఇవ్వాలి. స్నేహితులను పూర్తిగా తగ్గించాలి. మీ సమస్యలను తగ్గించేవారు స్నేహితులు, పెంచేవారు స్నేహితులు కాదు అన్న విషయం తెలుసుకోండి. అప్పులు చేయడం వల్ల వచ్చిన సమస్యలు మీ జీవితాన్ని కష్టాలపాలు చేశాయి. శక్తికి మించి ఖర్చులు చేయడం మీకే మంచిది కాదు. ఇకమీదట జాగ్రత్తగా ఉండండి. మీకు ఏమైనా సమస్యలు వస్తే ఇక్కడికి రండి. మీలో మీరు గొడవ పడవద్దు' అన్నారు బాధ్యులు.
'సరే మేడమ్ మీరు చెప్పినట్టే ఇల్లు పిల్లల స్కూల్కు దగ్గర్లో తీసుకుంటాను. ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటూను' అన్నాడు సునీల్. ఇద్దరూ రిజిష్టర్లో సంతకాలు చేసి అక్కడి నుంచి బయటకు వచ్చారు.'మా పిల్లల కాపురం నిలబెట్టిన మీకు ధన్యవాదాలు' అంటూ వారిద్దరి తల్లులు సంతోషించారు.