Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరిశోధనా రంగంలో మహిళలను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. సైబర్ క్రైమ్లో అయితే ఇంకా అరుదు. తనకు తెలియకుండానే పురుషాధిపత్య రంగంలో అడుగుపెట్టింది. సైబర్క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో మొట్టమొదటి మహిళగా తనదైన ముద్ర వేసింది. పరిశోధకురాలిగా 15 ఏండ్లపాటు ఆమెను చూసిన వాళ్లు...'' ఫీమేల్ పెర్రీ మాసన్'' అని పిలుస్తారు. 'అగాథా క్రిస్టీ'నెందుకు కాకూడదంటూ నవ్వుతూ సమాధానం చెప్పే ధన్యామీనన్ గురించి..
పట్టత్తిల్ ధన్యా మీనన్. దేశంలోని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో మొట్టమొదటి మహిళ. బ్రిటీష్ కొలంబియా యూనివర్సిటీ నుంచి దూరవిద్య ద్వారా బీటెక్ చేసింది ధన్య. ఆ తరువాత సాధారణంగా జాబ్ చేసింది. అప్పటిదాకా ఆమెకు నృత్యం అంటే చాలా ఇష్టం. కానీ పెండ్లితో దాన్ని వదిలేయాల్సివచ్చింది. ఉద్యోగం చేస్తూ భర్త చేస్తున్న వ్యాపారాల్లో పాలు పంచుకుంది. వ్యాపారంలో నష్టం వచ్చింది. వివాహ బంధం బీటలు వారింది. కొడుకుతో నడిరోడ్డున పడింది.
ఒంటరి తల్లిగా కష్టాలు..
కొడుకును చదివించడానికి స్కూల్కు తీసుకెళ్తే... సింగిల్ మదర్గా ఫీజు పే చేయలేదని సీటివ్వలేదు. అప్పుడే.. ఆమెకు వాళ్ల తాత సైబర్లా చేయమని సలహా ఇచ్చాడు. పుణేలోని ఏషియన్ స్కూల్ ఆఫ్ సైబర్ లాలో సైబర్ లా చదివింది. సైబర్ లా పుస్తకాలు చాలా ఖరీదు. అయినా ఆమె నెగ్గుకురాగలదన్న నమ్మకంతో ఫీజు నుంచి పుస్తకాల వరకు తాతే చూసుకున్నాడు. తన కెరీర్ ఎక్కడికి వెళ్తుంది? నేను సరైనదే చదువుతున్నానా? ఆమెకేమీ అప్పుడు తెలియదు. కానీ ఒక్కసారి చదవడం మొదలుపెట్టాక ఓన్ చేసుకుంది. డిటెక్టివ్ నవలకంటే ఎక్కువ ట్విస్టులున్న కేసులను చూసి నివ్వెరపోయింది. దానిపట్ల మరింత ఇష్టాన్ని పెంచుకుని ఆసక్తితో అధ్యయనం చేసింది. ఆ తరువాత అదే సైబర్ లా స్కూల్లో ఫ్యాకల్టీగా పనిచేసింది. 2008 తరువాత ఆమె పరిస్థితులు మారాయి. తన పనికి గుర్తింపు వచ్చింది. మొబైల్ స్టాకింగ్, స్పైక్యామ్, కార్పొరేట్ ఇన్వెస్టిగేషన్ వంటివి చేసింది. కార్పొరేట్ సంస్థలకు, పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు ట్రైనింగ్ వర్క్షాపులు నిర్వహించడం మొదలుపెట్టింది.
రాష్ట్రపతి అవార్డు
అది ఫేస్బుక్కి ముందు కాలం. అర్కుట్ హవా నడుస్తున్న సమయం. ఒక అబ్బాయి ఆర్కుట్లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఇద్దరు మహిళలను టార్గెట్ చేస్తూ అందులో రాసేవాడు. తీరా చూస్తే ఆ మహిళల్లో ఒకామె అతని తల్లి... ఇంకొకామె అతని టీచర్. వాళ్లిద్దరూ అతడిని తరచూ తిడుతుండేవారు. ఆ పగ తీర్చుకోవడానికి అతడు ప్రయోగించిన అస్త్రం ఆన్లైన్. ఇది ధన్యా మీనన్ ఛేదించిన మొదటి కేస్. 15 ఏండ్ల అనుభవంలో కేంద్ర ప్రభుత్వానికి కన్సల్టెంట్గా పనిచేసింది. ఫేక్ ప్రొఫైల్స్, విజువల్ మార్ఫింగ్, ఇతర సైబర్ క్రైమ్కు సంబంధించిన రెండు వేల కేసులను డీల్ చేసింది. ఆమె డీల్ చేసిన అత్యంత క్లిష్టమైన కేసుల్లో ఒకటి 2006లో కేరళలోని కేసు. ఒక స్కూల్కు అబ్బాయిలు... మరో స్కూల్కు సంబంధించిన అమ్మాయిలను మొబైల్లో ఫొటోలు తీసి... బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ముగ్గురు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసును చాలా జాగ్రత్తగా డీల్ చేసింది ధన్య. సైబర్ క్రైమ్ బాధితులకు సలహాలు సూచనలు ఇవ్వడం కోసం 2010లో సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కంపెనీ 'అవాంజో'ని కేరళలో స్థాపించింది. వీరేమీ పోలీసింగ్ చేయరు.. ఎలాంటి ఫిర్యాదులను కూడా తీసుకోరు. అయితే చట్టపరంగా ఎలాంటి అవకాశాలున్నాయనేది వివరిస్తారు. ప్రారంభంలో నెలకు 8 కేసులు వచ్చేవి. ఇప్పుడు... వారానికి 200 కేసులు వస్తున్నాయి. అలాగే వర్చువల్ ప్రపంచం వల్ల ఉన్న ప్రమాదాల మీద స్కూళ్లల్లో పిల్లలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఆమె అందిస్తున్న సేవలకు గాను గత ఏడాది 'రాష్ట్రపతి అవార్డు' దక్కించుకుంది. సైబర్ సెక్యూరిటీ అకాడమీని ప్రారంభించాలన్నది ఆమె కల.