Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అమ్మ' అన్నకమ్మని పిలుపు ఆంగ్లభాష ఆకర్షణలో పడి 'మమ్మీ'గా మారిపోయింది. తెలుగు మాట్లాడే వారి సంఖ్య నానాటికీ తగ్గిపోతూ.. అమ్మ భాషకు ఆదరణ కరువైంది. ఇతర రాష్ట్రాలు ప్రాథమిక విద్య మాతృభాషలోనే సాగాలంటూ ఉత్తర్వులిస్తుంటే, మన రాష్ట్రంలో మాత్రం భాషాభివృద్ధి కోసం ఉత్తుత్తిగా చర్యలు తీసుకుంటున్నారు. భాషను ప్రభుత్వాలు మరిచినా, ప్రజలు మాత్రం భాషాభిమానంతో అమ్మ భాషను బతికించుకుంటున్నారు. 'అచ్చంగా తెలుగు' అంటూ రేపటి తరానికి తేనెలొలుకు తెలుగులోని మాధుర్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు భావరాజు పద్మిని. గత ఏడేండ్లుగా భాషకోసం కృషి చేస్తున్నారు. సాహిత్యం, సంగీతం, సేవ ఊపిరిగా భావించే ఆమె పరిచయం..
పల్లెటూరి వాతావరణంలో కల్మషం లేని మనుషుల మధ్య, అచ్చ తెలుగు మాటలు వింటూ పెరిగాను. నాన్న కృష్ణ ప్రసాద్, స్టేట్ బ్యాంక్ ఉద్యోగి కావడంతో గుంటూరు జిల్లాలోని చిన్నచిన్న పల్లెటూర్లలో ఉండేవాళ్ళం. ప్రాథమిక విద్య తెలుగు మీడియంలో కొనసాగింది. ప్రభుత్వ పాఠశాలల్లోనే పాఠాలు బాగా చెప్పేవారు. స్కూలులో ఏదైనా వేడుక జరిగితే ఆ సందర్భంగా పాటలు, కథలు రాయించేవారు. తెలుగుభాషపై మక్కువ పెరగడానికి ఇవన్నీ కూడా కారణం కావచ్చు. ఇక ఇంట్లో అమ్మ పద్మావతి అనేక రకాల కథలు చెప్పేవారు. పురాణకథలు, నీతి కథలు ఆమె చెప్పుతుంటే వింటూ అలా నిద్రలోకి జారుకునేదాన్ని. అమ్మ ముగ్గులు బాగా వేసేవారు, కుట్లు, అల్లికలు ఎంతో నైపుణ్యంగా చేసేవారు. అమ్మ వీణ వాయించేవారు. ఆమె వెంట తిరుగుతూ అన్నీ నేర్చుకునేదాన్ని. చిన్నప్పుడు అమ్మ చెప్పిన కథలు విన్న తర్వాత మరిన్నికథల కోసం కాస్త పెద్దయ్యాక పుస్తకాలు ఎక్కువగా చదివేదాన్ని. సాహిత్యంపై అభిరుచి ఏర్పడడానికి అమ్మ కథలు, టీచర్ల ప్రోత్సాహం కారణం అయ్యింది. ఒక విధంగా చెప్పాలంటే అమ్మే నా రోల్ మోడల్.
బాపుగారి హాస్యం...
చిన్నతనం నుంచి కథలపై పెరిగిన ఇష్టం సాహిత్యం చదివేలా చేసింది. స్కూలు లైబ్రరీలో ఉండే పుస్తకాలన్నీ చదివేసి ఇంకా కొత్త పుస్తకాల కోసం ఎదురుచూసేదాన్ని. హాస్యంతో సాగే కథనాలు ఇష్టపడేదాన్ని. ముళ్ళపూడి వెంకటరమణ, మృణాళిని గార్ల రచనలు ఆసక్తిగా చదివేదాన్ని. కథ రాయడం మాత్రం డిగ్రీలోనే రాశాను. ఇంటర్ కాగానే మేం హైదరాబాద్ వచ్చేశాం. అప్పట్లో గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత రావడానికి ఎక్కువ రోజులు పట్టేది. ఒకరి ఇంటి నుంచి మరొకరి ఇంటికి సిలిండర్ తిరిగేది. ఇదే ఇతివృత్తంగా తీసుకుని 'చక్రభ్రమణం' పేరుతో సరదా కథ రాశాను. చదివిన వాళ్ళంతా బాగుందని మెచ్చుకున్నారు. పల్లెటూరు నుంచి రావడంతో మాకు నగరం పెద్ద పద్మవ్యూహంగా కనిపించేది. కనీసం పూలు కూడా దొరికేవి కాదు. ఇదే ఇతివృత్తంగా తీసుకుని ఆ తర్వాత నేను రాసిన మరో కథ 'మహానగరంలో మందారపువ్వు'. కథలు రాయడమే తప్ప వాటిని పత్రికలకు పంపించాలి, దాచుకోవాలి అన్న ఆలోచన ఉండేది కాదు. 2012 నుంచి నా కథలు ఎక్కువగా శిరాకదంబం, మాలిక, సంచిక వంటి ఆన్లైన్ మ్యాగజైన్లో వచ్చాయి. భూమిక, క్షత్రియ ప్రభ, ఆంధ్రభూమి పత్రికలలో, ప్రముఖాంధ్ర అంతర్జాతీయ మ్యాగజైన్లో వచ్చాయి.
బాధ్యతల కారణంగా..
చిన్నతనం నుంచే సంగీతం, చిత్రలేఖనం, నాట్యం, సాహిత్యంలో ప్రవేశం ఉంది. చదువులోనూ టాపర్ గా ఉండేదాన్ని. డిగ్రీ తర్వాత ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివాను. బయో ఇన్ఫర్మటిక్స్ కోర్సు పూర్తి చేశాను. కొన్ని రోజులు లెక్చరర్ గా పనిచేశాను. పెండ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు పెరగడంతో ఉద్యోగం చేయడం వీలు కాలేదు. ఇద్దరుపాపలు పుట్టిన తర్వాత ఇంకా బాధ్యతలు పెరిగాయి. ఇక ఉద్యోగం చేయాలన్న ఆలోచన మానుకున్నాను.
అచ్చంగా తెలుగు..
ఉద్యోగం చేయడం వీలుకాకపోతే ఇక ఏం చేయలేనా? ఇంటికే పరిమితం కావాలా? అన్న సందిగ్ధం నాలో కలిగింది. ఏదైనా చేయాలన్న తపన ఉన్నా.. ఏం చేయాలో తెలిసేది కాదు. 2011లో జీమెయిల్ లో తెలుగు టైపింగ్ వచ్చింది. అందరికీ తెలుగులోనే మెయిల్స్ పంపించేదాన్ని. అది చదివిన కొందరు 'మీ తెలుగు చాలా బాగుంది. తెలుగు భాష కోసం ఏమైనా చేయవచ్చు కదా' అంటూ సూచించారు. దాంతో అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి 2012లో ఫేస్బుక్ గ్రూప్ ఏర్పాటుచేశాను. అలా 'అచ్చంగా తెలుగు' ప్రారంభమైంది. మొదట్లో ఈ గ్రూప్లో ఎక్కువగా మా బంధువులు, స్నేహితులే ఉండేవారు. క్రమంగా సభ్యులు పెరిగారు. రోజూ ఒకేలా రాస్తే ఎవరూ చదవరు. అందుకే రోటిన్ గా కనిపించే కొన్ని సంఘటనలకు హాస్యం జోడించి రాసేదాన్ని. అలా తొలిదశలో నా రచనలు హాస్యవ్యాసాలుగా చాలామందికి చేరువయ్యాయి. ప్రస్తుతం మా ఫేస్బుక్ పేజి లో 26వేల మంది, ఫేస్ బుక్ గ్రూప్ లో 60వేల మంది ఉన్నారు. ఐదేండ్ల నుంచీ మా ఆన్లైన్ పత్రిక, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి సాహిత్యాన్ని చేరువచేస్తుంది. ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ కూడా అన్నిరకాల అంశాలతో అందుబాటులోకి వస్తోంది.
పూలతోటగా పెంచుతూ..
నా ప్రయాణం ఒంటరిగా మొదలైనా, ఇప్పుడు ఎంతో మంది నాకు సహాయంగా ఉన్నారు. మా సంస్థ తెలంగాణాలో రిజిస్టర్ అయింది. సంస్థ తరఫున జరిగే పలు కార్యక్రమాల్లో, గ్రూప్ నడపడంలో, పెయ్యేటి రంగారావు, అయ్యగారి నాగేంద్రకుమార్, పరమేశ్వరుని కృప, విజయ గొల్లపూడి, ఆలూరి కృష్ణప్రసాద్, కట్టుపల్లి ప్రసాద్ తదితరులు, మరెందరో సహృదయులు అహర్నిశలూ తోడ్పడుతున్నారు. కట్టుపల్లి ప్రసాద్ గారు ఈ గ్రూప్ ద్వారా ఛందస్సు పాఠాలు చెప్పి 200 మందికి పద్యాలు రాయడం నేర్పించారు. ఆర్టిస్ట్ నాగేంద్రబాబు గారు గత ఐదేళ్లుగా మా పత్రిక కోసం ఎంతో అందంగా బొమ్మలు వేస్తున్నారు.
సమాజంపట్ల బాధ్యత...
విశాఖ తుఫాన్ వచ్చినప్పుడు రామకృష్ణ మిషన్ కు మేము నిధులు పోగు చేసి, లక్ష రూపాయలు ఇచ్చాం. చదువుకు డబ్బు లేని వారిని, అనుకోకుండా ఆరోగ్య సమస్యలు వచ్చిన వారిని మా సంస్థ తరఫున ఆదుకున్నాం. ఫ్రీలాన్సర్గా రేడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఏడాదిగా డిడి యాదగిరి లో 'సాహితీ సౌరభాలు' అనే కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తున్నాను. ఆడియో వీడియో ఎడిటింగ్, షూటింగ్ వంటి నేర్చుకున్నాను. మైండ్ మీడియా అనే ఆన్లైన్ రేడియో లో ప్రోగ్రాం డైరెక్టర్ గా పని చేశాను. ఈ ప్రస్థానంలో అనేకమంది సాహిత్యదిగ్గజాలను కలుసుకునే వీలు కలిగింది. నా రచనలు చదివి ప్రముఖ సినీ రచయితలు సిరివెన్నెల, రామజోగయ్య శాస్త్రి, భువనచంద్ర తదితరులు 'చాలా బాగా రాస్తున్నావు' అంటూ అభినందించారు. ఇది నాకు లభించిన ఉత్తమ ప్రశంసలుగా భావిస్తాను.
రేపటి తరం కోసం..
తెలుగులో మాట్లాడేవారి సంఖ్య తగ్గుతుంది. కేవలం తెలుగు నేర్చుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేని కారణంగా రేపటి తరం తెలుగు భాషకు దూరం అవుతుంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి సమ్మర్ క్లాస్లు నిర్వహించాలన్న ఆలోచన ఉంది. మాతృభాషను అందిస్తే సంస్కృతిని అందించడం సులభం అవుతుంది. అందుకే అచ్చంగా తెలుగు ద్వారా నెట్ లో తెలుగు రాసే వారి సంఖ్యను, తెలుగు మాట్లాడేవారి సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నాం.