Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మ అంటే ప్రేమ! అమ్మ అంటే మమతకు ప్రతిరూపం! అమ్మ లేనిదే ఈ ప్రపంచమే లేదు! అమ్మ అంటే ఒక భద్రత! ఆమ్మే ప్రథమ గురువు, స్నేహితురాలు, మార్గదర్శకురాలు! మంచి చెడు, సుఖం, దుఖం ఎలాంటి పరిస్థితులోచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడాన్ని నేర్పించేది అమ్మే.
అలాంటి అమ్మకు చదువొస్తే..! ఇక ఏ సమస్య ఉండదు. ముఖ్యంగా ఆడ పిల్లలకు. చదువుకున్న చాలామంది స్త్రీలు తమ పిల్లలకు 'చాకలి పనొద్దు' రాయడం వస్తే చాలనుకుంటారు. ఇక అమ్మ పుస్తకాలు సర్దడంతో నుండి మొదలు పెడితే టిఫిన్ బాక్స్ల తయారీ వరకు అన్నీ తానే చూసుకుంటుంది. ముఖ్యంగా పరీక్షల సమయంలో చదువుకుంటుంటే అర్ధరాత్రయినా మనతో పాటే కూర్చుటుంది. అమ్మ గురించీ ఏమని చెప్పను, ఎంతని చెప్పనూ..! అలాంటి తల్లుల గురించి ఇటీవల వచ్చిన సర్వే ఆధారంగా కొన్ని విషయాలు.. మహిళలు చదువుకుంటే వారి ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది. కుటుంబం, సమాజ, వ్యక్తిగతంగా, పిల్లల పెంపెకం వంటి అంశాల్లో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు.
సర్వే ఆధారంగా...
మహిళలు చదువు కొన్న వారయితే, వారు కనే సంతానపు సంఖ్య కూడా తక్కువగా ఉంటుందనీ, కన్న సంతానం కూడా ఆరోగ్యంగానూ, చురుకుగానూ ఉంటుందన్న విషయాన్ని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆఫ్లైడ్ ఎకనామిక్ రిసర్చ్ సంస్థ జరిపిన దేశ వ్యాపిత సర్వే ద్వారా రుజువు చేస్తున్నది. ఈ సంస్థ మనదేశంలోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న యాభై వేల కుటుంబాలను సర్వేకు ఎంచుకున్నది. చిన్నారుల సంఖ్య, జీవిత కాల పరిమాణం విషయాలలో చదువుకొన్న వారి సంతానానికి, చదువుకోని వారి సంతానానికి మధ్య ఉండే తేడాలను స్పష్టంగా చిత్రించింది. ఆరు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం చదువుకున్న స్త్రీల సంతానపు పరిమాణం, ఐదు సంవత్సరాలు, అంతకంటే తక్కువ కాలం చదువు కొన్న స్త్రీల కంటే చాలా తక్కువగా ఉన్నది. ఐదు సంవత్సరాలు, అంతకంటే తక్కువ కాలం చదువుకొన్న వారి సంతానంలో వందకు 80 శాతం మంది జీవిస్తుండగా, ఆరు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం చదువు కొన్న స్త్రీల సంతానం వందకు 91 శాతం మంది జీవిస్తున్నారు. భార్య కనే సంతానపు సంఖ్యా పరిమాణం మీదా, వారి మనుగడ విషయం మీదా భర్త యొక్క విద్యా అర్హత స్థాలు ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది. సంతానపు సంఖ్య ఎక్కువగా ఉంటే ఆర్థిక స్థోమత మీద కూడా ప్రభావితం కనిపిస్తుందని ఈ సర్వే ద్వారా వెల్లడైంది. సంపన్న కుటుంబపు స్త్రీల సంతానం కంటే చదువు కొన్న స్త్రీ సంతానం ఎక్కువకాలం జీవించి ఉండటం గమనించదగిన విషయం.
నైతిక విలువలు...
అమ్మ చదువుకుంటే పిల్లలకు విద్యతో పాటు నైతిక విలువలు, కుటుంబ సంబంధాల గురించి నేర్పిస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు లేవు. దీంతో పిల్లల్లో ఆ సెంటిమెంట్ కనిపించడం లేదు. చదువులు పూర్తయిన తరువాత డబ్బు సంపాదించే మిషన్లా మారిపోతున్నారు. దీంతో బంధాలు తెగిపోతున్నాయి. అందుకే చిన్నతనం నుంచే వారిలో మానవ సంబంధాలు పెంపొందించేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. పెద్దలను ఏలా గౌరవించాలో వారికి తెలుస్తుంది. తల్లిదండ్రులపై ఉన్న ప్రేమానురాగాలు ఎప్పటికీ అలానే ఉంటాయి. అదేవిధంగా తల్లిదండ్రులు వారి ఎదుట గొడవపడకూడదు. ఇది వారిలో తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక పిల్లల్లో పనిచేసేతత్వం ముందునుంచే అలవాటు చేయాలి. తల్లిదండ్రులతో పాటు మనం కూడా కష్టపడి పనిచేయాలన్న తత్వాన్ని వారిలో పెంపొందించాలి.
సమయం కేటాయించాలి...
తల్లిదండ్రులపై గౌరవ మర్యాదలు, ప్రేమానురాగాలు అనేవి పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలతో ప్రేమతో మొలగాలి. వారి అభిరుచులను తెలుసుకుని అందులో మంచి చెడులు వారికి తెలపాలి. ఇలా వారితో కలసిమెలసి ఉండడం వల్ల తల్లిదండ్రులపై పిల్లలకు వాత్సల్యం పెరుగుతుంది. ఉద్యోగులైన భార్యాభర్తలు పిల్లలకు దూరంగా ఉండాల్సి వస్తే.. వారినికి ఒకసారి బిడ్డలోలతో సరదాగా గడపాలి. ఆసక్తికరమైన అంశాలు వెలికి తీయాలి. క్రీడలు, సంగీతం, తదితర అంశాలను వారితో పంచుకోవాలి. వారికి ఇష్టమైనా వంటకాలు వండి స్వయంగా తినిపించాలి.
ఇద్దరు పాటించాల్సినవి...
పారదర్శకతతో కూడిన పర్యవేక్షణ, లాలన, ప్రేమ, శ్రద్ధ, బాధ్యత, నియంత్రణ పిల్లలపై పూర్తిగా ఉండాలి. పిల్లలు పెద్దలు చేసే ప్రతి పనిని పరిశీలించడం, అనుకరించడం చేస్తారు. కాబట్టి పెద్దలు పిల్లల ముందు తమ వస్త్రధారణ, మాటతీరు, చేసే పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు తెలిసోతెలియక అబద్దాలు చెబుతుంటారు. విసుక్కోకుండా వాటి కష్టనష్టాలను వారికి సున్నితంగా తెలియజేయాలి. విజ్ఞానాన్ని విస్తరింప చేసుకోవడానికి కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు వినియోగం సర్వసాధారణంగా మారింది. పిల్లలు వీటిని సక్రమంగా వాడుకునేలా మార్గదర్శనం చేయాలి.