Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బుర్రకథలైనా, గుస్సాడి నృత్యరూపాలైనా కళాప్రదర్శనలో కళాకారుడితో పాటు వాయిద్యం ఉండాల్సిందే. జానపదుల సాహిత్యంతో, సంగీతంలో కనిపించే ఎన్నో సంగీత వాయిద్యాలు నేడు కనుమరుగైపోతున్నాయి. వాటిని పరిరక్షిస్తూ.. సంస్కృతి మూలాలను ప్రజలకు పరిచయం చేస్తున్నారు పాలమూరు యూనివర్సిటీ ఇంగ్లీష్, కల్చరల్ స్టడీస్ ప్రొఫెసర్, తెలంగాణ ఆది ధ్వని అధ్యయన వేదిక' కన్వీనర్ గూడూరు మనోజ. ప్రముఖ జానపద పరిశోధకులు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు పరిశోధన బృందంలో చురుకుగా ఉంటూ 'ఆదిధ్వని' ప్రదర్శన కోసం వాయిద్యాలను సేకరించారు. జానపద కళారూపాల్లో ప్రముఖ స్థానం వహించే వాయిద్యాల మ్యూజియం ఏర్పాటు చేయాలన్న
సంకల్పంతో ఉన్న ఆమెతో మూఖాముఖి..
జానపద వాయిద్యాలను వెలికి తీసుకురావాలన్న ఆలోచన ఎలా కలిగింది?
వరంగల్లో పుట్టి పెరిగాను. చిన్నతనంలో ఎన్నో కళారూపాలను చూసేవాళ్ళం. ఏదైన పండుగ వచ్చిందంటే చాలు ఇంటికి వివిధ కళాకారులు వచ్చేవారు. ఊరిలోనూ అనేక కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. చిన్నతనం నుంచే జానపద కళలపై ఆసక్తి ఎక్కువ. పల్లె ప్రజల జీవితాల్లోని ఆనందాన్ని, ఆవేదనను జానపద కళలు పరిచయం చేస్తాయి. జానపదుల నుంచి ఆశువుగా వెలువడేదే జానపదసాహిత్యం. మౌఖిక ప్రచారంలో ఉన్న జానపదసాహిత్యంపై అనేక పరిశోధనలు చేస్తున్నారు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావుగారు. గత రెండు దశాబ్దాలుగా పరిశోధనలో కలిసి పనిచేస్తున్నాను. పన్నెండేళ్లుగా గోండు లిపి కోసం పరిశోధనలు కొనసాగుతున్నాయి. భాష. సాహిత్యం, మౌలిక కథనాల వెనుక సంగీతం, దాని వెనుక వాయిద్యాల గురించి తెలిసింది. ఇలాంటి సమయంలో మాకు వచ్చిన ఆలోచన వారి జీవితాల్లోని పాటలు, కళలు ప్రదర్శించే సంగీత వాయిద్యాల గురించి తెలుసుకోవడం ప్రారంభించాం. కష్టంలో, ఆనందంలో, వేడుకల్లో సందర్భానుసారం మనసు లోతుల నుంచి జాలువారినవే జానపదాలు. వారి పనిలో, బతుకులో భాగమైన పదం పాటగా మారింది. ఆ పాటకు మధురమైన ధ్వని నిచ్చే వాయిద్యం కూడా వారి చేతుల్లోనే రూపుదిద్దుకుంది. అలాంటి ఎన్నో సంగీత వాయిద్యాల గురించి తెలుసుకోవడం సాధ్యమైంది.
జానపద సంగీత వాయిద్యాలతో గతంతో ప్రదర్శనలు ఏమైనా నిర్వహించారా?
జానపదుల పాటల్లోనూ వాద్యం, నృత్యం, ఆహార్యం ఉంటాయి. లయబద్ధమైన కదలికలతో మధురమైన ధ్వని వచ్చేలా వారు వాయిద్యాలను తయారుచేసుకుంటారు. అయితే ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ వాయిద్యాలన్ని క్రమంగా అంతరించిపోతున్నాయి. అంతే కాదు భాష, సాహిత్యం వెనక ఉన్న సంగీతం పోతోంది. వాటిని కాపాడాలన్న ఆలోచనతో మార్చి 17,18 తేదీల్లో యూనివర్సిటి స్థాయిలో 'మూలధ్వని' పేరుతో సెమినార్ను ఏర్పాటు చేశాం. ఇందులో రెండు వందల మంది కళాకారులు పాల్గొన్నారు. 60 వాయిద్యాలు ప్రదర్శించాం. జానపద సంగీత వాయిద్యాలను పరిరక్షించాలన్న మా మొదటి ప్రయత్నాన్ని చాలామంది ప్రశంసించారు. జానపదుల నుంచి సేకరించిన వాయిద్యపరికరాలను యూనివర్సిటీలకు పరిమితం చేయడం సరికాదు అన్న సూచనలు వచ్చాయి.
ఈ ప్రదర్శనలో ఎన్ని రకాల సంగీత వాయిద్యాలు ఉన్నాయి?
జాతి జనుల అస్తిత్వానికి ప్రతీకలు జానపద కళలు. వారు ఇష్టంగా పాడుకునే పాటలైనా, కష్టపడి తయారు చేసుకున్న వాయిద్యాలైనా కనుమరుగు కావడమంటే ఓ సంస్కృతి, చరిత్ర, జీవనవిధానం కాలగర్భంలో కలవడమే. అందుకే జానపదసాహిత్యాన్ని పరిరక్షించుకోవడంలో భాగంగా 'ఆది ధ్వని' పేరుతో 124 సంగీత వాయిద్యాలతో ఐదు రోజుల ప్రదర్శన ఏర్పాటు చేశాం. ఇందులో చాలా వాయిద్యాలు ముఖ్యంగా బుర్రవీణ, మెట్లవీణ, కిక్కిరి లాంటివి ఒక్క వాయిద్యం మాత్రమే ఉన్నాయి. వాటిని వాయించేవారు కూడా ఒక్కరొక్కరే ఉన్నారు. చాలా వాయిద్యాలకు ఇప్పుడున్న వారే ఆఖరి తరం. ఇలాంటి వాయిద్యాలకు రెండో వాయిద్యాన్ని తయారు చేయించే ప్రయత్నం చేస్తున్నాం. అరుదైన కళను నేర్చుకోవడానికి ఎవరైనా వస్తారన్న ఆశ ఉంది. ఎందుకంటే ఈ వాయిద్యాల నుంచి వచ్చే ధ్వని మనసును తాకుతుంది. థింసా, గుస్సాడి, బంజారా నృత్యాలలో వారి శరీర కదలికే సంగీతాన్ని వినిపిస్తుంది. అందుకు అనుగుణంగా వారు ఆభరణాలను తయారుచేసుకుంటారు. బుర్రకథ, చిందు యక్షగానం, ఒగ్గుకథ తదితర కళారూపాల్లో వారి చేతుల్లోని వాయిద్యం ఎంతో మధురమైన సంగీతాన్ని పలికిస్తుంది. ఇలా చెబితే ఎన్నో ఉన్నాయి. వాటిని ఆస్వాదించాలే తప్ప మాటల్లో చెప్పలేం.
ఇక్కడ మహిళలు మాత్రమే ఉపయోగించే వాయిద్యాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి వివరిస్తారా?
నేటి సంగీత ప్రపంచాన్ని చూస్తే సరస్వతి దేవి చేతిలో వీణా మాత్రమే కనిపిస్తుంది. ఆడపిల్లలు అనగానే వీణ నేర్పించారా? పాడటం వచ్చా? అని అడుగుతారు. కానీ, జానపద మహిళలు తమ కోసం ఎన్నో రకాల వాయిద్యాలను తయారుచేసుకునేవారు. ఈ ప్రదర్శనలో ఉంచిన వాటిలో 'గుజ్జిడి మొగ్గ'ను పరిశీలిస్తే ఇది గుత్తికోయ మహిళలు తమ కోసం తయారు చేసుకున్న వాయిద్యం. పొడవైన ఇనుప కడ్డీకి చివర్లో ఇనుముతో చేసి, మధ్యలో ఇనుపగుండ్లు అమర్చిన మొగ్గలు కడతారు. ఏడు, ఎనిమిది మొగ్గలు ఒకే చోట గుత్తిగా కడతారు. మహిళలు తమ ఎత్తుకు తగ్గట్టుగా ఈ కడ్డీను తయారు చేసుకుంటారు. స్త్రీ పురుషులిద్దరూ కలిసి చేసే సాముహిక నృత్యంలో పురుషులు డోలు వాయిస్తుంటే, మహిళలు అందుకు అనుగుణంగా ఈ ఇనుపకడ్డీని లయబద్దంగా భూమికి తాగిస్తారు. ఆ ధ్వనికి తగ్గట్టుగా నృత్యం ఉంటుంది. మరో వాయిద్యం 'ఘటవీణ' ఇది మహిళల వాయిద్యమే. ఇద్దరు స్త్రీలు కలిసి రెండు కుండలపై ఒకేలా వాయిస్తూ పాటలు పాడతారు. ఇలాంటి మహిళా వాయిద్యాలు మనకు ఎక్కడ కనిపించవు.
మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి?
జానపదుల నుంచి వచ్చిన కళలను కాపాడుకోవాలన్న తాపత్రయంతో మేం పనిచేస్తున్నాం. మన గవర్నర్ గారు కూడా ఈ ప్రదర్శనను ఎంతో మెచ్చుకున్నారు. వివిధ రంగాల ప్రముఖులు వచ్చి మా ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. ఈ ప్రేరణతో యూనివర్సిటీ స్థాయిలో పరిశోధనలు ఒకవైపు, ప్రజల్లో వీటిపై అవగాహన కల్పించే ప్రయత్నం మరోవైపు చేస్తున్నాం. తమ సంస్కృతి, చరిత్రను కాపాడుకోవాలన్న బాధ్యతను అందరికీ గుర్తుచేయడానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. జానపదకళలే నమ్ముకున్న కళాకారుల్లో ఉత్సాహం నింపడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడుతాయి. అరుదైన ఈ వాయిద్యాలను పరిరక్షిస్తూ వీటి కోసం ప్రత్యేకంగా జానపదుల అస్తిత్వాన్ని కాపాడేలా మ్యూజియం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది.