Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలంలో చర్మం సహజంగానే తేమను కోల్పోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇంట్లో ఉండే పాలు, తేనె, యోగర్ట్తో చర్మాన్ని కోమలంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో తెలుసుకుందాం.
తేనె: ఇది శక్తిమంతమైన సహజ మాయిశ్చరైజర్ . తేమను అందించి చర్మాన్ని పొడిబారనీయదు. పొడిచర్మం గలవారు తేనె రాసుకుని 20 నిమిషాలయ్యాక నీళ్లతో శుభ్రం చేసుకుంటే చర్మం పొడిబారదు. సగం టీస్పూన్ తేనెలో, టీస్పూన్ రోజ్వాటర్, టీస్పూన్ పాలపొడి వేసి పేస్ట్లా చేసుకొని ముఖానికి రుద్దుకున్నా కూడా చర్మం తాజాగా కనిపిస్తుంది. జిడ్డు చర్మం ఉంటే 100 ఎం.ఎల్ రోజ్వాటర్, టీస్పూన్ నిమ్మరసం, సగం టీస్పూన్ తేనె వేసి కలిపి ఫ్రిజ్లో కొద్దిసేపు ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతిమంతంగా మారుతుంది.
పాలు: దీనిలోని ప్రొటీన్లు, కొవ్వులు, లవణాలు చలికాలంలో చర్మానికి సోయగాన్నిస్తాయి. గాజు సీసాలో సగం కప్పు చల్లని పాలు, అయిదు చుక్కల ఆలివ్, నువ్వుల లేదా పొద్దుతిరుగుడు నూనె వేసి మిక్స్ చేసి ఫ్రిజ్లో పెట్టాలి. దీనిలో ముంచిన కాటన్బాల్తో ముఖం మీద నెమ్మదిగా రుద్దుకోవాలి. ఇలా చేస్తే ముఖం మీది మలినాలు, నల్లమచ్చలు మాయం అవుతాయి.
యోగర్ట్: దీనిలోని లాక్టిక్ ఆమ్లం చర్మం పీహెచ్ను ఒకేస్థాయిలో ఉంచుతుంది. రెండు టీస్పూన్ల యోగర్ట్లో చిటికెడు పసుపు వేసి ముఖానికి రాసుకోవాలి. పసుపులోని యాంటీసెప్టిక్ గుణాలు ఇన్ఫెక్షన్లను నివారించి చర్మానికి మెరుపునిస్తాయి.