Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పదునాగేండ్ల వయసులోనే రచనలు చేయడం ప్రారంభించిన ఆమె ఎనిమిది దశాబ్దాలుగా సాహిత్యరంగంలోనే కొనసాగుతున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళలు ముందడుగు వేసినప్పుడే సాధికారత సాధ్యమవుతుంది అంటూ ఆ దిశగా కృషి చేస్తున్నారు ప్రముఖ రచయిత్రి వాసిరెడ్డి కాశీరత్నం... 15 ఏండ్లుగా మహిళల కోసం 'మహిళా విజయం' మాస పత్రిక నిర్వహిస్తూ , ఎడిటర్గా తొంభైఏండ్ల వయసులోనూ పనిచేస్తున్నారు. సెన్సార్ బోర్డ్ మెంబర్గా, ఉమెన్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్గా పనిచేసిన ఆమె వందలాది మహిళా సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆర్థిక స్వాలంబన సాధించేలా వేలాది మంది మహిళలకు 70అంశాలపై ఉపాధి శిక్షణ ఇప్పించారు. ఆలోచన ఉంటే సరిపోదు ఆచరణ కూడా ఎంతో ముఖ్యమని చెప్పే ఆమె పరిచయం..
కృష్ణాజిల్లా నందిగామ తాలూకాలో చిన్న గ్రామం మాది. అమ్మ పాటిబండ్ల భ్రమరాంబ, నాన్న పాటిబండ్ల రామక్రిష్ణయ్య. సంగీతం పై ఆసక్తితో చిన్నప్పటి నుంచే సంగీతం నేర్పించారు.
నాలుగేండ్ల వయసులోనే...
హిందీ అందరూ నేర్చుకోవాలన్న గాంధీగారి సూచనల మేరకు మాకు ప్రత్యేకంగా హిందీ టీచర్ను నియ మించి నేర్పించేవారు. నాలుగేండ్ల వయసులో గాంధీగారిని చూశాను. రైలులో ప్రయాణిస్తూ ఆయన కిటికి వద్ద కూర్చోని స్వాతంత్య్ర సంగ్రామం కోసం కావల్సిన నిధులు సేకరిస్తున్నారు. ఎవరికీ తోచినంత వారు ఆయనకు డబ్బు, నగలు ఇస్తున్నారు. అలా ఆయన రూపం మనసులో ముద్రించుకు పోయింది. ఆ తర్వాత మా కుటుంబం చెన్నైకు మారింది. రైలు దిగగానే అంత పెద్ద పట్టణం, పెద్దపెద్ద భవంతులు చూసి షాక్ అయ్యాను. అక్కడే ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసి హిందీ పండిట్గా ఉద్యోగం చేశాను. దాంతోపాటు రేడియోలో హిందీ పాఠాలు చెప్పడానికి వెళ్ళేదాన్ని. పాటలు కూడా పాడేదాన్ని. ఒక రోజు ఆరుద్ర గారింటికి మేం భోజనానికి వెళ్ళాం. 'సావిత్రి సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటుంది. కాస్త భయం పోతుంది. నీతో రేడియో స్టేషన్కు తీసుకువెళ్ళు' అన్నారు. అలా నాలుగైదు సార్లు నాతో పాటు సావిత్రిగారిని రేడియో స్టేషన్కు తీసుకువెళ్లేదాన్ని. ఇద్దరం కలిసి పాటలు పాడాం. ఆ తర్వాత ఆమె పెద్దనటి అయిపోయారు. ఒకటి రెండుసార్లు కనిపించినా వెళ్ళి పలకరించేంత అవకాశం లేకపోయింది. అయితే కండ్లతోనే పలకరించుకునేవాళ్ళం. పరిచయమున్న వారందరినీ ప్రేమతో పలుకరించే గొప్పగుణం ఆమెది.
పెండ్లి తర్వాత..
వెటర్నరీ డాక్టర్ వాసిరెడ్డి నారాయణ రావుగారితో పెండ్లి తర్వాత మారుమూల గ్రామానికి మా మాకాం మారింది. ఆ తర్వాత మరికొన్ని గ్రామాలు తిరిగాం. చిన్నతనం నుంచే బాగా పుస్తకాలు చదవడంతో ఆ తర్వాత రాయడం ప్రారంభించాను. 14ఏండ్లు వయసులోనే కవితలు, కథలు రాసేదాన్ని. పంజాబీ రైటర్ అమ తప్రీతమ్ గారి రచనలు ఎక్కువగా చదివేదాన్ని. విజయవాడలో ఉన్నప్పుడు రేడియోలో హిందీ పాఠాలు చెప్పే అవకాశం వచ్చింది. కథలు, కవితలతో పాటు నవలలు మనిషీ - మనుగడ, చీకటి కోణాలు, అమెరికా యాత్ర, స ష్టి రహస్యం వంటి కొన్ని నవలలు కూడా రాసాను.
పత్రికారంగానికి పరిచయం చేసిన మల్లాది సుబ్బమ్మ..
ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చాం. నన్ను పత్రికారంగానికి పరిచయం చేసిన వారు ప్రముఖ రచయిత్రి మల్లాది సుబ్బమ్మ గారు. ఒక రకంగా చెప్పాలంటే ఆమె నా గురువు. నాలోని రచనా శక్తిని గుర్తించి ఆంధ్రజ్యోతి వారికి నన్ను పరిచయం చేసారు. అలా వనితాజ్యోతిలో కరస్పాండెంట్గా చేరాను.
ఆ తర్వాత ' మహిళా విజయం' పత్రిక ఏర్పాటుచేయడంలోనూ ఎంతో సహకరించారు. సాహిత్యాన్ని సమాజాభివృద్ధి కోసం మహిళల ప్రయోజనాల కోసం వినియోగించాలి అన్నది ఆమె వద్దనే తెలుసుకున్నాను. పట్టుదలతో పనిచేసినప్పుడే ఉన్నతి సాధ్యమవుతుందని అంటూ ఎన్నో సార్లు చెప్పేవారు.
రాజకీయాల్లో..
మావారికి ఏ ఊరికి బదిలీ అయిన ఆ ఊరిలో ఉండే మహిళా సంఘం సభ్యులతో కలిసి పనిచేసేదాన్ని. ఒకవేళ అక్కడ మహిళా సంఘాలు లేకపోతే అందరితో సంప్రదించి సంఘం స్థాపించేవాళ్ళం. అలా చాలా మహిళా సంఘాలను స్థాపించాం. వారికి స్థానిక వనరులతో ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేలా శిక్షణ ఇప్పించేవాళ్ళం. కుట్టు అల్లికలు, టైప్ రైటింగ్, సర్ఫ్ మేకింగ్, క్యాండిల్ మేకింగ్ ఇలా దాదాపు 70 అంశాలపై మహిళలకు శిక్షణ ఇప్పించి ఆర్థిక సమృద్ధి సాధించేలా అవగాహన కల్పించాం. ఇప్పటికీ కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తునే ఉన్నాం.
ఆర్థిక వెలుసుబాటు కల్పించేలా..
కొన్ని రోజులు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారు మహిళా సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్ళేదాన్ని. మహిళా సంఘాల ఏర్పాటు, ఉపాధి అవకాశాల కల్పన అంశాలపై ఉన్న అవగాహనను గుర్తించి ఉమెన్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్గా నియమించారు. అనేక మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం చేస్తూ.. స్వయం సంవృద్ధి సాధించేలా వర్క్షాప్లు నిర్వహించాం.
మహిళల కోసం ప్రత్యేకంగా...
కథరాసినా, నవల రాసినా కథా వస్తువు మహిళ సాధికారతే. రాసే ప్రతి అక్షరం మహిళాభ్యుదయానికి దారి చూపాలని ఆశించాను. నా రచనలను మెచ్చి నీలం కృష్ణారావు గారి అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డు ఎన్.టి.రామారావు గారి నుంచి అందుకోవడం ఆనందానిచ్చింది. ఆ తర్వాత తానా మహసభలకు వెళ్ళినప్పుడు మహిళల కోసం ప్రత్యేకంగా ఒక సంచికను తీసుకువచ్చాం. ఆ వేదికపైనే మహిళల కోసం మాసపత్రికగా కొనసాగిస్తే బాగుంటుందన్న సూచనల మేరకు 2005 నుంచి 'మహిళా విజయం' మాసపత్రికను ప్రారంభించాం. గత 15ఏండ్లుగా ఈ పత్రిక మహిళల కోసం వెలువడుతోంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ పత్రికను తీసుకువస్తున్నాం. ప్రతినెలా ఒక పరీక్షగా ఉంటుంది. ప్రారంభించిన నాటి నుంచి ఎన్ని ఇబ్బందులున్నా ఈ పత్రికను తీసుకువస్తున్నాం. మా టీమ్ కూడా మంచి స్పిరిట్తో పనిచేస్తున్నారు. మాకు ముగ్గురు అమ్మాయిలే. ఈ పత్రిక నాల్గో అమ్మాయి. నా ఊపిరి ఉన్నంత వరకు పత్రికను తీసుకువస్తాను.
సామర్థ్యంతోనే సమాధానం..
చాలా చోట్ల లింగవివక్ష ఉంది. ఆడవారు ఏం చేయగలరు అంటూ ప్రశ్నించేవారికి పని సామర్ధ్యంతోనే సమాధానం చెప్పాలి. జీవితంలో ఎదురయ్యే సమస్యలను పాజిటివ్గా తీసుకుని పరిష్కారం ఆలోచించాలి. సమస్యలను చూసి భయపడితే కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం రాదు. చాలా మంది చిన్నప్పుడు చదువుకోలేదు, అప్పుడు ఏమీ నేర్చుకోలేదు అంటూ బాధపడు తుంటారు. వయస్సు ఏ విషయం లోనూ అడ్డంకి కాదు. అనుకున్నది సాధించాలంటే పట్టుదల అవసరం. తమను తాను నిరూపించుకోవాలన్న తపన ఉంటే చాలు వయసుతో నిమిత్తం లేకుండా తమ కంటూ గుర్తింపును తెచ్చుకోవచ్చు.
- వి. యశోద