Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాతృత్వం ఓ మధురమైన భావన. ఆ మాతృత్వమే ఆమె కెరీర్కు అడ్డంకిగా మారిందా.. ఇటీవల జరిపిన ఓ సర్వే వివరాలు పరిశీలిస్తే నిజమనే అనిపిస్తుంది. గతంలో మూడు నెలలు మాత్రమే ప్రసూతి సెలవులు వుండేవి. ఆరు నెలల ప్రసూతి సెలవుల కోసం కార్మిక సంఘాలు ఎన్నో ఏండ్లు పోరాటం చేశాయి. చివరికి సెలవులు ఆరు నెలలకు పొడిగించారు. అయితే ఇది కేవలం ప్రభుత్వ సంస్థలతో పాటు కొన్ని పెద్ద పెద్ద సంస్థలు మాత్రమే పాటిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఆరు నెలల ప్రసూతి సెలవులు అమలు చేయడం లేదు. మరికొంతమందైతే ఏకంగా వివాహితులను ఉద్యోగాల్లో తీసుకునేందుకు ఆసక్తే చూపడం లేదు. దీనిపైనే ఇటీవలె ఓ సర్వే జరిగింది. ఆ సర్వే వివరాలు ఏంటో తెలుసుకుందాం...
ఆరు నెలల ప్రసూతి సెలవులు అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు చేస్తున్న మహిళల పరిస్థితులను తెలుసుకునేందుకు (స్టార్టప్) చిన్న, మధ్యతరహా పరిశ్రమల యాజమాన్యాల నుండి ఓ సర్వే జరిగింది. ఈ సర్వేలో దేశ వ్యాప్తంగా 8,500 మంది చిన్న వ్యాపార వేత్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పొడిగించిన ప్రసూతి సెలవులను అమలు చేసిన ప్రైవేటు, చిన్న వ్యాపార సంస్థల వారికి 400 కోట్ల నిధులు విడుదల చేస్తామని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అప్పట్లో చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. అందుకే చిన్న వ్యాపారులు దాన్ని అమలు చేయలేకపోతున్నామన్నారు. ప్రభుత్వం నుండి రావల్సిన నిధులు రాకుండా జీతాలు చెల్లిస్తే ఆర్థిక భారాన్ని భరించడం కష్టమని వారు ఈ సర్వేలో వెల్లడించారు.
భరించడం కష్టం
శిల్పి సిన్హా అనే 27 ఏండ్ల యువ వ్యాపార వేత్త సుమారు 15 మందితో ఓ చిన్న సంస్థను ప్రారంభించారు. ది మిల్క్ ఇండియా కంపెనీ ద్వారా రెండేండ్లుగా 76 లక్షలతో వ్యాపారాన్ని చేస్తున్నారు. ''నియామకం అనేది ప్రతిభపై ఆధారపడి వుంటుంది. దీనికి స్త్రీ పురుషులు అనే తేడా వుండదు. వాస్తవానికి పెండ్లి కాని యువతీ యువకులు ఈ పోటీ ప్రపంచంలో తమ కలలను నిజం చేసుకునేందుకు పరుగులు తీస్తు న్నారు. పెండ్లయిన వారికి కుటుంబ బాధ్యలు ఎక్కువ. వీరికైతే అలాంటి బాధ్యతలు వుండవు. కాబట్టి అనుకున్న లక్ష్యాలను వీరు మాత్రమే సాధించగలరు. ఆరు నెలల పాటు మహిళలు ప్రసూతి సెలవుల్లో వుండి ఉత్పత్తిలో భాగస్వామ్యం కాకపోతే కంపెనీ నడపడం మాలాంటి చిన్న సంస్థలకు చాలా కష్టం. ఆ భారాన్ని మేం భరించలేం'' అంటున్నారు ఆమె.
సంఖ్య తగ్గించేశారు
ప్రస్తుతం శిల్పి తన ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల ఖర్చు కోసం మరింత లాభాలు ఆర్జించాలని వ్యాపా రంలో పరుగులు తీస్తున్నారు. ఇది కేవలం ఈమె ఒక్కదాని సమస్య మాత్రమేకాదు. చాలా మంది యువ వ్యాపారవేత్తలు ఇలాంటి సమస్య లనే ఎదుర్కొంటున్నారు. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో సుమారు 33శాతం మంది సంస్థ ప్రారంభించిన కొత్తలో మహిళను చేర్చుకోవడం లేదని స్పష్టంగా చెప్పారు. 16 శాతం మంది మాత్రం అంతకు మందు సంవత్సరం కంటే మహిళా ఉద్యోగుల సంఖ్య తగ్గించేశామని చెప్పారు.
పెండ్లి కాని వారికే..
''ప్రతి మహిళకూ ప్రసూతి సెలవులు చాలా ముఖ్యమైనవి. ఆ సమయంలో ఆమెకు విశ్రాంతి చాలా అవసరం. అయితే ఓ వ్యాపారస్తుడిగా ఆలోచిస్తే మా దగ్గర పని చేసే ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా మా వద్దనే వుండాలని కోరుకుంటాం. అది మా సంస్థ అభివృద్దికి చాలా అవసరం. అందుకే సంస్థలో పెండ్లయిన మహిళలను చేర్చుకోలేకపోతున్నాను'' అంటున్నారు ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ టెక్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు సమిష్ బజాజ్. ఇతను తన సోదరుడితో కలిసి సంస్థను ప్రారంభించాడు. ప్రస్తుతం 25 మంది ఉద్యోగులతో కంపెనీని నడుపుతున్నాడు. అలాగే 15 మంది ఫ్రీలాన్సర్లతో పని చేయించుకుంటున్నాడు.
కుటుంబ బాధ్యతలు ఎక్కువ
''ఆరు నెలలు ప్రసూతి సెలవులు తీసుకున్న తర్వాత కూడా పిల్లల అవసరాల కోసం మరో మూడు సంవత్సరాలు శ్రద్ధ తీసుకోవల్సి వస్తుంది. తిరిగి వచ్చి ఉద్యోగంలో చేరినప్పటికీ బిడ్డ ఆరోగ్యం బాగోలేదనో ఏదో ఓ కారణంతో ఆందోళన చెందుతుంటారు. ఫలితంగా పనిపై దృష్టి పెట్టలేరు. మా ఉత్పాదక తగ్గిపోతుంది. ఈ దశలో స్త్రీ కుటుంబానికే ప్రధాన్యం ఇవ్వాలి. సంస్థ ప్రారంభించిన కొత్తలో ఆరు నెలల ప్రసూతి సెలవులను అమలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. కనీసం పది సంవత్సరాల తర్వాత అయితే సంస్థ ఆర్థికంగా స్థిరత్వం సాధిస్తుంది. అప్పుడైతే అమలు చేయవచ్చు'' అంటున్నారు గ్రోత్ హాక్ స్టార్టప్ కో ఫౌండర్ ఫైజల్ ఎం.ఖలీల్. అయితే కొంత మంది మహిళలు ప్రసూతి సెలవుల్లో కూడా ఇంటి నుండి పని చేయడం ద్వారా మా కంపెనీకి సహకరిస్తున్నారని ఆయన వెల్లడించారు.
సాకుగా చూపిస్తున్నారు
సోషల్ అల్ఫాలో పని చేసే సుకృతి సరోజ్ మాట్లాడుతూ ''మహిళలు తాము చేసే పని పట్ల ఎంతో నిబద్ధత, అంకితభావం కలిగి వుంటారు. వివిధ స్థాయిల్లో నాయకత్వం కూడా వహిస్తున్నారు. కానీ ప్రసూతి సెలవులను సాకుగా చూపి మహిళల సంఖ్యను తగ్గిస్తున్నారు. దీని వల్ల చాలా మంది మహిళలు తమ వృత్తిని కొనసాగించ లేరు. ఈ విషయంపైన ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, బహుళ జాతి కంపెనీలు కూడా ఆలోచించాలి. అయితే ప్రారంభించిన కొత్తలో చిన్న సంస్థలకు నిధుల సేకరణ చాలా కష్టం. ఆర్థికంగా ఎన్నో
సవాళ్ళను ఎదుర్కొ వలసివస్తుంది'' అంటున్నారు ఆమె.
కచ్చితంగా అమలు చేయాల్సిందే
కొన్ని స్టార్టప్లు మాత్రం ఆరు నెలల ప్రసూతి సెలవుల నిబంధనను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. పర్పుల్ క్వార్టర్ సీఈఓ దీపక్ సింగ్ అహ్లావత్ మాట్లాడుతూ ''దీనికి వేరే మార్గం లేదు. ఆరు నెలల ప్రసూతి సెలవులను కచ్చితంగా అమలు చేయాల్సిందే. అలాగే నియామకాల విషయంలో కూడా మేం కొన్ని నిబంధనలు పాటిస్తాం. వారి కుటుంబ సభ్యులు ఏం చేస్తారో అడుగుతాం. కానీ మీరు సంతానం పొందాలని అనుకుంటున్నారా అని మాత్రం అడగము. ఇలా అడగటం సభ్యత కాదని నేను భావిస్తాను'' అన్నారు.
అవకాశాలు కల్పించడం సామాజిక బాధ్యత
ప్రతి మహిళా తన జీవితంలో ఓ అందమైన అనుభూతిగా భావించే మాతృత్వం కెరీర్కి మాత్రం అడ్డంకి మారిందని ఈ సర్వేని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. మహిళలకు ఉపయోగడతాయని రూపొందించిన విధానాలే ఇప్పుడు వారి అభివృద్ధికి ఆటంగా మారాయి. ప్రసూతి సెలవుల తర్వాత మహిళలు మళ్ళీ తమ ఉద్యోగాన్ని కొనసాగించడం ఇప్పుడు పెను సవాలుగా మారింది. ఈ విషయంపైనే 'జాబ్ ఫర్ హర్' వ్యవస్థాపకురాలు నేహా బగారియా స్పందిస్తూ ''ఇది తల్లులు, వివాహిత మహిళలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు. ఇదే 'జాబ్స్ ఫర్ హర్' అనే ఫ్లాట్ ఫాం ప్రారంభించడానికి దారి తీసింది. ప్రసూతి సెలవుల తర్వాత వృత్తిని కొనసాగించడానికి వచ్చిన మహిళలను అవకాశాలు కల్పించడం ఓ సామాజిక బాధ్యత'' అంటున్నారు ఆమె. ఈ విషయంలో యాజమాన్యాల ఆలోచనా విధానం మారాలని ఆమె కోరుతున్నారు.
మన పాలకులు నిజంగా మహిళా సాధికారతను కోరుకునే వారే అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని తప్పించే ప్రతి మహిళా మాతృత్వాన్ని ఆనందంగా ఆస్వాదించే అవకాశం కల్పించాలి. మహిళల కోసం తెచ్చిన ప్రసూతి సెలవుల సవరణ కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. వివిధ సంస్థల్లో ఆ పరిస్థితులను సృష్టించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలే తీసుకోవాలి.