Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనాను పగడ్బందీగా ఎదుర్కొన్న చైనా వైపు ప్రపంచ మంతా చూస్తుంటే.. మన దేశమంతా కేరళ వైపు చూస్తోంది. ముందు జాగ్రత్తతో కరోనాపై యుద్ధం ప్రారంభించిన మొదటి రాష్ట్రం కేరళ. వుహాన్లో బయట పడిన కరోనా ప్రమాదం తమకూ పొంచి వుందని ఆమె ముందే ఊహించారు. దానికి తగిన జాగ్రత్తలు అన్వేషించారు. కింది స్థాయి నుండి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆమే కేరళ ఆరోగ్య శాఖ మంత్రి శైలజ టీచర్. ఒకప్పుడు సాధరణ ఉపాధ్యాయురాలిగా వున్న ఆమె ఇప్పుడు రాష్ట్ర ఆరోగ్యాన్ని కాపాడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. రాత్రనకా పగలనకా కార్యాలయంలో వుంటూ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. అందుకే దేశం దృష్టిని ఆకర్షించారు. ఎందరి ప్రశంసలనో అందుకుంటున్న ఆమె గురించి మరిన్ని విశేషాలు...
కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లా కూతుపరంబా ఆమె సొంతూరు. భౌతిక, రసాయన శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. కాలేజీలో చదువుతున్నప్పుడే ఆమె వామపక్షభావాలను పుణికిపుచ్చుకున్నారు. ఎస్ఎఫ్ఐ(భారత విద్యార్థి ఫెడరేషన్)లో చురుగ్గా పని చేశారు. విద్యార్థి సమస్యలపై రాజీలేని పోరాటం చేశారు. చదువు ముగిసిన తర్వాత కన్నూరులోని శివపురం హైస్కూల్లో ఉపాధ్యాయురాలిగా చేరారు. ఉపాధ్యాయ సంఘంలోనూ తన వంతు పాత్ర పోషించారు. ఉద్యోగ విరమణ తర్వాత పూర్తికాలం కార్యకర్తగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. విశేష ప్రజాభిమానంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం కేరళ ఆరోగ్య, సాంఘిక సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనుభవమే నేర్పింది
మంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి ఆమెకు వైద్య రంగంపై పెద్దగా అవగాహన లేదు. సైన్సు టీచర్గా, వామపక్ష ఉద్యమాల్లో కార్యకర్తగా పని చేయడమే తనుకున్న అనుభవంగా చెప్తారు ఆమె. నిరంతర అధ్యయనం, శాస్త్రీయ భావజాలమే ఈ రంగం గురించి త్వరగా అర్థం చేసుకోవడానికి ఆమెకు ఉపయోగపడింది. కష్టకాలంలో ఎలా స్పందించాలి, ముందు జాగ్రత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేవి ఆమె విద్యార్థి ఉద్యమం నుండే అలవర్చుకున్నారు. ఆ అనుభవంతోనే చైనాలోని వుహాన్లో కరోనా వైరస్ తలెత్తిందని తెలుసుకున్న వెంటనే ఆమె అప్రమత్తమయ్యారు. అప్పటికే నిఫా వైరస్తో యుద్ధం చేసిన ఆమె కరోనా వైరస్ను ఎదుర్కోడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆలోచించడం మొదలుపెట్టారు.
నిరంతర పర్యవేక్షణ
వుహాన్లో చదువుకుంటున్న కేరళ యువత పెద్ద సంఖ్యలో వున్నారు. ఆ వైరస్ సోకిన వారు ఇక్కడకు వస్తే వారి ద్వారా ఆ వ్యాధి ఇక్కడి వారికి సోకే ప్రమాదం ఉంది. అందుకే వెంటనే కేరళ ఆరోగ్య కార్యదర్శిని ఆమె అప్రమత్తం చేశారు. తగిన చర్యలకు నడుంబిగించారు. కిందస్థాయి నుండి వైద్య సిబ్బంది మొత్తాన్ని రంగంలోకి దింపారు. కరోనా బాధిత దేశాల నుంచి తమ రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించి కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేశారు. దానికి సంబం ధించిన పరికరాలను సిద్ధం చేసుకున్నారు. అన్ని జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్ర స్థాయి రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సమావేశమై మార్గదర్శకాలను సిద్ధం చేసుకున్నారు. ఈ సమాచారాన్ని జిల్లాలకు కూడా అందుబాటులో వుంచారు. విదేశాల నుండి వచ్చిన వారికి పరీక్షలు చేసేందుకు ప్రత్యేక అరోగ్య బృందాలను ఏర్పాటు చేశారు. విదేశాల నుండి వచ్చే వారి కోసం క్వారంటైన్ కేంద్రాలు సిద్దం చేశారు. రోగనిర్ధారణ అయిన వారి కోసం అసొలేషన్ వార్డులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
రాజకీయాలకు అతీతంగా...
జనవరి 24నే ఆరోగ్య సేవల డైరెక్టర్లతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. జనవరి 25న ఆరోగ్య అధికారులు, స్థానిక స్వపరిపాలన సంస్థల పరిధిలో అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ఆ తర్వాత జిల్లాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఈ చర్యలన్నీ కేరళలో మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఇలాంటి ఎన్నో చర్యలు చేపట్టడంతో శైలజ టీచర్ను రాజకీయాలకు అతీతంగా అందరూ అభినందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇలాంటి పొగడ్తలను ఆమె పెద్దగా పట్టించుకోరు. ప్రజల కోసం నిబద్దతతో పని చేయడం పార్టీ నుండి నేర్చుకున్నానని ఆమె అంటారు.
నిఫా వైరస్ సమయంలోనూ..
గడిచిన రెండేండ్లలో నిఫా వైరస్ కేరళను కుదిపేసింది. అప్పుడు కూడా శైలజ దానిపై పోరాటం చేశారు. ఆ అనుభవం కూడా కరోనాను ఎదుర్కొనేందుకు ఆమెకు ఉపయోగపడింది. అప్పుడు కూడా ఆమె చేపట్టిన చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి. కొత్త వైరస్ ప్రపంచంలోకి వచ్చిందని విన్న వెంటనే దాని లక్షణాలేమిటో వైద్యం బృందం పరిశీలన మొదలుపెట్టేలా చర్యలు చేపట్టారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సకాలంలో రంగంలోకి దిగారు. సంబంధించిన బాధ్యతల్లో నిష్ణాతులు కాకపోయినా సకాలంలో నిబద్దతతో, బాధ్యతతో, శాస్త్రీయ పద్దతిలో పని చేయగలితే ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు అంటారు ఆమె. రాష్ట్ర స్థాయిలో కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు ఏర్పడిన కీలక బృందంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరరు విజయన్, రెవెన్యూ శాఖా మంత్రి ఇ.చంద్రశేఖరన్తో పాటు శైలజ టీచర్ సభ్యులుగా ఉన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎవ్వరికీ నిత్యవసరాల ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యేక వాలెంటీర్లను నియమించి ఇంటింటికీ తిరిగి 16 రకాల నిత్యావసరాలను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నారు.
కేసులు పెరిగినా మరణాలు తక్కువ
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు మరింతగా పెరగడంతో రాష్ట్రానికి విదేశాల నుండి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫలితంగా కేరళలో కరోనా కేసుల సంఖ్య కూడా పెరిగింది. అందుకే అధునాతన టెక్నాలజీని ఉపయోగించి విదేశాల నుండి వస్తున వారి ఫోన్ నెంబర్లను ట్రాక్ చేసి వాళ్ళు ఎక్కడ వున్నారు, వచ్చిన తర్వాత ఎవరెవరిని కలిశారు అనేవి జీపీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసు కుంటున్నారు. వారికి సకాలంలో పరీక్షలు చేస్తున్నారు. తగిన చికిత్స అందిస్తున్నారు. ఆ ఫలితంగానే మార్చి 31నాటికి కేరళలో నమోదైన కేసులు 234 ఉన్నా మరణించిన వారు ఇద్దరు. కార్యాలయంలో ఉద్యోగులు అప్పుడప్పుడు ఇండ్లకు వెళ్ళినా శైలజ మాత్రం రాత్రనకా పగలనకా కార్యాలయంలోనే వుంటూ అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు.