Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్ ప్రభావంతో దేశంలో మార్చిలో లాక్డౌన్ మొదలైంది. లాక్డౌన్ ప్రకటించిన మూడు రోజుల తర్వాత 'అప్నే ఆప్ ఉమెన్ వరల్డ్ వైడ్' సంస్థ వ్యవస్థాపకురాలైనా రుచిరా గుప్తాకు ఢిల్లోలోని రెడ్ లైట్ ప్రాంతంలో నివసిస్తున్న 12 ఏండ్ల బాలిక నుండి ఫోన్ వచ్చింది. ''అక్కా మా కోసం ఏమైనా చేయండి, మేమందరం ఆకలితో ఉన్నాం, మాకు తినడానికి తిండి దొరకడం లేదు'' అనేది ఆ ఫోన్ సారాంశం.
ఫోన్ చేసిన అమ్మాయి ఓ సెక్స్ వర్కర్ కూతురు. లాక్డౌన్తో బోర్డింగ్ స్కూల్ నుండి ఇంటికి పంపివేయబడినా సెక్స్ వర్కర్ల పిల్లలు, అక్రమ రవాణాకు గురైన బాధితులు... ఇలా దేశ వ్యాప్తంగా ఎందరో ఉన్నారు. ఆ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే రుచిరా తన పనని మొదలెట్టారు. ఆప్రాంతంలోని 500 మంది కోసం వెంటనే స్నేహితుని సహాయంతో భోజనం ఏర్పాటు చేశారు.
వినాశనకర పరిస్థితులు
''తర్వాత నేను బీహార్, కోల్కతాతో పాటు ఇతర ప్రాంతా లలోనూ ఇలా ఆకలితో అలమటిస్తున్న మహిళలు, పిల్లల సమా చారాన్ని సేకరించాను. చాలా మంది తమ పిల్లలను పోషించ డానికి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువునూ అమ్ముకుంటున్నారు. కోవిడ్ కారణంగా అక్రమ రవాణా బాధితులు, వారి కుటుంబాలు వినాశనకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు. ఈ సమయంలో వాళ్ళు తమ ఆదాయాన్ని కోల్పోయారు. కిటికీ కూడా లేని ఓ చిన్న గదిలో 11 మంది నివసించేవారు. విద్య అనేదే వాళ్ళకు అసలు అందుబాటులో లేదు. ఆ పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా వుంది'' అంటున్నారు రుచిరా. ఈమె కొద్ది రోజుల్లోనే పది లక్షల మంది ఆకలి తీర్చారు. మూడు నెలల నుండి ఆ కుటుంబాలకు భోజనం అందించారు. భోజనంతో పాటు బియ్యం, ఉల్లిగడ్డ, పప్పులు, బంగాళదుంపలు, సుగంధ ద్రవ్యాలు, సబ్బు, వంటనూనె ఇలా నిత్యావసరాలు కూడా పంచుతున్నారు. ఒక్కో వాలంటీర్ 50 కుటుంబాలకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు. దీని కోసం సంస్థ నుండి ట్రక్కులు కూడా ఏర్పాటు చేసుకున్నారు.
అందరి సహకారంతో...
ప్రస్తుతం సెక్స్ వర్కర్లు అననుకూల పరిస్థితుల్లో జీవిస్తున్నారు. వీరికి సాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది. మా సంస్థ ద్వారా మేము మా ప్రయత్నం ప్రారంభించిన తర్వాత ఎందరో ముందుకు వచ్చారు. ఒకరు మాకు 50 వేల శానిటరీ ప్యాడ్లను పంచమని ఇచ్చారు. అవి అవసరమైనవారికి పంపిణీ చేయబడుతున్నాయో లేదో కూడా వాళ్ళు నిర్ధారించుకుంటారు. ఇండియా గేట్ నిర్వాహకులు బియ్యం ఇచ్చారు. ఇండోర్లోని ఒక సంస్థ సుగంధ ద్రవ్యాలు ఇచ్చింది. చాలా మంది ఆర్థిక సహకారాన్ని కూడా అందించారు. వీరందరి సహకారంతో సెక్స్ వర్కర్లకు, వారి కుటుంబాలకు సాయం చేయగలిగాం'' అంటున్నారు రుచిరా.
నిరంతరం శ్రమిస్తూ
కోవిడ్ సమయంలో అసలు బయటకు రావడమే ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. రుచిరా మాత్రం పగలూ రాత్రీ దీని కోసం శ్రమించారు. ఫోన్, ల్యాప్టాప్లో ఉదయం నుండి అర్థరాత్రి వరకు పని చేస్తూనే వుండేవారు. ఆకలితో అలమటిస్తున్న వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని కావల్సిన ఆహారాన్ని పంపించేవారు. ఆహారం తీసుకు వెళ్ళే ట్రక్కులు రాష్ట్ర సరిహద్దులు దాటే సమయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించు కోవడం, సమయానికి అవి చేరాయో లేదో తనిఖీ చేయడం, లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం, ప్యాకింగ్ చేయడం.. ఆ ఆహారం చెడిపోక ముందే సరైన సమయానికి బాధితులకు అందేలా చూడడం... ఇలా నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు.
ఇవ్వండి..పంచండి
మూడు నెలల్లోనే రుచిరా ''గివ్ ఇండియా, షేర్ ఇండియా'' అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళారు. ''ఈ కాలంలో వీరికి సాయం అందించిన చిన్న వ్యాపారులు గానీ, కార్యకర్తలు గానీ ఎలాంటి ప్రతిఫలం గానీ, సోషల్ మీడియాలో ప్రచారం గానీ ఆశించలేదు. అలాగే పనులు లేక వలస కార్మికులు కాలినడకన సొంత గ్రామాలకు బయలు దేరారు. వారికి వెయ్యి జతల చెప్పులు అందించాము. అలాగే వారి అవసరాలను కొంత వరకు తీర్చ గలిగాము'' కరోనా వైరస్ ఇంకా విజృంభిస్తూనే వుంది. అందుకే మా సాయాన్ని ఇంకా కొనసాగిస్తూనే వున్నాము'' అంటున్నారు ఆమె.
సరైన చట్టాల కోసం
సెక్స్ వర్కర్ల సమస్యలపై రుచిరా ఐక్యరాజ్యసమితిని కూడా కలిశారు. దీనికి సంబంధించిన చట్టాలు, విధానాలలో రావల్సిన మార్పుల గురించి చర్చించారు. మానవ అక్రమ రవాణాపై కొత్త చట్టం కోసం ఎన్జీఓలు, ప్రభుత్వాలు ఏం చేయాలో సూచించారు. అక్రమ రవాణాలపై మొట్టమొదటి సారి యుఎస్ చట్టాన్ని రూపొందించడానికి 2002లో ఆమె తన డాక్యుమెంటరీని యుఎస్ సెనేట్కు చూపించారు. అక్రమ రవాణా బాధితులకు సహాయం చేయడానికి ఆమె తన శక్తిమేరకు కృషి చేస్తున్నారు. అలాగే లైంగిక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జాతీయ కార్యా చరణ ప్రణాళికలను రూపొందించడానికి ఆమె అనేక దేశాలకు సహకరించారు. ఈ నేపథ్యంలో అక్రమ రవాణాను ఆపడానికి తన సొంత దేశంతో పాటు ఎక్కడా కూడా సరైన చట్టాలు, విధానాలు లేవని ఆమె గ్రహించారు.
అక్రమ రవాణాను అంతం చేయాలి
ఈ డాక్యుమెంటరీ తీసే సమయంలో ఆమెకు ఎన్నో అనుభవాలు ఎదుర య్యాయి. ఆ అనుభవాల తోనే వారి కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే రుచిరా 'ఆప్నే ఆప్ ఉమెన్ వరల్డ్'ను స్థాపించారు. వారి పిల్లలకు విద్య, కనీస అవసరాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో అక్రమ రవాణా అంతరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వృత్తిలో తల్లి ఉంటే కూతురు కూడా అదే వృత్తి చేయాలి అనేది బలంగా నాటుకు పోయింది. దీన్ని రూపుమాపాలని ఆమె భావిస్తున్నారు.
సంక్షేమ పథకాలు..
''ప్రభుత్వ భాగస్వామ్యంతో మేము మా కృషిని కొనసాగిం చాలనుకున్నాము. వారి ఆధార్ కార్డులను సేకరించి వారికి ప్రభుత్వం నుండి అందాల్సిన సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నాము. వారికి మంచి ఆహారం, సొంత ఇల్లు ఏర్పాటు చేయాలని అడుగు తున్నాం. అలాగే ఈ మహిళలకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించాలి. దీనితో వారు ఈ దుర్భరమైన జీవితం నుండి కొంత వరకైనా బయట పడగలరని మా నమ్మకం'' అంటున్నారు రుచిరా.
ప్రత్యామ్నాయం చూపాలి
లాక్డౌన్ సమయంలో ఆహారం పంపిణీ చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతుంది. కానీ అది ఈ మహిళలు, వారి కుటుంబాల వరకు చేరడం లేదు. వీరంత 12, 13 ఏండ్ల వయసులో కిడ్నాప్కు గురై బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టివేయబడిన వారు. సమాజంలో ఎటువంటి గౌరవం లేనివారు. తమ ఉనికిని తామే మర్చిపోయిన వారు. కోవిడ్ - 19 ఈ మహిళల వృత్తిని ప్రమాదం లోకి నెట్టివేసింది. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో తమ వృత్తిని కొనసాగించలేరు. ఎవరితో సన్నిహితంగా ఉండకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వారికి ఏదైనా ప్రత్యామ్నా యాన్ని ఏర్పాటు చేయాలి. ఆత్మహత్యలను నివారించాలి, వారికి పిల్లలు అనాథలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.
- రుచిరా
ది సెల్లింగ్ ఆఫ్ ఇన్నోసెంట్స్
పది లక్షల మంది ఆకలి తీర్చిన రుచిరా జీవితం గురించి, ఆమె స్థాపించిన 'ఆప్నే ఆప్ ఉమెన్ వరల్డ్వైల్డ్' గురించి తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా వుంది. ఓ జర్నలిస్టుగా రుచిరా నేపాల్ వెళ్ళారు. అక్కడ తప్పిపోయిన బాలికల గ్రామాలను పరిశీలించారు. వారు కిడ్నాప్కు గురై బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టివేయబడ్డారు. ఆమె వారి జీవితాలను అధ్యయనం చేసింది. 1999లో భారత దేశంలోని వివిధ ప్రాంతాలలో వేశ్యాగృహాలకు వెళ్ళి వారి జీవితాలను చూశారు. సెక్స్వర్కర్లు అనుభవిస్తున్నా సమస్యలను 'ది సెల్లింగ్ ఆఫ్ ఇన్నోసెంట్స్' అనే డాక్యుమెంటరీ తీశారు. దీనికి గాను ఆమె ఎమ్మీ అవార్డు కూడా అందుకున్నారు.
''ఈ డాక్యుమెంటరీ నా జీవితాన్ని కూడా మార్చివేసింది. ఒక జర్నలిస్టుగా యుద్ధం, ఆకలి, కరువు.. ఇలా ఎన్నో చూశాను. కానీ మహిళల పట్ల జరుగుతున్న లైంగిక దోపిడీని అప్పటి వరకు చూడలేదు. బీహార్, కోల్కతా, ముంబైలోని వేశ్యాగృహాలకు వెళ్ళాను. 13 ఏండ్ల బాలికల నుండి 40 ఏండ్ల మహిళలతో అక్కడ బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకుంటారు. ఈ మహిళలు శారీరక దోపిడీకి గురౌతున్నారు'' అంటున్నారు రుచిరా.