Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత దేశ స్వాతంత్రోద్యమంలో మహౌజ్వల ఘట్టంగా భాసిల్లిన వీరతెలంగాణ ప్రజాపోరాటం గురించి.. ఒక వైపు మత రాజకీయాలు నెరపేవారు, మరోవైపు దొరల వారసులు చేస్తున్న దుష్ప్రచారాలు నేడు పత్రికల్లో పతాక శీర్షికలను దక్కించుకుంటున్నాయి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మొన్నటి సెప్టెంబర్ 11న చలో అసెంబ్లీ నిర్వహించింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు తెలంగాణ రైతాంగ పోరాట ప్రాంతాలలో సభలు నిర్వహించి.. నాటి పోరాటం రెండు మతాల మధ్య కొట్లాటనే అన్న రీతిలో వక్రీకరించే ప్రయత్నం చేసారు. అయితే.. తెలంగాణ బిడ్డలు గుర్తించాల్సిన విషయమేమిటంటే.. నేటి తెలంగాణలో ఒక పార్టీ నాయకుడయిన బండి సంజరు చెబుతున్న దానికి భిన్నంగా.. నాటి తెలంగాణ వీరుడు బండి యాదగిరి చేసిన పోరాటం కొనసాగిందని చరిత్ర స్పష్టీకరిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మహత్తర తెలంగాణ రైతాంగ పోరాటం ఎందుకోసం జరిగింది? ఈ రోజున కొందరు నేతలు సంబరాలు జరుపుకుంటున్నట్టుగా... 1948లో కూడా సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలు సంబరాలు జరుపుకున్నారా? సెప్టెంబర్ 13, 1948లో తెలంగాణలో అడుగుపెట్టిన పటేల్ సైన్యాలకు తెలంగాణ ప్రజలు ఎదురెల్లి స్వాగతం పలికారా? లేక తిరస్కరించి ఎదురు నిలిచి పటేల్ సైన్యాలకు వ్యతిరేకంగా పోరాడారా? బీజేపీ వాళ్లు చెబుతున్నట్టుగా సెప్టెంబర్ 17, తెలంగాణకు స్వాతంత్య్రదినమే అయితే... 1946 జూలై 4న దొడ్డి కొమురయ్య అమరత్వంతో మొదలైన వీర తెలంగాణ రైతాంగ పోరాటం సెప్టెంబర్ 17, 1948న ఎందుకు ముగియలేదు? తెలంగాణ ప్రజల పోరాటం 1951 అక్టోబర్ 21 వరకు ఎందుకు కొనసాగింది? తొలుత నిజాంకు, భూస్వాములకూ వ్యతిరేకంగా మొదలైన తెలంగాణ బిడ్డల పోరాటం... అటు తర్వాత పటేల్ సైన్యాలకు వ్యతిరేకంగా కూడా ఎందుకు కొనసాగింది? పటేల్ నాయకత్వంలోని భారత సైన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ బిడ్డలు దేశద్రోహులా? లేక.. తెలంగాణ ప్రజల అభీష్టాన్ని గుర్తించక, దొరల పక్షం వహించిన పటేల్ సాబ్ తెలంగాణ ద్రోహా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితేనే... నిజమైన తెలంగాణ చరిత్ర ఏమిటో నేటి తెలంగాణ బిడ్డలకు అవగతమవుతుంది.
వీరతెలంగాణ ప్రజాపోరాటం.. నిజాంకు, రజాకార్లకూ వ్యతిరేకంగా మాత్రమే కొనసాగినట్టు నేడు బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. వారికున్న మతతత్వ ఎజెండాకు అనుకూలంగా చరిత్రను వక్రీకరిస్తున్నారు. 1930లో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జోగిపేటలో జరిగిన ఆంధ్రమహాసభ తొలిసభతో తెలంగాణ ప్రజల సంఘటిత చైతన్యం మొదలయ్యింది. తెలంగాణ ప్రజాపోరాటం మొదటి నుంచీ నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగానే కాదు... అంతకంటే ప్రధానంగా... తెలంగాణను చెరబట్టిన దొరల భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా కొనసాగింది. 1944లో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభ 11వ మహాసభ నాటికి.. ఆంధ్రమహాసభ ప్రధాన నాయకులందరూ కమ్యూనిస్టు ఆదర్శాలతో ప్రభావితులై.. కమ్యూనిస్టులుగా మారారు. ఆ విధంగా 1944 నుంచి తెలంగాణ ప్రజాపోరాటం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కొనసాగింది. అయితే... నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించిన కారణాన... ఆంధ్రమహాసభ పేరుతోనే కమ్యూనిస్టుపార్టీ కార్యకలాపాలు కొనసాగాయి.
1946 జూలై 4న నేటి జనగామ జిల్లా కడివెండిలో విసునూరి దొరసాని జరిపిన తుపాకీ కాల్పుల్లో ఆంధ్ర మహాసభ కార్యకర్త దొడ్డి కొమురయ్య అమరుడవ్వడంతో తెలంగాణ రైతాంగ పోరాటం సాయుధ రూపం సంతరించుకున్నది. బాంచన్ కాల్మొక్తా అంటూ బతికిన తెలంగాణ బిడ్డలు.. బరిసెలు, బందూకులూ చేతబట్టి... దొరల రాజ్యం కూల్చడానికి ఉద్యమించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో రైతాంగపోరాటం ఉధతంగా సాగింది. దొరలు ఊర్లను విడిచి పరారయ్యిండ్రు. మూడు వేల గ్రామాలు విముక్తమై... గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ప్రజారాజ్యం ఏర్పడింది. దొరల కబ్జాలో ఉన్న పది లక్షల ఎకరాల భూమి పేద రైతులకు పంచబడింది. వెట్టిచాకిరీ, రుణ పత్రాలు రద్దయ్యాయి. వ్యవసాయ కూలీల వేతనాలు పెరిగాయి. కుల వివక్ష, లింగ వివక్ష కట్టడి చేయబడినాయి.
తెలంగాణలో దొరల రాజ్యం కూల్చిన తెలంగాణ బిడ్డలు... దొరలకు పెద్దన్నలాంటి నిజామోడికి కూడా గోరీ కట్టడానికి సిద్ధమవుతున్నవేళ... 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. స్వతంత్ర భారతావనిలో... ఢిల్లీ పీఠమెక్కిన కాంగ్రెస్ పెద్దలు... భూస్వాములు, పెట్టుబడిదారుల పక్షం వహించడాన్ని, తెలంగాణ ప్రజలు గమనించారు. పక్కనున్న ఆంధ్ర ప్రాంతంలో (నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం) పాలన చేస్తున్న టంగుటూరి ప్రకాశం సర్కారు.. ''పబ్లిక్ సేఫ్టీ ఆర్డినెన్స్'' పేరుతో రైతు ఉద్యమాలను తీవ్రంగా అణచివేయడాన్ని భూస్వాముల కొమ్ముకాయడాన్ని చూసిన తెలంగాణ ప్రజలు... కాంగ్రెసుపార్టీ ఎవరి పక్షమో అర్థం చేసుకున్నారు. మరోవైపు తెలంగాణలోని భూస్వాముల ప్రతినిధులు.. కె. వెంకటరంగారెడ్డి, బూర్గుల రామకష్ణారావు, మర్రి చెన్నారెడ్డి మొదలైనవారు ఢిల్లీకి చేరి తెలంగాణ బిడ్డలకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారు. ''తెలంగాణలో నెలకొన్న పరిస్థితి గురించి కాంగ్రెస్ నాయకుల నివేదిక మాకందింది. భూస్వాములపై జరుగుతున్న దాడులను మేం ఒప్పుకోము. త్వరలోనే తగు చర్య తీసుకుంటామ''ని ఢిల్లీలో హౌంమంత్రి సర్దార్ వల్లభ్భాయి పటేల్ ప్రకటించారు.
సెప్టెంబర్ 13, 1948న తెలంగాణలోకి పటేల్ సైన్యాలు అడుగు పెట్టాయి. కోదాడ, దురాచిపల్లిలో తప్ప... మరెక్కడా నిజాం సైన్యాలు ప్రతిఘటించలేదు. సెప్టెంబర్ 17న నిజాంరాజు లొంగిపోయాడు. నెహ్రూ ప్రభుత్వం నిజాంరాజును సకల మర్యాదలతో అరుసుకున్నది. ఆయనకున్న ఆస్తులు, రాజభవనాలు ఆయనవేనని ప్రకటించింది. హైదరాబాద్ రాష్ట్రానికి ''రాజ్ ప్రముఖ్'' పదవినిచ్చి సత్కరించింది. తెలంగాణ బిడ్డలను అరిగోసలు పెట్టిన రజాకార్ల నాయకుడు కాసీం రజ్వీ పాకిస్థాన్కు పోతానంటే... దగ్గరుండి సాగనంపింది. మరోవైపు తెలంగాణ ప్రజలపై తన సైనిక చర్యను కొనసాగించింది. 1948 సెప్టెంబర్ నుంచి 1951 అక్టోబర్ వరకు.. మూడేండ్లపాటు తెలంగాణను పటేల్ సైన్యాలు రక్తపుటేరుల్లో ముంచెత్తాయి. తెలంగాణ పల్లెల్లో బీభత్సం సృష్టించాయి. కాటూరు, ఎలమర్రు మొదలగు గ్రామాలలో ఆడపడుచులను బట్టలిప్పించి బరివాతగా గాంధీ విగ్రహం చుట్టూ బతుకమ్మలాడించిన పటేల్ సైన్యాల దారుణకాండలను నాటి పత్రికలలో చదివిన భారతీయులందరూ సిగ్గుతో తలదించు కున్నారు. 1946 నుంచి 1951 వరకు కొనసాగిన వీర తెలంగాణ రైతాంగ పోరాటంలో నాలుగు వేల మంది తెలంగాణ బిడ్డలు అమరులవగా.. అందులో సగంపైగా పటేల్ సైన్యాల చేతుల్లోనే చనిపోయారు. తెలంగాణ ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలను చూసి భరించలేని డాక్టర్ జయసూర్య (సరోజినీనాయుడు కొడుకు) నాటి గవర్నర్ జనరల్ జే.ఎన్. చౌదరిని కలిసి... తెలంగాణ ప్రజలు కూడా భారతీయులేననీ.. వారి ఆకాంక్షలను గుర్తించి ఉద్యమకారులతో చర్చలు జరపాలని ప్రతిపాదించారు. నెహ్రూ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను కర్కశంగా తిరస్కరించింది. నాటి పరిణామాలన్నింటికి సజీవ సాక్షిగా నిలిచిన ప్రముఖ తెలంగాణ రచయిత దాశరథి రంగాచార్య తెలంగాణలో నాడు నెలకొన్న పరిస్థితులను నిష్పక్షపాతంగా అక్షరబద్ధం చేసారు. నిజాం హయాంలో... నెత్తిన రూమీ టోపీలు ధరించి... తెలంగాణ బిడ్డలపై జులుం చెలాయించిన దొరలు... ప్రజలు తిరగబడడంతో పల్లెల నుంచి పారిపోయి, సెప్టెంబర్ 17, 1948 తర్వాత... పటేల్ సైన్యాల అండతో నెత్తిన గాంధీ టోపీ ధరించి మళ్లీ పల్లెల్లోకి అడుగుపెట్టి... తమ పాత దోపిడీ విధానాలను యధావిధిగా కొనసాగించిన వైనాన్ని దాశరధి రంగాచార్య తన రచనల్లో (జనపథం, మోదుగుపూలు, జీవనయానం) కండ్లకు కట్టినట్టు రికార్డు చేసారు.
''తన చరిత్ర తనే పఠించి.. ఫక్కున నవ్వింది ధరిత్రి'' అన్నది ఓ కవి వాక్కు. నేడు.. తన చరిత్రను తన బిడ్డలే సరిగ్గా అర్థం చేసుకోలేక.. అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిని చూసి తెలంగాణ తల్లి దుఃఖిస్తున్నది. నాడు తెలంగాణను చెరబట్టిన దొరల వారసులే నేడు తెలంగాణ గద్దెనెక్కి... ''నాటి దొరలు మంచోళ్లే, నిజాం ప్రభువూ మనసున్నోడే'' అంటూ కీర్తిస్తున్నారు. నాడు తెలంగాణ ప్రజలు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే.. వారికి ఎలాంటి సహాయం అందించక, దొరల పక్షం వహించి, మత రాజకీయాలను నెరపిన మతోన్మాదులు నేడు తెలంగాణ చరిత్రకు మతపాక్షిక వక్రభాష్యం చెబుతున్నారు. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం కొనసాగిన మహౌన్నత ప్రజాపోరాటాన్ని... రెండు మతాల మధ్యన కొట్లాటగా చిత్రీకరిస్తున్నారు. ఈ రెండు స్వార్థశక్తులు తెలంగాణ చరిత్ర గురించి ప్రచారం చేస్తున్న సంకుచిత కథనాలకు ఆవలనున్న అసలు సత్యాన్ని... నేటి తెలంగాణ బిడ్డలు గుర్తించాలి. నాటి కమ్యూనిస్టు యోధుల ఆరాటమేమిటో... వాళ్ల పోరాటమెందుకో తెలుసుకోగలిగితే... నేటి కాలంలో మనం చేపట్టాల్సిన కర్తవ్యమేమిటో... తెలంగాణ బిడ్డలకు గోచరమవుతుంది.
- ఆర్. రాజేశమ్
సెల్: 9440443183