Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయన గాత్రం నవరసాలు వొలికి స్తుంది. ఆయన పలుకులు భాషకు పట్టాభిషేకం చేస్తాయి. అమతం కన్నా తీయనైన అయన పాటకు ప్రకతి సైతం ఆనందంతో పులకరించి పోతుంది. ఆయనే ఎస్.పీ. బాలుగా ప్రసిద్ధిగాంచిన శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం. బాలుగారు 1946 జూన్ 4న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోటమ్మపేట గ్రామంలో తండ్రి సాంబమూర్తి, తల్లి శకుంతల గార్ల ఇంట జన్మించారు. చిన్న తనం నుంచి చదువులో ఎంతో చురుకుగా, ఉత్సాహంగా ఉండేవారు. చదువుతో పాటు బాల్యం నుంచే పాటలంటే అమితాసక్తి.
ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే వివిధ సాంస్కతిక శాఖల వారు నిర్వహించే పాటల పోటీల్లో పాల్గొని ఎన్నో అవార్డులని, బహుమతుల్ని గెలుపొందారు. ఆ సమయంలోనే మద్రాస్ లోని తెలుగు కల్చరల్ ఆర్గనైజషన్ వారు నిర్వహించిన సంగీత పోటీల్లో పాల్గొని బాలసుబ్రహ్మణ్యం ప్రధమ బహుమతిని గెలుచుకొన్నారు. ఈ గెలుపు ఆయనకు మరో మలుపుగా మారింది. సినీ సంగీత దర్శకులు ఎస్.పి. కోదండపాణి ఆయన పాటకు ముగ్ధుడై తన సినిమాలో పాడేందుకు చక్కని అవకాశం ఇచ్చారు. 1966 డిసెంబర్ 15న ''శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న'' చిత్రం కోసం మద్రాస్లోని ప్రియాగార్డెన్స్ థియేటర్లో ''ఏమి వింత మోహమో'' అనే పాటను తొలిసారిగా పి. సుశీల, ఈలపాట రాఘవయ్య, పి.బి. శ్రీనివాస్లతో కలసి ఎంతో శ్రావ్యంగా పాడారు. మొదట్లో బాలుగారు చిన్న చిన్న హీరోలకు, కమెడియన్సుకు ఎక్కువగా పాడేవారు. ఒకసారి ఎస్.పి. కోదండపాణి ఓ చక్కని సలహా ఇచ్చారు. అగ్ర హీరోల గొంతుని అనుకరిస్తూ పాడమన్నారు. కోదండపాణి సలహాని తు.చ. తప్పకుండ పాటిస్తూ అగ్రహీరోల గొంతుని అనుకరిస్తూ ఆచ్చం అలానే పాడటం మొదలుపెట్టారు బాలు. ఇది చాలా అద్భుతంగా పనిచేయడంతో అక్కడినుంచి బాలు తన గాత్రంతో విశ్వరూపం చూపించారు. సినీ పాటల పూదోటలో ఎంతోఎత్తు ఎదిగారు.
ఏపాట పాడినా ఆ హీరోలే పాడారా అన్నంత అనుభూతిని మనకు కలిగించిన ఘనత ఒక్క బాలుగారికి మాత్రమే దక్కుతుంది. అల్లు రామలింగయ్య, రాజబాబు, మాడ వెంకటేశ్వర రావుకు అయన పాడిన వైవిద్య భరితమైన పాటలు ఇప్పటికీ మన చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. కమలహాసన్ నటించిన ''ఇంద్రుడు-చంద్రుడు ''చిత్రంలో గొంతును మార్చి కమలహాసన్కి డబ్బింగ్ చెప్పడమే కాకుండా, జీర గొంతుతో ''నచ్చిన ఫుడ్డు, వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండు'' అనే ఓ చక్కని పాటను అద్భుతంగా పాడి అందర్నీ మైమరిపించడమే కాకుండా తన గాత్రానికి తిరుగులేదని నిరూపించుకున్నారు.
రజనీకాంత్, కమలహాసన్, సల్మాన్ఖాన్, అనీల్కపూర్, గిరీష్ ఖర్నాడ్, జెమిని గణేష్, నగేష్, కార్తీక్, రఘువరన్లకు లెక్కకు మిన్నగా సినిమాలలో డబ్బింగ్ చెప్పి అందరి ప్రశంసలు అందుకున్నారు. అత్యధికంగా కమలహాసన్ సినిమాలకు డబ్బింగ్ చెప్పి కమలహాసన్కూ మంచి పేరు సంపాదించి పెట్టారు. కమలహాసన్ నటించిన ''దశావతారం'' చిత్రంలో ఏడు పాత్రలకు బాలుగారే డబ్బింగ్ చెప్పి అల్ టైమ్ రికార్డు సష్టించారు. అన్నమయ్య, శ్రీసాయి మహిమ చిత్రాలకుగాను అయన డబ్బింగ్ ఆర్టిస్ట్ అవార్డులు కూడా అందుకున్నారు.
వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. పాట పాడటమే కాదు, చాలా సినిమాలలో అతిధి పత్రాల దగ్గరనుంచి ప్రధాన పాత్రల వరకు ఎన్నో పాత్రలకు తన నటనతో జీవంపోసారు. దర్శకులు జంధ్యాల సినిమా ''మల్లెపందిరి''లో ఓ అందమైన కామెడీ ప్రొఫెషనల్ కిల్లర్ పాత్రను ఎంతో అద్భుతంగా రక్తికట్టించి నవ్వుల -పువ్వులు విరభూయించారు. ''పక్కింటి అమ్మాయి'' సినిమాలో కథను మలుపుతిప్పే ఓ ప్రధాన పాత్రను పోషించారు. 'వివాహ భోజనంబు, పర్వతాలు పానకాలు, చిరుజల్లు, పవిత్రబంధం లాంటి ఎన్నో సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అంతేకాదు 'గుణ, తిరుడా -తిరుడా, కెలడి కన్మణి, కాదలన్' లాంటి అద్భుతమైన సినిమాల్లో తమిళంలోనూ నటించి తన ప్రతిభను చాటుకొని తమిళ ప్రజల అభిమానాన్ని కూడ చూరగొన్నారు.
సంగీత దర్శకుడిగా కూడా సినీ వినీలాకాశంలో వెలుగుల్ని విరజిమ్మారు. తెలుగు చిత్రాలకే కాకుండా కన్నడ, తమిళ చిత్రాలకు కూడా తన బాణీలనందించి అందరి మన్ననలు అందుకున్నారు. 40చిత్రాలకు సంగీతాన్ని అందించారు. తెలుగులో 'కన్యాకుమారి' చిత్రానికి మొట్టమొదటగా సంగీత దర్శకత్వం వహించారు. ఆ తర్వాత బాపుగారి తూర్పు వెళ్లే రైలు, జానకి, సీతమ్మపెళ్ళి లాంటి అద్భుతమైన చిత్రాలకి సంగీతాన్ని అందిచారు.
ఈ అలుపెరుగని బాటసారి సినీ పరిశ్రమకు చేసిన సేవలకు ఎన్నో బిరుదులు ఆయనను వరించి ఆయన గౌరవాన్ని మరింత ఇనుమడింపజేశాయి. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 15భాషలలో 40వేలకు పైగా పాటలు పాడారు. నాలుగు భాషలలో జాతీయ సినీ అవార్డులను అందుకొన్న దేశంలోనే ఏకైక సినీ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం. భారత ప్రభుత్వం ''పద్మశ్రీ, పద్మభూషణ్'' అవార్డులతో సత్కరించింది. గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా, నటుడిగా, సంగీత దర్శకుడిగానూ ఆయా రంగాలలో అత్యధికంగా 39సార్లు రాష్ట్ర ప్రభుత్వం తరపున నంది పురస్కారాల్ని అందుకున్న ప్రతిభాశాలి బాలు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ను కూడా సొంతం చేసుకున్నారు. 2016 నవంబర్లో గోవాలో జరిగిన 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ఆయనకు ''శతవసంత భారతీయ చలన చిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని (సెంటినరి అవార్డు ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ 2016)'' ప్రదానం చేసారు. సంగీత దర్శకులకు బాలుగారి పాట పెద్ద ఎస్సెట్. తరాలు మారిన, స్వరాలు మారినా యావత్ భారతావనికి బాలు పాట నిత్య నూతనమే. అందుకె ఘంటసాల మాస్టారుగారి తర్వాత అంతటి స్థానాన్ని దక్కించుకున్నారు.
తనకి సినీగాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన ఎస్.పి. కోదండపాణిగారిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు ''కోదండపాణి ఆడియో ల్యాబ్ '' అని ఆయన పేరు పెట్టుకొని తన గురుభక్తిని చాటుకున్నారు. ఈ అవిశ్రాంత గాన గంధర్వుడు వెండితెర సినీ వినీలాకాశంలో పున్నమి నాటి చంద్రునిలా వెలుగుతూనే 1996లో ఈ టీవీలో ''పాడుతా తీయగా'' అనే కార్యక్రమంతో బుల్లితెర ప్రవేశం చేసి అక్కడా వెలుగుల్ని విరజిమ్మారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది గాయనీ గాయకులను పరిచయం చేసి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దారు. అలాగే ''స్వరాభిషేకం'' కూడా ఆయన సారథ్యంలో మరో అద్భుతమైన కార్యక్రమం. ఆయన మరణం సినీ కళామతల్లికి తీరని లోటే అయినా, కళాజగత్తులో ఆయన చిరంజీవి.
- పి. భాగ్యలక్ష్మి
సెల్: 9704725609